Thursday, July 14, 2016

కబాలి కొత్త పోస్టర్ అదిరింది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్ లో వేగం పెంచింది. ఇప్పటికే నిర్మాత అఫీషియల్ గా సినిమా డేట్ ఎనౌన్స్ చేయగా.. సెన్సార్ సభ్యులనుంచి కూడా సినిమా సూపర్ అన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా మీద ఏర్పడుతున్న అంచనాలను మరింత పెంచే స్థాయిలో ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

రిలీజ్ డేట్ తో పాటు ఉన్న ఈ పోస్టర్ లో రజనీ గాయలతో కనిపిస్తున్నాడు. సాధారణంగా రజనీ సినిమా అంటే వన్ మేన్ షోలా సాగుతుంది. హీరోయిన్ తో పాటు ఇతర పాత్రధారులెవరికి పెద్దగా గుర్తింపు రాదు కానీ కబాలి విషయంలో మాత్రం హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ లోనూ రజనీ హృదయంలో రాధికా ఆప్టే ఉన్నట్టుగా చూపించారు.

మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ, రాధికల మధ్య అందమైన ప్రేమకథ కూడా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. వంద కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన కబాలి రిలీజ్ కు ముందే 200 కోట్ల బిజినెస్ చేసింది. ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న కబాలి రికార్డ్ స్థాయిలో 3500 థియేటర్లలో ప్రదర్శించేందుకు చిత్రయూనిట్ ఏర్పాట్లు చేస్తోంది.

Wednesday, July 13, 2016

చూడకుండా ఉండలేనే...

సాయిరామ్‌శంకర్ హీరోగా నటిస్తున్న చిత్రం నేనోరకం శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రేష్మీమీనన్ కథానాయిక. సుదర్శన్ సలేంద్ర దర్శకుడు. శ్రీకాంత్‌రెడ్డి నిర్మిస్తున్నారు. మహిత్ నారాయణ్ సంగీత దర్శకత్వంలో అంబట్ల రవి రచించిన చూడకుండా ఉండలేనే ఒక్క క్షణమైనా.. అనే పల్లవితో రూపొందిన ఈ చిత్ర సాంగ్ టీజర్‌ను దేవిశ్రీప్రసాద్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేనోరకం టీజర్, సాంగ్స్ ఎంటర్‌టైనింగ్‌గా వున్నాయి. సాయిరామ్‌శంకర్ కెరీర్‌లో ఈ సినిమా బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. మహిత్‌నారాయణ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. పాటలతో పాటు నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది అన్నారు. 

సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ సమకాలీన అంశాల్ని స్ఫూర్తిగా తీసుకుని ఆద్యంతం ఆసక్తికరమైన కథ, కథనాలతో థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నా గత చిత్రాలకు భిన్నంగా వుండే చిత్రమిది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ టైటిల్‌కు తగ్గట్లుగానే సరికొత్త ట్రీట్‌మెంట్‌తో రూపొందిస్తున్నాం. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందన్న నమ్మకముంది అన్నారు. ఈ నెలలోనే పాటల్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. తమిళంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని రాధిక శరత్‌కుమార్ ఆసక్తిచూపిస్తున్నారు అని నిర్మాత తెలిపారు.

Tuesday, July 12, 2016

ఈ హన్సికని మీరు చూసి ఉండరు!

మనకు తెలిసిన హన్సిక అందమైన కథానాయిక మాత్రమే. కానీ వ్యక్తిగా ఆమెలో చాలా కోణాలున్నాయి. అన్నిటినీ మించి మానవత్వం పరిమళించే మంచి మనసు ఆమె సొంతం. ‘దయచేసి ఇతరులకు సహాయం చేయండి.. ఇది వర్షాకాలం. నిరాశ్రయుల మౌలిక అవసరాలు తీర్చడంలో మీవంతు సాయం చేయండి. మనం చేయగలిగిన అతిచిన్న పని ఇది’ అని హన్సిక ట్వీట్‌ చేశారు. అందరికీ చెప్పడమే కాదు, ఆమె చేసి కూడా చూపిస్తున్నారు.
చిన్నారులను దత్తత తీసుకుని వారి ఆలనా, పాలనా చూసుకుంటున్నారు. పెయింటింగ్‌లు వేస్తూ వాటి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులను పలు సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. తాజాగా ఇళ్లు లేక, రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌లపై నిద్రించే నిస్సహాయుల దగ్గరికి స్వయంగా తానే వెళ్లి దుప్పట్లు, బట్టలు, ఇతర సామాగ్రిని అందించారు హన్సిక. నిద్రపోతున్న వారి దగ్గరకు నిశ్శబ్దంగా వెళ్లి వాళ్ల పక్కన ఈ సామాగ్రిని ఉంచి వచ్చారామె. హన్సిక చేస్తున్న ఈ సమాజసేవ వీడియోను అభిమానులు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇది హాట్‌ టాపిక్‌గా మారింది.

