Monday, February 22, 2016

సీక్రెట్ చెవిలో కాదు.. బయటికే చెప్పేస్తా!

 తమన్నాలా తెల్లగా ఉండాలంటే ఏం చేయాలి? పాలతో స్నానం చేయాలా? పన్నీటితో జలకాడాలా? అసలు ఆమె ఎలాంటి సౌందర్య సాధనాలు వాడుతుంది... అని అనుకోని వాళ్లుండరు. తెల్లగా ఉండటం ఆ దేవుడు ఇచ్చిన వరం అంటారు తమన్నా. మరి.. చర్మం తళతళలకు మీరేం చేస్తారు? అనే ప్రశ్న తమన్నా ముందుంచితే.. పెరుగు, శెనగపిండి కలిపి పేస్ట్‌లా చేసుకుని, రాసుకుంటా అంటారామె. ఇది మాత్రమే  కాదు.. మరో సీక్రెట్ కూడా ఈ మిల్క్ బ్యూటీ చెప్పారు. అదే ‘అలోవెరా’. దాని గురించి తమన్నా మాట్లాడుతూ- ‘‘రోజంతా షూటింగ్ చేసి, ఇంటికి రాగానే నా స్కిన్ చూసుకుంటే కొంచెం కంగారుగా ఉంటుంది.
         
కానీ, ఆలోవెరా ఉంది కదా అని సరిపెట్టుకుంటాను. బాగా తీరిక చిక్కినప్పుడల్లా ఆ మొక్కలోంచి వచ్చే గుజ్జుని ఒంటికి పట్టించేస్తా. మన చర్మం పసిపిల్లలాంటిది. దాన్ని ఎంత గారాబం చేస్తే అంత అందంగా ఉంటుంది. నేను అలోవెరాతో గారాబం చేస్తాను. మీరు కూడా చేసి చూడండి. అలోవెరాకి మించిన మంచి సౌందర్య సాధనం లేదు. మన ఒంటి మీదకు వయసొచ్చినా అది కనపడనివ్వకుండా చేస్తుంది ’’ అని చెప్పుకొచ్చారు.

Sunday, February 21, 2016

రూ.251 ఫోన్ పై.. రూ.31 లాభం!

 అత్యంత చౌక స్మార్ట్ ఫోన్ 'ఫ్రీడం 251' గురించి రింగింగ్‌ బెల్స్ కంపెనీ నుంచి ప్రకటన వెలువడగానే సంభ్రమాశ్చర్యంతో పాటు సందేహాలు, విమర్శలు వెల్లువెత్తాయి. సామాన్య జనం ఆశ్చర్యపోగా, మార్కెట్ వర్గాలు విమర్శలు గుప్పించాయి. ప్రభుత్వ వర్గాలు కూపీ లాగే పనిలో పడ్డాయి. ఇంత జరుగుతున్నా రూ.251 కే స్మార్ట్ ఫోన్ అందించి తీరతామని రింగింగ్‌ బెల్స్ డైరెక్టర్‌ మోహిత్ గోయల్‌ బల్లగుద్ది చెబుతున్నారు. అంతేకాదు ప్రతిఫోన్ పై తమకు రూ.31 లాభం వస్తుందని లెక్కలు వేసి మరీ చూపిస్తున్నారు. ఏప్రిల్ 15 నుంచి ఫోన్లు డెలివరీ చేస్తామని ప్రకటించారు.
ఫిబ్రవరి 18న ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన వెంటనే 7 కోట్ల రిజిస్ట్రేషన్లు వచ్చినట్టు వెల్లడించారు. మొదటి విడతగా 25 లక్షల ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు మాత్రమే ఆమోదిస్తామని తెలిపారు. మరో 25 లక్షల ఫోన్లు ఆఫ్ లైన్ డిస్ట్రిబ్యూటర్లకు జూన్ 30లోపు అందజేస్తామన్నారు. ఆన్ లైన్ కోనుగోలుదారుల నుంచి పేవ్ మెంట్ గేట్ వే ద్వారా వచ్చిన డబ్బును ప్రత్యేక ఖాతాలో ఉంచుతామని, ఫోన్లు డెలివరీ చేసిన తర్వాతే ఆ డబ్బు ముట్టుకుంటామని ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్య్యూలో గోయల్ స్పష్టం చేశారు.

