Saturday, June 4, 2016

కావాలనే మాజీ లవర్‌తో ఫొటో దిగలేదు!

 'ఉడ్తా పంజాబ్‌' సినిమాతో మళ్లీ వెండితెర మీద కనిపించబోతున్నారు షాహిద్‌ కపూర్‌, కరీనా కపూర్‌. చాలాకాలం కిందటే విడిపోయిన ఈ మాజీ ప్రేమజంట.. గతంలో ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా విలేకరులు ఎంత కోరినా.. కలిసి ఫొటో దిగేందుకు ఒప్పుకోలేదు. ఇందుకు కారణం ఏమిటంటే.. తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌ వెల్లడించాడు. కావాలనే తామిద్దరం కలిసి ఫొటో దిగలేదని, ఒకవేళ ఫొటో దిగితే అప్పట్లో మీడియా మొత్తం దీనిపైనే మాట్లాడేదని, అందుకే మేం కలిసి ఫొటో దిగకూడదని తాను భావించానని షాహిద్ చెప్పాడు.
ఎన్నో ఏళ్ల గ్యాప్‌ తర్వాత షాహిద్‌, కరీనా..  అభిషేక్ చుబే తెరకెక్కించిన 'ఉడ్తా పంజాబ్‌'లో నటించారు.  నిజానికి ఒకే సినిమాలో నటిస్తున్నారనే మాటే కానీ.. ఈ ఇద్దరు కలిసి కనిపించే సీన్‌ ఒక్కటి కూడా ఈ చిత్రంలో లేదట. అంతేకాకుండా మీ ఇద్దరు భవిష్యత్తులో కలిసి నటించే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు వీరు సమాధానం దాటేశారు. సహ నటులు ఆలియా భట్‌, డైరెక్టర్‌ అభిషేక్‌ చుబే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నా ఈ ట్రైలర్‌ లాంచ్ కార్యక్రమంలో షాహిద్, కరీన చాలా ఇబ్బందిగా కనిపించారని అప్పట్లో కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై స్పందిస్తూ 'మేం ఇబ్బందిగా ఫీలైనట్టు మీరు ఎలా నిర్ణయిస్తారు? మేం అలా కనిపించామా? అలా ఎలా రాస్తారు?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

బాహుబలితో బ్రిటిష్ బ్యూటీ

 బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్, బాహుబలి 2 సెట్స్ మీద ఉండగానే తన నెక్ట్స్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు, ఇప్పటికే ప్రభాస్ రెగ్యులర్ సినిమా చేసి చాలా కాలం అవుతోంది. అందుకే బాహుబలి పూర్తవ్వగానే గ్యాప్ తీసుకోకుండా మరో సినిమాను పట్టాలెక్కించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. చాలాకాలం క్రితమే రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో సినిమా ఉంటుందంటూ ప్రకటించాడు ప్రభాస్.

యువి క్రియేషన్స్ బ్యానర్.., ప్రభాస్, సుజిత్ ల సినిమాను భారీగా నిర్మించడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే జాతీయస్థాయిలో ప్రభాస్ కు  ఫాలోయింగ్ రావటంతో ఈ సినిమాను కూడా మూడు భాషల్లో భారీగా నిర్మించడానికి రెడీ అవుతున్నారు. అందుకు తగ్గట్టుగా నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. తెలుగు, తమిళ్ తో పాటు హిందీలో కూడా గుర్తింపు ఉన్న అమీజాక్సన్ ను ఈ సినిమాను హీరోయిన్ గా ఫైనల్ చేశారట. తొలిగా ఈ బ్రిటిష్ బ్యూటీ ప్రభాస్ పక్కన నటించటం సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్.