Monday, September 26, 2016

‘బాహుబలి 2’ ట్రైలర్‌ ఎప్పుడంటే?

 ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి 2’ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం పతాక సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ చిత్రం విడుదల కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే నవంబరులో చిత్రం షూటింగ్‌ పూర్తి కానుందని సమాచారం. హీరో ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా అక్టోబరు 23న చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లను రాబట్టడంతో దానికి కొనసాగింపుగా తీస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బాహుబలి’ ట్రైలర్‌ యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లోనే దాదాపు 40 లక్షల మంది వీక్షించడం గమనార్హం.
ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. కీరవాణి చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న ‘బాహుబలి 2’ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

సమంత చేసిన పూజ ఏంటి?

‘వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాం’ అని ఇటీవల విడివిడి ఇంటర్య్వూల్లో అక్కినేని నాగచైతన్య.. సమంతలు చెప్పేయటం తెలిసిందే. దీంతో వీరి వ్యవహారంపై ఇప్పుడు అందరికి స్పష్టత వచ్చేసింది. ఇదిలా ఉంటే.. వీరిద్దరూ పక్కపక్కనే కూర్చొని పూజ చేసిన ఫోటోలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

పక్కపక్కనే కూర్చున్న చైతూ.. సమంతలు కుంకుమ బొట్లు పెట్టుకుని కనిపించారు. వీరికి చుట్టూ వేదపండితులు నిల్చుని ఉన్నారు. పెళ్లికి ముందుగా జరిపే పూజలో భాగంగా సమంత ఈ కార్యక్రమంలో చైతుతో కలిసి పాల్గొందని ఫిల్మ్‌ వర్గాల టాక్‌. మరి కొందరేమో.. దోష నివారణ నిమిత్తం ఈ పూజలు చేసినట్లు చెబుతున్నారు.
అయితే ఈ విషయం గురించి సమంత, నాగచైతన్య సోషల్‌మీడియా ద్వారా ఏమీ మాట్లాడలేదు. సమంత, నాగచైతన్య హిందు, క్రిస్టియన్‌ సంప్రదాయాల ప్రకారం రెండుసార్లు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.