Thursday, January 24, 2019

మరో కట్టప్ప!

  ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రంలో కీలక పాత్ర చేస్తావా? అని దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి అడగ్గానే వెంటనే ఒప్పుకొన్నానని అంటున్నారు ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రెండో భారీ షెడ్యూల్‌ ఇటీవల ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లోనే సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారట. ఈ విషయాన్ని ఆయన ఓ తమిళ మ్యాగజైన్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘నేను దర్శకత్వం వహించిన ‘నాడోడిగల్‌’ సినిమా చూసి రాజమౌళి సర్‌ నాకు ఓ పెద్ద మెసేజ్‌ పెట్టారు. అప్పటినుంచి నేను రాజమౌళి సర్‌తో టచ్‌లో ఉన్నాను. ఇటీవల ఆయన నన్ను తన ఇంటికి ఆహ్వానించారు. తన కుటుంబీకుల్ని పరిచయం చేశారు. అప్పుడే నాకు ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమా గురించి తెలిసింది. ఇందులో ఓ కీలక పాత్ర ఉంది చేస్తావా? అని అడిగారు. నేను క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఒప్పేసుకున్నాను. అయితే ముందు ఆయన స్క్రిప్ట్‌ చదవాలని చెప్పారు. సరేనన్నాను’ అని వెల్లడించారు.
             ప్రస్తుతం చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో ముగ్గురు కథానాయికలకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. సమంత, కీర్తి సురేశ్, ప్రియమణి, అదితిరావు హైదరి పేర్లు వినపడుతున్నాయి. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్‌ హక్కులు రికార్డు స్థాయిలో రూ.132 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.