Thursday, December 8, 2016

సంతకం పెట్టిందోచ్!

  సమంత అంటే ఇష్టపడే తెలుగు సినిమా అభిమానులకు ఇది శుభవార్తే. అక్కినేని నాగచైతన్య (చైతూ)తో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చెన్నై బ్యూటీ నటన, సినిమాలకు స్వస్తి పలుకుతారనే పుకార్లు షికారు చేశాయి. పెళ్లి తర్వాత కూడా సమంత నటిస్తుందని చైతూ స్వయంగా చెప్పినా... ఈ పుకార్లకు అడ్డుకట్ట పడలేదు. దీనికి తోడు ‘జనతా గ్యారేజ్’ తర్వాత తెలుగులో మరో చిత్రానికి సమంత సంతకం చేయకపోవడంతో ప్రచారంలో ఉన్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ పుకార్లకు చెక్ పెడుతూ... తెలుగులో కొత్త చిత్రాలకు సమంత సంతకం చేశారు. ఆ మాట ఎవరో కాదు... సాక్షాత్తూ సమంతే చెప్పారు. కానీ, ఆ కొత్త తెలుగు చిత్రాల ఏమిటన్నది మాత్రం చెప్పలేదు.
‘‘కొత్త చిత్రాల్లో ఎవరికి జోడీగా నటిస్తున్నాను, ఆ సినిమాలు ఏంటి, కాంబినేషన్ ఏమిటన్నది ప్రకటించడానికి నేనింక ఎదురు చూడలేను’’ అని సమంత ట్వీట్ చేశారు. ఫిల్మ్‌నగర్‌లో మాత్రం చిన్న ఎన్టీఆర్- దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ) సినిమా, రామ్‌చరణ్- దర్శకుడు సుకుమార్‌ల సినిమాల్లో హీరోయిన్‌గా సమంత పేరు వినిపిస్తోంది. అయితే, అధికారికంగా ఏదీ కన్ఫర్మ్ కాలేదు. అలాగే, చైతూతోనూ త్వరలోనే సమంత కలసి నటిస్తారనే వార్తలు వినపడుతున్నాయి. మరి, సమంత తెలుగులో అంగీకరించిన కొత్త సినిమాలు ఏమిటో? అబ్బ... సమంత మళ్ళీ ట్వీట్ చేసేదాకా జనం ఎదురుచూడలేరు బాబూ!

Wednesday, December 7, 2016

పూరి 'మూడు కోతులు.. ఒక మేక'

 పూరి జగన్నాథ్... టాలీవుడ్ సినిమా మేకింగ్ కు స్పీడు నేర్పిన దర్శకుడు. కొత్త హీరోతో సినిమా అయినా.. స్టార్ హీరోతో సినిమా అయినా.. పూరి స్పీడు మాత్రం తగ్గదు. మూడు నెలల్లోనే సినిమాను పూర్తి చేయడం పూరి స్టైల్. సినిమా మేకింగ్ లోనే కాదు, సినిమా టైటిల్ ఎంపికలో కూడా పూర్తి కొత్తదనం చూపిస్తుంటాడు. స్టార్ హీరోల సినిమాలకు పోకిరి, దేశముదురు లాంటి టైటిల్స్ పెట్టాలన్న, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం లాంటి పొయటిక్ టైటిల్స్ తో ఆకట్టుకోవాలన్నా పూరికే చెల్లింది.
ఇటీవల తన స్థాయికి తగ్గ హిట్స్ అందించటంలో విఫలమవుతున్న పూరి జగన్నాథ్, ఓ బిగ్ హిట్ తో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. అందుకే యంగ్ హీరోలతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కించిన రోగ్ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న పూరి, ఆ తరువాత చేయబోయే సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాడు. అంతేకాదు ఈ సినిమాకు మరోసారి తన మార్క్ కనిపించేలా డిఫరెంట్ టైటిల్ ను పిక్స్ చేశాడు. ముగ్గురు హీరోలతో రూపొందించనున్న ఈ సినిమా కోసం మూడు కోతులు ఒక మేక అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించనున్నారు.

Tuesday, December 6, 2016

రాజీపడే ప్రసక్తే లేదు!

