Friday, January 1, 2016

నేను శైలజ సినిమా రివ్యూ

క‌థేంటి?
 హరి(రామ్)కి ప్రేమ పిచ్చి. చిన్న‌ప్ప‌టి నుంచీ ప్రేమ‌లో ప‌డ‌డం.. విఫ‌ల‌మ‌వ్వ‌డం హ‌రికి అల‌వాటు.
 

 శైలు (కీర్తి సురేష్‌)ని కూడా అలానే ప్రేమిస్తాడు. కానీ.. హరి కుటుంబం అంతా వైజాగ్ కి బ‌దిలీ అవ్వ‌డం వ‌ల్ల‌... శైలుకి దూరం అవ్వాల్సి వ‌స్తుంది. హ‌రి పెరిగి పెద్ద‌వాడైనా ప్రేమ‌క‌థ‌ల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రేమించిన ప్ర‌తి అమ్మాయి త‌న‌కు దూరం అవ్వ‌డం చూసి... ఇక ప్రేమ జోలికి వెళ్లొద్ద‌నుకొంటాడు. కానీ.. త‌న జీవితంలోకి శైలు మ‌ళ్లీ వ‌స్తుంది. ఈసారి శైలును మ‌రింత సిన్సియ‌ర్‌గా ప్రేమిస్తాడు.కానీ.. శైలు మాత్రం హ‌రి ప్రేమ‌కు `నో` చెప్తుంది. దానికి కార‌ణం ఏమిటి?  శైలు ప్రేమ‌ని హ‌రి ఎలా పొందాడు? అన్న‌దే మిగిలిన క‌థ‌.....

Thursday, December 31, 2015

నూతన సంవత్సర శుభాకాంక్షలు - 2016

2015కి బై బై.. కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన నా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకు స్వాగతం..సుస్వాగతం.. 
మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 216

Wednesday, December 30, 2015

చాలా బాధ కలిగింది

రెండేళ్ల కిందట (2013) ఆస్ట్రేలియాతో జరి గిన టెస్టు సిరీస్ మధ్యలో తనను తీసేయడం బాధ కలిగించిందని డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నా డు. టీమ్ మేనేజ్‌మెంట్ నుంచిగానీ, సెలక్టర్ల నుంచిగానీ ఎలాంటి సమాచారం లేదన్నాడు. హైదరాబాద్‌లో జరిగిన రెండో టెస్టు తర్వాత వీరూను జట్టులో నుంచి తొలగించారు. అయితే చివరి రెండు టెస్టులు కూడా ఆడే అవకాశం ఇచ్చి ఆ తర్వాత రిటైర్ అవ్వమని చెబితే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.
   ‘ఆసీస్‌తో తొలి రెండు టెస్టుల్లో నేను సరిగా పరుగులు చేయలేదు. అయితే మరో రెండు అవకాశాలు వస్తాయి కాబట్టి వాటిలో మెరు గ్గా రాణించాలని భావించా. కానీ ఆ అవకాశమే ఇవ్వకుండా నన్ను తొలగించారు. ఒకవేళ చివరి రెండు టెస్టుల్లోనూ ఆడకపోతే తీసేసినా బాగుం డేది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్టర్లలో ఎవరి నుంచి సమాచారం రాలేదు. పత్రికల్లో ఈ విషయం రావడంతో చాలా బాధకు గురయ్యా’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
   మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తానని మేనేజ్‌మెంట్‌కు చెప్పినా పెద్దగా పట్టించుకోలేదన్నాడు. ఓపెనర్‌గా ఆడే సత్తా ఉందని చెప్పిన మేనేజ్‌మెంట్ ఓపెనింగ్ జోడిని మార్చే అవకాశం తీసుకోలేదన్నారు. పుజా రా, సచిన్, కోహ్లిలు వరుసగా మూడు, నాలుగు, ఐ దు స్థానాల్లో బ్యాటింగ్ చేస్తుండటంతో తనకు మిడిలార్డర్‌లో ఆడే అవకాశం రాలేదన్నాడు.