Monday, July 11, 2016

అనుష్కపై పొగడ్తల వర్షం

 సల్మాన్‌ఖాన్‌ ప్రధానపాత్రలో తెరకెక్కి ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్న చిత్రం ‘సుల్తాన్‌’. రంజాన్‌ సందర్భంగా విడుదలైన ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌తో పాటు ఆర్ఫాగా అనుష్కశర్మ నటనపైప్రశంసల వర్షం కురుస్తోంది. సల్మాన్‌కి దీటుగా కుస్తీ సన్నివేశాల్లో మెప్పించింది అనుష్క. తొలుత చాలామంది పేర్లను పరిశీలించిన దర్శకుడు అలీ.. ఆ పాత్రలో అనుష్కను కాకుండా వేరే వారిని చూడలేమంటూ పొగిడేస్తున్నాడు.
‘‘‘సుల్తాన్‌’ సినిమాలోని ఆర్ఫా పాత్రకు అనుష్క శర్మ తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరు. అత్యద్భుతమైన ప్రతిభ దాగి ఉన్న సహజనటి ఆమె’’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తాడు దర్శకుడు. అంతేకాదు.. ఈ చిత్రంలో కండలవీరుడికి సరిజోడీగా కనిపించిన ఈ సొట్టబుగ్గల సుందరీమణీ గురించి గతంలో సల్మాన్‌ కూడా ‘‘ప్రతిభ ఉన్న వారితో పనిచేయటం చాలా బాగుంటుంది’’ అని పొగిడేశాడు.
నిజమే.. ‘సుల్తాన్‌’ చిత్రంలో మల్లయోధురాలిగా అనుష్క పోషించిన పాత్ర ఆమెలోని భిన్నమైన ప్రతిభకు అద్దంపడుతుంది మరి.

సచిన్ తో పోల్చడం ఆపండి!

 పరుగుల యంత్రాన్ని తలపిస్తూ ఇప్పటికే పలు ఘనతలను తన ఖాతాలో వేసుకున్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. ఆ దిగ్గజ ఆటగాడితో తనను దయచేసి పోల్చవద్దంటూ అభిమానులకు మరోమారు విజ్ఞప్తి చేశాడు. అసలు తనకు సచిన్ తో ఎటువంటి పోలికా లేదని విరాట్  తెలిపాడు.  సచిన్ తో తనను పోల్చే విషయాన్ని ఇకనుంచైనా ఆపాలని విజ్ఞప్తి చేశాడు. ఈ విషయంలో అభిమానులు, మీడియా కాస్త సంయమనం పాటించాలని సూచించాడు.
'అసలు సచిన్ తో నాకు పోలిక లేదు. అతనితో నన్ను ఎందుకు పోల్చుతున్నారో అర్థం కావడం లేదు. సచిన్ ఆడినన్ని రోజులు ప్రజలకు అతనొక ఆదర్శం. ఆ రకమైన ఘనతను సాధించానని నేను అనుకోవడం లేదు. టెండూల్కర్ చాలా మందికి ప్రేరణగా నిలిచాడు.. మానవతా కోణంలో కూడా సచిన్ కు నేను ఏమాత్రం సరిపోను'అని విరాట్ తెలిపాడు.

Saturday, July 9, 2016

ప్రేమ విఫలమైతే..

ప్రేమ విఫలమైతే బాధ పడకూడదంటున్నారు నటి కాజల్‌అగర్వాల్. తన వ్యక్తిగత అనుభవమో ఏమోగానీ ఈ భామ ప్రేమ గురించి చాలానే చెప్పారు. ఈ తరం యువత ప్రేమలో పడడం సర్వసాధారణంగా మారిందన్నారు. అయితే అందరి ప్రేమ సక్సెస్ కావడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగని ప్రేమలో విఫలమైన వారు ఇక జీవితమే లేదని బాధ పడకూడదన్నారు. అది కరెక్ట్ కాదనీ, అలాంటి మానసిక వేదన నుంచి బయట పడాలన్నారు. ప్రేమించడం, ప్రేమించబడడం సహజం అన్నారు.

