Monday, February 29, 2016

'ఫ్యాన్' వర్సెస్ సూపర్ స్టార్

తన లుక్ తో ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసిన షారూఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ ఫ్యాన్, తొలి ట్రైలర్ తో ఆ అంచనాలను మరింత పెంచేసింది. ఇప్పటి వరకు కేవలం డ్రామాగా మాత్రమే ఈ సినిమాను చూపిస్తూ వచ్చిన చిత్రయూనిట్ ఫస్ట్ ట్రైలర్ లో ఇదో యాక్షన్ డ్రామగా రివీల్ చేశారు. ముఖ్యం రెండు విభిన్న పాత్రల్లో షారూఖ్ అద్భుతంగా ఆకట్టుకున్నాడు.             ట్రైలర్ తోనే సినిమా కథను కూడా రివీల్ చేశారు చిత్రయూనిట్. తన అభిమాన నటుడి కోసం ఎంతకైన తెగించే వ్యక్తి ఆ నటుడికే శత్రువుగా మరటం, ఆ తరువాత పరిణామాలే ఈ సినిమా కథగా కనిపిస్తోంది. యష్ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఫ్యాన్ సినిమాకు మనీష్ శర్మ దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 15న రిలీజ్ కు రెడీ అవుతోంది.

మరో యంగ్ హీరో మూవీలో అనసూయ?

 క్షణం మూవీ సాధించిన విజయంతో జోరుమీదున్న  యాంకర్ అనసూయ మరింత  దూసుకుపోతోంది. టాలీవుడ్‌లో ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.  తాజాగా రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే మూవీ కోసం అనూయను సంప్రదించినట్లు సమాచారం. అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో చిత్రం తెరకెక్కబోతున్న  సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు కొంత పెర్ఫార్మెన్స్ కు అవకాశం ఉన్న పాత్ర కావడంతో ఆమె ఓకే చెప్పినట్లు  టాలీవుడ్ టాక్.

రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ మూవీ ప్రారంభోత్సవం ఇటీవలే గీతా ఆర్ట్స్ ఆఫీసులో జరిగింది. తమిళంలో  ఘనవిజయం సాధించిన తనీఒరువన్ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అల్లు అరవింద్, రాంచచరణ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన మగధీర చిత్రం ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. దీంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. .

రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ వెర్షన్లో విలన్ పాత్ర చేసిన అరవింద్ స్వామి ఈ చిత్రంలో కూడా అదే పాత్రలో కనిపించబోతున్నారు. నాజర్, పోసాని కృష్ణమురళి కూడా ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు.  షూటింగ్   కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయ. దాదాపుగా 'ధ్రువ' అనే టైటిల్ ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా సోగ్గాడే చిన్ని నాయనా' క్షణం మూవీలలో పెర్ఫార్మెన్స్, గ్లామర్ తో ఆకట్టుకున్న ఈ అమ్మడు దీనిపై ఇంకా అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Sunday, February 28, 2016

టి20 ప్రపంచకప్ లో ఆడనివ్వరా?: ధోని

మైదానంలో కొత్త మంది అంపైర్లు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఉపయోగిస్తుండడంపై టీమిండియా వన్డే, టి20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇయర్ పీస్ లాంటి వస్తువులను అంపైర్లు వాడుతుండడంపై అభ్యంతరం తెలిపాడు. ఆశిష్ నెహ్రా బౌలింగ్ లో ఖుర్రం మంజూర్ కొట్టిన బంతిని తప్పించుకోవడంలో బంగ్లాదేశ్ అంపైర్ ఎస్ఐఎస్ సైకత్ విఫలమయ్యాడు. ఆ సమయంలో సైకత్ తన చెవికి ఇయర్ పీస్ తగిలించుకుని ఉన్నాడు.               దీని గురించి విలేకరులు అడిగినప్పుడు ధోని సరదాగా స్పందించాడు. 'టి20 ప్రపంచకప్ టోర్నీలో నన్ను ఆడకుండా చేయాలనుకుంటున్నారా. నాపై వేటు పడాలని కోరుకోవద్దు' అంటూ సరదాగా సమాధానం ఇచ్చాడు. అంపైర్లు ఇయర్ పీస్ తగిలించుకుని మైదానంలో అంపైరింగ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపాడు.            'అంపైర్లు వాకీ టాకీతో పాటు ఇయర్ పీస్ పరికరాలు వాడుతున్నారు. దీంతో ఒక చెవితోనే మైదానంలో పనిచేస్తున్నారు. ఒక చెవిని పూర్తిగా పరికరాలకు అప్పగించేయడంతో ఆటగాళ్లు చెబుతున్నది వారికి పూర్తిగా వినపడని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆన్ ఫీల్డ్ లో అంపైర్లు రెండు చెవులతో పనిచేయడం మంచిదన'ని ధోని పేర్కొన్నాడు.