ష్టించి పని చేయడంలో అనుష్క ముందు వరసలో ఉంటుంది. ఆమె గురించి పరిశ్రమలో ఎవర్ని అడిగినా సరే... హార్డ్‌వర్కర్‌ అనే మాటతోనే మొదలుపెడతారు. ఇటీవలి కాలంలో ఆమె చేస్తున్న పాత్రల్ని గమనించినా అనుష్క ఎంతగా చెమటోడుస్తుందో ఇట్టే అర్థమవుతుంది. ప్రతి సినిమాకీ అలా శక్తికి మించి కష్టపడటం ఎలా సాధ్యమవుతుందని అడిగితే అనుష్క ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. ‘‘వ్యక్తిగతంగా నాకు తెలిసిన వాళ్లను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. కానీ నన్ను అభిమానించే వాళ్లు మాత్రం కోకొల్లలు. వాళ్లందరికీ నేనొక నటిని మాత్రమే. నాలోని నటిని చూసే వాళ్లంతా అభిమానించడం మొదలు పెట్టారు. నా పనితీరే నాపైన అభిమానానికి కారణమైనప్పుడు ఆ విషయంలో రాజీపడాలా? ఛాన్సే లేదు. అందుకే నా పాత్ర కోసం ఏం కావాలన్నా చేయాలనుంటుంది. మనసులో ఆ భావన ఉండటంతోసెట్‌లోకి వెళ్లేసరికి పాత్రలో లీనమైపోతుంటా. ఇక ఆ తర్వాత నేనెంత కష్టపడుతున్నానన్నది నాకే గుర్తుండదు’’ అని చెప్పుకొచ్చింది అనుష్క.

లక్షాధికారులు!

  రామ్‌చరణ్ లక్షాధికారి అయ్యాడండీ. ఈ హీరోగారు 40 లక్షలకు అధిపతి. హన్సిక ఏకంగా 60 లక్షలకు అధిపతి అయ్యారు. త్రిష 30, ఇలియానా 40 లక్షలు... ఇలా లక్షాధికారులు అయినందుకు వీళ్లంతా చాలా హ్యాపీగా ఉన్నారు. కోట్లు కోట్లు పారితోషికం తీసుకునే వీళ్లు లక్షాధికారులైనందుకు ఆనందపడటమేంటి? అనేగా మీ డౌట్! అయితే అసలు విషయంలోకి వెళదాం...
 
 కరెన్సీ కష్టాల కారణంగా ఎవరెవరు తమ బ్యాంక్ ఖాతాల్లో ఎంతుందో చూసుకుని హ్యాపీగా ఫీలవుతున్నారు అనుకుంటున్నారా? కాదండి! ఈ లెక్క సోషల్ మీడియాల్లోని తమ ఖాతాల్లో అభిమానుల సంఖ్య. ఈ లెక్క ఆల్ ఇండియాకి సంబంధించినది కాదు.. హోల్ వరల్డ్‌ది అన్న మాట. సెలబ్రిటీలంతా అభిమానులతో నేరుగా తమ విశేషాలు పంచుకోవడానికి సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటున్న విషయం తెలిసిందే. అభిమాన నటీనటులతో నేరుగా మాట్లాడకపోయినా.. ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా అభిప్రాయాలు పంచుకోవచ్చు కాబట్టి, వీళ్ల ఎకౌంట్స్‌ని ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు. ఒక్కో సెలబ్రిటీ ఎకౌంట్‌లో లక్షల్లో ఫాలోయర్స్ ఉంటారు. గడచిన పది రోజుల్లో... 40, 60, 30 లక్షలకు చేరుకున్న సెలబ్రిటీల ఖాతాల వివరాల్లోకి వెళితే...
 
