Friday, October 4, 2019

ఆర్టీసీ సమ్మె షురూ..


దీంతో దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో విధులు నిర్వహిస్తున్న వారు శుక్రవారం మధ్యాహ్నం ఉన్న పళంగా విధుల నుంచి వైదొలిగారు. దూరప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే సర్వీసుల డ్రైవర్లు విధులు బహిష్కరించారు. దీంతో శుక్రవారమే సమ్మె మొదలైనట్లయింది. శుక్రవారం నాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కొలిక్కి రాకపోవటంతో ఈ సర్వీసులు నడిపే పరిస్థితి లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాకపోతే కొన్ని ప్రాంతాలకు ఏపీ బస్సులు రావటంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు.
బుధ, గురువారాల్లో జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనటంతో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన చర్చలపై అందరి దృష్టి నిలిచింది. ఇటు కార్మిక సంఘాలు బెట్టు వీడటమో, అధికారుల కమిటీ మెట్టు దిగటమో జరిగి సమ్మె తప్పుతుందని ప్రయాణికులు ఎదురు చూశారు. ఆదివారం సద్దుల బతుకమ్మ కావడంతో లక్షల మంది సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో జనం ఊళ్లకు వెళ్లినా, ఉద్యోగులు శనివారమే పయనమవుతున్నారు. సరిగ్గా అదే రోజు సమ్మె మొదలు కానుండటంతో శుక్రవారం టెన్షన్‌తో గడిపారు. సమ్మె లేదనే శుభవార్త కోసం ఎదురు చూశారు.  కాగా, నిర్ధారిత సమయంలో హామీలు నెరవేరుస్తామంటూ లిఖిత పూర్వకంగా స్పష్టమైన హామీ ఇస్తే సమ్మె యోచన విరమణపై ఆలోచిస్తామని కార్మిక సంఘాలు గట్టిగా డిమాండ్‌ చేశాయి. కానీ ఆర్థిక పరమైన అంశంతో ముడిపడ్డ డిమాండ్లపై ఉన్నఫళంగా లిఖిత పూర్వక హామీ సాధ్యం కాదని, దసరా తర్వాత మళ్లీ చర్చలు ప్రారంభిద్దామని, అప్పటి వరకు సమ్మెను వాయిదా వేసుకోవాలని అధికారుల కమిటీ స్పష్టం చేసింది. దీంతో కమిటీ తమ మాట వినదని, కార్మిక సంఘాల జేఏసీ చర్చలను బహిష్కరించి అక్కడి నుంచి నిష్కమించింది.
ప్రైవేటు డ్రైవర్ల చేతికి స్టీరింగ్‌ 
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు డ్రైవర్ల గుర్తింపు బాధ్యతను గురువారమే ఐఏఎస్‌ అధికారుల కమిటీ రవాణ శాఖకు అప్పగించింది. స్థానిక మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు తమ వద్ద ఉన్న డ్రైవర్ల వివరాల ఆధారంగా వారికి సమాచారం అందించి పిలిపించారు. 18 నెలలు, అంత కంటే ఎక్కువ కాలం క్రితం హెవీ మోటార్‌ వెహికిల్‌ లైసెన్సు తీసుకుని ఉన్న వారిని అర్హులుగా పేర్కొన్నారు. వారి డ్రైవింగ్‌ నైపుణ్యాన్ని పరిశీలించి, గతంలో యాక్సిడెంట్‌ కేసులు లేకుంటే వారి పేరును ఆర్టీసీ అధికారులకు సిఫారసు చేస్తున్నారు.
            అలా వచి్చన డ్రైవర్లు శనివారం ఉదయం 4 గంటల కల్లా డిపోలకు రావాల్సి ఉంది. పదో తరగతి ఉత్తీర్ణులైన వారిని కండక్టర్లుగా తీసుకుంటున్నారు. ఈ తాత్కాలిక డ్రైవర్లకు రోజుకు రూ.1,500, కండక్టర్లకు రూ.వెయ్యి చెల్లించాలని ఆర్టీసీ నిర్ణయించింది. అయితే వారి చేతికి పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ బస్సులు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. డీలక్స్‌ బస్సులపై తర్జనభర్జన పడుతున్నారు. వేగంగా వెళ్లటంతోపాటు ఖరీదు కూడా ఎక్కువ ఉండే సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్‌ బస్సులను వారి చేతికి ఇవ్వొద్దని నిర్ణయించారు.