Saturday, February 25, 2017

రజనీకాంత్‌ సరసన మరో బాలీవుడ్‌ నటి?

 సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘2.0’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆయన ‘కబాలి’ దర్శకుడు పా రంజిత్‌ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు. రజనీ అల్లుడు, నటుడు ధనుష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శక-నిర్మాతలు చిత్రంలో మిగిలిన నటీనటుల ఎంపిక పనుల్లో పడినట్లు తెలుస్తోంది. రజనీకాంత్‌కి జోడీగా బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ను అనుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే దర్శక-నిర్మాతలు విద్యాబాలన్‌ను కలిశారని, నటించడానికి ఆమె కూడా ఆసక్తి చూపారని తమిళ చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే విద్యాబాలన్‌ కోలీవుడ్‌లో నటిస్తున్న తొలి చిత్రమిదే అవుతుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ‘2.0’ చిత్రంలో అమీ జాక్సన్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్‌. రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.