 మీకోసం ఎంత కష్టపడుతున్నానో
 రామ్‌చరణ్‌కి ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ఖాతాలున్నాయి. ఫేస్‌బుక్ ఖాతాను ఇప్పుడు ‘40 లక్షల’ మంది అనుసరిస్తున్నారు. ‘‘మన ఫ్యామిలీ మొత్తం నాలుగు మిలియన్లు (40 లక్షలు). చాలా ఆనందంగా ఉంది. చూడండి.. ఫేస్‌బుక్‌లో మీకు అప్‌డేట్స్ ఇవ్వడానికి ఎంత కష్టపడుతున్నానో’’ అంటూ షూటింగ్ సమయాల్లో ఫోన్ ద్వారా ఫేస్‌బుక్‌లో తాను అప్‌డేట్ చేస్తున్న ఫొటోను రామ్‌చరణ్ పోస్ట్ చేశారు. తాను చేస్తున్న సినిమాల విశేషాలతో పాటు అడపా దడపా ఫేస్‌బుక్ ద్వారా ఫ్యాన్స్‌తో ప్రత్యేకంగా ‘చాట్’ చేస్తుంటారు రామ్‌చరణ్. అభిమానులు అడిగిన ప్రశ్నలకు లైవ్‌లో ఓపికగా సమాధానాలిస్తుంటారు.
 
 మీ ప్రేమకో మంచి ఉదాహరణ
 బబ్లీ బ్యూటీ హన్సిక తమిళంలో కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టాక అభిమానుల సంఖ్య బాగా పెరిగిపోయింది. పైగా తమిళనాడులో ‘చిన్న ఖుష్బూ’ అనిపించుకున్నారు కాబట్టి, అభిమానుల సంఖ్య సినిమా సినిమాకీ పెరుగుతోంది. ఫలితంగా ఈ బ్యూటీ ఫేస్‌బుక్ ఖాతాలో 60 లక్షలు ఫాలోయర్స్ చేరారు. ఫేస్‌బుక్‌లో ఎప్పట్నుంచో ఆమెకు ఎకౌంట్ ఉంది. ‘‘అభిమానులు నన్నెంతగా ప్రేమిస్తున్నారో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం’’ అని హన్సిక పేర్కొన్నారు.
 
 ఆ ఫొటోలకు బోల్డంత క్రేజ్
 గోవా బ్యూటీ ఇలియానా హిందీ సినిమాలు చేయడం మొదలుపెట్టాక సౌత్‌కి దూరమయ్యారు. కానీ, అభిమానులకు మాత్రం దూరం కాలేదు. ముఖ్యంగా ఈవిడగారి ‘ఇన్‌స్టాగ్రామ్’కి ఫాలోయర్ల సంఖ్య ఎక్కువ. ఎందుకంటే.. ఎప్పటిప్పుడు తన పర్సనల్ ఫొటోలను అందులో పొందుపరుస్తుంటారు. ‘వామ్మో.. చాలా హాట్ గురూ’ అనే స్థాయిలో ఆ ఫొటోలు ఉంటాయి. బికినీలో ఉన్న ఫొటోలను, వీడియోలను సైతం ఆమె పెడుతుంటారు. ఆ ఫొటోలకున్న క్రేజ్ ఎలాంటిదింటే ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌ని 40 లక్షల మంది ఫాలో అవుతున్నారు. 
 
 థర్టీ ప్లస్.. థర్టీ లాక్స్!
 త్రిష వయసు 30. నటిగా ఆమె కెరీర్ వయసు దాదాపు 15. ఇన్నేళ్లుగా కథానాయికగా రాణించడం అంటే చిన్న విషయం కాదు. పైగా చేతిలో రెండు మూడు సినిమాలతో బిజీగా ఉండటం అంటే మాటలు కాదు.  ఈ చెన్నై చందమామ చాలా ఆనందంలో ఉన్నారు. ఎందుకంటే ఈవిడగారి ట్విట్టర్ ఎకౌంట్‌ను 30 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ‘‘థ్యాంక్యూ.. నా మనసులో మీకు (ఫ్యాన్స్) ప్రత్యేకమైన స్థానం ఉంది’’ అని ఆనందం వ్యక్తం చేశారామె.
 
 కోట్లు తీసుకునే తారలకు వందల్లో ఫ్యాన్స్ ఉంటే లాభం లేదు. లక్షల్లో ఉండాలి. అప్పుడే లైమ్‌లైట్‌లో ఉన్నట్లు లెక్క. కెరీర్ మంచి ఊపు మీద ఉంటుంది. అందుకే ఈ కోటీశ్వరులందరూ తమను ఫాలో అవుతున్న లక్షలాది అభిమానులకు ‘బిగ్ థ్యాంక్స్’ అంటున్నారు.

