Monday, December 11, 2017

ఇదే వాగ్ధానం.. ఎప్పటికీ ప్రేమలో ఉంటాం..


భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ఓ ఇంటివారయ్యారు. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధువులు, స్నేహితులు సమక్షంలో ఈ ప్రేమ జంట ఒక్కటైంది. ఇటలీలోని తాస్కానిలోని ఓ రిసార్టులో విరాట్‌, అనుష్కలు పెళ్లి చేసుకున్నారు. 2013లో ఓ వాణిజ్య ప్రకటన షూటింగ్‌ సందర్భంగా కలిసిన కోహ్లీ, అనుష్క కొన్నేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారు. పెళ్లి చేసుకోవాలని ఈ ప్రేమ జంట ఈ మధ్యనే నిర్ణయించుకున్నా ఆ విషయం అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. శుక్రవారం అర్ధరాత్రి అనుష్క కుటుంబం ముంబయి నుంచి దిల్లీ వెళ్లగా వీరిద్దరి వివాహంపై వూహాగానాలు జోరందుకున్నాయి. అందుకు తగినట్లుగే అనుష్క, విరాట్‌ వివాహబంధంతో ఒకటయ్యారు. ఇటలీ నుంచి తిరిగొచ్చాక ఈ నెలాఖరులో విరుష్క జోడి ముంబయిలో పెళ్లి విందు ఇవ్వనుందని, జనవరి 4న ముంబయిలోని బాంద్రా కుటుంబ కోర్టులో పెళ్లి రిజిస్ట్రేషన్‌ ఉంటుందని తెలిసింది. మరోవైపు విరాట్‌, అనుష్క జంటకు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
రెండు చోట్ల వివాహ విందు
ఇటలీలో కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య ఒక్కటైన ఈ జంట తమ బంధువుల కోసం ఈ నెల 21న దిల్లీలో, మిత్రులు, క్రికెటర్ల కోసం ఈ నెల 26న ముంబయిలో వివాహ విందు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
ట్విటర్‌లో పెళ్లి చిత్రాలు..
విరాట్‌కోహ్లీ, అనుష్కశర్మలు తమ పెళ్లి చిత్రాలను ట్విటర్‌లో పోస్టు చేశారు. ట్విటర్‌లో చిత్రాలను ఇప్పటికే వేల సంఖ్యలో అభిమానులు రీట్వీట్‌ చేశారు.

విరాట్‌-అనుష్క పెళ్లి అయిపోయిందా?

 విరాట్‌- అనుష్క పెళ్లి.. గత కొన్ని రోజులుగా అందరి నోటా నానుతున్న మాట. ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రావడం.. దాన్ని అనుష్క మేనేజర్‌ ఖండించడం.. ఆ తర్వాత అనుష్క ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడం.. ఇలా కొన్నిరోజులుగా దీనిపై చర్చ నడుస్తూనే ఉంది. ఇటలీలో ఈ వారంలో వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. వీటికి కొనసాగింపుగా మరో ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకొచ్చింది. అదేంటంటే.. ఇప్పటికే వీరిద్దరికీ పెళ్లయిపోయిందని!
వీరిద్దరి గురించి సోషల్‌మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓ స్పోర్ట్స్‌ జర్నలిస్టు ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. గురువారం భారత్‌ను వీడిన ఈ జంట శనివారమే ఒక్కటయ్యిందని, త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నారని పేర్కొన్నారు. అయితే, దీన్ని కూడా ఆ ఇరువురు గానీ, వారి కుటుంబసభ్యులు గానీ అధికారికంగా ధ్రువీకరించలేదు.
మరోవైపు వీరి పెళ్లికి సంబంధించిన మరికొన్ని వార్తలు సైతం చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇటలీలోని టస్కనీ ప్రాంతంలో ఆరు ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో ఉన్న అతి విలాసవంతమైన విల్లాలో వీరి వివాహం జరగనుందని, పంజాబీ సంప్రదాయంలో తంతు నిర్వహించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు సంప్రదాయ బాంగ్రా నృత్యాలకు ఈ వేడుక వేదిక కానుందట. ఆహ్వానం అందిన వారిని మాత్రమే విల్లాలోకి అనుమతించే విధంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

పెళ్లి తర్వాత డిసెంబర్‌ 26న ముంబయిలో రిసెప్షన్‌ ఉంటుందని, దానికి కూడా క్రికెట్‌, బాలీవుడ్‌ వర్గాల నుంచి కొందరికి మాత్రమే ఆహ్వానముంటుందని సమాచారం. బాలీవుడ్‌ నుంచి షారుఖ్‌ఖాన్‌, ఆమీర్‌ఖాన్‌తో పాటు, క్రికెటర్లు తెందుల్కర్‌, యువరాజ్‌ సింగ్‌కు పెళ్లికి ఆహ్వానం అందినట్లు ఇది వరకే వార్తలు వచ్చాయి. ఏదేమైనా ప్రేమను ఏ మాత్రం సంశయించకుండా బయటపెట్టిన కోహ్లీ.. పెళ్లి విషయంలో మాత్రం ఇంత వరకు స్పందించకపోవడం గమనార్హం. ఎవరో ఒకరు అధికారికంగా ప్రకటించేంత వరకూ ఈ ప్రచారానికి తెరపడే అవకాశాలు కనిపించడం లేదు.
 

Saturday, December 9, 2017

విరాట్‌ పెళ్లికి వెళ్లేది వాళ్లిద్దరేనా?

 భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ స్టార్‌ అనుష్క శర్మల వివాహ సందడి ప్రారంభమైనట్లే కనబడుతోంది. అధికారికంగా వీరి పెళ్లిపై ఇరు వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేకపోయినా జరుగుతున్న పరిణామాలు చూస్తే వీరి వివాహం ఖాయంగా కనిపిస్తున్నది.  కాగా శుక్రవారం కుటుంబంతో సహా అనుష్క ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమివ్వడంతో  ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అదే సమయంలో కొన్నాళ్ల క్రితం డెహ్రాడూన్‌లో వీళ్లిద్దరిని ఆశీర్వదించిన పురోహితుడు కూడా విమానం ఎక్కేందుకు రావడంతో పెళ్లి వార్త నిజం కావొచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే ఈ వివాహానికి సంబంధించి మరో వార్త ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. విరాట్ తన వివాహానికి కేవలం ఇద్దరు క్రికెటర్లను మాత్రమే ఆహ్వానించాడట. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో పాటు యువరాజ్ సింగ్‌లకు విరాట్ వివాహ ఆహ్వానం అందినట్లు సమాచారం. భారత జట్టు శ్రీలంకతో జరిగే వన్డే, టీ-20 సిరీస్‌తో బిజీగా ఉండటంతో విరాట్ సచిన్, యువీలతో పాటు తన బాల్య మిత్రులు కొందరిని వివాహానికి ఆహ్వానించాడట. మూడు నెలల క్రితమే ప్లాన్ చేశారని, విరాట్, అనుష్కల కుటుంబాలు కావాలనే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని విరాట్ సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నెల 12న ఇటలీలోని మిలాన్‌లో కోహ్లి, అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారని కొంతమంది చెబుతుండగా, 15వ తేదీన వీరి వివాహం జరుగనున్నట్లు మరికొంతమంది చెబుతున్నారు.

Monday, October 23, 2017

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌ వచ్చేస్తోంది..

 సోషల్‌ మీడియా యాప్‌లో ఎక్కువగా ప్రాచుర్యం సంపాదించుకున్న వాట్సాప్‌, కొత్త కొత్త ఫీచర్లతో అలరిస్తోంది. తాజాగా వాట్సాప్‌ గ్రూప్‌ వాయిస్‌, వీడియో కాలింగ్‌ ఫీచర్‌ను కూడా యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఐఫోన్‌ యాప్‌ లేటెస్ట్‌ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఇప్పటికే వాట్సాప్‌ ఈ ఏడాదిలో పలు ఫీచర్లను ప్రవేశపెట్టి, 1 బిలియన్‌కు పైగా యూజర్లను తన సొంతం చేసుకుంది.  ఇటీవ‌ల ఐఫోన్ల‌లో ఉప‌యోగించే వాట్సాప్ అప్‌డేట్ కోడ్‌లో ఈ విషయానికి సంబంధించి సంకేతాలు ఉన్న‌ట్లు అంత‌ర్జాతీయ టెక్నిక‌ల్ వెబ్‌సైట్లు చెబుతున్నాయి.  2.17.70 ఐఓఎస్‌ అప్‌డేట్‌లో గ్రూప్‌ కాల్స్‌కు సంబంధించిన సూచనలు కలిగి ఉందని, ప్రస్తుతం ఇది ధృవీకరణ అయినట్టు డబ్ల్యూఏబీటాఇన్ఫో ఆదివారం ట్వీట్‌ చేసింది. 
గ్రూప్‌ వాయిస్‌ కాల్స్‌ గురించి చాలా సంకేతాలున్నప్పటికీ, గ్రూప్‌ వీడియో కాల్స్‌కు సంబంధించి ఒకే ఒక సంకేతం ఉన్నట్టు పేర్కొంది. గ్రూప్‌ వాయిస్‌ కాల్స్‌కు ఫీచర్‌పై ఈ యాప్‌ ప్రస్తుతం పనిచేస్తుందని, వచ్చే ఏడాది దీన్ని విడుదల చేయనున్నట్టు అంతకముందే పలు రిపోర్టులు నివేదించాయి. గ్రూప్ వీడియో కాలింగ్ గురించి కొద్దిగా సందిగ్ధ‌త ఉన్నా... గ్రూప్ వాయిస్ కాలింగ్ స‌దుపాయాన్ని మాత్రం వాట్సాప్ త్వ‌ర‌లో త‌ప్ప‌కుండా క‌ల్పించ‌నుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ ఫీచ‌ర్లు ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తాయనే విష‌యం ఇంకా తెలియాల్సి ఉంది.

Sunday, October 22, 2017

పుట్టిన రోజు శుభాకాంక్షలు ప్రభాస్‌

 
 యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం సాహో ఫస్ట్ లుక్‌ వచ్చేసింది. ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తమ అధికారిక ట్విట్టర్‌ పేజీలో దీనిని రిలీజ్ చేశారు. విదేశీ వీధుల్లో పొగ మంచు మసకలో.. ముసుగు ధరించిన ప్రభాస్‌ నడిచి వస్తున్న పోస్టర్‌ను వదిలారు. చూస్తుంటే హాలీవుడ్ స్థాయిలోనే దర్శకుడు సుజిత్ దీనిని రూపొందిస్తున్నాడేమో అనిపిస్తుంది.

Friday, October 20, 2017

క్రికెట్‌లో రాజు.. రారాజు

 
సుమారు 15 ఏళ్ల పాటు క్రికెట్‌ మైదానంలో తనదైన శైలిలో అలరించాడు వీరేంద్ర సెహ్వాగ్‌. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగి ఒంటి చేత్తో జట్టుకు విజయాలను అందించాడు. ఆ తర్వాత తనదైన ట్వీట్‌ షాట్లను సంధిస్తూ అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నాడు. ఈ రోజు వీరూ 39వ పుట్టిన రోజును జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, అభిమానుల నుంచి సెహ్వాగ్‌కు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

* బౌలర్లకు ఎన్నో నిద్రపట్టిని రాత్రులు మిగిల్చి, విధ్వంసానికి మారుపేరుగా నిలిచిన వీరేంద్ర సెహ్వాగ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు: సురేశ్‌ రైనా
* హ్యాపీ బర్త్‌ డే సెహ్వాగ్‌: అనిల్‌ కుంబ్లే
* క్రికెట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో రాజుగా.. వ్యాఖ్యాతగా రెండో ఇన్నింగ్స్‌లో రారాజుగా వెలిగిపోతున్న వీరేంద్ర సెహ్వాగ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. పండగ చేస్కో: హర్ష భోగ్లే
* ఎప్పుడైతే సెహ్వాగ్‌ క్రికెట్‌ ఆడటం మానేశాడో... అప్పట్నుంచే నేను ఇంట్లో కూర్చుని క్రికెట్‌ చూడటం మానేశా. హ్యాపీ బర్త్‌ డే సెహ్వాగ్‌: విజేందర్‌ సింగ్‌
* వీరూ నువ్వు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నా: పార్ధీవ్‌ పటేల్‌
* గోల్డెన్‌ హార్ట్‌ కలిగిన లెజండ్‌ వీరూకి పుట్టిన రోజు శుభాకాంక్షలు: మిథున్‌ మన్‌హాస్‌
* హ్యాపీ బర్త్‌ డే పాజీ: మహమ్మద్‌ షమి
* హ్యాపీ బర్త్‌ డే లెజండ్‌. మరింత కాలం నిన్ను చూసేలా దేవుడు దీవించాలని కోరుకుంటున్నా: క్రిస్‌ గేల్‌
* హ్యాపీ బర్త్‌ డే వీరూ. ఫియర్‌లెస్‌ అన్న పదానికి అర్ధం చెప్పినందుకు ధన్యవాదాలు. నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉండి నీ త్రిశతకాన్ని చూడగలిగాను: రహానె
* క్రికెట్‌ చరిత్రలో విధ్వంసకరమైన ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా పేరు తెచ్చుకున్న వీరూకి హ్యాపీ బర్త్‌ డే. వ్యాఖ్యాతగా నువ్వు మమ్మల్ని ఇలాగే ఎంటటైన్‌ చేస్తూ ఉండు: ఇషాంత్‌ శర్మ
* అంతర్జాతీయ క్రికెట్‌లో 17,253 పరుగులు, టెస్టుల్లో రెండు త్రిశతకాలు సాధించిన ఇద్దరు క్రికెటర్లలో ఒకడు, వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లో 200పైగా పరుగులు సాధించిన వీరేంద్ర సెహ్వాగ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు: ఐసీసీ
* వీరూ భాయ్‌కి జన్మదిన శుభాకాంక్షలు. సోషల్‌ మీడియాకి ఎక్కువ సమయం కేటాయించు: హర్భజన్‌ సింగ్‌
1999లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సెహ్వాగ్‌ 104 టెస్టుల్లో 49.34 సగటుతో 8,586 పరుగులు చేయగా 251 వన్డేల్లో 35.05 సగటుతో 8,273 పరుగులు సాధించాడు. 1999లో పాకిస్థాన్‌పై సెహ్వాగ్‌ వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2004లో అదే పాకిస్థాన్‌పై టెస్టుల్లో తొలి త్రిశతకాన్ని నమోదు చేశాడు సెహ్వాగ్‌. భారత్‌ తరఫున ఈ ఘనత అందుకున్న మొదటి ఆటగాడు సెహ్వాగ్‌. ఆ తర్వాత 2008లో దక్షిణాఫ్రికాపై సెహ్వాగ్‌ 319 పరుగులు చేశాడు. 2011లో వెస్టిండీస్‌పై ఇండోర్‌లో జరిగిన వన్డేల్లో ఈ డాషింగ్‌ ఓపెనర్‌ 149 బంతుల్లో 219 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు మన సెహ్వాగ్‌. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మన వీరేంద్రుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేయండి.
 