'మామ మంచు అల్లుడు కంచు' మూవీ రివ్యూ

            చాలా రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్ హీరోగా, సీనియర్ హీరో మోహన్ బాబు మరో లీడ్ రోల్ లో తెరకెక్కించిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ మామ మంచు అల్లుడు కంచు. మరాఠిలో ఘనవిజయం సాధించిన సినిమాకు తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి దర్శకుడు.
             అల్లరి నరేష్ 50వ సినిమాగా, మోహన్ బాబు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 40 ఏళ్లు పూర్తి చేసుకున్న తరువాత విడుదలైన సినిమాగా భారీ హైప్ క్రియేట్ చేసిన మామ మంచు అల్లుడు కంచు. రిలీజ్ తరువాత ఆ అంచనాలను అందుకుందా..? హిట్ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్ సక్సెస్ సాధించాడా,? చాలా కాలం తరువాత కామెడీ పాత్రలో నటించిన మోహన్ బాబు ఈ జనరేషన్ ను తన టైమింగ్ తో మెప్పించాడా..? వివరాల్లోకి వెళితే...
కథ :          భక్తవత్సలం నాయుడు( మోహన్ బాబు) అనుకోని పరిస్థితుల్లో రెండు పెళ్ళిలు చేసుకొని పాతికేళ్లుగా ఒకరి తెలియకుండా ఒకరిని మెయిన్ టెయిన్ చేయడానికి కష్టపడిపోతుంటాడు. అతని స్నేహితుడు ఇస్మాయిల్ (అలీ) ఈ కష్టాల్లో నాయుడుగారికి సాయం చేస్తుంటాడు. భక్తవత్సలం నాయుడు మొదటి భార్య సూర్యకాంతం (మీనా) కి ఒక కూతురు శృతి(పూర్ణ), రెండో భార్య ప్రియంవద(రమ్యకృష్ణ)కు ఓ కొడుకు గౌతమ్ నాయుడు(వరుణ్ సందేశ్). ఇలా కష్టాల్లో సాగుతున్న భక్తవత్సలం నాయుడుకి పిల్లలు పెళ్లీడుకి రావటంతో కొత్త కష్టాలు మొదలవుతాయి. శృతి, గౌతమ్ ల పుట్టిన రోజులు కూడా ఒకే రోజు కావటంతో సినిమా అసలు కథలోకి ఎంటర్ అవుతుంది.
         ఇద్దరు పిల్లలకు పుట్టినరోజు కానుకలు ఇచ్చే క్రమంలో అడ్రస్ లు మారిపోవటంతో శృతి గిఫ్ట్, గౌతమ్ కు, గౌతమ్ గిఫ్ట్ శృతికి వెళుతుంది. గిఫ్ట్ మార్చుకోవటం కోసం శృతి, గౌతమ్ లు కలుసుకోవాలనుకుంటారు. అలా కలిస్తే తన నాటకం బయటపడుతుందని భావించిన నాయుడు వారు కలవకుండా ఉండేదుకు గౌతమ్ గిఫ్ట్ దొంగతనం చేసి దాన్ని బాలరాజు (అల్లరి నరేష్) తో శృతి దగ్గరకు పంపిస్తాడు. ఎలాగైనా గౌతమ్ అంటే శృతికి అసహ్యం కలిగేలా చేయమంటాడు.
           శృతిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడ్డ బాలరాజు, తానే గౌతమ్ అని శృతిని ప్రేమలోకి దించుతాడు. అలా మరింత కష్టాల్లో ఇరుక్కున్న నాయుడు, బాలరాజు నుంచి తన కూతురిని కాపాడుకోవటానికి, తన ఇద్దరు భార్యల రహస్యం బయటపడకుండా ఉండటానికి ఎలాంటి ఎత్తులు వేశాడు. చివరకు ఆ విషయం ఎలా బయటపడింది. అనుకున్నట్టుగా బాలరాజు శృతి పెళ్లి చేసుకున్నాడా అన్నదే అసలు కథ.
నటీనటులు :
        
ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు గడుస్తున్నా మోహన్ బాబు ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటిపడి నటిస్తున్నారు. తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గ క్యారెక్టర్ ను ఎంచుకున్న మోహన్ బాబు ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించీ ఇప్పటికీ తనలో అదే ఫాం ఉందని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఇక తనకు బాగా అలవాటైన క్యారెక్టర్ లో అల్లరి నరేష్ మరోసారి మెప్పించాడు. కామెడీతో పాటు క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో కూడా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. చాలా రోజుల తరువాత ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో కనిపించిన అలీ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక మీనా, రమ్యకృష్ణ, పూర్ణ, వరుణ్ సందేశ్, కృష్ణభగవాన్ లు తన పరిధి మేరకు మెప్పించారు.
 
          ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో మంచి క్లారిటీ మెయిన్ టెయిన్ చేసిన శ్రీనివాస్ రెడ్డి, కన్ఫ్యూజింగ్ సీన్స్ లోనూ ఎక్కడ క్లారిటీ మిస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇటీవల కాలం వరుస సక్సెస్ లు సాధిస్తున్న మాటల రచయిత శ్రీధర్ సీపాన మరోసారి తన పెన్ను పవర్ చూపించాడు. కామెడీ పంచ్ లతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో ఆకట్టుకోలేకపోయిన ఒకే ఒక్క అంశం సంగీతం. ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేసినా.. థియేటర్ నుంచి బయటికి వచ్చాక గుర్తుండే పాట ఒక్కటీ ఇవ్వలేకపోయారు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ బాగున్నాయి.