Monday, December 5, 2016

తలైవీ.. సెలవ్

దేశ రాజకీయాల్లో ఓ శకం ముగిసింది.. అలుపెరుగక పోరాడిన ‘విప్లవ నాయకి’ విశ్రమించింది...అభిమానుల ‘అమ్మ’ అస్తమించింది.. తమిళనాట ఓ ధ్రువతార నేలరాలింది.. ముఖ్యమంత్రి జయలలిత రెండునెలలకుపైగా మృత్యువుతో జరిపిన పోరాటంలో అలిసిపోయారు. ఆమె అభిమానులు చేసిన పూజలు.. దేశవిదేశాలకు చెందిన అత్యంత నిపుణులైన వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు..
75 రోజులుగా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన జయలలిత సోమవారం రాత్రి 11.30కు మృతి చెందినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. ‘అమ్మ’ మృతితో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం వారం రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. మెరీనా బీచ్‌లోని ఎంజీఆర్‌ సమాధి వద్ద నేటి సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తారు. జయ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖులంతా సంతాపం తెలిపారు.
 చెన్నై: తమిళనాడు శోకసంద్రమైంది.. రాష్ట్రమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.. ముఖ్యమంత్రి జయలలిత (68) సోమవారం రాత్రి కన్నుమూశారు. రాత్రి 11.30 గంటలకు కన్నుమూసినట్లు చెన్నై అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఆసుపత్రి నుంచి పార్థివదేహాన్ని అర్ధరాత్రి పోయెస్‌ గార్డెన్‌లోని ఆమె స్వగృహానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం అక్కడినుంచి మంగళవారం ఉదయం మౌంట్‌రోడ్‌లోని రాజాజీ హాల్‌కు తరలిస్తారు. అత్యవసరంగా సమావేశమైన పార్టీ శాసనసభాపక్షం తదుపరి ముఖ్యమంత్రిగా పన్నీర్‌సెల్వంను ఎన్నుకుంది. ఆ వెంటనే ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి అర్ధరాత్రి 1.20 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రంలో వారంరోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు. మూడురోజుల పాటు రాష్ట్రంలోని విద్యాసంస్థలు, పాఠశాలలను మూసివేస్తారు. ఆమె అంత్యక్రియలను మెరీనా బీచ్‌లోని ఎంజీఆర్‌ సమాధి వద్ద మంగళవారం సాయంత్రం నిర్వహించనున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా జయ సన్నిహితురాలైన శశికళను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ప్రణబúముఖర్జీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తదితర ప్రముఖులంతా జయ మృతికి తీవ్ర సంతాపం ప్రకటించారు.
ఆదివారం సాయంత్రం తీవ్రమైన గుండెపోటు రావడంతో జయలలిత పరిస్థితి విషమించింది. అపోలో ఆసుపత్రిలోనే సాధారణ ప్రత్యేక గదిలో ఉంటున్న ఆమెను వెంటనే క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌కు తరలించారు. ఆమె ప్రాణాలు కాపాడటానికి వైద్యులు రేయింబవళ్లు శ్రమించారు. ‘ఎక్మో’ యంత్రం ద్వారా కృత్రిమ శ్వాస, రక్త ప్రసరణ జరిగేలా చూశారు. దిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) వైద్య