 

 

Wednesday, October 18, 2017

'రాజా ది గ్రేట్' మూవీ రివ్యూ


దాదాపు రెండేళ్ల విరామం తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ అంధుడిగా కనిపించి షాక్ ఇచ్చాడు. పటాస్, సుప్రీమ్ లాంటి వరుస హిట్స్ తో మంచి ఫాంలో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన రాజా ది గ్రేట్ మరోసారి మాస్ మహరాజ్ స్టామినాను ప్రూవ్ చేసిందా..? రెండేళ్ల విరామం తరువాత వెండితెర మీద కనిపించిన రవితేజ, అదే స్థాయిలో అలరించాడా..? దర్శకుడు అనిల్ రావిపూడికి హ్యాట్రిక్ విజయం దక్కిందా..?

కథేంటంటే: నిజాయతీ కలిగిన ఓ పోలీస్‌ ఆఫీసర్‌(ప్రకాష్‌రాజ్‌). ఆయనకో కుమార్తె లక్కీ(మెహరీన్‌). ఆ ఆఫీసర్‌కు కూతురంటే ప్రాణం. ఓ కేసు విషయంలో దేవ(వివ‌న్‌ భటేనా) తమ్ముడిని ఎన్‌కౌంటర్‌ చేస్తాడు ఆ పోలీస్‌ ఆఫీసర్‌. తన తమ్ముడిని చంపేశాడనే కోపంతో అతడిపైనా, అతని కుమార్తె లక్కీపైనా పగ పెంచుకుంటాడు దేవ. లక్కీ కళ్లముందే ఆమె తండ్రిని చంపేస్తాడు. అప్పటినుంచి దేవ నుంచి తప్పించుకుని తిరుగుతుంటుంది లక్కీ. రాజా(రవితేజ) పుట్టుకతో అంధుడు. కానీ ఆత్మవిశ్వాసం ఎక్కువ. రాజాను వాళ్ల అమ్మ(రాధిక‌) పోలీస్‌ ఆఫీసర్‌ చేయాలనుకుంటుంది. మరోపక్క దేవ నుంచి లక్కీని కాపాడేందుకు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రయత్నిస్తుంటుంది. ఈ విషయం తెలుసుకున్న రాజా ఏం చేశాడు? విలన్‌ గ్యాంగ్‌ నుంచి ఆమె ఎలా కాపాడాడు? అంధుడైన రాజా చివరికి ‘రాజా ది గ్రేట్‌’ అనిపించుకున్నాడా? 

ఎలా ఉందంటే: ఒక హీరో.. హీరోయిన్‌ను కాపాడటం అనేది రొటీన్‌ స్టోరీ. అయితే ఆ హీరో అంధుడు కావడమే ‘రాజా ది గ్రేట్‌’ చిత్రం ప్రత్యేకత. ముఖ్యంగా హీరో పాత్రను డిజైన్‌ చేసిన విధానం అందరికీ నచ్చుతుంది. అంధుడైన కథానాయకుడు ఒక బలమైన ప్రతినాయకుడిని ఎలా ఎదుర్కొన్నాడనే దాన్ని దర్శకుడు ఆకట్టుకునేలా చూపించాడు. డార్జిలింగ్‌ ఎపిసోడ్‌, కబడ్డీ ఆడే సన్నివేశాలు అలరిస్తాయి. యాక్షన్‌ సన్నివేశాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ప్రథమార్ధం చక్కని హాస్య సన్నివేశాలతో ఎంటర్‌టైనింగ్‌గా సాగిపోతుంది. ఇక ద్వితీయార్ధాన్ని హీరో-విలన్ల మధ్య వచ్చే సన్నివేశాలతో తీర్చిదిద్దాడు దర్శకుడు. ఎంటర్‌టైన్‌మెంట్‌ కన్నా యాక్షన్‌కు ప్రాధాన్యం ఇచ్చాడు. సెకండాఫ్‌లో వచ్చే మూడు ఫైట్‌లను మూడు రకాలుగా డిజైన్‌ చేసుకున్నాడు. ఒక దశలో సినిమా అయిపోయిందేమో అనిపిస్తుంది. కానీ పాటో, ఫైటో వస్తుంది. కొన్ని సన్నివేశాలు కేవలం నిడివి కోసం రాసుకున్నారేమో అనిపిస్తుంది. కాస్త సాగ‌దీత‌తో ఉన్నప్పటికీ అది వినోదాత్మకంగా చెప్పడంతో ప్రేక్షకుడు ఎక్కడా ఇబ్బందిపడడు. అయితే ద్వితీయార్ధాన్ని మరింత షార్ప్‌గా ఎడిట్‌ చేయాల్సింది. సినిమా మొత్తంలో హీరో-హీరోయిన్‌ల మధ్య ఎక్కడా లవ్‌ ట్రాక్‌ కనిపించదు. కానీ పాటలు వచ్చిపోతుంటాయి. వారి మధ్య కెమిస్ట్రీ చూపించలేదు. ‘గున్నాగున్నామామిడి...’ పాట ఎపిసోడ్‌ నవ్వులు పూయిస్తుంది.

చివరిగా: ‘రాజా ది గ్రేట్‌’.. రవితేజ ది గ్రేట్‌ 

Monday, September 11, 2017

యువీ, రైనాని మర్చిపోయారా..!

 భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల సిరీస్‌ ఈ నెల 17న ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం బీసీసీఐ తొలి మూడు వన్డేలకు భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో సిక్సర్ల హీరో యువరాజ్‌ సింగ్‌తో పాటు సురేశ్‌ రైనాకు స్థానం కల్పించలేదు. దీంతో నెటిజన్లు బీసీసీఐపై మండిపడుతున్నారు. మరోసారి యువరాజ్‌ సింగ్‌కు జట్టులో స్థానం కల్పించకపోవడం బాధాకరమని, ఇప్పుడు ఏ కారణం చూపించి అతన్ని ఎంచుకోలేదని ప్రశ్నిస్తున్నారు.
ఆసీస్‌ లాంటి ప్రత్యర్థితో తలపడేందుకు అనుభవం ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిమానులు అంటున్నారు. ఆర్‌సీబీ జట్టులోని ఆటగాళ్లకే విరాట్‌ ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాడని వారు ఆరోపించారు. కేదార్‌ జాదవ్‌ కంటే రైనా మంచి ఫినిషర్‌ అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జట్టు కూర్పు బాగోలేదని.. రైనా లేని జట్టుకు విజయావకాశాలు తక్కువ అని పేర్కొన్నారు.

Thursday, July 6, 2017

అప్పుడు ‘ఈగ’ ఇప్పుడు ‘చేప’?

 నాని కథానాయకుడిగా నటించిన ‘ఈగ’ చిత్రాన్ని ప్రేక్షకులకు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పుడు ఓ చేప నేపథ్యంలో సినిమా రాబోతోంది.
అది కూడా నాని ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ప్రశాంత్‌ శర్మ దర్శకుడిగా పరిచయమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ మొదలైనట్లు టాక్‌. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ని సైతం రూపొందించారట. అయితే ఈగ సినిమాలోలాగా ఈ సినిమాలోనూ నాని నటిస్తారా లేదా అన్న విషయం మాత్రం తెలీదు.
నాని కథానాయకుడిగా నటించిన ‘నిన్ను కోరి’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొత్త దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో నివేదా థామస్‌ కథానాయిక. ఆది పినిశెట్టి మరో ప్రధాన పాత్రలో కన్పిస్తారు.

Monday, July 3, 2017

కప్పు కాఫీ కూడా ఇవ్వలేదు

  చిత్ర రంగానికి చెందిన వారి ప్రేమ వివాహాలు చిరకాలం కొనసాగుతాయన్నది అరుదనే చెప్పాలి. అలాంటి వారిలో ఆదర్శ దంపతులుగా ఆనంద జీవితాన్ని గడుపుతున్న జంట సూర్య, జ్యోతిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక తరంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్, కమలహాసన్‌ల నుంచి శింబు, ధనుష్‌ల వరకూ జత కట్టి ప్రముఖ కథానాయకిగా రాణించిన జ్యోతిక అత్యధిక చిత్రాల్లో జత కట్టింది మాత్రం నటుడు సూర్యతోనే. ఆ పరిచయం వారి మధ్య సాన్నిహిత్యాన్ని, ఆ తరువాత ప్రేమను, ఆపై పెళ్లికి దారి తీసింది. సూర్య, జ్యోతికలకు ఇప్పుడు దియా, దేవ్‌ అనే ఇద్దరు పిల్లలున్న సంగతి తెలిసిందే.
అలా అందమైన జీవితాన్ని అనుభవిస్తున్న జ్యోతిక సుదీర్ఘ విరామం తరువాత 36 వయదినిలే చిత్రం ద్వారా నటిగా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ చిత్రం ప్రేక్షకామోదం పొందడంతో తాజాగా మగళీర్‌ మట్టుం చిత్రంతో తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయాలు అటుంచితే సూర్య లాంటి మంచి లక్షణాలున్న మగాళ్లు చాలా తక్కువ మంది ఉంటారని జ్యోతిక ఇటీవల ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. ఆయనకు తానింత వరకూ ఒక కప్పు కాఫీ కూడా కలిపివ్వలేదన్నారు. పలాన పని చేయమని సూర్య తనకు చెప్పింది లేదని అన్నారు. సూర్యలో సగం మంచి గుణాలు తన కొడుకు దేవ్‌కు అబ్బినా చాలని జ్యోతిక పేర్కొన్నారు. ఇక సూర్య కూడా జ్యో తనకు భార్యగా లభించడం తన అదృష్టం అని చాలా సార్లు బహిరంగంగానే చెప్పారన్నది గమనార్హం.

Thursday, June 22, 2017

ఆయనతో ఇప్పటికీ ప్రేమలో ఉన్నా: శ్రీదేవి

 దక్షిణ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలిగిన అతిలోక సుందరి శ్రీదేవి. ఆమె నటించిన తాజా చిత్రం ‘మామ్‌’. థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ నిర్మించారు. జులై 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో శ్రీదేవి మీడియాతో ముచ్చటించారు. తన భర్త, కుమార్తెల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
‘బోనీ కపూర్‌లాంటి నిర్మాతను ఇంతవరకు నేను చూడలేదు. ఆయన లేకుండా ‘మామ్‌’ సాధ్యమయ్యేది కాదు. ఈ సినిమా క్రెడిట్‌ మొత్తం ఆయనకే దక్కుతుంది. ‘మామ్‌’ సినిమా చక్కగా రావాలని నటీనటుల ఎంపిక, వారిని సెట్‌లో చైతన్యపరచడం వంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు’ అని శ్రీదేవి అన్నారు.
అనంతరం బోనీతో తన ప్రేమబంధం గురించి మాట్లాడుతూ.. ‘నేను బోనీతో చాలా నిజాయతీగా ఉంటాను. ఏ విషయాన్నీ దాచిపెట్టను. ఇది పెద్ద విషయమేమీ కాదు. ఆ మాత్రం కుటుంబం కోసం నేను చేయకపోతే, ఇంకెవరు చేస్తారు. ఇప్పటికీ ఆయన నన్ను గాఢంగా ప్రేమించడం.. నాకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుంటుంది. నేను ఆయనను ఎంతగానో ప్రేమిస్తున్నా. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయనపై నా ప్రేమ మరింతగా పెరుగుతోంది. దానికి ప్రేమ అనే పేరు సరిపోదు. ఇన్నేళ్లు అయినా ఏమీ మారలేదని ఆయన ప్రేమ నాకు గుర్తు చేస్తుంటుంది. బోనీ భావోద్వేగాలు కలిగిన వ్యక్తి. నన్ను ఎప్పుడూ నవ్విస్తుంటారు. మేం ఒకరికొకరం అండగా నిలుస్తుంటాం’ అని చెప్పారు.
శ్రీదేవి కుమార్తె జాహ్నవి సినీ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కుమార్తెకు ఏం సందేశం ఇస్తారని ప్రశ్నించగా.. ‘కష్టపడి పని చేయి, ఉత్తమ ప్రతిభ కనబరుచు. ఎటువంటి కష్టం లేకుండా ఫలితం లభించదు. హృదయంతో నటించాలి తప్ప మొదడుతో కాదని తనకు ఎప్పుడూ చెబుతుంటా. ఈ ప్రవర్తన నటి, నటుడికి చాలా ముఖ్యం. అదేవిధంగా జీవితంలో వినయం, కృతజ్ఞతాభావం చూపించడం ఏ వ్యక్తికైనా చాలా అవసరం’ అని శ్రీదేవి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 

Saturday, June 17, 2017

ఆ తప్పు ఇక్కడ చేయను!

