Thursday, October 17, 2019

విడాకులు తీసుకున్న మనోజ్‌ దంపతులు

 ప్రముఖ నటుడు మంచు మోహన్‌ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్‌ తన భార్య ప్రణతీ రెడ్డితో విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. దీనిపై మనోజ్‌ ఓ లేఖను ట్విటర్లో పోస్ట్‌ చేశారు. ''నా వ్యక్తిగత జీవితం, కెరీర్‌ గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. నేను విడాకులు తీసుకున్న విషయాన్ని బాధతో మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఒక అందమైన, గొప్ప అనుబంధానికి ముగింపు పలికాం. మా ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో మానసికంగా ఎంతో ఇబ్బందిపడ్డాం. దీనిపై సుదీర్ఘమైన ఆత్మపరిశీలన చేసుకున్న తర్వాత విడివిడిగా జీవించాలని నిర్ణయించుకున్నాం. మున్ముందు కూడా మేమిద్దరం ఒకరినొకరు గౌరవించుకుంటూ సహకరించుకోవాలనుకుంటున్నాం. ఈ నిర్ణయాన్ని మీరంతా సమర్ధిస్తారని, మా ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు'' అని మనోజ్‌ భావోద్వేగంతో లేఖలో పేర్కొన్నాడు.

నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న మనోజ్‌, ప్రణతి మధ్య సరైన సంబంధాలు లేవని, ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో ఆమె తన పుట్టింటికి అమెరికా వెళ్లిపోయిందని గతేడాది వార్తలు వచ్చాయి. ఐతే అవన్నీ పుకార్లేననని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మనోజ్‌ క్లారిటీ ఇచ్చారు. తాజాగా తామిద్దరం కలిసుండటం లేదని, విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా సోషల్‌మీడియాలో వెల్లడించారు మనోజ్‌. ఫ్యామిలీ ఫ్రెండ్‌ ప్రణతిని ప్రేమించిన మనోజ్‌ పెద్దల అంగీకారంతో 2015లో వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కొన్నాళ్ల నుంచే వీళ్లిద్దరూ విడివిడిగా ఉంటున్నారని కొన్నేండ్లు ప్రచారం జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ప్రణతి చాలా రోజుల పాటు అమెరికాలోనే ఉన్నారు. వీరిద్దరి అంగీకారం, ఇరు కుటుంబాల మధ్య చర్చల అనంతరం లీగల్‌గా విడిపోయారు.