Saturday, December 26, 2015

భలే మంచి రోజు : సినిమా రివ్యూ


               తెలుగు సినీ రంగం నుంచి చాలా అరుదుగా వస్తుంటాయి కానీ క్రైమ్‌ కామెడీలకి ఇక్కడ ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. మనీ, అనగనగా ఒక రోజు, ఐతే, స్వామిరారా లాంటి సినిమాలు ఈ జోనర్‌లో ఒక స్టాండర్డ్‌ సెట్‌ చేసాయి. చూడ్డానికి మామూలుగా అనిపించినా కానీ ఇలాంటి సినిమాల్ని డీల్‌ చేయడం అంత తేలిక కాదు. దర్శకుడికి మంచి సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌తో పాటు థింకింగ్‌ బ్రెయిన్‌ కూడా కంపల్సరీ. కొత్త దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్యకి ఆ రెండూ ఉన్నాయని ఈ చిత్రంలో చాలా సందర్భాల్లో తెలుస్తుంది. రెగ్యులర్‌ హ్యూమర్‌ కాకుండా వివిధ రకాల హాస్యాన్ని పండించాడు. కొన్ని చోట్ల తెలివిగా, కొన్ని చోట్ల తింగరిగా, కొన్ని సందర్భాల్లో వెకిలిగా, కొన్ని సందర్భాల్లో పేరడీతో, మరికొన్ని చోట్ల అశ్లీలంతో (సాయికుమార్‌, ఐశ్వర్య ట్రాక్‌) నవ్విస్తుందీ చిత్రం.
         శ్రీరామ్‌ ఆదిత్య ఖచ్చితంగా తన కథపై చాలా కసరత్తు చేసాడు. దీనిని ఆసక్తికరంగా మార్చేందుకు అతను చాలా సమయాన్ని వెచ్చించాడనే సంగతి తెలుస్తూనే ఉంటుంది. కథలోకి ఎంటర్‌ అయ్యే ఏ క్యారెక్టర్‌ టైమ్‌పాస్‌కి వచ్చినట్టుండదు. అన్నిటికీ ఒక పర్పస్‌ ఉంటుంది.. అన్నీ ప్లాట్‌లో ఇన్‌వాల్వ్‌ అయి ఉంటాయి. ప్రతి పాత్రనీ ఏదో విధంగా ఎంటర్‌టైనింగ్‌గా మలిచేందుకు దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. కేవలం కథనం, పాత్రల చిత్రణ విషయం మీదే కాదు.. దర్శకుడిగా తన టేకింగ్‌ గురించి మాట్లాడుకునేట్టు చేయడానికి తగ్గ విధంగా విజువలైజ్‌ చేసుకున్నాడు. ఎల్లో థీమ్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే ఛేజ్‌ సీన్‌ దర్శకుడి ఊహాశక్తిని తెలియజేస్తుంది. స్లమ్స్‌ని, విలన్‌ డెన్‌ని, హీరో గ్యారేజ్‌ని.. ప్రతి సెట్‌ పీస్‌కి డీటెయిలింగ్‌ చక్కగా కుదిరింది. ప్రొడక్షన్‌ డిజైన్‌ కానీ, సినిమాటోగ్రఫీ కానీ ఉత్తమ శ్రేణిలో నిలుస్తాయి.
         చక్కని కామెడీతో ఎలాంటి జర్క్స్‌ లేకుండా సాగిపోయే ఫస్ట్‌ హాఫ్‌ సూపర్బ్‌ ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో ఎండ్‌ అవుతుంది. సెకండ్‌ హాఫ్‌లో ఇంకా క్యారెక్టర్లు ఎంటర్‌ అవడం, మరికొన్ని త్రెడ్స్‌ వచ్చి మెయిన్‌ ప్లాట్‌తో కలవడం వల్ల కాసింత గందరగోళం నెలకొంటుంది. అయితే అన్నిటికీ తగ్గ ముగింపుని ఇవ్వడానికి, డాట్స్‌ అన్నీ కనెక్ట్‌ చేయడానికి దర్శకుడు ముందే ప్లాంటింగ్స్‌ వేసి పెట్టుకున్నాడు. వాటికి పే ఆఫ్స్‌ ఇస్తూ క్లయిమాక్స్‌ని వినోదాత్మకంగా మలిచాడు. అయితే ఎంటర్‌టైన్‌ చేసే ప్రాసెస్‌లో కొన్ని సార్లు అతను బ్యాలెన్స్‌ తప్పాడు. విలన్‌ పాత్రకి కూడా కామెడీ కోణం ఇవ్వడానికి అన్నట్టు అతని భార్యని (ఐశ్వర్య) సెక్స్‌ మేనియాక్‌గా చూపించడం కాస్త టూమచ్‌ అనిపిస్తుంది. అలాగే వేణు, అతని క్రైమ్‌ పార్టనర్‌ జోడీకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనిపిస్తుంది. పైగా వారిపై ఒక పాట కూడా చిత్రీకరించారు. అవసరమే లేని చోట హీరోహీరోయిన్లపై ఒక మెలోడీ సాంగ్‌ వచ్చి విసిగిస్తుంది. కొత్త ఆలోచనలతో వస్తోన్న దర్శకులు కొన్ని పాత పద్ధతులని కూడా విడిచిపెట్టాలి. తప్పనిసరిగా పాటలు ఉండాలి, ఫైట్లుండాలి లాంటి మూస పోకడలు మానుకోవాలి.
        సుధీర్‌బాబు తన పాత్రకి న్యాయం చేసాడు కానీ ఆ పాత్రకి అవసరం లేని ఫిజిక్‌తో కనిపించాడు. తన పాత్ర ఒక మామూలు కుర్రాడిగా కనిపిస్తే మరింత రక్తి కడుతుంది. పాత్రకి అనుగుణంగా ట్రాన్స్‌ఫర్మ్‌ అవడమనేది, బాడీ లాంగ్వేజ్‌లో సటిల్‌ ఛేంజెస్‌ చేయడమనేది చాలా ఇంపార్టెంట్‌ అని తెలుసుకోవాలి. వామిక బాగుంది. బాగానే చేసింది. పోసాని కామ్‌గా ఉండాల్సిన ఫాదర్‌ క్యారెక్టర్‌లో కాస్త కొత్తగా కనిపిస్తాడు. తన లౌడ్‌ డైలాగ్స్‌ అన్నీ మనసులోనే అనుకునేలా చేయడం నైస్‌ టచ్‌. దివాళా తీసిన విలన్‌గా సాయికుమార్‌, తింగరి కిడ్నాపర్లుగా వేణు, శ్రీరామ్‌, కన్నింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చైతన్య కృష్ణ, గ్రీడీ గాళ్‌ఫ్రెండ్‌గా ధన్య, సీనియర్‌ మోస్ట్‌ జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పృధ్వీ, బాత్రూమ్‌ బ్రేక్‌ కోసం డెస్పరేట్‌గా ఎదురు చూసే వాడిగా ప్రవీణ్‌.. అందరూ తలా ఒక చెయ్యి వేసి ఈ చిత్రాన్ని ఆసాంతం వినోదాత్మకంగా మార్చారు. క్లయిమాక్స్‌లో పృధ్వీ వీరవిహారం బాగా నవ్విస్తుంది.
       సన్నీ మరోసారి తన నేపథ్య సంగీతంతో అలరించాడు. పాటలు కూడా వినడానికి బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌ పాయింట్‌. ఇన్ని క్యారెక్టర్లు, ఇన్ని త్రెడ్లు ఉన్నపుడు అన్నిటినీ తక్కువ నిడివిలో సెట్‌ చేసిపెట్టడం ఏ ఎడిటర్‌కి అయినా పరీక్షే. వర్మ తనకి అప్పగించిన పని బాగా చేసాడు. నిర్మాతల టేస్ట్‌ని, ప్యాషన్‌ని మెచ్చుకోవాలి. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య 'భలే' అనిపిస్తాడు. కొత్త ఆలోచనలతో పాటు ప్రేక్షకులకి వినూత్న వినోదం అందించే తెలివితేటలు కూడా ఉన్నాయి. ఈమధ్య పరిచయమైన దర్శకుల్లో అంచనాలు పెట్టుకోతగ్గ దర్శకుల్లో ముందు వరసలో ఉంటాడు. డిఫరెంట్‌ సినిమాలని, క్రైమ్‌ కామెడీ జోనర్‌ని ఇష్టపడే ప్రేక్షకులని మెప్పించే ఈ చిత్రం మసాలా లవర్స్‌ని మెప్పించలేకపోవచ్చు. ద్వితీయార్థంపై, ఆరంభంలో మందకొడి కథనంపై ఇంకాస్త శ్రద్ధ చూపించినట్టయితే ఈ జోనర్‌లో ఇదో మోడ్రన్‌ క్లాసిక్‌ అయి ఉండేది.