 అక్కడ చేసిన తప్పు ఇక్కడ చేయనంటోంది బాలీవుడ్‌ బ్యూటీ సాయేషా సైగల్‌. లెజెండ్రీ నటుడు దిలీప్‌కుమార్‌ కుటుంబం నుంచి వచ్చిన ఈ తరం నటి సాయేషా. నటిగా తన రంగప్రవేశానికి ఏరి కోరి టాలీవుడ్‌ను ఎంచుకుని అఖిల్‌ చిత్రంతో తెరంగేట్రం చేసింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో సాయేషా ప్రతిభ వెలుగులోకి రాలేదు. ఆ తరువాత మాతృభాషలో అజయ్‌దేవ్‌గన్‌కు జంటగా శివాయ్‌ చిత్రంలో నటించింది.

ఆ చిత్రం ఓకే అనిపించుకుంది. అయినా సాయేషాకు ఈ రెండు భాషల్లోనూ అవకాశాలు తలుపు తట్టాయట. ఈ రెండు భాషా చిత్రాల అనుభవాన్ని చవి చూసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా కోలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఇక్కడ జయంరవికి జంటగా వనయుద్ధం చిత్రంలో నటించింది. విజయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 23న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అయితే ఇందులో హీరో జయంరవికి చాలా తక్కువ మాటలు, సాయేషాకు చాలా ఎక్కువ మాటలు ఉంటాయట. అంతేకాదు, ఇందులో పాటల సన్నివేశాల్లో డాన్స్‌లో సాయేషా కుమ్మేసిందట.

ఆ పాట కొరియోగ్రాఫర్‌ డాన్సింగ్‌ కింగ్‌ ప్రభుదేవానే అబ్బురపడేలా నటించిందట. ఈ టాక్‌ కోలీవుడ్‌లో వైరల్‌ అవడంతో అమ్మడికి అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇప్పటికే విశాల్, కార్తీ కలిసి నటిస్తున్న మల్టీస్టార్‌ చిత్రం కరుప్పురాజా వెళ్‌లైరాజా చిత్రంలో నటించడానికి ఎంపికైంది.మరో మూడు చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయట.

ఇలా కోలీవుడ్‌లో అనూహ్యంగా అవకాశాలు తలుపు తడుతుండడంతో అక్కడ చేసిన తప్పు ఇక్కడ చేయను అంటోంది నటి సాయేషా. ఇంతకీ ఆ తప్పేంటంటే టాలీవుడ్, బాలీవుడ్‌ల్లో అవకాశాలు వచ్చినా అంగీకరించలేదట. ఇప్పుడు కోలీవుడ్‌లో వస్తున్న అవకాశాలను వదులుకునేది లేదని ఈ జాణ అంటోంది. మొత్తం మీద మూడు చిత్రాలకే చాలా ఆరితేరిపోయింది కదూ.

Sunday, May 28, 2017

ఆ నటి చనిపోలేదు

  ప్రముఖ బుల్లితెర నటి శ్వేతా తివారి చనిపోయారంటూ శనివారం సోషల్‌మీడియాలో పుకార్లు రావడం చర్చనీయాంశంగా మారింది. శ్వేతా స్నేహితురాలు, ప్రముఖ నటి సాక్షి తన్వర్‌.. తన ట్విటర్‌ ఖాతాలో స్నేహితురాల్ని కోల్పోయినందుకు బాధగా ఉంటంటూ ట్వీట్‌ చేశారు.
దాంతో చనిపోయింది శ్వేతా తివారి అనుకుని ప్రముఖులంతా సోషల్‌మీడియాలో ఆమెకు నివాళులు అర్పించడం మొదలుపెట్టారు. మరికొందరైతే శ్వేతా భర్త అభినవ్‌కి ఫోన్లు చేసి సంతాపం తెలిపారు. దాంతో షాకైన అభినవ్‌.. షూటింగ్‌ మధ్యలో ఆపేసి వెంటనే ఇంటికి వెళ్లాడు. ఈ విషయం తెలిసి శ్వేత తెగ నవ్వుకుందని.. ఇలాంటి పుకార్లు సృష్టించద్దు అంటూ అభినవ్‌ మీడియా ద్వారా వేడుకున్నాడు.
అయితే ఇలాంటి వార్తలు తాను పట్టించుకోనని మూడుసార్లు తనని ఇలాగే చంపేశారని శ్వేత తెలిపారు. ఓ రకంగా ఇలాంటి వార్తలకు అలవాటు పడిపోయినట్లు పేర్కొన్నారు. ఇలాంటి పుకార్లు రావడం ఇది తొలిసారి కాదు. ఇంతకుముందు బాలీవుడ్‌ ప్రముఖులు కాదర్‌ ఖాన్‌, ఫరీదా జలాల్‌, దిలీప్‌ కుమార్‌ చనిపోయినట్లు సోషల్‌మీడియాలో తప్పుడు వార్తలు హల్‌చల్‌ చేశాయి.

Thursday, April 27, 2017

నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్‌లోకి...!

 వెస్టిండీస్‌ క్రికెటర్‌ మార్లోన్‌ శామ్యూల్స్‌ నాలుగేళ్ల తర్వాత ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అడుగుపెడుతున్నాడు. దిల్లీ డేర్‌డెవిల్స్‌ యాజమాన్యం అతడితో ఒప్పందం కుదుర్చుకొంది. కుడిచేతి చూపుడు వేలి గాయంతో ఐపీఎల్‌ పదికి దూరమైన డికాక్‌ స్థానంలో శామ్యూల్స్‌ను తీసుకొంది. ఈ వెటరన్‌ క్రికెటర్‌ 71 టెస్టులు, 187 వన్డేలు, 55 టీ20ల్లో వెస్టిండీస్‌ తరఫున ఆడాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో రూ.కోటి కనీస ధరతో వచ్చిన శామ్యూల్‌ను ఎవరూ కొనగోలు చేయలేదు. చివరి సారిగా 2013లో పుణె వారియర్స్‌ తరఫున ఐపీఎల్‌ ఆడాడు.

Wednesday, April 26, 2017

ఆ రోజు త్వరలోనే వస్తుంది!

 ఆ రోజు త్వరలోనే వస్తుంది అని నమ్మకంగా చెబుతోంది నటి కీర్తీసురేశ్‌. తంతే గారెల బుట్టలో పడ్డ చందాన మాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌ వచ్చి పడ్డ నటి కీర్తీసురేశ్‌. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ఇళయదళపతి విజయ్, ధనుష్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించేసి తన మార్కెట్‌ను అమాంతం పెంచేసుకుంది. అంతేకాదు టాలీవుడ్‌లోనూ నటించిన రెండు చిత్రాలు విజయాన్ని చవిచూడడంతో అక్కడ యమ క్రేజ్‌ సంపాదించుకుంది. తాజాగా సూర్యతో తానాసేర్న్‌దకూటం చిత్రంలో రొమాన్స్‌ చేస్తున్న కీర్తీసురేశ్‌ త్వరలో మహానటి సావిత్రి జీవిత చరిత్రతో ద్విభాషా చిత్రంగా తెరకెక్కనున్న నడిగై తిలగైయార్‌(తెలుగులో మహానది)లో సావిత్రి పాత్రలో నటించడానికి రెడీ అవుతోంది.

ఇందులో మరో క్రేజీ నటి సమంత కూడా నటించనున్నారు. ఈమె పాత్రికేయురాలిగా నటించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. కీర్తీసురేశ్‌ తెలుగులో పవన్‌కల్యాణ్‌కు జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న కీర్తీ నటిగా ఇంత త్వరగా ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదని పేర్కొంది.

 భైరవా చిత్రంలో విజయ్‌తో జత కట్టానంది. ఆయనతో నటించిన అనుభవం గురించి తాను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదంది. అదే విధంగా ప్రస్తుతం మరో స్టార్‌ హీరో సూర్యతో కలిసి తానా సేర్న్‌దకూటం చిత్రంలో నటిస్తున్నానని చెప్పింది. ఇక మరో స్టార్‌ నటుడు అజిత్‌తో ఎప్పుడు రొమాన్స్‌ చేస్తారని అభిమానులు అడుగుతున్నారని, ఆ అవకాశం త్వరలోనే వస్తుందని నటి కీర్తీసురేశ్‌ చెప్పింది.

అంటే అజిత్‌ తదుపరి చిత్రంలో నాయకి ఈ అమ్మడేనా? అలాంటి చర్చలు జరుగుతున్నాయా? అన్న ప్రశ్నలకు సమాధానం త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే తదుపరి విశాల్‌తో సండైకోళి 2 చిత్రంలో నటించనున్నట్లు కీర్తీ పేర్కొంది. మొత్తం మీద కోలీవుడ్, టాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ స్టార్‌ హీరోలతో నటిస్తూ పుల్‌ జోష్‌లో ఉందన్నమాట.

Monday, April 24, 2017

కాఫీ ఇస్తానంటే పారిపోతాడు..

 తన చేత్తో కాఫీ పెట్టిస్తానంటే సూర్య అక్కడి నుంచి పరుగు తీసేవారని నటి జ్యోతిక అన్నారు. ఆమె, శరణ్య, వూర్వశి, భానుప్రియ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘మగాలిర్‌ మట్టం’ చిత్రం పాటల విడుదల కార్యక్రమాన్ని సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూర్య, కార్తీ, శివకుమార్‌, పాండిరాజ్‌, వూర్వశి, సుధ కొంగర, ఎస్‌.ఆర్‌. ప్రభు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జ్యోతిక మాట్లాడుతూ.. ‘సూర్య నా కారు దగ్గరకు వచ్చి మరీ రోజూ బాయ్‌ చెప్తారు. తర్వాతే తాను సినిమా షూటింగ్‌కు బయలుదేరుతారు. బ్రహ్మ తెలిసో, తెలియకో చిత్రంలోని పాత్ర కోసం సరైన మహిళను(తననే) ఎంచుకున్నారు. ఎందుకంటే.. నాకు వివాహమై పదేళ్లవుతోంది. ఈ పదేళ్లలో నా భర్త కోసం స్వయంగా కేవలం ఒక్క దోశ వేశాను. అది కూడా ఇటు దోశ, అటు చపాతీకి మధ్యలో తయారైంది. ఆ దోశ తిన్నందుకు ధన్యవాదాలు సూర్య. ఈ దోశను నేను నా పెళ్లి తర్వాతి రోజు వేశాను. తర్వాత దోశలు పోసే అవసరం లేదని అమ్మ చెప్పారు. కనీసం నా చేత్తో కాఫీ చేసి ఇస్తానన్నా సూర్య అక్కడి నుంచి పరుగు తీస్తారు. ఇందుకే నన్ను నటించడానికి పంపుతున్నారేమో అనిపిస్తుంది. కానీ సూర్య లేకుండా నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు.. థ్యాంక్యూ సూర్య’ అని చెప్పారు.

Tuesday, March 14, 2017

ఫుల్‌గా తాగి.. 175 బాదిన బ్యాట్స్‌మన్‌

 వన్డే క్రికెట్‌ చరిత్రలో 12/3/2006 తేదీకి ఓ ప్రత్యేకమైన స్థానముంది. సరిగ్గా ఇదే తేదీన దక్షిణాఫ్రికా జట్టు 434 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. వన్డే చరిత్రలో 400కుపైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అదే తొలిసారి.. ఈ అరుదైన ఘనతను సఫారీలు సొంతం చేసుకోవడం వెనుక చిచ్చరపిడుగు హెర్షల్లీ గిబ్స్‌ పాత్ర ఉంది. జోహాన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాలో జగిరిన ఈ వన్డేలో గిబ్స్‌ చెలరేగిపోయాడు. ఆసిస్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. ఏకంగా 175 పరుగులు చేయడంతో అసాధ్యమనుకున్న 400కుపైగా లక్ష్యాన్ని సఫారీలు సొంతం చేసుకున్నారు.

అయితే, గిబ్స్‌ సాధించిన అరుదైన ఈ ఫీట్‌ వెనుక ఉన్న ఓ రహస్యం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వన్డే మ్యాచ్‌కు ముందురోజు అర్ధరాత్రి దాకా పీకలవరకు తాగి.. ఫుల్‌ హ్యాంగోవర్‌ స్థితిలో గిబ్స్‌ బ్యాటింగ్‌కు దిగాడు. ఆ హ్యాంగోవర్‌తోనే కంగారు బౌలర్లను కకావికలం చేశాడు. ఈ విషయాన్ని తన ఆత్మకథలో గిబ్స్‌ వెల్లడించాడు. మ్యాచ్‌కు ముందురోజు స్నేహితుడితో కలిసి రాత్రి ఒంటిగంటవరకు ఫుల్‌గా మద్యాన్ని సేవించానని, ఆ తెల్లారి హ్యాంగోవర్‌తోనే బ్యాటింగ్‌కు దిగానని గిబ్స్‌ పేర్కొన్నాడు. సహజంగానే చెలరేగి ఆడే గిబ్స్‌కు ఆ హ్యాంగోవర్‌ ఇంకాస్తా ఊపునిచ్చిందేమో. ఏకంగా 21 ఫోర్లు, ఏడు సిక్సర్లతో ఆ మ్యాచ్‌లో గిబ్స్‌ విధ్వంసం సృష్టించాడు. అతని ఘనతతో దక్షిణాఫ్రికా 434పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటికీ వన్డే చరిత్రలో అతి పెద్ద లక్ష్యఛేదన రికార్డుగా ఇది మిగిలిపోయింది.

