Thursday, January 7, 2016

ఆడకుండానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తాం

 ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల మధ్య చివరి టెస్టుకు వరుసగా మూడు రోజుల పాటు వర్షం అంతరాయం కలిగించింది. చివరి రోజు ఆట సాధ్యం కావడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్... ప్రత్యర్థితో ఓ వినూత్న ప్రతిపాదన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 112.1 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆడకుండా డిక్లేర్ చేస్తుందని... వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేసి డిక్లేర్ చేస్తే... ఆ తర్వాత చివరి రోజు మిగిలే 70 ఓవర్లలో 370 లక్ష్యంతో తాము ఆడతామని ప్రతిపాదించాడు.

  కానీ వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్ తమ జట్టు సభ్యులతో సంప్రదించి దీనిని తిరస్కరించారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టి 38 ఓవర్లలో 2 వికెట్లకు 176 పరుగులు చేసింది. వార్నర్ (103 బంతుల్లో 122; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు సెంచరీ చేశాడు. 82 బంతుల్లో శతకం పూర్తి చేసిన వార్నర్... సిడ్నీ మైదానంలో వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వోజెస్ (ఆస్ట్రేలియా)కు రిచీ బెనాడ్ పేరిట పతకాన్ని ఇచ్చారు. ఇకపై ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల మధ్య జరిగే ఫ్రాంక్ వారెల్ ట్రోఫీలో ప్రతిసారీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలిచిన క్రికెటర్‌కు బెనాడ్ పతకం ఇస్తారు.


బ్రాండ్ అంబాసిడర్ గా అమితాబ్ నియామకానికి రంగం సిద్ధ ...


 ప్రముఖ బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ స్థానాన్ని బిగ్ బి అమితాబ్ బచ్చన్ రీప్లేస్ చేయబోతున్నారు. పర్యాటక శాఖ ప్రచార కార్యక్రమం 'అద్భుత భారత్(ఇన్‌క్రెడిబుల్ ఇండియా)' బ్రాండ్ అంబాసిడర్ గా అమితాబ్ నియామకానికి రంగం సిద్ధమైంది. త్వరలో అమితాబ్ నియామకంపై ప్రకటన వెలువడనుంది.
  కాగా ఇప్పటివరకూ భారత పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆమీర్ రెండు నెలల కిత్రం.. భారత్‌లో అసహనంపై  చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఆమీర్ వ్యాఖ్యలను కేంద్రమంత్రులతో పాటు, బీజేపీ నేతలు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో అతిథి దేవో భవ ప్రచార బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం అతడినిను తొలగించిన విషయం తెలిసిందే. దీంతో  ఇన్ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ రేసులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్పా, అక్షయ్ కుమార్ ఉండగా, చివరకు బిగ్ బి వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది.
మరోవైపు ఇన్ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్   నుంచి తొలగించడంపై ఆమీర్ ఖాన్ స్పందించాడు. ప్రభుత్వ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని అతడు పేర్కొన్నాడు.