Saturday, February 27, 2016

'భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను'

మహేష్‌బాబుతో చిత్ర నిర్మాణం
ఆ సంస్థ అధినేత అశ్వనీదత్

  తెలుగులో ప్రముఖ దర్శకులు, హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాల్ని నిర్మించిన వైజయంతీ మూవీస్ కొన్నేళ్ల విరామం తరువాత తిరిగి చిత్ర నిర్మాణాన్ని చేపడుతున్నట్టు ఆ సంస్థ అధినేత సి.అశ్వనీదత్ తెలిపారు. ఆయన శనివారం సతీసమేతంగా మందపల్లి మందేశ్వర (శనేశ్వర) స్వామివార్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కాలం కలిసి రాక చిత్ర నిర్మాణంలో విరామం ఏర్పడిందని, ఈ ఏడాది నుంచి వరుసగా చిత్రనిర్మాణానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.

 గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరో గా త్వరలో చిత్ర నిర్మాణం ప్రారంభించి వచ్చే ఏడాది మేలో విడుదలకు ప్లాన్ చేశామని, ఈ ఏడాది ద్వితీయార్థంలోనే రామ్‌చరణ్ హీరోగా చిత్రనిర్మాణం ప్రారంభిస్తామని, ఆ చిత్రానికి దర్శకుడిని నిర్ణయించాల్సి ఉందని చెప్పారు. తన అభిమాన హీరోలు సీనియర్ ఎన్‌టీఆర్, మెగాస్టార్ చిరంజీవి అని చెప్పారు.

చిరంజీవితో తీసిన ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’ ఎక్కువ పేరు తెచ్చిందన్నారు. చిరంజీవి 151 లేదా 152 చిత్రాన్ని తానే నిర్మిస్తానన్నారు. తన కుమార్తె ప్రియాంకదత్ స్వప్నా బ్యానర్ స్థాపించి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాన్ని నిర్మించిందని, ఆ చిత్ర దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవితకథతో చిత్రాన్ని నిర్మించనుందని చెప్పారు. మహానటుడు ఎన్‌టీఆర్ స్ఫూర్తితో టీడీపీలోకి వచ్చిన తాను అదే పార్టీలో కొనసాగుతున్నానన్నారు. ఒక్కసారి టీడీపీ తరఫున ఎన్నిక ల్లో పోటీ చేసినా ప్రస్తుతం ఆ ఆలోచన లేదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనని అన్నారు.
 

'క్షణం' మూవీ రివ్యూ


కర్మ, కిస్ లాంటి సినిమాలతో తన మార్క్ చూపించిన అడవి శేష్ మరోసారి సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చేసిన ప్రయత్నం క్షణం. టాలీవుడ్ లో చాలా అరుదుగా కనిపించే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లేను కూడా అందించిన శేష్, అంతా తానే అయి సినిమాను తెరకెక్కించాడు. అదాశర్మ గ్లామర్, అనసూయ పోలీస్ లుక్ లాంటి అంశాలతో పాటు పీవీపీ లాంటి భారీచిత్రాల నిర్మాణ సంస్థ కూడా తోడవ్వటంతో క్షణం సినిమా రిలీజ్ కు ముందే భారీ హైప్ క్రియేట్ చేసింది. మరి ఆ అంచనాలను ఈ క్షణం అందుకుందా..?
కథ : ఇండియాలో మెడిసిన్ చదవడానికి వచ్చిన ఎన్నారై కుర్రాడు రిషి (అడవి శేష్), అదే కాలేజ్ లో చదివే శ్వేత (అదాశర్మ)తో ప్రేమలో పడతాడు. తనను ప్రేమించిన వెంటనే ఆ విషయాన్ని ఆమె తండ్రి ముందే శ్వేతకు చెబుతాడు. రిషి పద్ధతి శ్వేత తండ్రికి నచ్చదు. తను ఇక్కడివాడు కాదన్న కారణంతో వారి ప్రేమను అంగీకరించడు. శ్వేతను కార్తీక్ (సత్యదేవ్)కు ఇచ్చి పెళ్లి చేస్తాడు. దీంతో తన చదువు మధ్యలోనే ఆపేసి రిషి అమెరికా వెళ్లిపోతాడు. ఈ సంఘటన జరిగిన నాలుగేళ్ల తరువాత శ్వేత, రిషికి ఫోన్ చేసి తనను కలవాలంటుంది. వెంటనే ఇండియా బయలుదేరి వచ్చిన రిషితో తన కూతురు రియా కిడ్నాప్ అయ్యిందని, తనను వెతకడానికి సాయం చేయాలని అడుగుతుంది. రిషి కూడా శ్వేతకు సాయం చేయడానికి అంగీకరిస్తాడు.

