Tuesday, February 16, 2016

నేనెవరికిస్తే మీకెందుకు..

 విరాట్‌కోహ్లి - అనుష్కశర్మ మధ్య బంధానికి తెరపడిందంటూ ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు విరాట్‌ ఎక్కడికి వెళ్లినా అతడికి అనుష్కకు సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి మంగళవారం జరిగిన ప్రైవేటు కార్యక్రమంలో.. ఓ ఖరీదైన గడియారాన్ని బాలీవుడ్‌లో ఎవరికైనా బహూకరించాల్సి వస్తే.. ఎవరికిస్తారంటూ ఓ విలేకరి కొంటెగా అడిగాడు. కోహ్లి మాత్రం కాస్త ఘాటుగానే స్పందించాడు. ‘‘బాలీవుడ్‌లో ఉన్నవాళ్లకు ఎందుకిస్తాను. ఇస్తేగిస్తే మా కుటుంబంలో ఎవరికైనా బహుమానంగా ఇస్తా. లేకుంటే జట్టు సహచరులకు ఇస్తా. అయినా ఎవరికిస్తే మీకెందుకు. ప్రస్తుత కార్యక్రమానికి సంబంధించిన ప్రశ్నలడగాలి కానీ.. విషయాన్ని మరోవైపు మళ్లించే ప్రయత్నం ఎందుకు చేస్తారు’’ అని అన్నాడు. మానవ సంబంధాల గురించి అడిగిన మరో ప్రశ్నకూ ఇలాగే స్పందించాడు కోహ్లి. ‘‘ఎవరితో సంబంధం గురించి అడుగుతున్నారు. అయినా ఇవి నన్నడగాల్సిన ప్రశ్నలు కాదు’’అని మండిపడ్డాడు.

ప్రభాస్ కొత్త సినిమాకు ముహుర్తం కుదిరింది

 గత మూడేళ్లుగా బాహుబలి సినిమాతో కాలం గడిపేస్తున్న ప్రభాస్ ఫైనల్ గా మరో సినిమాకు ముహుర్తం సెట్ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. బాహుబలి తొలిభాగం పూర్తవ్వగానే స్టార్ట్ చేయాల్సిన సినిమాను ఎట్టకేలకు బాహుబలి 2 షూటింగ్ పూర్తయిన తరువాత మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. ఇప్పటికే పక్కా స్క్రిప్టురెడీగా ఉన్న దర్శకుడు సుజిత్, ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు.
ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ లో ఉన్న ప్రభాస్ ఈ ఏడాది అక్టోబర్ కల్లా ఆ సినిమాను పూర్తిచేయాలని భావిస్తున్నాడు. రాజమౌళి కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ కల్లా ప్రభాస్ పార్ట్ ముగించేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో నవంబర్ నుంచి తన నెక్ట్స్ సినిమాను ప్రారంభించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు బాహుబలి. రన్ రాజా రన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సుజిత్ చాలాకాలంగా ప్రభాస్ తో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నాడు. ప్రభాస్ హోం బ్యానర్ యువి క్రియేషన్స్, ప్రభాస్, సుజిత్ కాంబినేషన్ లో సినిమాను నిర్మించనుంది.