బృందం కూడా ప్రత్యేక విమానంలో చెన్నైకి వచ్చింది. లండన్‌ నుంచి డాక్టర్‌ రిచర్డ్‌ బాలే వైద్యసేవలపై సలహాలు ఇస్తూ సమీక్షించారు. వైద్యుల ప్రయత్నాలు విఫలమవడంతో ఆమె సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె ఆరోగ్యం మళ్లీ విషమించినట్లు తెలియగానే అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. రెండురోజుల నుంచి అక్కడ తీవ్ర ఉద్వేగపూరితమైన వాతావరణం కొనసాగింది. సోమవారం రాత్రి జయ మృతిచెందినట్లు తెలియగానే అభిమానులంతా కన్నీరుమున్నీరయ్యారు. తమిళనాడు మొత్తం విషాదంలో మునిగిపోయింది. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాపాడలేకపోయాం..
రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు
అపోలో ఆసుపత్రుల అధికారిక ప్రకటన
ఈనాడు, చెన్నై: ‘ఇది వ్యక్తం చేయలేని దుఃఖం (ఇన్‌డిస్‌క్రైబబుల్‌ గ్రీఫ్‌), మన ప్రియతమ నేత, తమిళనాడు ముఖ్యమంత్రి, విప్లవనాయకి అమ్మ(జయలలిత) ఈ రోజు రాత్రి (సోమవారం) 11.30 గంటలకు కన్నుమూశారు. సెప్టెంబర్‌ 22న తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌ సమస్యలతో గౌరవ ముఖ్యమంత్రి ఆసుపత్రిలో చేరారు. ఆమెకు క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో వివిధ విభాగాల నిపుణులతో చికిత్స అందించాం. వాటికి ఆమె బాగా స్పందించారు. క్రమంగా కోలుకున్నారు, ఆహారమూ తీసుకునేవారు. వీటన్నిటి ఆధారంగా ఆమెను క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ నుంచీ హై డిపెండెన్సీ యూనిట్‌కు తరలించాం. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఆమె పరిస్థితి మెరుగయ్యే సూచనలు కనిపించాయి. దురదృష్టవశాత్తు 4వ తేదీ(ఆదివారం) సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రికి తీవ్రమైన గుండెపోటు(మాసివ్‌ కార్డియాక్‌ అరెస్ట్‌) వచ్చింది. వెంటనే వైద్య నిపుణులు ఆమెను క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌కు తరలించారు. వెనువెంటనే ఎక్మో సహాయం అందించి పరిస్థితిని పర్యవేక్షించాం. ఎక్మో అనే చికిత్స ప్రక్రియ అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న అత్యంత అధునాతన చికిత్స ప్రక్రియ. ఆమెకు అవసరమైన ప్రతి చిన్న చికిత్సను కూడా అందించి కాపాడటానికి విశ్వ ప్రయత్నాలు చేశాం. అయినా.. అప్పటికే విషమించిన ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి ఆమెను కోలుకోలేకుండా చేశాయి. చివరకు ఆమె సోమవారం రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు. అపోలో ఆసుపత్రిలోని సిబ్బంది గౌరవ ముఖ్యమంత్రికి అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన అవిశ్రాంత వైద్య సపర్యలు అందించారు. ఆమె మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆమెను పోగొట్టుకుని విచారంలో మునిగిపోయిన తమిళనాడు ప్రజలు, జాతి దుఃఖంలో మేము సైతం పాలు పంచుకుంటున్నాం’
- అపోలో ఆసుపత్రుల యాజమాన్యం