అయితే అలా ప్రేమించుకున్న వారందరూ పెళ్లి పీటలెక్కడం లేదని, సామాజిక పరమైన అంశాలు, తల్లిదండ్రుల వ్యతిరేకత వంటి అంశాలు కొందరి విషయంలో ఆటంకంగా మారుతున్నాయన్నారు. ప్రేమలో పడడంలానే ప్రేమలో విఫలం అవడం సాధారణ విషయమేనన్నారు. ప్రేమలో పడ్డా కూడా మనం ఏమిటన్నది మరచిపోకూడదని, మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదని అన్నారు. మన ప్రాధాన్యతను ప్రేమ తగ్గించకూడదన్నారు. ప్రేమించిన వ్యక్తే జీవితం అనే స్థాయికి వెళ్లరాదని... ఒక వేళ ప్రేమలో విఫలమైనా అందుకు బాధ పడకూడదన్నారు. దాని నుంచీ వెంటనే బయటపడగలం అన్నారు. తాను ఇప్పటి వరకూ ఎవరినీ ప్రేమించలేదన్నారు.

పెళ్లికి కూడా ఇంకా చాలా సమయం ఉంది అని అంటున్న కాజల్‌అగర్వాల్ నటిగా కోలీవుడ్‌లో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం జీవా సరసన క వలైవేండామ్ చిత్రంలోనూ విక్రమ్‌కు జంటగా గరుడా చిత్రంలోనూ నటిస్తున్నారు. తాజా సమాచారం ఏమిటంటే అజిత్ 57వ చిత్రంలో నటించే అవకాశం ఈ బ్యూటీకి వచ్చిందనీ. ఇటీవల పూజా కార్యక్రమాలను జరుపుకున్న అజిత్ చిత్రంలో అనుష్క కథానాయకి అన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. మరి ఆమె పాత్రలో కాజల్ నటిస్తారా? లేక ఇందులో మరో నాయకి పాత్రను పోషించనున్నారా? అన్న క్లారిటీ త్వరలోనే రావచ్చు. మరో విషయం ఏమిటంటే అజిత్‌తో కాజల్ ఎన్నై అరిందాల్ చిత్రంలోనే రొమాన్స్ చేయాల్సింది. అయితే అప్పట్లో ఆ అవకాశం చివరిలో అనుష్కను వరించింది.

Thursday, July 7, 2016

అందరికీ ఓకె చెప్పేస్తున్నాడు

బ్రహ్మోత్సవం సినిమాతో నిరాశపరిచిన మహేష్ బాబు తన నెక్ట్స్ సినిమాతో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ మధ్య ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాల మీద దృష్టి పెట్టిన సూపర్ స్టార్, ఇప్పుడు రూట్ మార్చి ఓ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేస్తున్నాడు. తమిళ దర్శకుడు మురుగదాస్ డైరెక్షన్ లో మెసేజ్ ఓరియంటెండ్ కమర్షియల్ యాక్షన్ డ్రామాను రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెలాఖరున సెట్స్ మీదకు వెళ్లనుంది.

మురుగదాస్ సినిమా ఇంకా మొదలు కాకముందే ఇతర దర్శకులకు కూడా కమిట్మెంట్స్ ఇచ్చేస్తున్నాడు. ఇప్పటికే బ్రహ్మోత్సవం నిర్మాతలైన పీవీపీ సంస్థ కోసం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. తనకు పోకిరి బిజినెస్ మేన్ లాంటి సూపర్ హిట్స్ అందించిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన సినిమా చేయనున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇక దర్శకధీరుడు రాజమౌళికి కూడా చాలా రోజుల క్రితమే సినిమా చేస్తానని మాట ఇచ్చాడు రాజకుమారుడు. మరి ఇన్ని సినిమాలు లైన్లో పెట్టిన మహేష్ బాబు, ఇవన్నీ ఎప్పటికీ పూర్తి చేస్తాడో.7

Tuesday, July 5, 2016

గోవింద గోవింద

కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే కథానాయికలు చాలామందే. తమ అందాన్ని రెట్టింపు చేసి చూపెట్టే మాయాజాలం దర్శకేంద్రుడి చేతిలో ఉందని కథానాయికలు నమ్ముతుంటారు. అలాంటి కె.రాఘవేంద్రరావే ఎప్పట్నుంచో ఓ కథానాయికతో పనిచేయాలని ఎదురు చూస్తున్నారట. ఆమె ఎవరో కాదు... అనుష్క. కాస్త ఆలస్యమైనా అనుష్కతో కలిసి పనిచేసే అవకాశం లభించిందని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు కె.రాఘవేంద్రరావు. ఆయన దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. ఇందులో ఓ కీలక పాత్ర కోసం అనుష్కని ఎంపిక చేసుకొన్నారు. అలాగని అనుష్క నాగార్జునకి జంటగా నటించడం లేదు. ఇందులో ఆమెది ఓ భక్తురాలి పాత్ర అని కె.రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. ఆమె కెరీర్‌లో ఇలాంటి పాత్ర చేయడం ఇదే తొలిసారి. ‘‘ఏ పాత్రనైనా చేయగలిగే అద్భుతమైన నటి అనుష్క. ‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ చిత్రాల్లో తన పాత్రలకి తగ్గట్టుగా ఒదిగిపోయింది. తనదైన నటనతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. భక్తురాలిగా మా సినిమాలో అనుష్క నటనని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది’’ని ట్వీట్‌ చేశారు కె.రాఘవేంద్రరావు.