తాము ఎంతో కసరత్తు చేసిన తర్వాతే  'ఫ్రీడం 251' గురించి ప్రకటించామని, మోసం చేసే ఉద్దేశం తమకు లేదని అన్నారు. 'నేను, నా కంపెనీ ఆదాయపన్ను ఎగేసినట్టు ఒక్క ఫిర్యాదు లేదు. నాపై ఎటువంటి కేసులు లేవు. ఎందుకు నన్ను మోసగాడిగా చిత్రీకరిస్తున్నారు. నైతిక విలువలతో కూడిన వ్యాపారానికి కట్టుబడ్డా' అని గోయల్ పేర్కొన్నారు.

కనీస ధరకు కంటే తక్కువకు అమ్మితే వచ్చే నష్టాన్ని తాము స్థాపించబోయే మార్కెటింగ్ వేదిక ద్వారా కవర్ చేస్తామని, ఈ మార్కెట్‌లో కొనుగోళ్ల ద్వారా లభించే లాభాలను తమ వినియోగదారుడికి బదిలీ చేయడం ద్వారా దీనిని అధిగమిస్తానని రింగింగ్‌ బెల్స్ ప్రెసిడెంట్ అశోక్ చద్దా అంతకుముందు వివరించారు.

మిల్కీబ్యూటీ ప్రేమలో పడిందా!

 నటి తమన్నా బాలీవుడ్ దర్శకుడు షాజిత్‌ఖాన్ ప్రేమలో పడ్డారని,త్వరలోనే వీరు పెళ్లి పీటలెక్కబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. తమన్న హిందీలో షాజిత్‌ఖాన్ దర్శకత్వం వహించిన హిమ్మత్‌వాలా చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. ఆ చిత్రం షూటింగ్ సమయంలోనే వీరి మధ్య సన్నిహితం ప్రేమగా మారిందని,దీంతో తరచూ రహస్యంగా కలుసుకుంటూ ప్రేమలో మునిగితేలుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీన్ని తమన్నా ఖండించారు.

 షాజిత్‌ఖాన్ దర్శకత్వంలో తాను హిందీలో హిమ్మత్‌వాలా చిత్రంలో నటించానని, ఆ చిత్రం పరాజయం పాలైనా తదుపరి హమ్‌షకల్స్ చిత్రంలో అవకాశం కల్పించారన్న గౌరవం షాజిత్‌ఖాన్‌పై ఉందని పేర్కొన్నారు. అలా తమ మధ్య స్నేహమే తప్ప ప్రేమ లేదని స్పష్టం చేశారు. షూటింగ్‌లో తనకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారని, షాజిత్‌ఖాన్ అంటే ఆ కృతజ్ఞత కూడా ఉందని అన్నారు. ఇది తెలియని వారు తమ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారన్నారు. నా జీవితంలో బాహుబలి చిత్రాన్ని మరచిపోలేనని, ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి తనకు దేవుడిలా కనిపిస్తున్నారని పేర్కొన్నారు.

 తాను ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన నటినని, మంచి కథా పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్నానని అన్నారు. ఇందుకు అదృష్టం కూడా తోడయ్యిందని, అందుకే మంచి అవకాశాలు వస్తున్నాయని అన్నారు. అదేవిధంగా హిందీలోనూ వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటించి అక్కడ కూడా నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నానన్నారు. ఎంత కష్టపడి నటించినా మంచి కథల్లో నటించే అవకాశాల అమరాలన్నారు. కాలం కలసిరావాలని, అన్నిటికీ మించి అభిమానుల ఆదరణ చాలా అవసరం అని మిల్కీబ్యూటీ అన్నారు.

Saturday, February 20, 2016

ప్రభాస్‌ ఫియాన్సీ ఆమెనా.. కాదా?

