Monday, May 9, 2016

నేనూ... మా ఆయన!

 ‘దేవుడా.. శ్రుతీహాసన్‌కి పెళ్లయ్యిందా? ఏం పాపం చేశామని ఇప్పుడే పెళ్లి చేసేసుకుంది. ఇంకొన్నాళ్ల పాటు సినిమాలు చేస్తుందా? లేదా.. కొంపతీసి సినిమాలు మానేసే ఉద్దేశం ఏమీ లేదు కదా’ అని శ్రుతీహాసన్ అభిమానులు తెగ ఫీలైపోయారు. వీళ్లు ఇంతగా బాధపడిపోవడానికి కారణం, సరదాగా శ్రుతీహాసన్ తన ట్విట్టర్‌లో చేసిన ఓ ట్వీట్. ‘లంచ్ విత్ మై డియరెస్ట్ హజ్బెండ్’ అంటూ శ్రుతి ఓ ఫొటోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో దుమారమే చెలరేగింది.
అది చూసి, ఆమె అభిమానులందరూ చెలరేగిపోయారు. ‘మీకు పెళ్లయిందా...? అతను మీ భర్తా... ఇంతకన్నా హ్యాండ్‌సమ్ పర్సన్ మీకు భర్తగా వస్తాడు కదా... ఇంత తొందరపడ్డారేంటి?’ అని కామెంట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో శ్రుతీహాసన్ ‘‘నాకస్సలు పెళ్లి కాలేదు.. నిజం చెబుతున్నా... నన్ను నమ్మండి. సరదాగా చేసిన ట్వీట్ అది’’ అని పోస్ట్ పెట్టడంతో అభిమానులు శాంతించారు.

విద్యాబాలన్‌ ఎంత పనిచేసింది!

 బాలీవుడ్‌ నటులు హృతిక్‌ రోషన్‌, కంగనా రనౌత్‌ల మధ్య వివాదం ఇంకా ఏమీ తేలనే లేదు. మరో పక్క దాని ప్రభావం మాత్రం ఇతరుల మీద బాగానే పడుతోంది. తాజాగా ఈ విషయమై విద్యాబాలన్‌ స్పందన ఆమె భర్త సిద్దార్థ్‌ రాయ్‌ కపూర్‌కి ఇబ్బందికరంగా పరిణమించింది. విషయమేమిటంటే.. తీన్‌ చిత్ర ప్రచార కార్యక్రమం సందర్భంగా మీడియా కంగనా విషయంలో స్పందించాల్సిందిగా విద్యాబాలన్‌ను కోరింది.
ఇతరుల గురించి మాట్లాడడం మర్యాద కాదంటూనే కంగనా ధైర్యాన్ని మెచ్చుకుంది విద్య. ఆమె తనకు తాను మద్దతుగా నిలబడి పోరాడడం తనకు నచ్చిందని, ఈ విషయంలో కంగనాని అభినందిస్తున్నానని విద్య పేర్కొంది. సాధారణంగా మహిళలు కుటుంబంలో వారందరి కోసం పోరాడడం చూస్తాం కానీ ఇలా తమకోసం తాము ధైర్యంగా నిలబడడం అరుదని పేర్కొంది.
విద్య అలా కంగనాకి మద్దతిస్తున్నట్లుగా మాట్లాడటం భర్త సిద్దార్థ్‌కి ఇబ్బందికరంగా మారిందట. ఎందుకంటే హృతిక్‌ నటిస్తున్న కాబిల్‌ చిత్రానికి సిద్దార్థ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అందులోనూ ఓ నిర్మాతగా నటీనటులందరితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వివాదంతో హృతిక్‌కి, తనకి మధ్య ఎక్కడ అభిప్రాయభేదాలు వస్తాయోనని సిద్దార్థ్‌ కంగారుపడుతున్నాడని బాలీవుడ్‌ సమాచారం.

