Tuesday, February 9, 2016

కిడ్నీ వ్యాధిగ్రస్తుడి కోసం ఆటో నడిపిన అఖిల్

 కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఏడేళ్ల చిన్నారి అశ్విత్‌రెడ్డిని సినీ హీరో అక్కినేని అఖిల్ పరామర్శించారు. మంచు లక్ష్మి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ ప్రైవేట్ టీవీ చానల్ ద్వారా అశ్విత్‌రెడ్డి దుస్థితిని తెలుసుకున్న అఖిల్ మంగళవారం ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా అశ్విత్‌రెడ్డి వైద్యానికి అవసరమయ్యే డబ్బు కోసం ఆటో నడిపి కొంత మొత్తం సేకరించారు. నగరంలోని నర్సింహస్వామి దేవాలయం రోడ్డులో ఉంటున్న కట్టూరి కృష్ణారెడ్డి, కవితలకు కుమారుడు అశ్విత్‌రెడ్డి, కుమార్తె అనుషిత ఉన్నారు.     రెండు నెలల క్రితం అశ్విత్ డెంగీ జ్వరం బారినపడటంతో వైద్య పరీక్షలు చేయించారు. ఆ సమయంలో అతనికి రెండు మూత్రపిండాలు పాడైనట్లు వైద్యులు తెలిపారు. వైద్యం కోసం ఆస్తి, బంగారం అమ్మి రూ.6 లక్షల వరకు ఖర్చు చేశారు. కిడ్నీ మార్పిడికి రూ.10 లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పారు.  అంతమొత్తం వెచ్చించే స్థోమత అశ్విత్‌రెడ్డి తల్లిదండ్రులకు లేదు. ఈ నేపథ్యంలో టీవీ చానల్ ద్వారా విషయాన్ని తెలుసుకున్న అఖిల్ ఖమ్మం వచ్చి ఆటో నడిపి డబ్బులు సేకరించి ఇచ్చాడు.

Monday, February 8, 2016

కథ కుదిరింది


‘నేను.. శైలజ’ అంటూ ఓ ప్రేమకథ వినిపించి తొలి అడుగులోనే ఆకట్టుకొన్న దర్శకుడు కిషోర్‌ తిరుమల ఇప్పుడాయనకు వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. నితిన్‌తో ఓ సినిమా ఓకే చేసుకొన్న కిషోర్‌..ఇప్పుడు వెంకటేష్‌కీ కథ వినిపించేశారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు వెంకటేష్‌. ఆ తరవాత కిషోర్‌ సినిమా పట్టాలెక్కుతుంది. మల్టీ డైమెన్షన్‌ రామ్‌మోహన్‌ నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇటీవలే వెంకటేష్‌గారికి కథ వినిపించా. ఆయనకు బాగా నచ్చింది. ఆయన సినిమాలంటే వినోదంతో పాటు కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అంశాలూ ఉండాలనుకొంటారు. అలాంటి కథే ఇది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తామ’’న్నారు.

Sunday, February 7, 2016

నో డౌట్.. వాళ్లు విడిపోయారు!

 చూడబోతే 2016 'బ్రేక్ అప్ ఇయర్'గా రికార్డులకెక్కేలా ఉంది. ఈ ఏడాది ఆరంభం నుంచి బాలీవుడ్ ప్రముఖ జంటలంతా 'బ్రేక్ అప్' బాట పట్టారు. తాజాగా క్రేజీ జంట విరాట్ కోహ్లి-అనుష్క శర్మలు కూడా అదే దారిలో నడిచినట్లు రుజువులతో సహా నిరూపిస్తున్నారు సినీ డిటెక్టివ్ లు. ఎప్పుడూ తమ విహారయాత్రలతో వార్తల్లో నిలిచే ఈ ప్రేమ పక్షులు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. నెలరోజుల క్రితమే వీరు విడిపోయారని చెప్పడానికి పలు అంశాలు కూడా అనుకూలిస్తున్నాయి.
ఇన్ స్టాగ్రామ్ లో 'హార్ట్ బ్రేక్'..
కొన్ని రోజుల క్రితం విరాట్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ పేజీలో సెల్ఫీ పోస్ట్ చేసి 'హార్ట్ బ్రేక్' అంటూ దానికో క్యాప్షన్ జోడించాడు. ఆ 'హార్ట్ బ్రేక్' క్యాప్షన్ బ్రేకింగ్ న్యూస్ అవుతుందని భావించాడో ఏమో వెంటనే దాన్ని తొలగించాడు.  కానీ ఆ కాస్త వ్యవధిలోనే ఫ్యాన్స్ అసలు విషయాన్ని పసిగట్టేశారు. విరాట్ అంతటితో ఊరుకున్నాడా.. 'హార్ట్ బ్రేక్' క్యాప్షన్ తొలగించిన వెంటనే అనుష్కను 'అన్ ఫాలో' చేసేశాడు. దాంతో అభిమానులు ఓ నిర్ధారణకు వచ్చేశారు.