Sunday, March 12, 2017

పెళ్ళి పెళ్లే... సినిమా సినిమానే!

 అక్కినేని నాగచైతన్య (చైతూ) పేరు వినిపిస్తే చాలు! సమంతతో ప్రేమ, పెళ్లి... ఈ కబుర్లే వినిపిస్తున్నాయి. మనోడు చేస్తున్న సినిమా సంగతులు ప్రేక్షకుల మధ్య పెద్దగా చర్చకు రావడం లేదు. కానీ, చైతూ సైలెంట్‌గా కొత్త సినిమాల షూటింగులు కానిచ్చేస్తున్నాడు. ‘సొగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్‌ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఓ పక్క ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుండగానే... మేనమామ డి. సురేశ్‌బాబు, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాని ఈ మధ్యే అంగీకరించాడు.

అప్పుడే ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. హైదరాబాద్‌లో 18 రోజుల పాటు చైతూ, ఇతర తారలు పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. నెక్ట్స్‌ షెడ్యూల్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నాడు. లావణ్యా త్రిపాఠి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రాజమౌళి కుమారుడు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ఈ సినిమాకు లైన్‌ ప్రొడ్యూసర్‌. ‘జెంటిల్‌మన్‌’ ఫేమ్‌ డేవిడ్‌ ఆర్‌.నాథన్‌ ఈ చిత్రానికి కొత్త తరహా కథ, కథనాలు అందించారట!

Saturday, March 11, 2017

నిర్మాత దిల్‌ రాజుకు సతీ వియోగం

 ప్రముఖ తెలుగు నిర్మాత, పంపిణీదారుడు దిల్‌ రాజు అలియాస్ వి.వెంకట రమణారెడ్డికి సతీ వియోగం జరిగింది. దిల్‌ రాజు భార్య అనిత (46) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్‌ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఇవాళ తుది శ్వాస విడిచారు. కాగా వరుణ్‌ తేజ్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'ఫిదా'  చిత్రం షూటింగ్‌ నిమిత్తం దిల్‌ రాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.
ఈ దుర్వార్త విన్న దిల్‌ రాజు... అమెరికా నుంచి హైదరాబాద్‌ బయల్దేరారు. ఆయన వచ్చేవరకు అనిత మృతదేహాన్ని ఆసుపత్రిలోనే ఉంచుతారని తెలిసింది.  విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు దిల్‌రాజు కుటుంబానికి సంతాపం ప్రకటించారు. ఇటీవల దిల్‌ రాజు తమ కుమార్తె హన్హిత రెడ్డి పెళ్లిని గోవాలో గ్రాండ్‌గా జరిపించిన విషయం తెలిసిందే.

దిల్‌ రాజు... శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆయన నిర్మించిన తొలి చిత్రం దిల్‌ విజయవంతం కావడంతో ఆ పేరే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది.

Friday, March 10, 2017

తేజ దర్శకత్వంలో స్టార్ వారసురాలు

 చిత్రం, నువ్వు నేను, జయం లాంటి సినిమాలతో ఇండస్ట్రీని మలుపు తిప్పిన దర్శకుడు తేజ. అంత కొత్త వారితో తిరుగులేని విజయాలు సాధించిన ఈ గ్రేట్ డైరెక్టర్, కొంత కాలంగా సక్సెస్ కు దూరమయ్యాడు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలన్ని వరుసగా ఫ్లాప్ అవ్వటంతో ఆయన కెరీర్ కష్టాల్లో పడింది. లాంగ్ గ్యాప్ తరువాత ప్రస్తుతం రానా హీరోగా ఓ పొలిటికల్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు తేజ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది.
నేనే రాజు నేనే మంత్రి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత మరోసారి తన మార్క్ లవ్ స్టోరిని చేసే ఆలోచనలో ఉన్నాడు తేజ. అంతా కొత్త వారితో ఓ క్యూట్ లవ్ స్టోరిని ప్రీపేర్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రముఖ హీరో రాజశేఖర్ కూతురు శివానిని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నాడట. గతంలో రాజశేఖర్ హీరోగా తేజ అహం అనే సినిమాను ఎనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా చర్చల దశలోనే ఆగిపోయింది. గతంలో తేజ పరిచయం చేసిన నటీనటులు ఇప్పుడు స్టార్ గా వెలుగొందుతున్నారు. అదే బాటలో రాజశేఖర్ కూతురికి కూడా తేజ బ్రేక్ ఇస్తాడేమో చూడాలి.

Tuesday, March 7, 2017

మొన్న రజనీ... నిన్న కమల్‌

 తమిళనాడులో రాజకీయాలకు, సినిమాకు అవినాభావ సంబంధం ఉంది. ఇప్పటి వరకూ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రుల్లో 90 శాతం సినిమాకు చెందిన వారేనన్నది జగమెరిగిన సత్యం. జయలలిత మరణానంతరం సినిమా పరిశ్రమకు సంబంధంలేని ముఖ్యమంత్రి చేతిలోకి ప్రభుత్వం వెళ్లింది. దీన్ని తమిళనాడులోని అత్యధిక శాతం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో నటుడు కమలహాసన్‌ ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా తన భావాలను ట్విట్టర్‌ ద్వారా వెలిబుచ్చడం ప్రజలను ఆకర్షించింది.
కమల్‌ బహిరంగంగానే శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకించి, పన్నీర్‌సెల్వంకు మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో కమల్‌ ఆదివారం రాష్ట్రంలోని నలుమూల అభిమానుల ప్రతినిధులను, తన సంఘానికి చెందిన న్యాయవాదులను కలవడంతో  రాజకీయవర్గాల్లో అలజడి మొదలైంది. అయితే సమావేశంలో రాజకీయ ప్రస్తావన తీసుకురాకపోవడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు.

కమల్‌ అభిమానులకు ఈ సమావేశం ఏమాత్రం రుచించలేదు. వారు తన అభిమాన నటుడు రాజకీయాల్లోకి ప్రవేశించాలని కోరుకుంటున్నారు. కమల్‌పై ఒత్తిడి తీసుకొస్తామని, ఆయన రాజకీయరంగ ప్రవేశానికి ఇదే సరైన సమయం అని అభిమానులు అంటున్నారు. కాగా మొన్నటి వరకూ ఇలాంటి రాజకీయ సెగ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఎదుర్కొన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే కమలహాసన్‌కు ఎదురవుతోందన్నది పరిశీలకుల మాట.

Monday, March 6, 2017

నిప్పుతో ఆడగలిగే మగాడు దొరకలేదట!

 మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్‌ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. కానీ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకునిపెంచుకుంటోంది. కొంతకాలం వరకు కెమెరాకు దూరంగా ఉన్న సుస్మిత ఇప్పుడిప్పుడే ఈవెంట్లకు హాజరవుతోంది. అయితే ఈమధ్యకాలంలో సుస్మిత ఎక్కడికి వెళ్లినా ఎంతకాలమని సింగిల్‌గా ఉంటారు, పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతున్నారట. వారికి సమాధానంగా సుస్మిత ఇలా చెప్పుకొచ్చింది. ‘నాయిష్ట ప్రకారమే ఒంటరిగా ఉన్నా.. నా ఛాయిస్‌తో సురక్షితంగా, సంతోషంగా ఉన్నా. ఇతరుల ఛాయిస్‌నీ అలాగే గౌరవిస్తున్నా.. సింగిల్స్‌ అయినా డబుల్స్‌ అయినా గెలవడానికేగా ఆడతాం.. అయినా ఆ ప్రశ్నకి సమాధానం చెప్పితీరాలంటే.. నిప్పుతో ఆడగల మగాడు నాకు ఇంకా దొరకలేదు’ అని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కొందరి నోటికి తాళం వేసింది సుస్మిత.

Saturday, March 4, 2017

కూతురు నటిస్తే కాళ్లు విరగ్గొడతాడట..

 బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌కి తన కుమార్తె త్రిషాలా నటి కావడం ఇష్టంలేదట. ఒకవేళ త్రిషాలా నటిఅవుతానంటే ఆమె కాళ్లు విరగ్గొట్టేవాణ్ణి అంటున్నారు సంజయ్‌. జైలు నుంచి విడుదలయ్యాక సంజయ్‌ నటిస్తున్న తొలి చిత్రం ‘భూమి’. తండ్రీ కూతుళ్ల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సంజయ్‌ కుమార్తెగా అదితిరావ్‌ హైదరి నటిస్తోంది. ఆగ్రాలో నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సంజయ్‌ను రీల్‌ లైఫ్‌ కూతురు అదితికి రియల్‌ లైఫ్‌ కూతురు త్రిషాలాకి పోలికేంటి అని ఓ విలేకరి అడిగారు. ఇందుకు సంజయ్‌.. ‘త్రిషాలా నటి అవుతానంటే ఆమె కాళ్లు విరగ్గొట్టేవాణ్ణి. కానీ అదితితో నేను అలా చెయ్యలేను’ అని సరదాగా సమాధానమిచ్చారు.
సంజయ్‌, ఆయన తల్లిదండ్రులూ నటీనటులే. అలాంటప్పుడు తన పిల్లల్ని సినిమా రంగం వైపు ఎందుకు రానివ్వాలనుకోవడంలేదని మళ్లీ విలేకరులు ప్రశ్నించారు. ‘త్రిషాలాని మంచి, సురక్షితమైన ఉద్యోగంలో చూడడానికి చాలా కష్టపడ్డాను. మంచి కళాశాలలో చేర్పించాలని చాలా ఖర్చు పెట్టాను. ఇప్పుడు ఎఫ్‌బీఐలో పనిచేస్తోంది. మరోపక్క ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కూడా చేస్తోంది. కానీ హిందీ చిత్ర పరిశ్రమలో ఉండాలంటే ముందు తనకి భాష తెలిసుండాలి. అందులోనూ నటి కావడం అంత సులువు కాదు. నటన పైకి గ్లామరస్‌గా కనిపిస్తుంది కానీ అది చాలా కష్టమైన ఉద్యోగం’ అని చెప్పుకొచ్చారు సంజూ బాబా.

Friday, March 3, 2017

టాలీవుడ్‌ ముద్దుగుమ్మ పెళ్లి కబురు..!

  టాలీవుడ్ లో  అగ్ర హీరోయిన్‌గా  చలామణి అవుతున్న కాజల్‌ అగర్వాల్‌  పెళ్లికి సంబంధించి  పలు రూమర్లు  సోషల్‌ మీడియాలో​  చక్కర్లు కొడుతున్నాయి.  చారడేసి కళ్లతో  చందమామ సినిమాతో స్టార్ గా మారిన కాజల్, తెలుగు, తమిళ సినిమాల్లో  ఓ వెలుగు వెలుగుతోంది.  ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందిట. ఇదే  ఇపుడు  సోషల్‌ మీడియా టాప్‌ టాక్‌.   ముంబైకి  చెందిన ఓ  బిజినెస్ మెన్ తో కాజల్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందనీ, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.  అంతేకాదు ఇరు కుటుంబ పెద్దలు వీరి ప్రేమ పెళ్ళికి  గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చేసారనీ, దీంతో వీరు  ఏడు అడుగులు వేయనున్నారనీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.  కాజల్ చేసుకోబోయే వ్యక్తికి దేశవ్యాప్తంగా హోటల్స్ చైన్ ఉందని అంటున్నారు.               కాగా టాలీవుడ్‌ మెగా‍స్టార్‌  చిరంజీవి  సెన్సేషనల్‌ మూవీ  ఖైదీ నెం 150లో అమ్మడూ.. లెస్ట్‌ డు కుమ్ముడుతో  అభిమానులను కుమ్మేసిన ఈ కలువ కళ్ళ సుందరి కాజల్ కి ఈ ఏడాది బాగానే కలిసి వచ్చిందని చెప్పాలి.  ప్రస్తుతం వివేగం, నేనే రాజు నేనే మంత్రి తో పాటు డీకే దర్శకత్వంలో ఓ లేడి ఓరియెంటెడ్   చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే  పెళ్లి కబుర్లపై కాజల్‌ అధికారింగా స్పందించేంతవరకు ఈ సస్పెన్స్‌ తప్పదు. మరి.. ఈ శుభవార్త  అభిమానుల చెవిన ఎపుడు వేస్తోందో.. వేచి చూడాల్సిందే..

Monday, February 27, 2017

ఆ కోరిక తీరనుంది!