Sunday, May 8, 2016

రాజీవ్‌ కనకాలను కొట్టిన రష్మి

 ‘జబర్‌దస్త్‌’ షోలో తనదైన యాంకరింగ్‌ శైలితో అందరినీ అలరించింది రష్మి గౌతమ్‌. ఇటీవల ‘గుంటూరు టాకీస్‌’లో కథానాయికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ హాట్‌హాట్‌ అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కించింది. ఇప్పుడు ‘చారుశీల’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో రాజీవ్‌ కనకాల కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్‌లో రాజీవ్‌కనకాలపై రష్మి దాడి చేసిందంట. ఈ విషయాన్ని రాజీవ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘చారుశీల షూటింగ్‌లో రష్మి నాపై దాడి చేసింది. ఏమిటి రష్మిజీ ఇది. ఎవరైనా అడగండి ఏంటి పని’ అంటూ రాజీవ్‌ పోస్ట్‌ చేశారు.
ఈ చిత్రంలో రాజీవ్‌ బుగ్గ, నుదుటిపై రక్కేసినట్లు కనిపిస్తోంది. అసలు ఇలా జరగడానికి కారణం ఏమిటా అని నెటిజెన్లు ఆలోచనలో పడ్డారు. అసలు ఏం జరిగిందో రష్మినే చెప్పాలి మరి. ఇంకా ఈ విషయం సుమకు తెలుసో లేదో మరి.

నాని సినిమాలో అతిథిగా?

 దర్శకుడు రాజమౌళి తాను తీసే సినిమాల్లో ఏదో పాత్రలో కనిపించి, ప్రేక్షకులకు చిన్న సర్‌ప్రైజ్ ఇస్తుంటారు. గత ఏడాది విడుదలైన ‘బాహుబలి’లో ఐటమ్ సాంగ్‌కి ముందు సీన్లో కాసేపు కనిపించారు. ఇప్పుడు నాని సినిమాలో కనిపించడానికి రెడీ అవుతున్నారన్న వార్త ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నాని హీరోగా ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందునున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాని ఓ దర్శకుడికి అసిస్టెంట్ డెరైక్టర్ పాత్రలోకనిపించనున్నారు. ఆ దర్శకుడి పాత్రలో కనిపించమని రాజమౌళిని అడిగితే, గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

అతనెవరు?

 నాని హీరోనా... విలనా...? అంటూ ప్రేక్షకులకు పెద్ద పజిల్ ఇచ్చేశారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అదేంటీ అనుకుంటున్నారా? ఆయన దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘జెంటిల్‌మన్’ సినిమా టైటిల్‌కి  ‘హీరోనా? విలనా?’ అని ట్యాగ్‌లైన్ పెట్టిన విషయం గుర్తు చేయక్కర్లేదు. మరి.. ఈ జెంటిల్‌మన్ పాత్ర ఎలా ఉంటుందనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. శ్రీదేవి మూవీస్ పతాకంపై నాని, సురభి, నివేదా థామస్ ముఖ్యతారలుగా  శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ‘‘ఈ నెల 12న టీజర్‌ను, 22న పాటలను విడుదల చే యనున్నాం. అందమైన రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, సంగీతం: మణిశర్మ, కెమెరా: పీజీ విందా.

Saturday, May 7, 2016

నన్ను ఇంతవాణ్ని చేసింది అభిమానులే!