గడ్డం కూడా తీసేశాడు..
సాధారణంగా పంజాబీల వివాహ సమయంలో జరిగే కొన్ని వేడుకల్లో వరుడు గడ్డంతో ఉండటం వారి సంప్రదాయం. వివాహం కోసమే విరాట్ గడ్డం పెంచుతున్నాడని ఓ భారీ రూమర్. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ విరాట్ గడ్డం తీసేసి కనబడుతున్నాడు. అనుష్క పెళ్లికి  నిరాకరించడంతోనే  విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నాడట.

ఇక వారి సన్నిహితుల కథనం ప్రకారం.. విరాట్-అనుష్కలు నెల క్రితం విడిపోయిన మాట నిజమేనని, అయితే వారిద్దరూ ఇష్టపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.  ప్రస్తుతం వారిద్దరూ కెరీర్ మీద సీరియస్ గా దృష్టి పెట్టాలనుకుంటున్నారని, అయినా ఆ నిర్ణయం విరాట్ ది కాదని చెబుతున్నారు. కాగా విరాట్ టీ ట్వంటీ ప్రిపరేషన్ లో బిజీగా ఉండగా.. అనుష్క సుల్తాన్ షూటింగ్ లో బిజీ.  మొత్తానికి గడసరి క్రికెటర్, సొగసరి హీరోయిన్ల ప్రేమకథ ఇలా ఊహించని మలుపు తిరిగింది.

Saturday, February 6, 2016

యువీకి షాక్‌.. వాట్సన్‌కి లక్‌

  ఐపీఎల్‌ గత రెండు సీజన్లలో అత్యధిక ధరకు అమ్ముడుపోయి వేలంలో రారాజుగా వెలుగొందిన భారత్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌ సింగ్‌కు తాజాగా ఐపీఎల్‌-9 సీజన్‌ వేలంలో దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీ 2014 సీజన్‌లో యువరాజ్‌ని రూ.14 కోట్లకు కొనుగోలు చేయగా.. తర్వాత ఏడాది దిల్లీ డేర్‌డెవిల్స్‌ ఏకంగా రూ.16 కోట్లు వెచ్చించి మరీ దక్కించుకుంది. అయితే ఈ రెండు సీజన్లలో యువరాజ్‌ సింగ్‌ పేలవ ఆటతీరుతో ఫ్రాంచైజీలను తీవ్రంగా నిరాశపరిచాడు. శనివారం బెంగళూరులో జరిగిన వేలంలో రూ.2కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన యువరాజ్‌ను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. అయితే రూ.7కోట్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దక్కించుకుని అందర్నీ ఆశ్చర్య పరిచింది. అంటే గత రెండేళ్లతో పోలిస్తే యువరాజ్‌ ధర దాదాపు సగానికి సగం పడిపోయిందన్నమాట. దాదాపు 351 మంది క్రికెటర్లు శనివారం వేలంలో నిలిచారు.

