Thursday, February 23, 2017

ధోనీని తప్పించడంపై సెహ్వాగ్‌ హర్షం

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ పుణె సూపర్‌ జైంట్స్‌ ధోనీని తమ జట్టు కెప్టెన్‌గా తప్పించిన తర్వాత తదుపరి సారథిగా స్టీవ్‌ స్మిత్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయితే ధోనీని తప్పించడంపై అభిమానులంతా నిరాశగా ఉంటే వీరేంద్ర సెహ్వాగ్‌ మాత్రం తనకు సంతోషమని అంటున్నాడు. ‘ధోని కెప్టెన్‌గా లేకపోవడం నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే త్వరలో జరిగే ఐపీఎల్‌ పదో సీజన్‌లోనైనా మా జట్టు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌.. పుణెను ఓడించగలదని ఆశిస్తున్న’ట్లు సెహ్వాగ్‌ సరదా వ్యాఖ్యలు చేశాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్‌ మాట్లాడుతూ సారథ్య బాధ్యతల నుంచి అతన్ని తప్పించడం ఆ ఫ్రాంచైజీకి సంబంధించిన ఆంతరంగిక విషయమని, కానీ భారత్‌కు నాయకత్వం వహించిన అత్యుత్తమ కెప్టెన్లలో ధోని ఒకడని ప్రశంసించాడు. యాజమానులైన తమను పట్టించుకోకపోవడం, క్రికెటేతర విషయాల్లో కూడా అతడు జోక్యం చేసుకోవడం తదితర కారణాలను చూపుతూ అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించినట్లు పుణె యాజమాని సంజీవ్‌ గోయెంకా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.
సెహ్వాగ్‌ గతంలో పంజాబ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించి రిటైర్మెంట్‌ ప్రకటించినప్పటికీ అతని సేవలను మాత్రం ఫ్రాంచైజీ ఉపయోగించుకుంటోంది. ఇటీవల పంజాబ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌ హెడ్‌గా బాధ్యతలు చేపట్టడంతో పాటు మెంటార్‌గా కూడా కొనసాగుతున్నాడు. ధోని సారథిగా లేనందున త్వరలో ఆరంభంకానున్న పదో సీజన్‌లో ఇరు జట్లు తలపడినప్పుడు పుణెపై తమ జట్టు గెలుపొందడం సులభమవుతుందని సెహ్వాగ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.