Thursday, December 24, 2015

సౌఖ్యం సినిమా రివ్యూ


'జాబ్‌లెస్‌, రెక్‌లెస్‌, రూత్‌లెస్‌, రిడిక్యులస్‌.. టోటల్‌గా యూజ్‌లెస్‌' అంటూ హీరో పాత్రని ఇంట్రడ్యూస్‌ చేస్తారిందులో. ఈ సినిమా గురించి వర్ణించడానికి కూడా అదే లైన్‌ని వాడేసుకోవచ్చు. పృధ్వీ, కృష్ణ భగవాన్‌ పాత్రలని పరిచయం చేసే ముందు... వాళ్లు తమ ఊళ్లో పెద్ద సినిమాలు రిలీజ్‌ చేసుకోలేక హిట్‌ అయిన సినిమాలని పేరడీ చేస్తూ సినిమాలు తీసి వాటినే ప్రదర్శిస్తుంటారని చెప్తారు. 'లౌక్యం' సినిమాలాంటి మరో హిట్‌ కావాలంటూ గోపీచంద్‌, ఆనంద్‌ ప్రసాద్‌ అడిగితే.. మళ్లీ అలాంటిది రాయలేక 'లౌక్యం'నే స్పూఫ్‌ చేసి.. 'సౌఖ్యం' అనే టైటిల్‌ పెట్టేసినట్టున్నారు.