  వచ్చే అదృష్టాన్ని నిలువరించడం ఎవరితరం కాదు. అలాగే అందని దాని కోసం ఆశ పడడం వృథానే. అలాగని కలల్ని కనడం, వాటిని నెరవేర్చుకోవడానికి కృషి చేయడం సాధికుల లక్షణం. అదే విధంగా అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం తెలివైన వారి పని. ఇక సినీ కథానాయికల విషయానికొస్తే వరించి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఎదిగే వారు కొందరైతే, కోరుకున్న అవకాశాలను సంపాదించుకునే వారు మరి కొందరు. మొదట నుంచి అందాలార బోసి కమర్షియల్‌ హీరోయినన్ లగా పేరు తెచ్చుకుని నటిగా ఒక స్థాయికి చేరిన తరువాత కథలో సెంటరిక్‌ పాత్రలను పోషించాలని ఆశ పడుతుండడం సహజం.
అయితే ఆశపడిన వారందరికీ అలాంటి అవకాశాలు రావడం అన్నది కల్లే. కొందరికి మాత్రం ఆశించకుండానే హీరోయిన్  ఓరియెంటెడ్‌ అవకాశాలు ముంగిట వాలతాయి. ఒకప్పుడు నటి విజయశాంతి అలాంటి లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల్లో నటించి లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందారు. తాజాగా నటి నయనతార, అనుష్క, త్రిష లాంటి వారు కథల్లో సెంటరిక్‌ పాత్రలో రాణిస్తున్నారు. ఇటీవల నటి సోనియా అగర్వాల్‌ కూడా లేడీ ఓరియెంటెడ్‌ పాత్రలో నటిస్తున్నారు. ఆమె నటిస్తున్న అహల్య అనే చిత్రం ఐదు భాషల్లో తెరకెక్కుతోంది. కాగా నటి కాజల్‌అగర్వాల్‌కు కూడా స్త్రీ ప్రధాన పాత్రతో కూడిన చిత్రాల్లో నటించాలన్న ఆశ పుట్టింది.
ఇప్పటి వరకూ గ్లామరస్‌ పాత్రలకే పరిమితవైున ఈ బ్యూటీ కెరీర్‌ మధ్యలో కాస్త డౌన్ నా మళ్లీ గాడిలో పడింది. ప్రస్తుతం అజిత్‌తో వివేకం చిత్రంలోనూ, విజయ్‌తో ఆయన 61వ చిత్రంలోనూ రొమాన్స్  చేస్తున్న ఈ ఉత్తరాది భామ కోరుకున్నట్లు తాను ఆశపడిన పాత్రలో నటించే అవకాశం వరించిందన్నది తాజా సమాచారం. దర్శకుడు డీకే నయనతార కోసం ఒక హీరోయిన్  సెంటరిక్‌ కథను తయారు చేసుకున్నారు.
ఈ పాత్రలో ఇప్పుడు నటి కాజల్‌అగర్వాల్‌ను ఎంపిక చేసుకున్నారు. కాజల్‌ ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో కవలైవేండామ్‌ చిత్రంలో నటించారు. ఆ స్నేహం కారణంగానే ఈ హీరోయిన్  ఓరియెంటెడ్‌ కథా చిత్రంలో నటించే అవకాశం కాజల్‌ను వరించిందని తెలుస్తోంది. మొత్తం మీద కాజల్‌ కోరుకుంది సాధించుకుంది. ఇప్పుడు ఈ అమ్మడు కూడా నయనతార, త్రిషల వరుసలో చేరబోతున్నందుకు ఆనందంలో తేలిపోతోందట. లక్కు అంటే ఇదే మరి.

Saturday, February 25, 2017

రజనీకాంత్‌ సరసన మరో బాలీవుడ్‌ నటి?

 సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘2.0’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆయన ‘కబాలి’ దర్శకుడు పా రంజిత్‌ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు. రజనీ అల్లుడు, నటుడు ధనుష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శక-నిర్మాతలు చిత్రంలో మిగిలిన నటీనటుల ఎంపిక పనుల్లో పడినట్లు తెలుస్తోంది. రజనీకాంత్‌కి జోడీగా బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ను అనుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే దర్శక-నిర్మాతలు విద్యాబాలన్‌ను కలిశారని, నటించడానికి ఆమె కూడా ఆసక్తి చూపారని తమిళ చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే విద్యాబాలన్‌ కోలీవుడ్‌లో నటిస్తున్న తొలి చిత్రమిదే అవుతుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ‘2.0’ చిత్రంలో అమీ జాక్సన్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్‌. రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Friday, February 24, 2017

రివ్యూ: విన్నర్‌


కథేంటి?: హార్స్‌ రేసింగ్‌నే వ్యాపారంగా చేసుకొన్న కుటుంబానికి చెందిన వ్యక్తి మహేంద్రరెడ్డి (జగపతిబాబు). ఆయన కొడుకే సిద్ధార్థ్‌(సాయిధరమ్‌ తేజ్‌). భార్య చనిపోవడంతో సిద్ధార్థే లోకంగా బతుకుతుంటాడు. కానీ ఉన్నట్టుండి సిద్ధార్థ్‌కి తన తండ్రిపై ద్వేషం పెరుగుతుంది. అందుకే చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోతాడు. పెద్దయ్యాక న్యూ లుక్‌ పత్రికకు క్రియేటివ్‌ హెడ్‌గా పనిచేస్తుంటాడు. ఒక పార్టీలో తొలి చూపులోనే సితార (రకుల్‌ప్రీత్‌సింగ్‌)ని చూసి ప్రేమిస్తాడు. ఒక లక్ష్యం కోసం పాటుపడుతున్న ఆమెని ప్రేమలో దించే క్రమంలో ఓ చిన్న పొరపాటు జరుగుతుంది. దాంతో సితార తండ్రి రాజీవ్‌రెడ్డి (సురేష్‌).. నెంబర్‌ వన్‌ రేసర్‌ అయిన సిద్ధార్థ్‌రెడ్డి(ఠాకూర్‌ అనూప్‌సింగ్‌)తో పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు. అది తెలుసుకొని సిద్ధార్థ్‌ ఎలాగైనా పెళ్లి ఆపాలని వెళతాడు. ఇంతలో సితారే తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను సిద్ధార్థ్‌ని ప్రేమించానని, అతను కూడా హైదరాబాద్‌లో రేసరే అని చెబుతుంది. కావాలంటే సిద్ధార్థ్‌రెడ్డికీ, సిద్ధార్థ్‌కీ మధ్య పోటీ పెట్టమని కూడా చెబుతుంది. అదే సమయంలోనే ఈ పోటీలో త‌న‌ కొడుకు సిద్ధార్థ్‌రెడ్డి గెలుస్తాడని మహేందర్‌రెడ్డి అక్కడికొచ్చి చెబుతాడు. అది చూసి ఒక్కసారిగా షాక్‌ అవుతాడు సిద్ధార్థ్‌. తన స్థానంలో వచ్చిన సిద్ధార్థ్‌రెడ్డి ఎవరో తెలుసుకోవాలనుకొంటాడు. మరింతకీ ఆ సిద్ధార్థ్‌రెడ్డి ఎవరు? రేసింగ్‌లో ఎవరు గెలిచారు? సిద్ధార్థ్‌రెడ్డి అసలు రూపం బయటపెట్టి తన తండ్రికి సిద్ధార్థ్‌ ఎలా దగ్గరయ్యాడు? సితార లక్ష్యం కోసం, ఆమె మనసు సొంతం చేసుకోవడం కోసం సిద్ధార్థ్‌ ఏం చేశాడు? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే?: తెలుగు సినిమాకి అలవాటైన ఫార్ములా కథే ఇది. ఆ మాట కొస్తే ఫార్ములా కథలు తప్పేం కాదు. కాకపోతే ప్రేక్షకుడు థియేటర్లో కూర్చున్నంతసేపూ ఇది మనం చూసేసిన కథే అనిపించకుండా, ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం సరదాగా గడిచిపోయిందంటే చాలు.. పాసైపోయినట్టే.. ఆ విషయంలో కొంత వరకు సఫలమయ్యాడు దర్శకుడు. తండ్రీ-కొడుకుల బంధానికి హార్స్‌రేస్‌ నేపథ్యాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథా నేపథ్యంలో కొత్తదనం ఉంది తప్ప కథ, కథనాలు మాత్రం సాధారణంగానే అనిపిస్తాయి. కథ ఎత్తుగడ, హీరోయిన్‌ని చూసి హీరో ప్రేమలో పడటం, ఆ తర్వాత వచ్చే ప్రేమ సన్నివేశాలు రొటీన్‌గా సాగుతాయి. ‘సింగమ్‌ సుజాత’గా పృథ్వీ కథలోకి ప్రవేశించాక సన్నివేశాలు పరుగులు పెట్టాయి. మహేందర్‌రెడ్డి కొడుకుగా, ఠాకూర్‌ అనూప్‌సింగ్‌ ప్రవేశంతో కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది. అయితే ఆ తర్వాత కథ మరింత రక్తి కట్టాల్సి ఉండగా, అలా జరగదు. విరామానికి ముందున్న ఆసక్తి క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ద్వితీయార్ధంలో పీటర్‌హెయిన్స్‌గా అలీ చేసే సందడి, పతాక సన్నివేశాల్లో హార్స్‌రేసింగ్‌ సన్నివేశాలు అలరిస్తాయి. కథంతా ప్రేక్షకుడి వూహకు తగినట్లుగానే సాగుతుంది. ఈ సినిమాలో కొత్తగా ఏదైనా ఉందంటే అది హార్స్‌రేసింగ్‌ నేపథ్యంలో కూడిన సన్నివేశాలే. తొలి సగభాగం స్థాయిలో విరామం తర్వాత కూడా వినోదం మరింత పండుంటే ఈ సినిమా మరోస్థాయికి వెళ్లేది.
ఎవరెలా చేశారంటే: సాయిధరమ్‌తేజ్‌ హుషారుగా నటించాడు. భావోద్వేగంతో కూడిన సన్నివేశాల్లోనూ పర్వాలేదనిపించాడు. డ్యాన్స్‌, ఫైట్ల విషయంలో ఎప్పటిలాగే తన మార్కును చూపించాడు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ అందంగా కనిపించింది. పృథ్వీ, అలీ, వెన్నెల కిషోర్‌ వినోదాన్ని పంచే బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. సినిమాలో వాళ్ల పాత్రలే హైలైట్‌ అయ్యాయి. జగపతిబాబు నటన, ఆయన పాత్ర చాలా బాగుంది. ప్రతినాయకుడిగా ఠాకూర్‌ అనూప్‌ సింగ్‌ తన పరిధి మేర బాగానే నటించాడు. సాంకేతికంగా ఈ సినిమాకు మంచి మార్కులు పడతాయి. ఛాయాగ్రహణం, సంగీతం బాగున్నాయి. అబ్బూరి రవి సంభాషణల్లో మెరుపులు కనిపించాయి. దర్శకుడు తాను అనుకున్న కథను అనుకున్నట్లు తెరకెక్కించాడు. అయితే ద్వితీయార్ధంపై దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. విదేశాల్లో పాటలు, హార్స్‌ రేసింగ్‌ సన్నివేశాలు చక్కటి నిర్మాణ విలువలకు అద్దం పట్టాయి.
చివరిగా: తండ్రీకొడుకుల బంధంతో ‘విన్నర్‌’  

Thursday, February 23, 2017

ధోనీని తప్పించడంపై సెహ్వాగ్‌ హర్షం

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ పుణె సూపర్‌ జైంట్స్‌ ధోనీని తమ జట్టు కెప్టెన్‌గా తప్పించిన తర్వాత తదుపరి సారథిగా స్టీవ్‌ స్మిత్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయితే ధోనీని తప్పించడంపై అభిమానులంతా నిరాశగా ఉంటే వీరేంద్ర సెహ్వాగ్‌ మాత్రం తనకు సంతోషమని అంటున్నాడు. ‘ధోని కెప్టెన్‌గా లేకపోవడం నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే త్వరలో జరిగే ఐపీఎల్‌ పదో సీజన్‌లోనైనా మా జట్టు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌.. పుణెను ఓడించగలదని ఆశిస్తున్న’ట్లు సెహ్వాగ్‌ సరదా వ్యాఖ్యలు చేశాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్‌ మాట్లాడుతూ సారథ్య బాధ్యతల నుంచి అతన్ని తప్పించడం ఆ ఫ్రాంచైజీకి సంబంధించిన ఆంతరంగిక విషయమని, కానీ భారత్‌కు నాయకత్వం వహించిన అత్యుత్తమ కెప్టెన్లలో ధోని ఒకడని ప్రశంసించాడు. యాజమానులైన తమను పట్టించుకోకపోవడం, క్రికెటేతర విషయాల్లో కూడా అతడు జోక్యం చేసుకోవడం తదితర కారణాలను చూపుతూ అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించినట్లు పుణె యాజమాని సంజీవ్‌ గోయెంకా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.
సెహ్వాగ్‌ గతంలో పంజాబ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించి రిటైర్మెంట్‌ ప్రకటించినప్పటికీ అతని సేవలను మాత్రం ఫ్రాంచైజీ ఉపయోగించుకుంటోంది. ఇటీవల పంజాబ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌ హెడ్‌గా బాధ్యతలు చేపట్టడంతో పాటు మెంటార్‌గా కూడా కొనసాగుతున్నాడు. ధోని సారథిగా లేనందున త్వరలో ఆరంభంకానున్న పదో సీజన్‌లో ఇరు జట్లు తలపడినప్పుడు పుణెపై తమ జట్టు గెలుపొందడం సులభమవుతుందని సెహ్వాగ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Wednesday, February 22, 2017

ఆయన ప్రపోజ్‌ చేశారు: ఖుష్బూ

 అందం, చక్కటి అభినయంతో ఒకప్పుడు అగ్రకథానాయికగా రాణించిన నటి ఖుష్బూ తన ప్రేమ జీవితం గురించి సోషల్‌మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు. 22 ఏళ్ల క్రితం తీసిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ఆ సందర్భాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘22 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 22న నేను ‘మురైమమన్‌’ సినిమా షూటింగ్‌లో ఉన్నా.. ఆ సమయంలో ఆయన నాకు ప్రపోజ్‌ చేశారు. జంటగా ఇద్దరి ప్రయాణం అలా మొదలైంది’ అని ఖుష్బూ ట్వీట్‌ చేశారు.
2001లో ఖుష్బూ, సి. సుందర్‌ల వివాహం జరిగింది. వీరికి అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఖుష్బూ ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌- త్రివిక్రమ్‌ కలయికలో వస్తున్న మరో చిత్రంలోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.