‘‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాకి పనిచేసినప్పుడు మనిషిగా ఎదిగా. ‘బ్రహ్మోత్సవం’తో మరిన్ని విషయాలు నేర్చుకొన్నాన’’న్నారు మహేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బ్రహ్మోత్సవం’. సమంత, కాజల్‌, ప్రణీత కథానాయికలు. పీవీపీ సంస్థ నిర్మించింది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించారు. మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాలు శనివారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తొలిసీడీని మహేష్‌ ఆవిష్కరించి చిత్రబృందానికి అందజేశారు. ప్రచార చిత్రాన్ని సమంత, కాజల్‌, రేవతి, సత్యరాజ్‌ విడుదల చేశారు. మహేష్‌బాబు మాట్లాడుతూ ‘‘ఈ రోజు చాలా ప్రత్యేకం. ఎందుకంటే మా అమ్మాయి సితార ఈ ఆడియో ఫంక్షన్‌కి వచ్చింది. నా సినిమాల పాటల వేడుకకు సితార రావడం ఇదే తొలిసారి. అందరికీ మంచే జరుగుతుంది. ఈ సినిమాతో పెద్ద పెద్ద స్టార్స్‌తో పనిచేసే అవకాశం దక్కింది. వాళ్ల నుంచి చాలా నేర్చుకొన్నా. మరీ ముఖ్యంగా సత్యరాజ్‌గారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో కలసి పనిచేయడం ఓ గౌరవం. తోట తరణి గారి గురించి మాట్లాడే అనుభవం నాకు లేదు.‘అర్జున్‌’లో ఆయన వేసిన సెట్‌ ఎప్పటికీ మర్చిపోను. నేను ఫోన్‌ చేసి అడగ్గానే ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నారు రత్నవేలు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నా కెరీర్‌లో బెస్ట్‌ ఆల్బమ్‌. దానికంటే ఈ సినిమాలో పాటలు ఇంకా బాగుంటాయి. దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల అంటే నాకు చాలా ఇష్టం. చాలా స్వచ్ఛంగా ఉంటారాయన. పరిశ్రమ వ్యక్తులతో పెద్దగా కలవరు. అందుకే అంత స్వచ్ఛంగా ఉంటారేమో? ఆయనతో ఇంకా చాలా సినిమాలు చేయాలి. పీవీపీ లాంటి అభిరుచి ఉన్న నిర్మాతల అవసరం చాలా ఉంది. అభిమానుల గురించి నేనెప్పుడూ పెద్ద మాటలు మాట్లాడను. నిజంగా ప్రేమ ఉంటే మాటలతో దాన్ని వ్యక్తపరచలేం. నన్ను ఇంత వాణ్ని చేసింది అభిమానులే. ఈ నెల 20న ‘బ్రహ్మోత్సవం’ విడుదలవుతుంది. థియేటర్లలో పండగ చేసుకొందామ’’న్నారు.
‘‘మంచి అభిరుచి ఉన్న నిర్మాణ సంస్థ పీవీపీ. తెలుగు, తమిళ భాషల్లో ఉత్తమ చిత్రాల్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల తీసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చూశా. సహజంగా ఉంటుందా కథ. పాత్రలు నటిస్తున్నట్టు ఎక్కడా కనిపించదు. ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుంది. ‘బ్రహ్మోత్సవం’ ప్రచార చిత్రం బాగుంది. గత చిత్రాల కంటే మహేష్‌ అందంగా కనిపిస్తున్నాడు. మీక్కీ జె. మేయర్‌ అందించిన సంగీతం నచ్చింది. ‘శ్రీమంతుడు’ మహేష్‌ చిత్రాల్లో రికార్డు వసూళ్లు సాధించింది. ‘బ్రహ్మోత్సవం’ అంతకంటే గొప్పగా ఆడాలి. నిర్మాతలకు మంచి డబ్బులు తీసుకురావాలి’’ అని ఆకాంక్షించారు కృష్ణ. కాజల్‌ మాట్లాడుతూ ‘‘నా ఆలోచనలకు దగ్గరగా ఉండే కథ ఇది. అందుకే ఇష్టంగా చేశా. నటీనటులకు సినిమా ఓ మతం. ఆ మతానికి ‘బ్రహ్మోత్సవం’ ఓ ప్రార్థనా గీతం’’ అంది. ‘‘ఏ సినిమా చేసినా అందులో నేను ఎలా నటించాను? అనే టెన్షన్‌ ఉంటుంది. అదే మహేష్‌ సినిమా అయితే ‘మహేష్‌ పక్కన నేను ఎలా కనిపిస్తా’ అనే టెన్షన్‌ మొదలవుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని వెతుక్కొంటూ వెళ్లడం మామూలే. కానీ ఈ సినిమాలో పిల్లలు తమ మూలాల్ని వెతుక్కొంటూ చేసే ప్రయత్నం కొత్తగా అనిపించింది. శ్రీకాంత్‌ అడ్డాల మాత్రమే ఇలాంటి సినిమా చేయగలర’’ని సమంత చెప్పింది.
దర్శకుడు మాట్లాడుతూ : ‘‘ఇంతమంది సీనియర్‌ నటీనటుల మధ్య, సాంకేతిక నిపుణుల మధ్య పనిచేయాలంటే కాస్త బెరుకుగా ఉండేది. మహేష్‌బాబు చిరునవ్వు చూస్తే అది మాయమైపోయేది. ఆయనే నన్ను ముందుకు నడిపించారు. ఆయన నాకిచ్చిన రెండో అవకాశం ఇది. దాన్ని నిలుపుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేశా’’ అన్నారు. మిక్కీ జె.మేయర్‌ చెబుతూ ‘‘నెలల తరబడి ఈ పాటల కోసం కష్టపడ్డాం. పాటలు రాసిన వాళ్లకూ, పాడిన వాళ్లకూ కృతజ్ఞతలు. మహేష్‌బాబు సినిమాకి సంగీతం అందించడం ఇది రెండోసారి. ఆయనతో పనిచేయడం ఓ గౌరవం. ఈ సినిమాలో చాలామంది గొప్ప నటీనటులున్నారు. రేవతి గారికి నేను పెద్ద అభిమానిని. ఈ పాటలు అందరికీ నచ్చుతాయన్న నమ్మకం ఉంద’’న్నారు. నమ్రత, విజయనిర్మల, నరేష్‌, రావు రమేష్‌, సుధీర్‌బాబు, పరుచూరి వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ, ప్రణీత, జయసుధ, రేవతి, సత్యరాజ్‌, వంశీ పైడిపల్లి, రత్నవేలు, తోట తరణి, కె.ఎస్‌.రామారావు తదితరులు పాల్గొన్నారు.