           సినిమా అనే కళ అనుక్షణం కుంగిపోయేలా, కంపించిపోయేలా, కళ్లు వాచేలా ఏడ్చి కళ తప్పేలా ఉందీ సౌఖ్యం. హీరో పాత్ర పరిచయానికి ముందు పోలీస్‌ స్టేషన్‌కి పరుగెత్తుకుంటూ వచ్చే అతని ఫ్యామిలీని, వాళ్లు చెప్పే ఫ్లాష్‌బ్యాక్‌ని చూసేసరికే 'ఇన్‌ఫ్రంట్‌ క్రొకడైల్స్‌ ఫెస్టివల్‌' అనే పిక్చర్‌ వచ్చేయాలి. ఒకవేళ అప్పటికీ ట్యూబ్‌లైటు వెలగనట్టయితే... ఫెరోషియస్‌ విలనీకి పేరు పడ్డ ప్రదీప్‌ రావత్‌ వచ్చి 'డోరేమోన్‌' తెలుగు డబ్బింగ్‌ వర్షన్‌లో కార్టూన్‌ క్యారెక్టర్‌లా ఓవరాక్ట్‌ చేస్తుంటే అయినా సీన్‌ అర్థమైపోవాలి. అప్పటికీ బల్బు వెలగకపోతే ఇక అటుపై వెలగాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే ఎలాగో ఫ్యూజ్‌లు కొట్టేసి, వెలిగిన బల్బ్‌లు కూడా మాడిపోతాయి!
క్లయిమాక్స్‌ సీన్‌లో విలన్స్‌ని అడ్డుకున్న బ్రహ్మానందాన్ని ఉద్దేశిస్తూ అతని అనుచరుడు హీరోకి ఫోన్‌ చేసి 'త్వరగా రండి సర్‌... కంటెంట్‌ లేకుండా ఎక్కువ సేపు మా సర్‌ మ్యానేజ్‌ చేయలేడు' అని చెప్తాడు. ఈ సినిమా చూస్తున్నంతసేపు కంటెంట్‌ లేక, దీనిని ఎలా మ్యానేజ్‌ చేయాలనేది తెలీక, రెండు గంటలకి పైగా నిడివి ఉండేట్టు చూసుకోవడమెలాగో అర్థం కాక.. తోచిన సన్నివేశాలని, తట్టిన కామెడీని రాసుకుంటూ పోయారనిపిస్తుంది. సప్తగిరికి ఆత్మలు కనిపిస్తాయంటూ మొదలు పెట్టి, రెండు సీన్ల తర్వాత అతడిని పక్కన పడేసారు. వెంకీలో బ్రహ్మానందం పాత్రని అటు తిప్పి, ఇటు తిప్పి రైల్లో పోసానిని దించారు. బొమ్మరిల్లు ఫాదర్‌ని బురిడీ కొట్టించడానికి రఘుబాబుని రెడీలో బ్రహ్మానందంని చేసారు. ఇంక నవ్వించడమెలాగో తెలీదన్నట్టు బాహుబలి, శ్రీమంతుడుని స్పూఫ్‌ చేసి వదిలారు. అక్కడికీ కంటెంట్‌ లేదని బోధ పడి క్లయిమాక్స్‌ ఫైట్‌లో అడ్డం పడి 'లౌక్యం' హిట్‌కి తనవంతు సహకారం అందించిన పృధ్వీ పాత్రకి బదులు బ్రహ్మానందాన్ని పెట్టారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. అడుగడుగునా ఏదో తానులోంచి చింపుకొచ్చిన ముక్కలన్నీ కుట్టి ఇదే కొత్త స్క్రిప్టు అంటూ చేతులు దులిపేసుకున్నారు. ఇక దాని వాటం ఎలాగుంటుందనేది, దాన్ని చూడ్డం ఎంత సౌఖ్యంగా ఉంటుందనేది మీ ఊహలకే వదిలేస్తున్నాం.
               లౌక్యంతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ ఇచ్చిన రైటర్లు కనుక వాళ్లిచ్చిన స్క్రిప్టుని గోపీచంద్‌ క్వశ్చన్‌ చేయలేడు. ఆ సినిమా అంత హిట్‌ అయింది కాబట్టి ఈసారి దీనిపై నిర్మాత డౌట్‌ పడలేడు. చేయి తిరిగిన వాళ్లు, చేసి చూపించిన సమర్ధులు ఇచ్చిన దానిని మార్చి తీసే ధైర్యం దర్శకుడు చేయడు. ఇంకేముంది ఇష్టానికి రాసుకున్న స్క్రిప్టు తీరూ తెన్నూ లేకుండా, తలా తోకా తెలీకుండా సౌఖ్యం అనే పదానికి ఎగ్జాక్ట్‌ ఆపోజిట్‌గా మారింది. గోపీచంద్‌ అయినా, జేమ్స్‌బాండ్‌ అయినా ఇలాంటి క్యారెక్టర్‌ ఇస్తే చేష్టలుడిగి చూస్తుండిపోవాల్సిందే. కెమెరా ముందు ఏదోటి చేసేసి కట్‌ చెప్పించుకోవాల్సిందే. గోపీచంద్‌ అదే చేసాడు. లౌక్యం ఇచ్చారనే కృతజ్ఞతని చూపించి పరిహారం చెల్లించుకున్నాడు. తన సౌఖ్యం కోసమైనా కాస్త లౌక్యం ప్రదర్శిస్తే బాగుండేది. హీరో గురించే చెప్పడానికేం లేదంటే ఇక హీరోయిన్‌ గురించి దేనికిలెండి. నాయికానాయకులే కీలుబొమ్మలైనప్పుడు.. వారికి సహకారం అందించిన వాళ్లు, ప్రతినాయకులైన వాళ్లు మాత్రం ఎలా మెప్పించగలరని. లౌక్యం విజయంలో కీలక పాత్రధారులైన కమెడియన్లు కూడా తమకిచ్చిన స్టేల్‌ జోకులని, స్టింకింగ్‌ స్పూఫ్‌లని పండించడానికి పడ్డ పాట్లు వివరించడమెలాగని?
'శేషూ శేషూ..' అంటూ సప్తగిరి పరిచయం... 'ఎవ్వడంట ఎవ్వడంట' అంటూ పృధ్వీ ఇంట్రడక్షన్‌, 'నా పేరు దయ.. నాకు లేనిదే అది' అంటూ బ్రహ్మానందం రావడం.. అవేమీ సరిపోనట్టు 'గబ్బర్‌సింగ్‌' అంత్యాక్షరి సీన్‌కి ఎక్స్‌టెన్షన్‌! ఇంతకుమించి కామెడీ ఉండదా? లేక కామెడీ అంటే ఇంతే అనుకుంటున్నారా? ఫస్ట్‌ హాఫ్‌లో వాచ్‌ వైపు, సెకండ్‌ హాఫ్‌లో ఎగ్జిట్‌ వైపు చూస్తూ నూట నలభై నిమిషాలు గడవడం ఎంత కష్టమో తెలుసుకుంటాం. వరదల్లో చిక్కుకున్న వాళ్లని చూసి అయ్యోపాపం అంటాం. అలా ఇరుక్కుపోతే తిండి, నీళ్లు, నిత్యావసరాలు ఉండవేమో.. కనీసం అక్కడీ సౌఖ్యం చూసే 'భాగ్యం' ఉండదు. 'అంతకుమించిన' పరీక్షని పెట్టి, వర్ణించలేని విధమైన శిక్షని వేస్తుందీ చిత్రం. హిట్‌ సినిమా అనే దానికి ప్రత్యేకమైన సూత్రాల్లేవు. హిట్‌ కొట్టడానికి ఫలానా అంటూ దిక్సూచి లేదు. మంచి కథ, పకడ్బందీ కథనం ఉన్నా ఎక్కడో ఒక చోట ఏదో ఒక వెలితి వచ్చి మొత్తంగా ఫలితం తిరగబడుతుంది. లౌక్యంకి అన్నీ కుదిరేసాయి. ఈసారి దానిని అనుకరించి పాస్‌ అయిపోదామని చూసేసరికి టేకాఫ్‌ అవకుండా రన్‌వేపైనే క్రాష్‌ అయిపోయింది.