 'బాహుబలి' ప్రభాస్ పెళ్లికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' సినిమా పూర్తవ్వగానే ఈ యంగ్ రెబల్‌ స్టార్ పెళ్లిపీటలు ఎక్కుతాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ అమ్మాయి ఫొటో ఆన్‌లైన్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ప్రభాస్‌ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈమేనంటూ ఈ ఫొటో సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో ఒక్కసారిగా ఇది వైరల్‌ గా మారిపోయింది. అయితే ఈ వార్త ఎంతవరకు నిజమన్నది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
గులాబీ రంగు చీర కట్టుకొని ఓ భారీ వస్త్రనిలయంలో ఈ అమ్మాయి ఉన్నట్టు ఫొటోలో కనిపిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఈ అమ్మాయి ప్రస్తుతం బీటెక్ చదువుతున్నదని, 2016లో ఆమె గ్రాడ్యుయేషన్‌ పూర్తవుతుందని అంటున్నారు. అయితే, ప్రభాస్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే మిత్రులు మాత్రం ఈ కథనాలను కొట్టిపారేస్తున్నారు. ప్రభాస్‌కు కాబోయే వధువు అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో నకిలీదని, ఆ వార్తలను నమ్మవద్దని చెబుతున్నారు.

Wednesday, February 17, 2016

వాళ్ల బాటలోనే... అలీ కూడా

 ఈ జనరేషన్ నటులు కేవలం నటులగానే మిగిలిపోవాలనుకోవటం లేదు. అందుకే ఇతర రంగాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. ముఖ్యం మన హీరోలు హీరోయిన్లు అప్పుడప్పుడు సింగర్ అవతారం ఎత్తుతూ గాయకులకు పోటీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే  ఈ విషయంలో కామెడీ స్టార్ లు కూడా వెనక్కి తగ్గటం లేదు. ఇటీవల 'లచ్చిందేవి ఓ లెక్కుంది' సినిమా కోసం జయప్రకాష్ రెడ్డి పాట పాడగా ఇప్పుడు ఈ లిస్ట్ లో అలీ కూడా చేరిపోయాడు.              మరో అడుగు ముందుకేసిన అలీ పాడ పాడటమే కాదు, తన పాడే పాటను తానే రాశాడు కూడా. ఎందుకంటే ఆ పాట తను మాత్రమే రాయగలడు. ఎంద చాట అంటూ విచిత్రమైన పదాలతో అలరించే అలీ అదే భాషలో పాట పాడాడు. అక్కినేని ఫిలిం స్కూల్ స్టూడెంట్ చునియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పడేసావే సినిమా కోసం అలీ పాట రాసి, పాడాడు. అనూప్ రుబెన్స్ సంగీత దర్శకత్వంలో రూపొందించిన ఈ పాటను ఇప్పటికే రికార్డ్ చేశారు.

Tuesday, February 16, 2016

నేనెవరికిస్తే మీకెందుకు..

 విరాట్‌కోహ్లి - అనుష్కశర్మ మధ్య బంధానికి తెరపడిందంటూ ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు విరాట్‌ ఎక్కడికి వెళ్లినా అతడికి అనుష్కకు సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి మంగళవారం జరిగిన ప్రైవేటు కార్యక్రమంలో.. ఓ ఖరీదైన గడియారాన్ని బాలీవుడ్‌లో ఎవరికైనా బహూకరించాల్సి వస్తే.. ఎవరికిస్తారంటూ ఓ విలేకరి కొంటెగా అడిగాడు. కోహ్లి మాత్రం కాస్త ఘాటుగానే స్పందించాడు. ‘‘బాలీవుడ్‌లో ఉన్నవాళ్లకు ఎందుకిస్తాను. ఇస్తేగిస్తే మా కుటుంబంలో ఎవరికైనా బహుమానంగా ఇస్తా. లేకుంటే జట్టు సహచరులకు ఇస్తా. అయినా ఎవరికిస్తే మీకెందుకు. ప్రస్తుత కార్యక్రమానికి సంబంధించిన ప్రశ్నలడగాలి కానీ.. విషయాన్ని మరోవైపు మళ్లించే ప్రయత్నం ఎందుకు చేస్తారు’’ అని అన్నాడు. మానవ సంబంధాల గురించి అడిగిన మరో ప్రశ్నకూ ఇలాగే స్పందించాడు కోహ్లి. ‘‘ఎవరితో సంబంధం గురించి అడుగుతున్నారు. అయినా ఇవి నన్నడగాల్సిన ప్రశ్నలు కాదు’’అని మండిపడ్డాడు.

