Tuesday, January 29, 2019

టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల


 ఆస్ట్రేలియాలో 2020లో నిర్వహించే పురుషుల, మహిళల ప్రపంచ కప్‌ టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌ జట్లు ఉన్న కఠినమైన గ్రూప్‌ 2లో కోహ్లీ సేనను చేర్చారు. ఈ గ్రూప్‌లో ఆ మూడు జట్లతోపాటు మరో రెండు అర్హత సాధించే జట్లు ఉండనున్నాయి. దక్షిణాఫ్రికాతో టీమిండియా తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. మరో వైపు భారత మహిళల జట్టును గ్రూప్‌ ఏలో చేర్చారు. తొలి మ్యాచ్‌లోనే భారత్‌ కఠిన జట్టును ఎదుర్కోనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌, ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది. 


             ఆస్ట్రేలియాలో తొలిసారిగా మహిళల, పురుషుల టీ20 ప్రపంచ కప్‌లను ఒకే ఏడాది, ఒకే దేశంలో నిర్వహిస్తున్నారు. ఈ రెండు టోర్నీల ఫైనల్‌ మ్యాచ్‌లను మెల్‌బోర్న్‌ స్టేడియంలోనే నిర్వహించనుండటం విశేషం. మహిళల ప్రపంచ కప్‌లో మొత్తం పది జట్లు 23 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, భారత్‌ తలపడనున్నాయి. ఇక పురుషుల ప్రపంచకప్‌ అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు జరగనుంది.