Wednesday, December 23, 2015

నెంబర్‌ కొట్టండి .. సమస్య చెప్పండి




ప్రజల సౌకర్యార్థం టోల్‌ ఫ్రీ నెంబర్లు 


సిఎంఓ ఆఫీస్‌ 040-23454071                 మీ ఏరియాలో ఏదైనా సమస్య ఏళ్ల తరబడి పెండింగ్‌లో కొనసాగుతోందా.? అధికారులు నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారా? ప్రజా ప్రతినిధులు మీవైపు చూడటం లేదా..? ప్రభుత్వ పథకాల్లో మీకు ఏమైనా అసౌకర్యం కలుగుతుందా..? ఇవన్నీ సమస్యలను నేరుగా ముఖ్యమంత్రికే చెప్పుకోవాలని ఉందా.. అయితే మీరు అక్కడి దాకా పోవాల్సిన పనిలేదు. ఇలాంటి వాళ్ల కోసమే సిఎంఓ కార్యాలయంలో 040- 23454071 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. దీనికి ఫోన్‌ చేస్తే ముఖ్యమంత్రికి చెప్పినట్లేనని కెసిఆర్‌ చెప్పారు మరి. ఏ సమస్యకైనా 100

 మనం ఏ సమస్యలో ఉన్నా, పోలీసులకు ఏదైనా సమాచారం ఇవ్వాలనుకున్నా 100 డయల్‌ చేస్తే సరి. ఈ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే స్థానికంగా ఉన్న పోలీస్‌ స్టేషన్లకు కనెక్ట్‌ అవుతోంది. పైసా ఖర్చు లేకుండా సమాచారం ఇవ్వొచ్చు. తెలుసుకోవచ్చు.
 
తక్షణ వైద్యం కోసం 108




ఆపదలో ఉన్నప్పుడు ఫోన్‌ చేస్తే వచ్చేది ఏమిటంటే 108 అంబులెన్స్‌ వాహనమని నేడు అందరికీ తెలుసు. రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాదాలు జరిగినా.. ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నా? ఆసుపత్రికి చేరేందుకు 108 వాహనానికి ఫోన్‌ చేస్తే చాలు. క్షణాల్లో మీ ముందుంటుంది. అయితే అంబులెన్స్‌ వచ్చేంత వరకు రూట్‌ వివరాల కోసం ఆ సిబ్బంది మనకూ ఫోన్‌ చేస్తుంటారు.
'మీసేవా' కేంద్రాలపై...