Wednesday, February 3, 2016

చిరంజీవికి నేడు ఆపరేషన్

 మెగాస్టార్ చిరంజీవి గురువారం ఆపరేషన్ చేయించుకోనున్నారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో భుజానికి ఆయన శస్త్రచికిత్స చేయించుకోనున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. చాలా కాలంగా ఆయన భుజం నొప్పితో బాధ పడుతున్నారని, కత్తి సినిమా షూటింగ్ కు ముందే ఆపరేషన్ చేయించుకోవాలని భావించి ముంబై ఆస్పత్రిలో చేరారని తెలిపాయి. చాలా రోజుల క్రితమే ఆపరేషన్ చేయించుకోవాలని అనుకున్నా కుదరలేదని వెల్లడించాయి.
చిరంజీవి సతీమణి సురేఖ ఆయన వెంట ఉన్నారు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆయన దాదాపు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఆయనను ఎప్పుడు డిశ్చార్జి చేస్తారనేది వెల్లడి కాలేదు. పూర్తిగా కోలుకున్నాకే ఆయన హైదరాబాద్ కు తిరిగొచ్చే  అవకాశముందని సమాచారం. కత్తి సినిమా రీమేక్ నటించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభంకానుంది. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తారు.

ఓ మిస్డ్‌కాల్.. ప్రేమ..పెళ్లి.. విషాదం!

ఆదిలాబాద్
                   ఓ మిస్డ్‌ కాల్.. వారి మధ్య పరిచయూనికి దారితీసింది. అది ప్రేమగా మారి పెళ్లి దాకా చేరింది. చివరికి ఆ యువతి ప్రాణాన్నే బలితీసుకుంది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని కొత్త కాలనీకి చెందిన గుమ్ముల స్వరూప (22) బీడీ కార్మికురాలు. గుమ్ముల లక్ష్మి, రాములు మూడో సంతానమైన ఆమె పెద్దగా చదువుకోలేదు. మూడేళ్ల క్రితం ఆమె ఫోన్‌కు ఒక మిస్డ్ కాల్ వచ్చింది. ఎవరు కాల్ చేశారో తెలియక ఆమె తిరిగి కాల్‌ చేసింది. అవతలి వ్యక్తి తన పేరు అశోక్ అని, తాను ఆదిలాబాద్‌కు చెందిన వ్యక్తినని పరిచయం చేసుకున్నాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్ని రోజులపాటు ప్రేమలో గడిపారు. అనంతరం అశోక్ పెళ్లికి నిరాకరించడంతో స్వరూప పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.           పోలీసులు, పెద్ద మనుషుల ద్వారా రాజీ కుదుర్చుకుని పెళ్లి చేసుకున్న వారికి 20 రోజుల క్రితమే కూతురు పుట్టింది. ఏమైందో ఏమో తెలియదు కానీ మంగళవారం సాయంత్రం స్వరూప ఆత్మహత్య చేసుకుందని కాలనీవాసులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. అయితే.. స్వరూప ఆత్మహత్య చేసుకోలేదని, భర్తే చితకబాది బలవంతంగా పురుగుల మందు తాగించాడని ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. అతను హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేస్తున్నాడని అంటున్నారు. ఆదిలాబాద్‌లోని రూరల్ పోలీసులు స్వరూప భర్త అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tuesday, February 2, 2016

స్త్రీలే ఎక్కువ కాలం జీవిస్తారా?