ఆ ఫోటోలను నెట్ లో పెడతానంటూ...

ల్లూరు క్రైం: ‘నీ అర్ధనగ్న ఫొటోలు నా వద్ద ఉన్నాయి.. చెప్పినట్లు వినకుంటే ఫొటోలు నెట్‌లో పెడతా’..అంటూ బెదిరించి బాలికపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతని వేధింపులు తాళలేని బాధితురాలు నిద్రమాత్రలు మింగింది. ఈ సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. నెల్లూరులోని నీలగిరి సంఘానికి చెందిన ఓ బాలిక పాలిటెక్నిక్ డిప్లొమో సెకండియర్ చదువుతోంది. ఆమె ఇంటి ముందు నివాసం ఉండే ఉడతా సురేష్‌కు భార్య, ఎనిమిదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అతడు బాలికను ప్రేమిస్తున్నానంటూ కొన్ని నెలలుగా వెంటపడుతున్నాడు. బాధితురాలు తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సురేష్ కుటుంబసభ్యుల హామీ మేరకు కేసు ఉపసంహరించుకొన్నారు. అయినా, అతని ప్రవర్తనలో మార్పురాలేదు. బాలిక కళాశాలకు వెళుతుండగా వెంటబడేవాడు.

ఆమెకు అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టడంతో పాటు, ఆమె అర్ధ నగ్న ఫొటోలు తన వద్ద ఉన్నాయని.. వాటిని నెట్‌లో పెడతానని బాలికను బెదిరిస్తున్నాడు. తాను చెప్పినట్లు వినాలని బెదిరించి తన షాపునకు తీసుకెళ్లి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే ఆమెను, ఆమె తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడు. దీంతో బాలిక అతని వికృత చేష్టలను మౌనంగా భరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో బాలిక గర్భవతి కాగా అబార్షన్ పిల్స్ మింగించాడు. ఈ క్రమంలో ఈ నెల మూడోతేదీ సాయంత్రం నిద్రమాత్రలు మింగింది. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను బాధిత కుటుంబసభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆమె ఆస్పత్రిలో చికిత్స పొంది మంగళవారం తల్లిదండ్రుల సాయంతో నాలుగో నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్పెక్టర్ సీహెచ్ సీతారామయ్య నిందితుడిపై లైంగికదాడి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

విలన్ గా మారుతున్న మరో హీరో

స్టార్ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరో ఆర్యన్ రాజేష్. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త ఫరవాలేదనిపించినా.. తరువాత వరుస ఫ్లాప్ లతో నిరాశపరిచాడు. తరువాత వ్యాపారాలతో బిజీగా కావటంతో సినీరంగానికి పూర్తిగా దూరమయ్యాడు. అదే సమయంలో ఆర్యన్ తమ్ముడు అల్లరి నరేష్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకొని 50పైగా సినిమాలు చేసి సత్తా చాటాడు.

సినీ నిర్మాణంతో పాటు ఇతర వ్యాపారాల్లోనూ బిజీగా ఉన్న ఆర్యన్ రాజేష్ కు నటనమీద ఆసక్తితగ్గలేదు. అందుకే త్వరలో రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. అయితే టాలీవుడ్ హీరోల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ప్రస్తుతం ప్రతినాయక పాత్రలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకే త్వరలో విలన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు రాజేష్. ఎక్కువగా లవర్ బాయ్ తరహా సినిమాలు చేసిన రాజేష్, విలన్ గా ఎంట్రీ ఇస్తే, అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Monday, July 4, 2016