పెళ్లికి గ్రీన్‌సిగ్నల్!

 బాలీవుడ్‌లో అత్యంత యోగ్యుడైన బ్రహ్మచారిగా ముద్రపడిన సల్మాన్‌ఖాన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సమాచారం. గతంలో ఎన్నో ప్రేమ వ్యవహారాల్ని నడిపిన ఆయన ప్రస్తుతం రొమానియాకు చెందిన లూలియా వాంటూర్ అనే సుందరితో డేటింగ్ చేస్తున్నాడు. ఈ సంవత్సరాంతంలో సల్మాన్ ఆమెను పెళ్లాడబోతున్నాడని ముంబై సినీ వర్గాల్లో వినిపిస్తోంది. సల్మాన్‌ఖాన్ తల్లి సల్మాఖాన్ ఆరోగ్యం కుదురుగా వుండటం లేదని, తల్లి కోరిక మేరకు సల్మాన్‌ఖాన్ వివాహం చేసుకోవడానికి అంగీకరించాడని చెబుతున్నారు. డిసెంబర్‌లో పెళ్లికి ముహూర్తాన్ని ఖరారు చేసే పనిలో సల్మాన్‌ఖాన్ కుటుంబ సభ్యులు వున్నారని తెలిసింది.

ఆ కల ఇప్పటికి నెరవేరింది

 కథాబలం ఉన్న చిత్రాల్లో నటిస్తూ, హీరోగా  మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సందీప్ కిషన్. ప్రస్తుతం రాజసింహ దర్శకత్వంలో ‘ఒక్క అమ్మాయి తప్ప’ చిత్రంలో నటించారాయన. నేడు సందీప్ కిషన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు.
* హైటెక్‌సిటీ ఫ్లై ఓవర్ ట్రాఫిక్‌లో జరిగే ప్రేమకథ ఇది. ఇద్దరు ప్రేమికులు ఆ ట్రాఫిక్‌ను దాటుకుని సమస్య నుంచి ఎలా బయటపడ్డారన్నదే కథ. రియలిస్టిక్ ఎమోషన్స్ బేస్ చేసుకుని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం తెరకెక్కించాం. స్క్రీన్‌ప్లే సినిమాను పరిగెత్తిస్తుంది.

* కళాశాల అంటే ఇష్టం లేక మధ్యలోనే చదువు ఆపేసే పాత్రలో నటించా. ఎదుటివారి మనసు చదివేంత తెలివితేటలున్న అబ్బాయి పాత్ర ఇది. కమర్షియల్ డెరైక్టర్స్‌లో రాజసింహ బెస్ట్ డెరైక్టర్. నేను ఎంచుకున్న మంచి కథల్లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఒక్క అమ్మాయి తప్ప’ కూడా ఉంటాయి.  నిత్యామీనన్ ఈ చిత్రం ఒప్పుకోవడానికి కారణం కథే. నాకు, నిత్యామీనన్‌కు హైట్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. సెట్‌లో ఒకరిపై ఒకరు సరదాగా జోకులు వేసుకునేవాళ్లం. మంచి కథ అయితే నెగటివ్ పాత్రల్లో నటిస్తా. హిట్టు, ఫ్లాప్ గురించి పట్టించుకోకుండా ముందుకెళుతుంటా.   

* నేను ఇండస్ట్రీకొచ్చిన కొత్తలో కృష్ణవంశీగారితో పనిచేయాలనుకునేవాణ్ణి. ‘నక్షత్రం’ చిత్రంతో ఆ కల నెరవేరింది. నేను, లావణ్యా త్రిపాఠి కలిసి తమిళంలో ‘మాయవన్’ అనే చిత్రం చేస్తున్నాం. అలాగే మరో తమిళ సినిమాలో నటిస్తున్నాను.