మహేష్‌ సినిమాకు పేరు ఖాయం!

 సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, కొరటాల శివ కాంబినేషన్లో సినిమా అనే ప్రకటన వెలువడినప్పటి నుంచీ టైటిల్‌పై పుకార్లు వస్తున్నాయి. మహేష్‌ ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తున్నారని, ‘భరత్‌ అను నేను’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్‌ వచ్చింది. అయితే దీనికి సంబంధించి తాజాగా చిత్ర బృందం నుంచి దాదాపు స్పష్టత వచ్చింది. ఈ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య సోమవారం ‘భరత్‌ అను నేను’ అనే పేరును రిజిస్టర్‌ చేయించారు. మరి టైటిల్‌పై దాదాపు స్పష్టత వచ్చినా, మహేష్‌ ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తున్నారా? అన్న ప్రశ్నకు సమాధానం కోసం వేచి చూడాలి. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి నుంచి జరగనున్నట్లు తెలుస్తోంది.
మహేష్‌ కథానాయకుడిగా ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం అహ్మదాబాద్‌లో జరుగుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదు.

Sunday, December 4, 2016

ఆయన చిన్న కమలహాసన్!

  నటుడు జయంరవిని చిన్న కమలహాసన్‌గా ప్రభుదేవా అభివర్ణించారు. ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు  ప్రభుదేవా ఇటీవల దేవి చిత్రంలో నిర్మాతలా కూడా అవతారమెత్తిన విషయం తెలిసిందే. ఆయన తన ప్రభుదేవా స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం బోగన్. జయంరవి, హన్సిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇంతకు ముందు ఇదే జంటతో రోమిమో జూలియట్ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన లక్ష్మణ్ దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు అరవిందస్వామి ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అం దిస్తున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం చెన్నై శివారు ప్రాంతం ఇంజిమ్‌బాక్కమ్‌లో గల వేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలోని ఐసరి వేలన్ ఆవరణలో జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర కథానాయకుడు జయంరవి మా ట్లాడుతూ బోగన్ పక్కా కమర్షియ ల్ ఫార్ములాలో తెరకెక్కిన మాస్ రొమాంటిక్ ఎంటర్‌టెయినర్ అని తెలిపారు.
ఇందులో అరవిందస్వామితో మరోసారి కలిసి నటించడం ఆనందంగా ఉందన్నారు. ఇక ఈ చిత్రంలో యువ సంగీత దర్శకుడు అనిరుద్ పాడిన పాటకు తాను చిందేయడం మంచి అనుభూతి అని పేర్కొన్నారు. తనిఒరవన్ చిత్రం తరువాత అంత మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. చిత్ర నిర్మాత ప్రభుదేవా మాట్లాడుతూ సినిమాకు చెందిన చాలా విషయాలు ఆయనకు తెలుసని, అందుకే తాను జయంరవిని కుట్టి(చిన్న) కమలహాసన్ అని పిలుస్తానని అన్నారు. ఇక నటి హన్సిక నటన బోగన్ చిత్రంలో తనను చాలా ఇంప్రెస్ చేసిందన్నారు. ఎంగేయుమ్ కాదల్ చిత్రం నాటి నుంచి ఇప్పటి వరకూ ఆమె ఎదుగుదలను తాను చూస్తున్నానని తెలిపారు. ఈ బోగన్ చిత్రం అని వరా్గాలను అలరించే మంచి కమర్షియల్ ఎంటర్‌టెరుునర్‌గా ఉంటుందని ప్రభుదేవా ఆశాభావం వ్యక్తం చేశారు.

Friday, December 2, 2016

బెంగళూర్ వ్యాపారవేత్తతో బొమ్మాళి పెళ్లి?

 యోగా టీచర్ అనుష్కకు వరుడు దొరికాడా..? ఈ ప్రశ్నకు అవుననే అంటున్నారుు సినీ వర్గాలు. తమిళ, తెలుగు భాషల్లో అగ్ర నాయకిగా రాణిస్తున్న నటి అనుష్క. 2005లో నటిగా రంగప్రవేశం చేసిన ఈ భామ ప్రముఖ కథానాయకులందరితోనూ నటించారు. ప్రస్తుతం 35వ ఏట అడుగుపెట్టారు. దీంతో అనుష్క పెళ్లి గురించి చాలా రోజులుగా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆంధ్రాకు చెందిన ఒక వ్యాపారవేత్తను అనుష్క పెళ్లాడబోతున్నారనే ప్రచారం ఆ మధ్య హల్‌చల్ చేసింది. అయితే నిజంగానే అనుష్క పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో బెంగళూర్‌కు చెందిన వ్యాపారవేత్తతో బొమ్మాళి పెళ్లి నిశ్చయం అయింయందని తాజా సమాచారం. ఆయనకు బెంగళూర్, ఆంధ్రాలో భారీగా ఆస్తులున్నట్లు టాక్. వీరి పెళ్లి వచ్చే ఏడాది జరగనుందని సినీ వర్గాల సమాచారం. అనుష్క సూర్యకు జంటగా నటించిన ఎస్-3 చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 16న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం బాహుబలి-2, భాగమతి చిత్రాలతో పాటు నాగార్జున సరసన నమో వెంకటేశాయ అనే భక్తిరస కథా చిత్రంలో నటిస్తున్నారు. వీటిని పూర్తి చేసిన తరువాత పెళ్లి పీటలెక్కనున్నారని, ఆ తరువాత నటనకు స్వస్తి చెప్పే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.