స్నేహం కోసం.. ప్రాణం ఇచ్చాడు


ఉగ్రవాదులు వెళ్లిపొమ్మని చెప్పినా కూడా తనతో పాటు వచ్చిన స్నేహితురాళ్ల కోసం అక్కడే ఉండి ఓ బంగ్లాదేశ్‌ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 20ఏళ్ల ఫరాజ్‌ ఆయాజ్‌ హొస్సైన్‌ అనే బంగ్లాదేశీ విద్యార్థిని ఇప్పుడు సోషల్‌ మీడియాలో హీరో అని పొగుడుతున్నారు. ప్రాణాలు పోతాయని తెలిసి కూడా తనతో పాటు వచ్చిన స్నేహితురాళ్లను వదిలేసి వెళ్లకుండా ఫరాజ్‌ అక్కడే ఉన్నాడని ఇటీవల ఢాకాలోని రెస్టారెంట్‌లో జరిగిన ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న ఓ వ్యక్తి మీడియాకు వెళ్లడించారు. ఫరాజ్‌ స్నేహితురాళ్లలో భారతీయ యువతి తరుషి కూడా ఉంది.
ఫరాజ్‌ అమెరికాలోని ఎమ్రోయ్‌ యూనివర్సిటీలో చదువుతున్నాడు. వేసవి సెలవులకు అతడు బంగ్లాదేశ్‌ వచ్చాడు. సెలవులకు వచ్చిన తన స్నేహితురాళ్లు ఎమ్రోయ్‌ యూనివర్సిటీలో చదువుతున్న అమెరికాకు చెందిన అబింతా కబిర్‌, కాలిఫోర్నియా యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థిని తరుషి జైన్‌తో కలిసి దాడి జరిగిన రెస్టారెంట్‌కు వెళ్లారు. ఉగ్రవాదులు బందీలుగా తీసుకున్నవారిలో ఈ ముగ్గురు ఉన్నారు. ఉగ్రవాదులు బంగ్లాదేశ్‌ వారిని వదిలేసి.. విదేశీయులను మాత్రమే హతమార్చారు. అయితే ఫరాజ్‌ను వెళ్లిపొమ్మని చెప్పినా.. తన స్నేహితురాళ్లను వదిలేస్తే వెళ్తానని.. లేదంటే వెళ్లనని చెప్పడంతో ఉగ్రవాదులు అతడిని కూడా చంపేశారు. గత వారం ఢాకాలో ఉగ్రవాదులు రెస్టారెంట్‌పై దాడి చేసి 20 మందిని హతమార్చిన సంగతి తెలిసిందే. భద్రతాసిబ్బంది దాడుల్లో ఉగ్రవాదులు కూడా హతమయ్యారు.

ధోనిని రజనీకాంత్ తో ఎందుకు పోల్చారంటే?

 టీమిండియా 'మిస్టర్ కూల్' ఎంఎస్ ధోనిని అభిమానులు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో పోలుస్తున్నారు. ధోని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసిన హెయిర్ కట్ ఫొటో చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కూల్ గా ఉండడంలోనే కాదు నిరాడంబరతలోనూ తనను తానే సాటి ధోని నిరూపించుకున్నాడని కితాబిచ్చారు. బుద్ధిగా కూర్చుని 'బెస్ట్ ఫినిషర్' సదాసీదాగా జుత్తు కత్తిరించుకుంటున్న ఫొటోను తన ఫేస్ బుక్ పెట్టిన వెంటనే అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు.                      ఏమాత్రం హంగు ఆర్భాటం లేకుండా ధోని హెయిర్ కట్ చేయించుకోవడం చూసి అభిమానులు అవాక్కయ్యారు. టీమిండియా కెప్టెన్ అంటే హై-ఫై సెలూన్ లో కటింగ్ చేయించుకుంటాడని భావించిన ఫ్యాన్స్ ధోని పెట్టిన ఫొటో చూసి అతడిపై ప్రశంసలు కురిపించారు. కింద నుంచి పైకి వచ్చాడు కాబట్టే అతడు నిరాడంబరంగా ఉంటాడని వ్యాఖ్యానించారు. ధోనికి ఈగో లేదని, చాలా సింపుల్ ఉంటాడని మరొకరు కామెంట్ చేశారు.              నిరాడంబరంగా ఉండేవాడే నిజమైన సూపర్ స్టార్, సూపర్ హీరో అని.. 'తలైవర్' రజనీకాంత్ తర్వాత ధోనిలో సింప్లిసిటీ చూశానని మరొక అభిమాని అన్నాడు. ధోని ఆటతో పాటు అతడి హెయిర్ స్టైల్ ఎప్పుడు వార్తాల్లో నిలుస్తుంటుంది. ఇప్పుడు హెయిర్ కట్ కూడా హాట్ టాఫిక్ గా మారింది.

ఓడినా ‘కప్’ ఇచ్చారు!