ప్రభాస్ కొత్త సినిమాకు ముహుర్తం కుదిరింది

 గత మూడేళ్లుగా బాహుబలి సినిమాతో కాలం గడిపేస్తున్న ప్రభాస్ ఫైనల్ గా మరో సినిమాకు ముహుర్తం సెట్ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. బాహుబలి తొలిభాగం పూర్తవ్వగానే స్టార్ట్ చేయాల్సిన సినిమాను ఎట్టకేలకు బాహుబలి 2 షూటింగ్ పూర్తయిన తరువాత మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. ఇప్పటికే పక్కా స్క్రిప్టురెడీగా ఉన్న దర్శకుడు సుజిత్, ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు.
ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ లో ఉన్న ప్రభాస్ ఈ ఏడాది అక్టోబర్ కల్లా ఆ సినిమాను పూర్తిచేయాలని భావిస్తున్నాడు. రాజమౌళి కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ కల్లా ప్రభాస్ పార్ట్ ముగించేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో నవంబర్ నుంచి తన నెక్ట్స్ సినిమాను ప్రారంభించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు బాహుబలి. రన్ రాజా రన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సుజిత్ చాలాకాలంగా ప్రభాస్ తో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నాడు. ప్రభాస్ హోం బ్యానర్ యువి క్రియేషన్స్, ప్రభాస్, సుజిత్ కాంబినేషన్ లో సినిమాను నిర్మించనుంది.

Monday, February 15, 2016

అదృష్టం బాగుండి.. బతికిపోయా: అమితాబ్

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో జరిగిన అగ్నిప్రమాదం నుంచి తాను అదృష్టం బాగుండి బతికిపోయానని.. లేకపోతే మంటల్లో చిక్కుకుని ఉండాల్సిన వాడినని బాలీవుడ్ పెద్దమనిషి అమితాబ్ బచ్చన్ చెప్పారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తాను అప్పుడే తన పెర్ఫార్మెన్స్ ముగించుకుని అక్కడి నుంచి కారులో బయల్దేరానని, కాసేపటికే అక్కడ మంటలు అంటుకున్నాయని అమితాబ్ చెప్పారు. అయితే అక్కడి వాళ్లు తనను కాసేపు అక్కడే ఉండి.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను కలిసి వెళ్లాల్సిందిగా కోరారని, కానీ పని ఉండటంతో వెళ్లిపోయానని చెప్పారు. ఒకవేళ అక్కడే ఉండి ఉంటే, తాను అగ్నిప్రమాదంలో చిక్కుకుపోయేవాడినని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దేవుడి దయ వల్ల వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారని, అలాగే ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ఎవరూ మృతి చెందకపోవడం అదృష్టమని ట్వీట్ చేశారు. అయితే ఇది మాత్రం చాలా భయానకమైన అనుభవం అన్నారు.                   ఇక బాలీవుడ్ మిస్టర్ పెర్‌ఫెక్షనిస్టు ఆమిర్ ఖాన్ కూడా ఈ ప్రమాదం గురించి తన ఫేస్‌బుక్ పేజీలో రాశాడు. చౌపట్టిలో లైవ్ షో జరుగుతున్నప్పుడు అంత పెద్ద అగ్నిప్రమాదం సంభవించడం చాలా దురదృష్టకరం గానీ, ముంబై పోలీసులు, అగ్నిమాపక శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి పరిస్థితిని చాలా చక్కగా హ్యాండిల్ చేశారని అన్నాడు. ఎవరూ కంగారు పడి తొక్కిసలాట జరగకుండా వీఐపీల నుంచి సామాన్యుల వరకు అందరినీ నిమిషాల మీద గ్రౌండునుంచి పంపారని, చిట్టచివరి వ్యక్తి అక్కడి నుంచి వెళ్లేవరకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అక్కడే ఉన్నారని చెప్పారు.