Thursday, December 22, 2016

నన్ను దూరం పెట్టారు: హీరోయిన్‌

తనను దక్షిణాది సినీ పరిశ్రమ దూరం పెట్టిందనే ఆవేదనను నటి ఇలియానా వ్యక్తం చేశారు. ఇంతకు ముందు దక్షిణాది చిత్ర పరిశ్రమ ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఈ గోవా సుందరిని తలపై ఎక్కించుకొని మోసింది. నన్భన్‌ చిత్రంతో తమిళ సినీ ప్రేక్షకులను అలరించిన ఇలియానాకు ఆ సమయంలో పలు అవకాశాలు వచ్చాయి. అయితే అప్పుడు ఈ అమ్మడు బెట్టు చేశారు. బాలీవుడ్‌ మోజుతో దక్షిణాది చిత్రాలను తక్కువగా చూశారు. అయితే తాను ఊహించింది జరగలేదు. బాలీవుడ్‌ ఇలియానాను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మళ్లీ దక్షిణాదికే మకాం మార్చాలన్న ప్రయత్నాలు మొదలెట్టారు.
 
ఇటీవల ఈత దుస్తులతో అందాలారబోసిన ఫొటోలను ఇంటర్నెట్‌లో విడుదల చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలన్న సామెతను మరిచిన ఇలియానాకు ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమ షాక్‌ ఇచ్చింది. ఆమెను అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో దక్షిణాది సినిమా తనను పక్కన పెట్టేసిందని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఇలియానా. ప్రస్తుతం ఈ భామ ఏమంటున్నారో చూద్దాం. ప్రస్తుతం హిందీలో ఒకటి రెండు చిత్రాలే చేస్తున్నాను. దక్షిణాదిలో ఒక్క అవకాశం కూడా రావడం లేదు. కారణం ఏమిటో తెలియడం లేదు. ఈ మధ్య ఒక తెలుగు దర్శకుడు వచ్చి కథ చెప్పారు. మా చిత్రంలో మీరే కథానాయకి అని నమ్మపలికారు. అంతే మళ్లీ కంట పడలేదు. ఇప్పుడా చిత్రంలో వేరే నటి నటిస్తున్నారు. నన్నెందుకు తొలగించారని నేనా దర్శకుడిని అడగ్గా సారీ అని ఫోన్‌ పెట్టేశారు.
 
నిజం చెప్పాలంటే నేను చేసిన చిత్రాలన్నీ ఇష్టపడి చేసినవే. అర్ధాంగీకారంతో ఏ చిత్రం చేయలేదు. హిందీలో బర్ఫీ చిత్రం నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. తర్వాత అక్షయ్‌కుమార్‌కు జంటగా నటించడం మంచి అనుభవం. నేను నటించిన ప్రతి చిత్రంతో చాలా నేర్చుకున్నాను. నటించిన సన్నివేశం పూర్తి కాగానే దర్శకుడి ముఖంలోకి చూస్తాను. ఆయనలో సంతోషం కనిపిస్తే నేను సంతృప్తి పడతాను. ఇక జయాపజయాల గురించి పెద్దగా పట్టించుకోను. దక్షిణాది దర్శక నిర్మాతల నుంచి మంచి పాత్రలో నటించే అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తున్నాను అని పేర్కొన్నారు. ఇది ఇలియానా ఎదురు చూపుల వేదన.

వాళ్ల కొడుకు పేరు వాళ్లిష్టం.. మీకెందుకు?



నెటిజన్లను హెచ్చరించిన రిషికపూర్‌
బాలీవుడ్‌ జంట సైఫ్‌అలీ ఖాన్‌, కరీనా కపూర్‌లు తమ చిన్నారికి తైమూర్‌ అలీఖాన్‌ పటౌడీ అని పేరుపెట్టుకున్నారు. అయితే ఈ పేరు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కొందరు బాబుకు ఈ పేరు ఎందుకు పెట్టారో చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. దీనికి కారణం ఉంది.. తైమూర్‌ అనే పేరున్న మంగోల్‌ రాజు 14వ శతాబ్దంలో భారతదేశంపై దాడిచేశాడు. దిల్లీపై దాడి చేసి వందల మంది ప్రాణాలను బలిగొన్నాడు. ఇది పక్కనపెడితే తైమూర్‌ అంటే.. ఉక్కు మనిషి, ధీరత్వం గల రాజు అని అర్థం వస్తుంది. నెటిజన్లు చేసిన కామెంట్స్‌ చూసిన నటుడు, కరీనా కపూర్‌ బాబాయి రిషి కపూర్‌ ట్విట్టర్‌ వేదికగా వారిని హెచ్చరించారు. గతంలో దేశాన్ని ఆక్రమించిన వ్యక్తి పేరును ఇప్పుడు బాబు పేరుతో పోల్చడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘తల్లిదండ్రులు తమ కుమారుడికి పేరు పెట్టుకోవాలనుకుంటే.. జనాలు ఎందుకింత బాధపడిపోతున్నారో తెలియడం లేదు. మీ పని మీరు చూసుకోండి. పిల్లలకి ఏ పేరు పెట్టాలనేది తల్లిదండ్రుల ఇష్టం’ అని ట్వీట్‌ చేశారు.
తర్వాత ఇంకా కోపంతో ‘మీ పని మీరు చూసుకోండి. మీ పిల్లల పేర్లు మీరు పెట్టలేదా? కామెంట్‌ చేయడానికి మీరెవరు?’ అని ట్వీట్‌ చేశారు. ఇకపై ఈ విషయంపై వాదనలు చేస్తే చాలా మంది బ్లాక్‌(ట్విట్టర్‌లో) అయిపోతారని హెచ్చరించారు.