ఈ కిడ్నాప్ మిస్టరీని ఛేదించే క్రమంలో పోలీసులు, స్కూల్ ప్రిన్సిపల్, శ్వేత ఇరుగుపొరుగులను కలిసిన రిషి, వాళ్లు చెప్పిన సమాధానంతో షాక్ అవుతాడు. అసలు రియా అనే అమ్మాయే లేదని, శ్వేత మెంటల్ కండిషన్ సరిగ్గా లేకపోవటం వల్లే తనకు కూతురు ఉన్నట్టు ఊహించుకుంటుందని తెలుస్తుంది. ఇదే విషయాన్ని శ్వేతతో చెబుతాడు రిషి. తను ఎంతో నమ్మకంగా సాయం చేస్తాడనుకున్న రిషి కూడా తన మాట నమ్మకపోవటంతో శ్వేత ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ తరువాత రిషి ఏం చేశాడు..? అసలు నిజంగా శ్వేతకు కూతురు ఉందా..? ఉంటే ఏమయ్యింది..? తనకు సాయం చేయమని శ్వేత, రిషినే ఎందుకు అడిగింది..? లాంటి అంశాలన్ని తెర మీద చూసి తెలుసుకోవాల్సిందే


నటీనటులు:
ప్రతి సినిమాకు ఎంతో మెచ్యూరిటీ చూపిస్తున్న అడవి శేష్, ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్ లోనూ మంచి వేరియేషన్స్ చూపించి, సినిమా అంతా వన్ మేన్ షోలా నడిపించాడు. ముఖ్యంగా లుక్ విషయంలో కూడా మంచి వేరియేషన్స్ చూపించాడు. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైన అదాశర్మ ఈ సినిమాతో నటిగా కూడా మంచి మార్కులు సాధించింది. కూతురి్న పొగొట్టుకున్న తల్లి బాధను మనసుకు హత్తుకునేలా చూపించింది. తొలిసారి ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించి అనసూయ ఫరవాలేదనిపించింది. తన నుంచి అద్భుతమైన నటన ఆశించేవారికి మాత్రం నిరాశ తప్పదు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా సత్యం రాజేష్ ఆకట్టుకున్నాడు. తన పాత్రతో సినిమాకు కాస్త కామెడీ యాడ్ చేసే ప్రయత్నం చేశాడు.

Thursday, February 25, 2016

తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్ కేటాయింపులివీ...

తెలంగాణలోని వేర్వేరు లైన్లకు బడ్జెట్ లో కేటాయింపులు


పెద్దపల్లి-నిజామాబాద్ : రూ.70కోట్లు
మునీరాబాద్-మహబూబ్ నగర్: రూ.90 కోట్లు
ముథోడ్-ఆదిలాబాద్: రూ.1 కోటి
మనోహరాబాద్-కొత్తపల్లి : రూ.20 కోట్లు
గద్వాల్-రాయ్ చూర్ : రూ.5 కోట్లు
అక్కన్నపేట-మెదక్ : రూ.5 కోట్లు
నాగరాఘవపూర్-మందమర్రి : రూ.15 కోట్లు
కాజీపేట-విజయవాడ ట్రిప్లింగ్ పనులకు రూ.114 కోట్లు
భద్రాచలం-కొవ్వూరు : రూ. 5 కోట్లు
భద్రాచలం-సత్తుపల్లి :రూ.కోటి
కొండపల్లి-కొత్తగూడెం: రూ.10
మణుగూరు-రామగుండం: రూ.10 కోట్లు
డిచ్ పల్లి-నిజామాబాద్ రోడ్ ఓవర్ బ్రిడ్జికి: రూ.10 కోట్లు
సికింద్రాబాద్ -మహబూబ్ నగర్ డబ్లింగ్ కు: రూ.80 కోట్లు
బోధన్ నుంచి బీదర్ కు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు
పెద్దపల్లి-జగిత్యాల మధ్య సబ్ వేల నిర్మాణానికి రూ.5 కోట్లు
కాజీపేట-వరంగల్ మధ్య రోడ్ ఓవర్ బ్రిడ్జికి రూ.5 కోట్లు
కొత్తగా మణుగూరు - రామగుండం - కొత్త లైను కోసం లక్ష రూపాయలు కేటాయింపు
కాజీపేట-బలార్షా : రూ.30కోట్లు
సికింద్రాబాద్-మహబూబ్ నగర్ :రూ.80 కోట్లు