 ఏడు పదుల వయసులో ఏ ఆర్టిస్ట్ అయినా శరీరాన్ని కష్టపెట్టుకునే పాత్రలు చేయడానికి వెనకాడతారు. కానీ, అమితాబ్ బచ్చన్ వంటి కొంతమంది తారలు రిస్క్‌లు తీసుకోవడానికి రెడీ అయిపోతారు. ప్రస్తుతం నటిస్తున్న ఓ చిత్రంలో ఈ బిగ్ బి బాక్సర్‌గా కనిపిస్తారు. ఈ చిత్రం కోసం జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న బాక్సర్లతో తలపడుతున్నారు. వాళ్ల ఉత్సాహం, ప్రతిభ చూస్తుంటే ఆశ్చర్యం వేసిందనీ, వాళ్లతో బాక్సింగ్ రింగ్‌లో తలపడటం సవాల్‌గా అనిపించిందనీ అమితాబ్ అన్నారు. ఈ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు నా చిన్ననాటి విశేషాలు గుర్తొచ్చాయని అమితాబ్ చెబుతూ - ‘‘ఇష్టం ఉన్నా లేకపోయినా మా స్కూల్లో బాక్సింగ్ నేర్చుకోవాల్సిందే.

 పోటీల్లో ఒకే ఒక్క పాయింట్‌తో గెలుపోటములు ఆధారపడి ఉన్నప్పుడు భలే మజాగా ఉండేది. ఆ ఒక్క పాయింట్ దక్కించుకుని, ఆనందపడేవాణ్ణి. ఓసారి మాత్రం బాక్సింగ్ టోర్నమెంట్‌లో ఓడిపోయాను. అయినా కప్ ఇచ్చారు. గెలుపు కోసం ధైర్యసాహసాలను మెండుగా ప్రదర్శించినందుకుగాను ఆ కప్ గెల్చుకున్నా. వాస్తవానికి నా ఎత్తు నాకు మైనస్ అయ్యింది.

 నా బరువేమో లోయర్ కేటగిరీ వాళ్లకు సమానంగా ఉండేది. ఎత్తు మాత్రం హయర్ కేటగిరీకి సమానంగా ఉండేది. దాంతో నన్ను హయర్ కేటగిరీకే ఎంపిక చేసేవాళ్లు. వాళ్లేమో ‘ఆలోచించుకో. విరమించుకుంటేనే నీకు మంచిది. లేకపోతే దెబ్బలు తగలడం ఖాయం’ అని హెచ్చరించేవాళ్లు. కానీ, నేను మాత్రం ఆ హెచ్చరికను ఖాతరు చేసేవాణ్ణి కాదు. మొండిగా తలపడేవాణ్ణి. ఇప్పడు సినిమా కోసం బాక్సింగ్ చేస్తుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి’’ అని చెప్పారు.

Sunday, July 3, 2016

నాకు బాయ్‌ఫ్రెండ్స్ లేరు..

6
తనకు మగ మిత్రులే లేరంటోంది నటి లావణ్యత్రిపాఠి. ఏమిటీ నమ్మశక్యంగా లేదా? ఈ మధ్య కథానాయికలు ఏమి చెప్పినా అవునా? నిజమా? అనుకునే పరిస్థితి నెలకొంది. లావణ్య త్రిపాఠి మాటల్ని అలానే అనుకుందాం బ్రహ్మన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన నటి లావణ్య త్రిపాఠి. ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఓకే అన్నా ఈ అమ్మడిని మాత్రం చిత్ర పరిశ్రమ నోనో అన్నదనే చెప్పాలి.అయితే చిన్న గ్యాప్ తరువాత లావణ్య త్రిపాఠి ప్రయత్నాలు టాలీవుడ్‌లో ఫలించాయి.

అక్కడ కుర్ర హీరోలతో నటించిన చిత్రాలు మంచి విజయాలను పొందడంతో తాజాగా కోలీవుడ్‌లో ఒక అవకాశం వచ్చింది. నిర్మాత సీవీ.కుమార్ దర్శకుడిగా మోగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న మాయాన్ చిత్రంలో లావణ్యత్రిపాఠిని నాయకిగా ఎంచుకున్నారు.ఈ చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్న ఈ బ్యూటీని పలకరించగా మాయాన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న చిత్రం అని తెలిపింది.

ఇందులో తన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పింది. తెలుగు, తమిళ భాషల్లో నటించడంలో తనకెలాంటి వ్యత్యాసం అనిపించడం లేదని అంది. కమర్శియల్ కథా చిత్రాలకు, ప్రేమ కథా చిత్రాలకు ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణ ఉంటోందని చిప్పింది. ఇక నటన విషయానికి వస్తే ఏ భాషలోనైనా ఒకటేనని పేర్కొంది. తనకు మాత్రం అన్ని భాషల్లోనూ నటించాలని ఆశ అని అంది. అదే విధంగా తానెవరినీ పోటీగా భావించడం లేదని చెప్పింది.