'మీసేవా' కేంద్రాల్లో మీ పనులు సకాలంలో జరగడం లేదా? ఇచ్చిన సమయానికి ధృవీకరణ పత్రాలు జారీ చేయడం లేదా? కేంద్రాల్లో కనీస వసతులు లేవా? సమాచారం కోసం గంటల తరబడి నిలబెడుతున్నారా? పైసలిస్తే తప్ప పని జరగడం లేదా.. అయితే 1100 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేయండి మీ సమస్యను పరిష్కరిస్తారు.


ఆరోగ్య సందేహాలు తీర్చుకోండిలా...



మీ మానసిక పరిస్థితి బాగా లేదా? ఫోన్‌ ద్వారా కౌన్సిలింగ్‌ పొందాలని అనుకుం టున్నారా? ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సల్లో ఏమేమి ఉన్నాయి? వైద్య సేవల కోసం ఎక్కడెక్కడ సంప్రదించాలి? వంటి సలహాలతో పాటు ఆరోగ్యశ్రీ ఉన్న ఆసుపత్రుల్లో చికిత్స అందించేందుకు నిరాకరిస్తున్నాయా? ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గాలను వెతికేందుకు 104 నంబర్‌ ఉపయోగపడుతుంది.
అవినీతి అంతు చూడాలంటే...1064



ప్రభుత్వ కార్యాలయంలో మిమ్మల్ని ఎవరైనా లంచం అడుగుతున్నారా? అక్రమ వ్యాపారాలు చేస్తున్న వారి వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారా? అయితే 'ఎసిబి' వారు ఏర్పాటు చేసిన 1064 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి, సమాచా రాన్ని వారికి చెప్పండి. ఇదే కాక 1800 222 021కు కూడా ఫోన్‌ చేసి చెప్పొచ్చు.



విద్యుత్‌ సమస్యపై 1912 కరెంట్‌ బిల్‌ ఎక్కువగా వచ్చిందా..? విద్యుత్‌ సరఫరా నిల్చిపోయిందా? సరఫరాలో తరచూ అవాంతరాలు ఎదురవుతున్నాయా? ఇలా విద్యుత్‌ శాఖకు సంబంధించిన ఏ ఫిర్యాదులనైనా స్వీరించేందుకు విద్యుత్‌ శాఖ '1912' టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటు చేసింది.


ఆర్టీసీ సంస్థ గురించి.. 


ఏదైనా విహారయాత్రకు బస్సులో పోవాల నుకుంటున్నారా ? ఆర్టీసీ బస్సు బాగా లేదా? సమయానికి బస్సు రావడం లేదా? బస్సులతో మరేమైనా ఇబ్బందులు ఉన్నాయా? వెంటనే 1800-200-4599 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేయాలి. ఫిర్యాదు వెళ్లిన వెంటనే హైదరాబా ద్‌లోని నియంత్రణ విభాగం (కంట్రోల్‌రూం) ద్వారా జిల్లా సిబ్బందికి ఆదేశాలు వస్తాయి. తద్వారా ఒక పరిష్కార మార్గం ఏర్పడుతుంది. దీనికి తోడు సమాచారం కూడా అందిస్తారు.
 రాజీవ్‌ గాంధీ ఎయిర్‌ పోర్టు...
 
హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఏదైనా సమాచారం కావాలా? విమానాలు సకాలంలో నడుస్తున్నాయా లేక రద్దు చేయబడ్డాయా అనే విషయాలతో పాటు విమానాల రాకపోకలు, ఛార్జీల వివరాలు తెలుసుకోవాలంటే 1800 419 2008 నెంబర్‌కు ఫోన్‌ చేస్తే సరి. 

యూత్‌ సమస్యలపై...

యుక్త వయస్సులోకి వచ్చాకా యువతలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. వీటిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక అనేక మంది తికమకపడుతుంటున్నారు. అలాంటి వారికోసం ప్రభుత్వం యువ కౌన్సిలింగ్‌ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఏ సమస్యనైనా నేరుగా 1800 116 888కు ఫోన్‌ చేయండి.
 ర్యాగింగ్‌ సమస్యపై...
 

కళాశాలలోనైనా, లేక ఇతర ప్రాంతాల్లోనైనా ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే ఈ సమాచారాన్ని నేరుగా అధికారుల దృష్టికి తీసుకుపోవచ్చు. దీనికోసం 1800 180 5522 నెంబర్‌కు ఫోన్‌ చేయాలి. 
 
ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు కోసం...
 ప్రస్తుతం ప్రతి పనిలో ఆధార్‌ కార్డు ఒక బాగస్వామిగా అయిపోయింది. గతంతో ఒక వ్యక్తి గుర్తింపు కార్డుగా రేషన్‌ కార్డు ఉండగా ప్రస్తుతం ఆధార్‌, పాన్‌ కార్డులుగా మారిపో యాయి. మీ ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డులు పోయినా.. తప్పులు పడ్డా ఈ నెంబర్ల ద్వారా సూచనలు తీసుకోవచ్చు. ఆధార్‌ కార్డు 1800 300 1947, పాన్‌ కార్డు- 1800 180 1961 నెంబర్లను టోల్‌ ఫ్రీ గా ఏర్పాటు చేశారు.

 గ్యాస్‌ ఇబ్బందులపై..



గ్యాస్‌ సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, సకాలంలో అందివ్వకపోయినా దానికోసం గ్యాస్‌ సంస్థలు టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేశారు. భారత్‌ గ్యాస్‌- 1800 222 725 , హిందుస్తాన్‌ గ్యాస్‌ - 1800 2333 777, ఇండెన్‌ గ్యాస్‌ -1800 2333 555లకు ఫోన్‌ చేయండి.


ఉపాధి హామీ వివరాలకు...

గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద కూలీ పని దొరకడం లేదా? పని చేసినా కూలి ఇచ్చేం దుకు డబ్బులు అడుగుతున్నారా? సకాలంలో కూలీ అందడం లేదా? ఎక్కడైనా అక్రమాలు జరిగాయా? సిబ్బంది పనితీరు సక్రమంగా లేదా? ఇలా ఎలాంటి సమస్యలపైనా '155321' నెంబర్‌కు ఫోన్‌ చేసి చెప్పొచ్చు.
 
వ్యవసాయరంగ ఫిర్యాదులకు..

అదనంగా వ్యవసాయరంగ ఫిర్యాదుల కోసం 1800-425-3536 అనే నెంబర్‌ను కూడా ఏర్పాటు చేశారు. సిబ్బందిపైనా, ఎటువంటి ఫిర్యాదుల కోసమైనా ఫోన్‌ చేసి చెప్పొచ్చు. వెంటనే స్పందించి సమస్య పరిష్క రిస్తారు.
 
సాగుపై సలహాలు పొందండిలా..


ప్రస్తుతం ఏ పంట వేస్తే బాగుంటుంది? అంతర పంటల్లో దేనికి డిమాండ్‌ ఉంటుంది. ఏ సమయంలో ఏ పంటలు వేసుకుంటే మేలు. వేసిన పంటలపై వచ్చే చీడపీడలు, పురుగుల నివారణ కోసం ఏ మందులు వాడాలి? ఇలా పంటల సాగుపై సలహాల కోసం వ్యవసాయ శాఖ 1100 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. పంటల నష్టపరిహారం అందకపో వడం, నల్ల బజారుకు విత్తనాలు, ఎరువుల తరలిండం తదితర అంశాలపైనా సమాచా రాన్ని పొందొచ్చు.

ఫిబ్రవరిలో మెకల్లమ్ రిటైర్మెంట్

 న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్... వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నట్లు మంగళవారం వెల్లడించాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ తనకు చివరిదని తెలిపాడు. ఫిబ్రవరి 12న ఆసీస్‌తో ప్రారంభంకానున్న తొలి మ్యాచ్‌తో మెకల్లమ్ కెరీర్‌లో వందో టెస్టు పూర్తి చేసుకుంటాడు. తర్వాత 20 నుంచి జరిగే రెండో టెస్టు ఆడి రిటైర్ కానున్నాడు. అయితే మార్చి 8 నుంచి జరిగే టి20 ప్రపంచకప్‌కు కేన్ విలియమ్సన్ కివీస్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
                  రిటైర్మెంట్ గురించి తర్వాత చెప్పాలనుకున్నా ప్రపంచకప్‌కు జట్టు ఎంపిక నేపథ్యంలో ముందుగానే నిర్ణయాన్ని వెల్లడించానని తెలిపాడు. ‘ఆసీస్‌తో తొలి టెస్టు ముగిసే వరకు ఈ విషయాన్ని బహిరంగం చేయొద్దని భావించా. అయితే టి20 ప్రపంచకప్ జట్టులో నా పేరు లేకపోతే చాలా సమస్యలు, ఆందోళనలు ఏర్పడతాయి. దాన్ని తప్పించేందుకే నా నిర్ణయాన్ని ముందుగానే చెప్పేశా. కివీస్ తరఫున ఆడినందుకు చాలా గర్వపడుతున్నా’ అని మెకల్లమ్ వ్యాఖ్యానించాడు.



                   2002లో ఆసీస్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మెకల్లమ్.. కెరీర్‌లో ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడి 11 సెంచరీలతో 6273 పరుగులు సాధించాడు. 254 వన్డేల్లో ఐదు సెంచరీలతో 5909 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, కొచ్చి టస్కర్స్ కేరళ, చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల క్రిస్ కెయిన్స్‌కు సంబంధించిన మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో సాక్ష్యం ఇచ్చిన మెకల్లమ్.. తన వీడ్కోలుపై దాని ప్రభావం లేదని స్పష్టం చేశాడు.