Monday, February 13, 2017

రేపు తేలనున్న శశికళ రాజకీయ భవితవ్యం!

  అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ రాజకీయ భవితవ్యం మంగళవారం తేలనుంది. శశికళపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు రేపు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఈ కేసులో శశికళ నిర్దోషిగా తేలితే ముఖ్యమంత్రి కావడానికి న్యాయపరమైన చిక్కులు ఉండవు. ఒకవేళ శశికళకు శిక్షపడితే ముఖ్యమంత్రి కావాలన్న ఆశలు ఆవిరైనట్టే. ఆమె జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. మరో ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హురాలవుతారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దివంగత జయలలితతో పాటు ఆమె నెచ్చెలి శశికళ కూడా నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో జయలలిత, శశికళను కర్ణాటకలోని దిగువ కోర్టు దోషులుగా ప్రకటించింది. దీంతో జయలలిత అప్పట్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. వీరిద్దరూ కొన్ని రోజులు జైల్లో గడిపారు. తర్వాత ఈ తీర్పును సవాల్‌ చేస్తూ జయలలిత  కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కిందికోర్టు తీర్పును హైకోర్టు కొట్టేయడంతో జయలలిత మళ్లీ సీఎం అయ్యారు. కాగా హైకోర్టు తీర్పును కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ నేపథ్యంలో రేపు సుప్రీం కోర్టు వెలువరించే తీర్పుపై తమిళనాట ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.