పురుషుల కన్నా స్త్రీల ఆయు: ప్రమాణం ఎక్కువని చాలా పరిశోధనల్లో తేలింది. పురుషులతో పోలిస్తే గుండె జబ్బులు, పక్షవాతం..లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా స్త్రీలలో తక్కువగా రావడాన్ని గమనించారు. రోగనిరోధకశక్తితో పాటు జీవనపరిమితి కూడా స్త్రీలలో ఎక్కువగా ఉండడానికి కారణమేమిటి? అనే విషయంపై జీవశాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఈ విషయం అంతుచిక్కని రహస్యంగానే ఉంది. కానీ స్కాండినేషియన్‌ శాస్త్రవేత్తలు మాత్రం తమ పరిశోధనల్లో ఒక కొత్త విషయాన్ని చెప్పారు. స్త్రీ శరీర కణాల్లో వైవిధ్యభరితమైన రెండు ఎక్స్‌ క్రోమోజోములు ఉండడమే ఇందుకు కారణమని ఆ నిపుణుల బృందం పేర్కొంది.
                     ఆ రెండే కీలకం : మనిషి శరీరం సూక్ష్మమైన కణాలతో నిర్మితమైందన్న సంగతి తెలిసిందే. ప్రతి కణంలోనూ 22 జతల నిర్మాణాత్మక క్రోమోజోములు, ఒక జత లైంగిక క్రోమోజోములు ఉంటాయి. వీటిలో సగం తల్లి, సగం తండ్రి నుంచి సంక్రమిస్తాయి. అయితే వీటిలో శరీర నిర్మాణానికి దోహదపడే 22 జతల క్రోమోజోముల సంగతలా ఉంచితే, తల్లిదండ్రులిద్దరి నుంచి ఆనువంశికంగా వచ్చే లైంగిక క్రోమోజోములే జీవి లింగభేదాన్ని నిర్దేశిస్తాయి. కీలకమైన ఆ క్రోమోజోముల్నే ఎక్స్‌, వై గా పిలుస్తారు. ఇవి స్త్రీలలో ఎక్స్‌, ఎక్స్‌ సంయోగంగా, పురుషుల్లో ఎక్స్‌, వై సంయోగంగా ఉంటాయి. ఫలదీకరణ సమయంలో ఈ క్రోమోజోముల్లో జరిగే కణవిభజన, పుట్టేబిడ్డ ఆడా, మగా అనే విషయాన్ని నిర్దేశిస్తుంది. ఆయా క్రోమోజోముల మీద ఉన్న జన్యువులే కణవిభజనను ప్రభావితం చేస్తాయి. అయితే తల్లి, తండ్రి నుంచి వచ్చే వైవిధ్యభరితమైన ఆ రెండు ఎక్స్‌ క్రోమోజోములే స్త్రీలలో ఆయు:ప్రమాణం ఎక్కువగా ఉండడానికి కారణమని స్కాండినేషియన్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రెండు ఎక్స్‌ క్రోమోజోముల కారణంగా ప్రతి స్త్రీ శరీరంలోనూ స్వల్ప వైవిధ్యం ఉన్న రెండు కణరేఖలు ఏర్పడతాయి. ఈ కణరేఖలే జీవి ఆయు:ప్రమాణాన్ని పెంచడానికీ, తగ్గించడానికీ దోహదపడతాయని వారు వివరించారు. స్త్రీలలో రెండు రకాల కణరేఖలు ఏర్పడడం వల్ల జీవనాన్ని ప్రభావితం చేయగల రేఖను ఎంపిక చేసుకునే అవకాశం వాళ్ల శరీరానికి ఉంది. అలాంటి అవకాశం పురుషులకు లేదు. అందుకే పురుషులలో కన్నా స్త్రీలలో ఆయు:ప్రమాణం ఎక్కువ అని తమ ప్రయోగాల ద్వారా వారు పేర్కొన్నారు.
                     స్త్రీలలో ఉండే ఈ రెండు కణరేఖల్లో ఎదో ఒకటి మాత్రమే పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుందని డెన్మార్క్‌లోని ఓడెన్స్‌ యూనివర్సిటీకి చెందిన కారీ క్రిస్టెన్‌సెన్‌, ఓస్లోలోని ఉలెవల్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌కు చెందిన కరెన్‌ హెలెన్‌ ఆర్‌స్టావిక్‌ అధ్యక్షతన పరిశోధనలు చేసిన బృందం పేర్కొంది. ఎక్స్‌ క్రోమోజోమ్‌ మీదున్న ఆండ్రోజన్‌ జన్యుకారకం ఆధారంగా ఆ రెండూ ఒకదానిలో ఒకటి కలియకుండా విడవిడిగా ఏర్పడినవేనని తేలింది.