Tuesday, February 21, 2017

ఐపీఎల్‌ పదోసీజన్‌ లోగో ఆవిష్కరణ

 టోర్నీ ఆరంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకొన్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఫీవర్‌ సోమవారం ఆటగాళ్ల వేలం ప్రక్రియతో మొదలైంది. తాజాగా లీగ్‌ పదోసీజన్‌ లోగోను మంగళవారం ఆవిష్కరించారు. తొమ్మిది లీగ్‌లను విజయవంతంగా ముగించుకొని పదో సీజన్‌లోకి ఘనంగా అడుగుపెడుతున్నందున లోగోలో పది సంఖ్యను అందంగా తీర్చిదిద్దారు. సంఖ్య మధ్యలో బ్యాట్స్‌మన్‌ షాట్‌ ఆడుతున్న భంగిమను ఏర్పాటు చేశారు. పక్కనే ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌ వివో, ఐపీఎల్‌ ఆంగ్ల అక్షరాలను డిజైన్‌ చేశారు. ఏప్రిల్‌ 5న హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో తొలి మ్యాచ్‌ అట్టహాసంగా ప్రారంభంకానుంది. మరోవైపు దేశవ్యాప్తంగా 38 నగరాల్లో ఐపీఎల్‌ ఫ్యాన్‌పార్క్‌ల ద్వారా స్టేడియంలో ఉన్న అనుభూతిని అభిమానులకు కలిగించేలా ఏర్పాటు చేస్తున్నారు.

Sunday, February 19, 2017

జీవితం అంటే ఆట!

  పేరు ఉంగరాలు రాంబాబు. ఓహో.. ఉంగరాల వ్యాపారం చేస్తాడేమో అనుకుంటున్నారా? అబ్బే అలాంటిదేం లేదు. మనోడికి జాతకాలంటే మహా నమ్మకం. అందుకే ఆ రాయి.. ఈ రాయి.. అంటూ రాళ్ల ఉంగరాలతో వేళ్లను నింపేసుకున్నాడు. కామెడీ హీరో సునీల్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న ‘ఉంగరాల రాంబాబు’. పేరుకే కామెడీ హీరో కానీ.. రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోలు చేసే రేంజ్‌లో సునీల్‌ డాన్సులు చేస్తారు. అందుకే ఈ సినిమాలో ఆయన ఇంట్రడక్షన్‌ సాంగ్‌ని భారీగానే ప్లాన్‌ చేశారు.
అన్నపూర్ణ స్టూడియోలో స్పెషల్‌ సెట్‌లో ఈ సాంగ్‌ షూటింగ్‌ జరుగుతోంది. ‘లైఫ్‌ అంటే ఆట..’ అంటూ సాగే ఈ పాటకు డాన్స్‌ మాస్టర్‌ భాను కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆయన చెప్పిన కొత్త స్టెప్పులను సునీల్‌ ట్రై చేస్తున్నారు. ‘‘ఇది పెప్పీ నంబర్‌. సినిమాలో మొదటి సాంగ్‌. చాలా సై్టల్‌గా ఉండటం కోసం సెపరేట్‌ లైటింగ్‌ స్కీమ్‌తో సెట్‌ వేసాం’’ అని ఆర్ట్‌ డైరక్టర్‌ ఏయస్‌ ప్రకాష్‌ చెప్పారు. అన్నట్లు రాంబాబుకి లవర్‌ లేదా? లేకేం. ఉందండి. ఇందులో మియా జార్జ్‌ కథానాయికగా నటిస్తున్నారు. రాంబాబు ఈవిడగారికి ఉంగరం తొడగటానికి చాలా ఫీట్లే చేస్తాడేమో. ఈ సమ్మర్‌లోనే రాంబాబు సందడి చేయడానికి రాబోతున్నాడు.

Saturday, February 18, 2017

హీరోయిన్‌ను కారులో బందీగా చేసి..

  దక్షిణాది హీరోయిన్ భావనను కొందరు దుండగులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. శుక్రవారం రాత్రి కేరళలోని కోచిలో ఈ ఘటన జరిగింది. చివరకు ఆమె సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఈ కేసులో పోలీసులు భావన కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
నిన్న కేరళలోని త్రిస్సూర్ నుంచి కోచికి భావన కారులో బయల్దేరింది. కొంతమంది ఓ టెంపులో భావన కారును ఫాలో అయ్యారు. కోచిలోని నెడుంబస్సెరీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు రాగానే భావన కారును టెంపుతో ఢీకొట్టారు. ఆ తర్వాత టెంపులో ఉన్నవారు కారు డ్రైవర్ మార్టిన్‌ను బయటకు లాగి కారులో కూర్చున్నారు. దుండగులు భావనను బందీగా చేసుకుని కారును నగరంలో గంటన్నర పాటు తిప్పారు. ఆ సమయంలో దుండగులు భావన పట్ల అనుచితంగా ప్రవర్తించి ఆమెతో ఫొటోలు, వీడియోలు దిగారు. ఆ తర్వాత పలరివట్లోమ్ జంక్షన్ వద్ద కారును, ఆమెను వదిలి పారిపోయారు. భావన కారును నడుపుకొంటూ దగ్గరలో ఉన్న ఓ నిర్మాత ఇంటికి వెళ్లి విషయం చెప్పింది.

భావన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో ఆమె కారు డ్రైవర్ మార్టిన్ పాత్ర ఉండొచ్చని భావిస్తున్నారు. భావన వద్ద గతంలో కారు డ్రైవర్‌గా పనిచేసిన సునీల్ కుమార్ ఆమెను కిడ్నాప్ పథకం వేసినట్టు పోలీసులు చెప్పారు. అతనిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడనే కారణంతో భావన అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. మార్టిన్‌కు తెలిసే సునీల్ భావనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినట్టు పోలీసులు చెప్పారు.

భావన తెలుగులో ఒంటరి, హీరో, మహాత్మా, నిప్పు సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మొత్తం 70 సినిమాల్లో నటించింది.

Friday, February 17, 2017

రివ్యూ : ఘాజీ


  కథేంటంటే..?: 1971లో ఇండియన్‌ సబ్‌మెరైన్‌ ఎస్‌ 21కీ.. పాకిస్థానీ జలంతర్గామి ఘాజీకీ మధ్య జరిగే నీటి యుద్ధం ఈ కథ. లెఫ్టినెంట్‌ కమాండర్‌ అర్జున్‌ (రానా).. కెప్టెన్‌ రణ్‌ విజయ్‌సింగ్‌ (కె.కె.మీనన్‌)లు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి విశాఖపట్నం తీరాన్ని ఎలా కాపాడారు? 18 రోజుల పాటు నీటిలో జరిపిన పోరాటంలో పాక్‌ జలాంతర్గామి ఘాజీని ఎలా మట్టికరిపించారు? అనేదే కథ.
ఎలా ఉందంటే..?: ఇండియా - పాక్‌ యుద్ధమంటే మనందరికీ కార్గిల్‌ యుద్ధం.. లేదంటే అంతకు ముందు జరిగిన కొన్ని యుద్ధాలే తెలుసు. సముద్ర గర్భంలోనూ ఇండియా - పాక్‌లు హోరాహోరీగా తలపడ్డాయని, ఆ యుద్ధంలో భారతీయ సైనికులు ధృఢచిత్తంతో శత్రువుల్ని ఎదుర్కొని విజయం సాధించారన్న చరిత్రకు ‘ఘాజీ’ అద్దం పట్టింది.
ఈ సినిమాలో దాదాపు 90 శాతం సన్నివేశాలు కేవలం సబ్‌మెరైన్‌లోనే తీశారు. కంటికి సబ్‌ మెరైన్‌ తప్ప ఇంకేం కనిపించదు. అయినా సరే.. విసుగు అనిపించదు. తరవాతేం జరుగుతుందన్న ఉత్కంఠ తప్ప. మనదేశం పాకిస్థాన్‌పై విజయం సాధిస్తుందన్న సంగతి తొలి సన్నివేశంలోనే అర్థమైపోతుంది. కానీ ‘ఎలా’ అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించడంలో దర్శకుడు సఫలీకృతమయ్యాడు. దేశభక్తి నేపథ్యంలో సాగే చిత్రాల్లో.. ప్రేక్షకుల్ని కనెక్ట్‌ చేయడం తప్పనిసరి. అప్పుడే తెరపై ప్రధాన పాత్రలు ఎంత భావోద్వేగంతో రగిలిపోతాయో.. ప్రేక్షకుల్లోనూ అలాంటి స్పందనే కలుగుతుంటుంది. ఈ విషయంలోనూ దర్శకుడు విజయం సాధించాడు. శత్రువుల నుంచి మన సబ్‌మెరైన్‌ని కాపాడుకొనే సందర్భంలో.. ఘాజీని మట్టుపెట్టినప్పుడు ప్రతి ప్రేక్షకుడూ మనసులో ‘జైహింద్‌’ అనుకోకుండా ఉండలేడేమో..?!
 
అతి తక్కువ పాత్రలతో.. ‘యుద్ధం’ అనే ఒకే లైన్‌తో రెండు గంటలు కూర్చోబెట్టడం.. పట్టుసడలని స్క్రీన్‌ప్లేతోనే సాధ్యమైంది. అక్కడక్కడ నేవీకి సంబంధించిన సాంకేతిక పదాలు ప్రేక్షకులకు అర్థం కావు. కానీ.. అవేవీ ఇబ్బందిని కలిగించవు. కథని.. తెరపై ఉన్న వాతావరణాన్నీ అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఒక్కసారి వాతావరణం అలవాటైన తర్వాత.. శుభం కార్డు పడేంత వరకూ తెరపై నుంచి చూపు మరల్చకుండా చేయటంలో విజయవంతమైంది చిత్ర బృందం.
ఎవరెలా చేశారంటే..?: ఈ సినిమాలో పాత్రలు తప్ప పాత్రధారులెవ్వరూ కనిపించనట్లుగా ఉంది. రానా ఈ కథని.. ఈ పాత్రనీ ఏరికోరి ఎందుకు చేశాడో సినిమా చూస్తే అర్థమైపోతుంది. కెకె మీనన్‌ పాత్రని ప్రేమిస్తాం. అతను తెరపై ఇంకాసేపు ఉంటే బాగుణ్ణు అనుకొంటాం. తాప్సిని ఎందుకు తీసుకొన్నారో అర్థం కాదు. ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. ఓంపురి.. నాజర్‌లవి చాలా చిన్న పాత్రలు.
కె అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోసింది. మనం కూడా నీటిలో ఉన్నామేమో అనే భావన కేవలం నేపథ్య సంగీతంతోనే కలిగించారు. మది కెమెరా పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న చిత్రమే అయినా... చిన్న సబ్‌మెరైన్‌ సెట్లో.. కెమెరాని పరుగులు పెట్టించాడు. సంకల్ప్‌ ఆలోచన.. అతని స్క్రీన్‌ ప్లే ‘ఘాజీ’ని ఓ మర్చిపోలేని చిత్రంగా మలిచాయి.
 

