టీమిండియా పుంజుకుంది.
విండీస్తో రెండో వన్డేలో ఘన విజయం సాధించి కోచి పరాజయానికి ప్రతీకారం
తీర్చుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన ధోనీసేన
రెండో వన్డేలో 48 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్ను 1-1కు సమం చేసింది.
విరాట్ కోహ్లి (62, 78 బంతుల్లో 5ఫోర్లు), సురేష్ రైనా (62, 60 బంతుల్లో
5ఫోర్లు, 2సిక్స్లు), హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. కెప్టెన్ ధోని (51
నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఛేదనలో విండీస్ ఓపెనర్ స్మిత్ (97)
రాణించినా జట్టును ఓటమి నుంచి తప్పించలేదు. బౌలర్లు షమి, జడేజా, మిశ్రాలు
విండీస్ పతనాన్ని శాసించారు.

263 పరుగుల
ఛేదనలో విండీస్కు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు డ్వేన్ స్మిత్ (97),
డారెన్ బ్రావో (26) 64 పరుగులతో శుభారంభాన్ని ఇచ్చారు. లెండ్లీ
సిమ్మోన్స్ గాయం కారణంగా ఓపెనర్గా వచ్చిన బ్రావో..స్మిత్తో కలిసి
స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. అర్థ సెంచరీ భాగస్వామ్యంతో సాఫీగా వెళ్తోన్న
విండీస్ ఇన్నింగ్స్కు మహ్మద్ షమి బ్రేక్ ఇచ్చాడు. చక్కటి బంతితో బ్రావో
వికెట్లను గిరాటేసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఆల్ రౌండర్ పొలార్డ్
(40) పించ్ హిట్టర్గా ఎడాపెడా బౌండరీలు బాదాడు. మూడు సిక్స్లు కొట్టిన
పొలార్డ్..మిశ్రా బౌలింగ్లో మరో భారీ షాట్కు యత్నించి వికెట్ను
సమర్పించుకున్నాడు. ఓపెనర్ డ్వేన్ స్మిత్ ఏమాత్రం జోరు తగ్గించకుండా
నిర్థాక్షిణ్యంగా బౌండరీలు బాదాడు. 11 ఫోర్లు, రెండు సిక్స్లు సాధించిన
స్మిత్ సెంచరీ ముంగిట షమికి వికెట్కు కోల్పోయాడు. తొలి వన్డే సెంచరీ హీరో
శామ్యూల్స్ (16)ను ఉమేష్ యాదవ్ పెవిలియన్కు చేర్చాడు. దినేస్
రామ్దిన్ (3)ను మిశ్రా తన ఆఖరి ఓవర్లో ఔట్ చేశాడు. వరస ఓవర్లలో ఫామ్లో
ఉన్న శామ్యూల్స్, రామ్దిన్లు ఔట్ కావటంతో విండీస్ ఒత్తిడిలో పడింది.
కెప్టెన్ బ్రావో(10), డారెన్ సామీ (1), రస్సెల్ (4)లను వెంటవెంటనే
పెవిలియన్ చేర్చిన ధోనీసేన మ్యాచ్పై పట్టు బిగించింది.
రాణించిన
కోహ్లి, రైనా : టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే,
టీమిండియాకు కోచి వన్డేలాగా శుభారంభం మాత్రం దక్కలేదు. ఓపెనర్లు త్వరగానే
పెవిలియన్ చేరి నిరుత్సాహపరిచారు. ఫామ్లో ఉన్న శిఖర్ ధావన్ (1)ను
టేలర్ బలిగొనటంతో టీమిండియా పరుగుల వేటలో వెనకంజ వేసింది. మరో ఓపెనర్
అజింక్య రహానే(12) సామీ బౌలింగ్లో సులభమైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తెలుగు
కుర్రాడు అంబటి రాయుడు (32) మరోసారి చక్కటి శుభారంభాన్ని భారీ స్కోరుగా
మలచటంలో విఫలమయ్యాడు. కోహ్లితో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే యత్నంలో
రాయుడు స్పిన్నర్ సులేమాన్ బెన్ బౌలింగ్లో ఔటయ్యాడు. రాయుడు నిష్క్రమణ
అనంతరం కోహ్లికి జతకలిసిన రైనా టీమిండియాకు భారీ భాగస్వామ్యాన్ని
అందించాడు. కోహ్లి నెమ్మదిగా ఆడినా రైనా మంచి స్ట్రయిక్ రేట్తో
బ్యాటింగ్ చేశాడు. స్ట్రయిక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ను నిర్మించిన
కోహ్లి, రైనా నాల్గో వికెట్కు 104 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని
నెలకొల్పారు. ఈక్రమంలోనే రైనా, కోహ్లిలు అర్థ శతకాలు పూర్తి చేశారు. ఐదు
ఫోర్లు, రెండు సిక్స్లు బాదిన రైనా..మరో సెంచరీ దిశగా సాగుతున్నట్లే
కనిపించాడు. స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో భారీ షాట్కు యత్నించిన రైనా
పెవిలియన్ బాట పట్టాడు. హాఫ్ సెంచరీతో ఫామ్లోకొచ్చిన కోహ్లి..ఈఏడాది
ఫిబ్రవరి తర్వాత (వన్డే, టెస్ట్ల్లో) నమోదు చేసిన ఏకైక అర్థ శతకం ఇదే
కావటం విశేషం. కెప్టెన్ ధోని (51నాటౌట్, 40 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్స్)
ఆఖర్లో ధనాధన్ ఇన్నింగ్స్తో జట్టు స్కోరును 250 దాటించాడు. రవీంద్ర జడేజా
(6) కీలక సమయంలో పరుగులు చేయటంలో విఫలమయ్యాడు.