అనుష్క, సమంత, నిత్యామీనన్‌ల నటనంటే తనకు ఇష్టం అని చెప్పింది. ప్రేమలో పడ్డారా? అని చాలా మంది అడుగుతున్నారని, తానెవరినీ ప్రేమించలేదని చెప్పింది. ఇంకా చెప్పాలంటే తనకు మగ మిత్రులే లేరనీ అంది. ఈ మధ్యనే సినిమాల్లోకి వచ్చానని, తన దృష్టి అంతా నటనపైనేనని చెప్పుకొచ్చింది. అన్నట్టు ఈ జాన నటనానుభవం ఏమీ తక్కువకాదు. దశాబ్దం పూర్తి చేసుకుంది. తను నటించిన బ్రహ్మన్ చిత్రం 2006లో విడుదలైందన్నది గమనార్హం.

ఔను.. అమ్మా నాన్న కాబోతున్నాం

కరీనా కపూర్ తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె భర్త సైఫ్ అలీఖాన్ శనివారం ధ్రువీకరించారు. ఈ ఇద్దరికీ పెళ్లై దాదాపు నాలుగేళ్లయింది. అప్పట్నుంచీ కరీనా తల్లి కాబోతోందనే వార్తలు అడపా దడపా హల్ చల్ చేశాయ్. అవన్నీ పుకార్లని సైఫ్, కరీనా స్పష్టం చేసుకుంటూ వచ్చారు. ఆ మధ్య ఓ సందర్భంలో కరీనా తాను తల్లి కావాలనుకుంటున్నట్లు చూచాయగా చెప్పారు.
 
 ఇప్పుడు ఆ కోరికను నిజం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సైఫ్ మాట్లాడుతూ- ‘‘ఔను.. కరీనా గర్భవతి. డిసెంబర్‌లో డెలివరీ డేట్ ఇచ్చారు. కరీనా ప్రెగ్నెన్సీ గురించి తెలియగానే శ్రేయోభిలాషులందరూ శుభాకాంక్షలు చెప్పారు. అందరికీ థ్యాంక్స్’’ అన్నారు. కరీనా కపూర్‌కు ఇది తొలి సంతానం కాగా...మాజీ భార్య అమృతాసింగ్‌తో సైఫ్‌కు ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారు. 1991లో అమృతా సింగ్‌ను పెళ్లి చేసుకున్న సైఫ్... పదమూడేళ్ల కాపురం తర్వాత విడాకులు తీసుకున్నారు.

అలా చేస్తే అవకాశాలెన్నో..


అలా నటిస్తే అవకాశాలెన్నో అంటోంది నటి చాందిని. ఇంతకీ ఆ అమ్మడు ఏమంటుందో ఒకసారి చూస్తే పోలా. సిద్ధు ప్లస్‌టూ చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి ప్రవేశించిన భామ చాందిని. ఆ తరువాత ఒకటి రెండు చిత్రాల్లో నటించి కనిపించకుండా పోయిన ఈ జాణ ఇటీవల నయాపుడై, విల్‌అంబు చిత్రాలతో రీఎంట్రీ అయ్యింది.
 
 అయితే ఈ సారి ఏకంగా అరడజను చిత్రాలకు పైగా అవకాశాలను చేజిక్కించుకున్న చాందినిని మధ్యలో చాలా గ్యాప్‌నకు కారణం ఏమిటన్న ప్రశ్నకు అందాలారబోత పాత్రలకు ఓకే చెబితే ఈ పాటికి ఎన్ని చిత్రాలు చేసి ఉండేదాన్నో అయితే అలా నటించడం తన కిష్టం లేదని బదులిచ్చింది. నటనకు అవకాశం ఉన్న పాత్రల కోసం ఎదురు చూస్తున్నానంటున్న ఈ బ్యూటీ నీకు పోటీ ఎవరన్న ప్రశ్నకు తనెవరినీ పోటీగా భావించడం లేదని సమాధానమిచ్చింది.
 