Wednesday, February 15, 2017

లేడీ గెటప్.. నాకు అన్నం పెట్టింది


సినిమాలపై మోజుతో ఓ యువకుడు ఇంట్లో చెప్పకుండా కృష్ణానగర్‌ వచ్చి అనేక కష్టాలకు ఓర్చి ఓ సినిమా కార్యాలయంలో ఆఫీస్‌ బాయ్‌గా చేరి తన లక్ష్యానికి చేరువయ్యాడు. ఈ ప్రస్థానంలో ఆ యువకుడు లేడీ గెటప్‌తో ఆకట్టుకుంటూ బుల్లితెరపై వెలుగుతున్నాడు. నటనపై మక్కువతో 15 ఏళ్లుగా సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తనకు అచ్చొచ్చిన ఆడపాత్రలో బుల్లితెరపై నవ్వులు పూయిస్తున్నాడు. అతడే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన కె.శాంతికుమార్‌. వాస్తవంగా శాంతికుమార్‌ అంటే ఎవరికీ తెలియదు. లేడీ గెటప్‌లో ‘శాంతి స్వరూప్‌’గా మాత్రమే సుపరిచితుడు. తనదైన మేనరిజంతో సందడి చేస్తూ అలరిస్తున్న ఈ బక్కపల్చటి యువకుడు తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. ఆ వివరాలు అతడి మాటల్లోనే.. 
  అర్ధాకలితో అలమటించా..
సినిమా మోజుతో కృష్ణానగర్‌లో మకాం పెట్టి చాలా కష్టాలు ఎదుర్కొన్నా. కొన్ని రోజులు నీళ్లతోతోనే కడుపు నింపుకోవాల్సి వచ్చింది. తర్వాత ఓ సినిమా కార్యాలయంలో రూ.1000 జీతంతో ఆఫీస్‌ బాయ్‌గా పనిచేస్తూ స్టూడియోల చుట్టూ ఒక్కచాన్స్‌ అంటూ తిరిగాను. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తచ్చాడుతున్న నన్ను జబర్దస్త్‌ కమెడియన్స్‌ రాఘవ, రచ్చ రవి చూశారు. నటనపై నాకున్న మక్కువను వారి దృష్టికి తీసుకెళితే.. తమ జట్టులో ఓ అవకాశం ఇచ్చారు. శాంతిగా కామెడీ టైమింగ్‌తో మంచి మార్కులు పడ్డాయి. దాంతో అవకాశాలు వచ్చాయి.
ఇప్పటి వరకూ 80 స్కిట్స్‌..
వచ్చేవన్నీ లేడీ గెటప్‌లే. అయినా సరే.. ఈ శాంతి ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. దాదాపు అన్ని చానళ్లలోనూ ఆ గెటప్‌లోనే కనిపిస్తున్నా. మొన్నటి దసరా మహోత్సవం స్కిట్‌లో యాంకర్‌ శ్రీముఖిని అనుసరిస్తూ చేసిన డ్రామా ప్రేక్షకులకు ఆకట్టుకుంది. నా శరీరతత్వం.. లేడీ గెటప్‌లో నా వేషధారణతో అన్ని టీంలవారు ప్రోత్సహిస్తూ వారి స్కిట్‌లో అవకాశం ఇస్తున్నారు. ఒక్కసారి మొహానికి రంగు వేసుకున్నాక.. ఏ నటుడన్నా ఏ పాత్ర వేయడానికైనా సిద్ధంగా ఉంటాడు.. నేనూ అంతే. 
  నా చీరలు బాగుంటాయట.. 
ఇటీవల ప్రైవేట్‌ ప్రోగ్రామ్స్‌ ఇవ్వడానికి వెళుతున్నా. అక్కడ నన్ను చూసిన చాలామంది మగవాళ్లే మీ చీరలు బాగుంటాయని కితాబిస్తున్నారు. నా భార్యకు కూడా చీరల సెలక్షన్‌లో ఇంత ప్రావీణ్యం లేదంటూ వాళ్ల ముందే నన్ను పొగుడుతుంటారు. అది  నాకు చాలా సంతోసంగా ఉంటుంది.
ఆడీ లేదు.. ఆనందం ఉంది
నాకు ఆడీ కారుందని, పెద్ద ఇల్లు ఉందని ఇటీవల సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అవన్నీ నిజం కాదు.. ఆఫీస్‌ బాయ్‌గా పనిచేస్తున్నప్పుడు పైసాపైసా దాచుకుని ఓ స్కూటీ కొనుకున్నా. నాకున్నది అదొక్కటే. ఆడి కారు లేదు కానీ నా కష్టాలు మరిచిపోయేలా రెండు పూటలా తిండికి, ఇంటి అద్దె చెల్లించే స్తోమత మాత్రం జబర్దస్త్‌ ఇచ్చింది. 

Tuesday, February 14, 2017

‘సింగం-4’ చేస్తా: సూర్య

 సూర్య కథానాయకుడిగా ‘సింగం’ సిరీస్‌లో వచ్చిన చిత్రం ‘ఎస్‌3’. అనుష్క, శ్రుతిహాసన్‌ కథానాయికలు. హరి దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మంగళవారం హైదరాబాద్‌లో చిత్ర విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్‌. ఎందుకంటే విడుదల తేదీ ఇప్పటికే చాలా సార్లు మారింది. సినిమా ఎప్పుడు విడుదలవుతుందనేది మన చేతుల్లో లేదు. నేను చాలా కంగారు పడ్డాను. కానీ ప్రేక్షకుల చిత్రాన్ని ఆదరించారు. దక్షిణాదిన ఏటా సుమారు వెయ్యికు పైగా సినిమాలు విడుదలవుతుంటాయి. అందులో ఏడు శాతం మాత్రమే విజయం సాధిస్తుంటాయి. అందుకే ప్రతి నటుడికీ హిట్‌ అనేది ప్రత్యేకం. మా నాన్నగారు నన్ను ఆలింగనం చేసుకొని అభినందించటం చాలా అరుదైన విషయం. అలాంటిది ఆయన ఈ సినిమా చూసి నన్ను ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. అంతకంటే సంతోషకరమైన విషయం ఇంకేముంటుంది. అందుకే దర్శకుడు హరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ఆయనతో మరో సినిమా చేస్తాను. సింగం సిరీస్‌ను కొనసాగించే అవకాశాలూ ఉన్నాయి. అన్నీ కుదిరితే ‘సింగం 4’తో వస్తాం. కానీ దానికి ఐదారేళ్లు పట్టొచ్చు.’ అన్నారు.
దర్శకుడు హరి మాట్లాడుతూ.. ‘గతంలో వచ్చిన ‘సింగం’ చిత్రాలలాగానే దీనికి కూడా చాలా కష్టపడినట్లు తెలిపారు. తనకు ఎన్టీఆర్‌ నటించిన ‘టెంపర్‌’ చిత్ర‌మంటే ఎంతో ఇష్టమని అన్నారు. ఆయనతో కలిసి ఓ పవర్‌ఫుల్‌ చిత్రాన్ని చేయాలనుకొంటున్నట్లు వెల్లడించారు.

Monday, February 13, 2017

రేపు తేలనున్న శశికళ రాజకీయ భవితవ్యం!

  అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ రాజకీయ భవితవ్యం మంగళవారం తేలనుంది. శశికళపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు రేపు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఈ కేసులో శశికళ నిర్దోషిగా తేలితే ముఖ్యమంత్రి కావడానికి న్యాయపరమైన చిక్కులు ఉండవు. ఒకవేళ శశికళకు శిక్షపడితే ముఖ్యమంత్రి కావాలన్న ఆశలు ఆవిరైనట్టే. ఆమె జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. మరో ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హురాలవుతారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దివంగత జయలలితతో పాటు ఆమె నెచ్చెలి శశికళ కూడా నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో జయలలిత, శశికళను కర్ణాటకలోని దిగువ కోర్టు దోషులుగా ప్రకటించింది. దీంతో జయలలిత అప్పట్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. వీరిద్దరూ కొన్ని రోజులు జైల్లో గడిపారు. తర్వాత ఈ తీర్పును సవాల్‌ చేస్తూ జయలలిత  కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కిందికోర్టు తీర్పును హైకోర్టు కొట్టేయడంతో జయలలిత మళ్లీ సీఎం అయ్యారు. కాగా హైకోర్టు తీర్పును కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ నేపథ్యంలో రేపు సుప్రీం కోర్టు వెలువరించే తీర్పుపై తమిళనాట ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Saturday, February 11, 2017

ఒక్క సినిమాలో 29 పాటలు

 ప్రస్తుతం సినిమా స్టైల్, ఆడియన్స్ టేస్ట్ పూర్తిగా మారిపోయింది. గతంలోలా ఆరుపాటలు, ఐదు ఫైట్లు అన్న కాన్సెప్ట్ మారిపోయింది. అవసరం ఉంటేనే సినిమాల్లో పాటలు పెడుతున్నారు. అది కూడా మూడు నిమిషాలకే ముగించేస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో కూడా పాటల పందిరి లాంటి సినిమా ఒకటి ప్రేక్షకుల ముందుకు రానుంది.
కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదరుచూస్తున్న బాలీవుడ్ యువ నటుడు రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా జగ్గా జాసూస్. రణబీర సరసన కత్రినాకైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఏకంగా 29 పాటలున్నాయట. గతంలో 'హమ్ ఆప్ కే హై కౌన్' సినిమాలో 14 పాటలుండగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి జగ్గా జాసూస్ లో 29 పాటలు పెట్టారు మేకర్స్. ఈ సినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు.

Friday, February 10, 2017

ఓం నమో వేంకటేశాయ


మర్షియల్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తూ వచ్చిన కె.రాఘవేంద్రరావు తనలోని మరో కోణాన్ని చూపిస్తూ భక్తి ప్రధానమైన చిత్రాల్ని తెరకెక్కిస్తున్నారు. వాటిలోనూ తనదైన మార్క్‌ని చూపిస్తూ ఆబాల గోపాలాన్ని అలరిస్తున్నారు. అందులో భాగంగా రూపుదిద్దుకొన్న చిత్రమే ‘ఓం నమో వేంకటేశాయ’. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడిసాయి’ చిత్రాల తర్వాత రాఘవేంద్రరావు-నాగార్జున కలయికలో వస్తున్న చిత్రమిది. వేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడైన హథీరాం బాబాజీ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాను తీస్తే రాఘవేంద్రరావే తీయాలి.. చేస్తే నాగార్జునే చేయాలి అన్నట్టుగా ఆ ఇద్దరూ భక్తి ప్రధానమైన చిత్రాలపై ఓ ప్రత్యేకమైన ముద్రవేశారు. అందుకే ‘ఓం నమో వేంకటేశాయ’కి కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే అంచనాలు షురూ అయ్యాయి. మరి ఆ మేజిక్‌ మరోసారి తెరపై కనిపించిందా? శ్రీవారి భక్తుడు ‘అన్నమయ్య’గా ఒదిగిపోయిన నాగార్జున, హథీరాం బాబాగా ఎలా నటించాడు.. లాంటి ప్రశ్నలకు సమాధానాలు..
కథేంటంటే?: దేవుడిని చూసే విద్య నేర్చుకోవాలంటూ బాల్యంలోనే ఇంటి నుంచి బయటకొస్తాడు రామ(నాగార్జున). వేద పాఠశాలలో విద్యనభ్యసిస్తూ గురువు(సాయికుమార్‌) చెప్పిన మాటతో తపస్సుకు పూనుకుంటాడు. ఆ తర్వాత తిరుమల చేరతాడు. కానీ స్వామి దర్శనం మాత్రం కాదు. దేవుడ్నే చూడాలంటూ అన్న, పానీయాలు లేకుండా అయిదురోజుల పాటు గుడిముందే కూర్చుంటాడు. స్వామికోసమే ఈ జీవితం అంటూ సదా ఆయన ఆరాధనలో మునిగి తేలుతుంటాడు. అలాంటి పరమ భక్తుడికి స్వామి దర్శన భాగ్యం కలిగిందా? లేదా? తిరుమలలో ఆలయ అధికారి గోవిందరాజులు(రావు రమేష్‌) రామపై ఎందుకు కక్ష కట్టాడు? రామను పరీక్షించేందుకు స్వామి ఏం చేశాడు? ఆ ప్రయత్నంలో రామ జీవితంలో ఎదురైన అనుభవాలు ఎలాంటివి? ఆయన్ని మనువాడాలనుకొన్న భవానీ (ప్రగ్యాజైస్వాల్‌) కథేంటి? రామ కోసం ఆమె చేసిన త్యాగం ఎలాంటిది? శ్రీవారికి మరో భక్తురాలైన కృష్ణమ్మ(అనుష్క)కి రామకి మధ్య సంబంధం ఏమిటి? రామ.. హథీరాం బాబాగా ఎలా మారాడు? తదితర విషయాల్ని తెలుసుకోవాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే.

  ఎలా ఉందంటే: భక్తికున్న శక్తితో వేంకటేశ్వరస్వామిని మురిపించిన మరో పరమ భక్తుడు హథీరాం బాబా కథ ఇది. బాల్యంలోనే స్వామిని ప్రత్యక్షంగా చూడాలంటూ బయటకొచ్చిన హథీరాం తిరుమలను కలియుగ వైకుంఠంగా మార్చడంలో కృషి ఎలాంటిది? స్వామి వారి చేతుల మీదుగానే సజీవ సమాధి ఎలా అయ్యాడు? తదితర విషయాలతో ఈ చిత్రం సాగుతుంది. వేంకటాచల స్థలపురాణం, హథీరాంబాబా, కృష్ణమ్మల భక్తి నేపథ్యంలో తొలిసగ భాగం సాగుతుంది. భక్తులపై జరుగుతున్న దోపిడీని అడ్డుకుంటూ తిరుమలను పరమ పవిత్రంగా ఉంచేందుకు హథీరాం బాబా ప్రయత్నించడం, స్వామి భక్తులకు పుణ్య క్షేత్రం విశిష్టతను చాటిచెప్పడం తదితర సన్నివేశాలతో చిత్రం సాగుతుంది. అధికారి గోవిందరాజులు, ఆయన బృందం చేసే అరాచకాలను అడ్డుకుంటూ హథీరాం బాబా స్వామి సేవలో పునీతమయ్యే తీరును తెరపై కళ్లకు కట్టారు.
ఎవరెలా: ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’లా భక్తుల పాత్రలో ఒదిగిపోయిన నాగార్జున హథీరాం బాబాగా నటించి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సౌరభ్‌జైన్‌ వేంకటేశ్వరుడిగా చక్కగా నటించాడు. కృష్ణమ్మగా అనుష్క పాత్ర చాలా కీలకం. పతాక సన్నివేశాల వరకూ ఆమె తెరపై కనిపిస్తూనే ఉంటుంది. వేంకటేశ్వరస్వామి భక్తురాలిగా పవిత్రత ఉట్టిపడేలా తెరపై కన్పించింది. నాగార్జున కూడా పాత్రలో లీనమై నటించారు. పతాక సన్నివేశాల్లో ఆయన నటన మరోస్థాయికి చేరిందనే చెప్పాలి. జగపతిబాబు, ప్రగ్యాజైస్వాల్‌లాంటి నటులు తెరపై కనిపించేది కాసేపే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. రావురమేష్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌ తదితర పాత్రలు వినోదాన్ని పంచుతాయి.
సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. ఎస్‌.గోపాల్‌రెడ్డి కెమెరా పనితనం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. ముఖ్యంగా శేషగిరులను చూపించిన విధానం, ప్రతీ సన్నివేశం వర్ణ రంజితంగా ఉంటుంది. కీరవాణి సంగీతం కథకు ప్రాణం పోసింది. చాలా వరకూ కథ పాటల రూపంలోనే చెప్పారు. ఆ సమయంలో కీరవాణి అందించిన స్వరాలు కీలక పాత్ర పోషించాయి. నేపథ్య సంగీతం కథను మరింత గుండెకు హత్తుకునేలా మార్చింది. కిరణ్‌కుమార్‌ కళా ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది. దర్శకుడిగా కె.రాఘవేంద్రరావు మరోసారి తనదైన మేజిక్‌ను ప్రదర్శించారు. నాగార్జున-ప్రగ్యాజైస్వాల్‌, జగపతిబాబు-అనుష్కలపై తెరకెక్కించిన సన్నివేశాలు భక్తిరస చిత్రంలోనూ కె. రాఘవేంద్రరావు మార్కు కమర్షియల్‌ ఛాయలు స్పష్టంగా కనిపించేలా చేస్తాయి. మిగిలిన చోట్ల కూడా పండ్లు, దీపాలు, పుష్పాలతో తెరను వర్ణ శోభితం చేశారు. కథను చెప్పిన విధానం కూడా చాలా బాగుంది. హథీరాం, కృష్ణమ్మల జీవితాలతో పాటు ఆలయ స్థలపురాణం, వరాహమూర్తి దర్శనం, స్వామివారికి చేసే సేవల విశిష్టతలను సినిమాలో చూపించిన విధానం తెలియని వారికి ఎన్నో విషయాలను తెలియజేస్తుంది.
 