                     ఈ పరిశోధనల కోసం వయస్సు తక్కువగా ఉన్న మహిళల కణాలను పరిశీలించారు. అందులో ఆ రెండు రేఖలు సుమారుగా 50:50 నిష్పత్తిలో విభజన చెంది ఉన్నాయని గుర్తించారు. ఆ తర్వాత వృద్ధుల శరీరంలోని కణరేఖల్ని పరిశీలించారు. వారందరిలో కూడా ఒకే కణరేఖకే ప్రాముఖ్యం ఇచ్చినట్లు కనుగొన్నారు. ఆ తర్వాత నడివయస్సు ఉన్న మహిళలో పరిశోధనలు చేశారు. మొత్తం అందరిలోనూ రెండు కణరేఖల్లో ఒకటి పూర్తిగా చర్యాగుణాన్ని అంటే డామినేట్‌ చేస్తూ కనిపించింది. అదే పురుషుల్లో అయితే ఒకే ఒక కణరేఖ ఉంటుంది. కాబట్టి వారికి ఒకే అవకాశం ఉంటుందని క్రిస్టెన్‌సెన్‌ పేర్కొన్నారు. అంతేకాదు, స్త్రీలలో రెండు కణరేఖలు ఉండడం వల్ల ఒకటి కాకపోతే రెండోది ప్రభావశీలంగా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల వాళ్ల జీవన పరిమితి పురుషుల్లో కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు.
                  ఈ బృందం జంతువులపై చేసిన ప్రయోగాలు కూడా ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. ఉదాహరణకు క్షీరదాలను తీసుకుంటే వాటిలో కూడా మగ జంతువుల్లో ఎక్స్‌, వై అనే లైంగిక క్రోమోజోములే ఉంటాయి. అందువల్ల వాటి ఆయు:ప్రమాణం కూడా తక్కువే. అదే పక్షుల్లో ఆడవాటిలో జెడ్‌, డబ్ల్యూ అనే రెండు వైవిధ్యభరితమైన లైంగిక క్రోమోజోములుం టాయి. మగపక్షుల్లో రెండూ జెడ్‌ క్రోమోజోములే ఉంటాయి. ఫలితంగా పక్షుల విషయంలో మగ పక్షులే ఎక్కువ జీవనపరిమితిని కలిగి ఉంటాయి. దీన్ని బట్టి ఈ లైంగిక క్రోమోజుములే జీవుల ఆయు:ప్రమాణాన్ని ప్రభావితం చేస్తున్నాయని పరిశోధకలు నిర్ధారించారు.
                      అయితే ఈ అభిప్రాయాలతో అందరూ ఏకీభవించడం లేదు. 'జీవన పరిమితి ఎంత కాలముంటుందనేది మనం లెక్కించలేం కాబట్టి ఈ విషయంతో ఏకీభవించలేం' అని జాన్‌సన్‌ పేర్కొంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ ఇడహౌకు చెందిన స్టీవెన్‌ ఆస్టడ్‌ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. అదీగాక మార్స్యుపియల్స్‌లో(పిల్లల్ని సంరక్షించుకు నేందుకు పొట్ట కింద భాగంలో సంచీలాంటి నిర్మాణాన్ని కలిగి ఉండే క్షీరదజాతి) అంటే కంగారూ లాంటి జంతువుల్లో తండ్రి నుంచి సంక్రమించే ఎక్స్‌ క్రోమోజోమ్‌.. ఆడజంతువుల్లో ఎప్పుడూ క్రియాశీలంగా ఉండదు. అంటే వాటిలో ఏ ఎక్స్‌ క్రోమోజోమ్‌ మంచిది అని తేల్చడానికి అవకాశమే లేదని ఆయన పేర్కొన్నారు. కాబట్టి ఆడామగా కంగారూల్లో ఏవి ఎక్కువ కాలం జీవిస్తాయనేది తేల్చిచెప్పలేం. ఆడామగా జీవుల్లో ఆయు:ప్రమా ణాలు వివిధ జాతుల్లో వివిధ రకాలుగా ఉన్నాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయని, వాటిపై వివాదాలు లేకపోలేదని మరికొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఆసీస్‌తో తొలివన్డేలో భారత మహిళా జట్టు ఓటమి

 ఆస్ట్రేలియా- భారత మహిళా క్రికెటజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కాన్‌బెర్రా వేదికగా జరిగిన తొలిమ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. దీంతో ఆసీస్‌ 1-0తో సిరీస్‌లో పైచేయి సాధించింది. అంతకు ముందు నిర్వహించిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 2-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేసింది. అలెక్స్‌ బ్లాక్‌వెల్‌ 114, ఎల్ల్సీ పెర్రీ 90 పరుగులతో భారీ స్కోరుకు బాటలు వేశారు. భారత బౌలర్లలో శిఖాపాండే మూడు వికెట్లు సాధించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళలు 46.5 ఓవర్లలో 175 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. హర్మన్‌ప్రీత్‌(46), జూలన్‌ గోస్వామి(25) మాత్రమే రెండండెల స్కోర్‌ చేశారు.