  ప్రస్తుతం చేస్తున్న చిత్రాల గురించి చెబుతూ భూపతిపాండియన్ దర్శకత్వంలో మన్నన్ వగైయరా,ి సబిరాజ్‌కు జంటగా కట్టప్ప కానోమ్, భరత్ సరసన ఇన్నోడు విళైయాడు, అంజనా దర్శకత్వంలో పల్లాండు వాళ్గా, నృత్యదర్శకుడు గౌతమ్ దర్శకత్వంలో కన్నుల కాసు కాట్టప్పా, అమీర్ నిర్మిస్తున్న డాలర్ దేశం చిత్తాలతో పాటు నాన్ అవళై సందిత్తపోదు చిత్రంలో నటిస్తున్నానని పెద్ద లిస్ట్‌నే చెప్పింది. అంతే కాదు తెలుగులోనూ ఒక చిత్రం చేస్తున్నట్లు తెలిపింది. మరి ఈ సారన్నా తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందో లేదో చూద్దాం.

Saturday, July 2, 2016

'ఆ రోజు నన్ను చూసి అందరూ నవ్విన వాళ్లే'

 ఆయన తొలి రోజుల్లో చదువుల్లో అంత ఘనాపాటేం కాదు. ఒకానొక సందర్భంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో కూడా తొలిసారి ఫెయిలయ్యాడు. అలాంటి వ్యక్తి చేతుల్లో ఇప్పుడు మూడు పీహెచ్ డీలు. ఆ మూడు ఓ ముగ్గురు ప్రముఖ వ్యక్తులకు అంకితాలు. ఈ రోజుల్లో ఒక్క డాక్టరేట్ ఉండటమే కష్టమవుతుండగా ఆయన మాత్రం ఏకంగా మూడు డాక్టరేట్ లు పొందాడు. ఆయనే జగదీశ్ త్రివేది(49).

గుజరాత్ లోని సురేంద్రనగర్ కు చెందిన ఆయన మూడు పీహెచ్ డీలు పూర్తి చేసి ప్రముఖ నవలా రచయిత దేవ్ శంకర్ మెహతా, ప్రముఖ హాస్యకారుడు షాబుద్దిన్ రాథోడ్, ప్రముఖ మత గురువు మోరారీ బాపునుకు ఈ మూడింటిని అంకితం చేశాడు. అంతేకాదు.. జగదీశ్ త్రివేది కూడా ఒక పెద్ద హాస్యకారుడు. 'నేను ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో ఫెయిలయిన తర్వాత ప్రతి ఒక్కరు నన్ను ఎగతాళి చేశారు నవ్వారు. నేను సైన్స్ చదవలేనని నాకు తెలుసు. అందుకే వెంటనే ఆర్ట్స్ కు మారిపోయాను. నేను ఇంటర్ ఒకసారి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. రెండు పీహెచ్ డీలు పూర్తి చేసి నేను డల్ స్టూడెంట్ కాదని నిరూపించాను' అని ఆయన చెప్పాడు.

బొద్దుగా ఉండడమే వరమైంది...

‘నా శరీరాకృతి హీరోయిన్‌ కావడానికి సహకరించదేమో అని కొంచెం ఆందోళన పడేదాన్ని. హీరోయిన్‌కు నడుము నాజుకుగా ఉండాలని నిర్మాతలు, దర్శకులు భావించేవారు. నేను బొద్దుగా ఉంటానని నాపై విమర్శలు వచ్చాయి. కానీ అవేవీ నాకు ప్రతిబంధకం కాలేదు’ అంటోంది మాధురీ దీక్షిత్‌. తన అందంతో 1980-90 దశకాలలో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన హీరోయిన్‌ మాధురి. ఆమె మంచి నాట్యకళాకారిణి కూడా. 1988లో వచ్చిన ‘తేజాబ్‌’ సినిమాలో ‘ఏక్‌ దో తీన్‌ చార్‌ పాంచ్‌ ఛే సాథ్‌ ఆఠ్‌ నౌ... దస్‌ గ్యారా బారా తేరా’ పాటకు మాధురీ వేసిన స్టెప్పులకు ఆరోజుల్లో యువ ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. అటువంటి మాధురి ఏకంగా ఆరు ఫిలింఫేర్‌ బహుమతులు గెలుచుకోవడమే కాకుండా ‘పద్మశ్రీ’ బిరుదు కూడా సొంతం చేసుకుంది, మాధురీ దీక్షిత్‌ 1999లో కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు శ్రీరాం మాధవ్‌ను వివాహమాడి అక్కడే స్థిరపడింది. ఇప్పుడు మాధురీ మకాం ముంబైకి మార్చివేసింది. నాట్యమంటే అభిమానించే మాధురి ‘డాన్స్‌ విత్‌ మాధురి’ పేరుతో ఆన్‌ లైన్‌ డ్యాన్స్‌ అకాడెమీని నిర్వహిస్తోంది.