 

Thursday, February 9, 2017

రివ్యూ: ఎస్‌3 (యముడు 3)


కథేంటంటే?: సింగం సిరీస్‌ తొలి భాగం ‘సింగం’ పల్లెటూరి నేపథ్యంలో సినిమా సాగుతుంది. తర్వాత భాగం ‘సింగం 2’ సింగం (సూర్య) పట్టణానికి వస్తాడు. మూడో భాగం ‘సింగం 3’లో పట్టణం నుంచి ఆస్ట్రేలియా వెళ్తాడు. ఒక పోలీసు కమిషనర్‌ హత్యకు సంబంధించిన విచారణ చుట్టూ సాగే కథ ఇది. నిజాయతీ గల పోలీసు అధికారి సిడ్నీలో ఇండియన్‌ పోలీసు పవర్‌ ఎలా చూపించాడన్నది కథ. కథలో కావ్య (అనుష్క).. విద్య (శ్రుతిహాసన్‌)ల మధ్య ఉన్న సంబంధం ఏంటి అన్నది కూడా ఆసక్తికరంగా ఉంటుంది.
ఎలా ఉందంటే?: ఈ సినిమా కేవలం యాక్షన్‌ ప్రియుల్ని దృష్టిలో ఉంచుకునే తీర్చిదిద్దారు దర్శకుడు హరి. అందుకు సంబంధించిన సన్నివేశాలు మాస్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. సూర్య పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు.. మేనరిజం.. ఫైట్లపై దర్శకుడు దృష్టి పెట్టారు. తొలి భాగం నిదానంగా సాగుతుంది. అనవసరంగా ఇరికించిన కామెడీ సన్నివేశాలు కాస్త ఇబ్బంది పెడతాయి. అనుష్క.. సూర్యల మధ్య నడిపించిన ట్రాక్‌ కూడా కథలో ఇమడనట్లుగా ఉందనిపిస్తుంది.
విశ్రాంతికి 20 నిమిషాల ముందు నుంచి థ్రిల్‌ కలిగించే సన్నివేశాలు మొదలవుతాయి. దాంతో ప్రేక్షకుడికి ఆసక్తి మొదలవుతుంది. ఆ నేపథ్యంలో వచ్చే పోరాట ఘట్టాలు అలరిస్తాయి. ద్వితీయార్ధం ప్రారంభంలో సన్నివేశాల్ని పరుగులు పెట్టించాడు దర్శకుడు. సిడ్నీ నేపథ్యంలో సాగిన యాక్షన్‌ ఘట్టాలు ఆకట్టుకుంటాయి. ఛేజింగ్‌లు.. సూర్య చేసిన ఫైట్లు.. పోలీసు పవర్‌ను చూపించిన డైలాగ్‌లు ఇవన్నీ కలిసి ఓ యాక్షన్‌ ప్యాకేజీలా దర్శకుడు చూపించాడు.
 ఆస్ట్రేలియాలో జరిగే సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. మొత్తంగా చూస్తే ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం పట్టుగా సాగింది. కాకపోతే దర్శకుడు తొలి రెండు భాగాల్లో చూపించిన చాకచక్యం ఈ సినిమాలో చూపించలేకపోయాడు. కథ బలహీనంగా ఉండటం.. హీరో పాత్రపై తప్ప మరే పాత్రపైనా దృష్టి పెట్టకపోవడం నిరాశకు గురి చేస్తాయి. ‘వైఫై..’ పాట కోసం మాత్రమే శ్రుతిహాసన్‌ను తీసుకున్నారా.. అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు మామూలుగా సాగాయి.
 
ఎవరెలా చేశారంటే: సూర్య కోసమే ఈ సినిమా తీశారా.. అనేలా ఉంది. మరోసారి శక్తిమంతమైన పోలీసు పాత్రలో సూర్య రాణించారు. సూర్య గెటప్‌.. తను చేసిన పోరాట దృశ్యాలు ఆకట్టుకుంటాయి. అనుష్క మరీ లావుగా కనిపించింది. ఈ విషయంలో తాను జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఆమె పాత్రకు అంత ప్రాముఖ్యత లేదు. శ్రుతిహాసన్‌ది కేవలం గ్లామర్‌ పాత్ర మాత్రమే. విలన్‌ పాత్రల్ని పోషించిన వారిని దర్శకుడు స్టైలిష్‌గా చూపించాడు. రాధిక నటన ఆకట్టుకుంటుంది.
చివరగా.. యాక్షన్‌ ప్రియులకు ‘ఎస్‌’3 

Tuesday, February 7, 2017

‘నేను లోకల్‌’


వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్నాడు నాని. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, కృష్ణగాడివీర ప్రేమ‌గాథ‌, జెంటిల్‌మ‌న్‌, మజ్ను... ఇలా ఆయ‌న జోరు కొన‌సాగుతూఉంది. ప‌లువురు స్టార్ ద‌ర్శ‌కులు నానితో క‌లిసి ప‌నిచేయ‌డానికి ఉత్సాహం చూపించినా ఆయ‌న మాత్రం మ‌ళ్లీ త‌న‌దైన శైలిలోనే కంటెంట్‌కి ప్రాధాన్య‌మిస్తూ నేను లోక‌ల్‌` చేశాడు. వ‌రుస విజ‌యాల నాని.. దిల్‌రాజు నిర్మాణ సంస్థ‌... దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం... ఇలా విడుద‌ల‌కి ముందే ప్రేక్ష‌కుల్ని ఆక‌ర్షిస్తూ అంచ‌నాల్ని పెంచిందీ చిత్రం. మ‌రి సినిమా అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్టుగానే ఉందా? నాని విజ‌యాల జోరు కొన‌సాగిన‌ట్టేనా? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటేరివ్యూలోకి వెళ్లాల్సిందే...
కథేంటి: ఇంజినీరింగ్‌ పూర్తి చేసి, సరదా సరదాగా తిరిగే కుర్రాడు బాబు(నాని). తనలాగే తాను జీవించాలనే భావాలున్న వ్యక్తి. ఎవరికోసం తనని తాను మార్చుకోడు. కీర్తి(కీర్తిసురేష్‌)ని తొలిసారి చూడగానే మనసు పారేసుకుంటాడు. తన ప్రేమ విషయం చెబితే అందుకు కీర్తి నో చెబుతుంది. ‘నువ్వు ప్రేమించే వరకూ విసిగిస్తా’నని బాబు ఆమె వెంటపడుతుంటాడు. ఈ క్రమంలో అతని మనసును తెలుసుకున్న కీర్తి ప్రేమలో పడుతుంది. ఆ విషయం రేపు ‘మనం కలుసుకున్నప్పుడు’ చెబుతానని బాబుతో అంటుంది. ఈ నేపథ్యంలో కీర్తి కిడ్నాప్‌నకు గురవుతుంది. ఈ విషయం తెలుసుకున్న బాబు ఆమెను రక్షించేందుకు వెళ్లగా, అక్కడ అప్పటికే పోలీస్‌ అధికారి సిద్ధార్థ వర్మ (నవీన్‌ చంద్ర) రౌడీలను చితకబాదుతాడు. కీర్తిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానని, ఆమె జోలికి ఎవరైనా వస్తే చంపేస్తానంటూ వార్నింగ్‌ ఇస్తాడు. అప్పుడే అక్కడకు వచ్చిన బాబు రియాక్షన్‌ ఏంటి? బాబు, కీర్తిల ప్రేమ కథ సుఖాంతం అయిందా? పోలీస్‌ అధికారి సిద్ధార్థ వర్మ కథ ఏమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 ఎలా ఉందంటే?: నాని సినిమా అంటే కుటుంబం మొత్తం హాయిగా చూసే సినిమా అని ఓ మార్కు ఉంది. ఈసారి కూడా అదే ట్రాక్‌లో నడిచాడు నాని. ప్రథమార్ధం నాని-కీర్తి సురేష్‌ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలతో సరదా సరదాగా గడిచిపోతుంది. ఇక నాని తల్లిదండ్రుల పాత్రలను పోసాని కృష్ణమురళి, ఈశ్వరిరావు పోషించారు. ఈ ముగ్గురి మధ్య వచ్చే సన్నివేశాలూ కడుపుబ్బా నవ్విస్తాయి. కీర్తి సురేష్‌ తన అందాలతో మరోసారి అలరించింది. సిద్ధార్థ వర్మ పాత్ర ప్రవేశంతో సరదాగా సాగే కథ ఓ కీలక మలుపు తీసుకుంటుంది. విరామానంతరం వచ్చే సన్నివేశాలు అన్నీ సిదార్థ వర్మ, బాబు నేపథ్యంలో సాగుతాయి. కీర్తిని ప్రేమించిన ఇద్దరూ వాళ్ల మనసుల్లో ప్రేమను ఎలా బయట పెట్టారు? కీర్తి ఎవరిపై ఎలా మొగ్గు చూపుతుంది అనే విషయాలు ఆకట్టుకునేలా సాగిపోతాయి. అయితే ఎవరి ప్రేమలో ఎంత బలముందో నిరూపించాల్సిన సమయంలో సిద్థార్థ వర్మ ప్రయత్నాలు పెద్ద ఎత్తున సాగగా, బాబు ‘నేనేం చేయను’ అంటూ చెప్పే సన్నివేశాలు సాగతీతగా అనిపిస్తాయి. కథ ఎంతకీ ముందుకు సాగకపోవడంతో ప్రేక్షకుడిని ఒకింత అసహనానికి గురిచేస్తాయి. మళ్లీ పతాక సన్నివేశాల రాకతో కథ ఆసక్తికరంగా మారుతుంది. ద్వితీయార్ధం నుంచి ముక్కోణపు ప్రేమ కథలా ఒక అమ్మాయి.. ఇద్దరు అబ్బాయిల మధ్య సాగేపోయేలా సన్నివేశాలు ఉన్నాయి. చివరిలో కూడా ఓ కీలకమైన మలుపు ఉండటంతో కథ రక్తి కట్టిస్తుంది. కథ కొత్తది కాకపోయినా కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం తెరపై కనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే: నాని తన నటనతో వన్‌మ్యాన్‌ షోలా ఆకట్టుకున్నాడు. సంభాషణలు పలికే సమయంలో తనకున్న ఈజీనెస్‌ను మరోసారి ప్రదర్శించాడు. ప్రతీ సన్నివేశంలోనూ సంభాషణలు పలికే విధానంలోనూ రజనీకాంత్‌ను అనుసరించినట్టు స్పష్టంగా అర్థమవుతుంటుంది. ఇదో ప్రేమ కథ అయినా మాస్‌ అంశాలు ఉండటంతో నాని రజనీని అనుసరించే ప్రయత్నం చేశాడు. కీర్తి అందంగా కన్పించింది. ఆమెకు నటనా ప్రాధాన్యం ఉన్న పాత్ర లభించింది. సిద్ధార్థ వర్మగా నవీన్‌చంద్ర ద్వితీయార్థంలో కనిపిస్తాడు. అతనికీ మంచి పాత్రే దక్కింది. సాంకేతికంగా మంచి మార్కులు పడతాయి. ప్రసన్నకుమార్‌ మాటలు, త్రినాథరావు దర్శకత్వం వారి వారి శైలిలో సాగుతాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చింది. పాటలన్నీ అలరిస్తాయి. ‘దిల్‌’రాజు నిర్మాణ విలువలు అడుగడుగునా కనిపిస్తాయి.
చివరిగా: ‘లోకల్‌’ కుర్రాడి ప్రేమకథ