Thursday, September 24, 2015

యా .. ఆల్లా ..

 ముస్లింలకు పరమ పవిత్రమైన హజ్‌యాత్రలో మహా విషాదం చోటుచేసుకొంది. సౌదీ అరేబియాలోని మీనాలో గురువారం ఉదయం 9 గంటల సమయంలో (స్థానిక కాలమానం) జరిగిన తొక్కిసలాటలో 717 మంది యాత్రికులు మరణించారు. మృతుల్లో రాష్ర్టానికి చెందిన ఓ మహిళ సహా నలుగురు భారతీయులున్నారు. ఈ దుర్ఘటనలో 860 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో వృద్ధులు, మహిళలే అధికంగా ఉన్నారు. మృతుల్లో అనేక దేశాల పౌరులున్నారని సౌదీ అరేబియా పౌర రక్షణ విభాగం తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని స్థానిక మీడియా పేర్కొంది. 1990 తర్వాత హజ్‌యాత్రలో ఇంతటి విషాదం చోటుచేసుకోవటం ఇదే మొదటిసారి. ముస్లింల పవిత్ర నగరం మక్కాలో ఈ నెల 11న గ్రాండ్ మసీదుపై భారీ క్రేను కూలిన ఘటనలో 11మంది భారతీయులుసహా 115 మంది యాత్రికులు మరణించిన విషయం తెలిసిందే


సౌదీ అధికారులతో విదేశాంగ శాఖ మంతనాలుఈ సంవత్సరం హజ్‌ యాత్రలో మన దేశం నుంచి సుమారు లక్షన్నర మంది హాజరైనట్లు అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. మక్కాలో జరిగిన ఘోర ప్రమాదంపై అక్కడి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామని, వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేపట్టామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాశ్‌ స్వరూప్‌ మీడియాకు తెలిపారు. ఘటనపై కేంద్ర మంత్రి నజ్మా హెప్తుల్లా స్పందించారు. మక్కాకు లక్షన్నర మందికి పైగా భారతీయులు వెళ్లారని చెప్పారు. యాత్రకు ఎంత మంది వెళ్లారన్న దానిపై విదేశాంగ శాఖ, హజ్‌ కమిటీ వద్ద కచ్చితమైన సమాచారం ఉందని, దాని ఆధారంగా అన్ని వివరాలు తెలుసుకుంటామన్నారు. విభిన్న కోటాల్లో రాష్ట్రాలు యాత్రికులకు సాయం చేస్తూ హజ్‌ యాత్రకు పంపిస్తున్నందున హజ్‌ సెల్‌ పేరిట విదేశాంగ శాఖ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి వాటిని పర్యవేక్షిస్తోందని వివరించారు.