Wednesday, February 24, 2016

నామీదే నాకు ఈర్ష్య

 ఇదివరకు కథానాయికల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉండేది. ఒకే సినిమాలో నటించినా సరే... ఒకరి గురించి మరొకరు మాట్లాడేందుకు ఇష్టపడేవాళ్లు కాదు. ఇటీవల మాత్రం దోస్త్‌ మేరా దోస్త్‌ అంటూ ఐక్యతారాగం పాడుతున్నారు. ఎదుటి కథానాయిక ఒక మంచి పాత్ర చేసిందంటే చాలు... వెంటనే వాళ్లని అభినందించే పనిలో పడిపోతుంటారు. అనుష్క అయితే మొదట్నుంచీ తోటి కథానాయిలతో స్నేహంగా మెలుగుతోంది. అందుకే ‘అనుష్క నిజంగా స్వీటీనే’ అంటుంటారు ఆమెతో కలిసి ప్రయాణం చేసిన కథానాయికలు. హిందీ కథానాయిక సోనాక్షి సిన్హా మొదలు తమన్నా వరకు చాలామంది అనుష్కని బహిరంగంగా పొగిడినవాళ్లే. నిజంగా మీకెప్పుడూ, ఏ కథానాయికపైనా ఈర్ష్య పుట్టింది లేదా? అని అనుష్కని అడిగితే... ‘‘మేం స్నేహంగా ఉన్నంతమాత్రాన మామధ్య పోటీ ఉండదనుకోకండి. అసలు పోటీ లేకపోతే ఏ వృత్తినీ ఆస్వాదించలేం. మరింత మంచి పాత్రలు ఎంచుకోవాలి, వేరొకరి కంటే బాగా నటించాలనే తపన మనసులో ఎప్పుడూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంటుంది. ఇక ఈర్ష్య, ద్వేషం కలగడం లాంటివంటారా?... ఒక మంచి అవకాశం అందినప్పుడు - ‘ఇలాంటి పాత్ర నాకు కాకుండా వేరొకరికి వెళ్లుంటే, నిజంగా వాళ్లని ద్వేషించేదాన్నేమో కదా. వాళ్లపై నాకు అసూయ పుట్టేదేమో కదా’ అనిపిస్తుంటుంది. ఎందుకంటే అలాంటి పాత్రలు నాకు చాలాసార్లే లభించాయి. అందుకే పుడితే గిడితే నామీదే నాకు ఈర్ష్య పుట్టాలి తప్ప వేరొకరిపై కాదు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనుష్క ‘బాహుబలి- ది కన్‌క్లూజన్‌’లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

Tuesday, February 23, 2016

నేటి నుంచే ఆసియా కప్



ఆఖరి పంచే కాదు, తొలి విజయం మనదైనప్పుడూ ఆ కిక్కు వేరుగా ఉంటుంది. ఆ కిక్కును సొంతం చేసుకోవాల్సిన సమయమిది. టీ20 ఆసియా కప్ మొదలయ్యేది నేడే. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్‌తో ఢీకొననుంది టీమ్ ఇండియా. చలో మరి.. టోర్నీలో శుభారంభం చేద్దాం.. కప్పు వేటను దూకుడుగా మొదలెడదాం.
ఆసియా కప్‌కు సర్వం సిద్ధమైంది. బంగ్లాదేశ్ ఆతిథ్యంలో జరగనున్న ఈ టోర్నీ మొదలయ్యేది బుధవారమే. ప్ర పంచ క్రికెట్లో పసికూన స్థాయి నుంచి పరిణతి గల జట్టు స్థాయికి ఎగబాకుతున్న బంగ్లా జట్టుతోనే టీమ్ ఇండియా తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌కు వేదికగా ఇక్కడి షేర్-ఏ-బంగ్లా స్టేడియం ముస్తాబైంది. టీ20 ఫార్మాట్లో ఇప్పుడు భారత్ తిరుగులేని శక్తి. ఆస్ట్రేలియాను వారి గడ్డపై క్లీన్‌స్వీప్ చేసి వచ్చి, భారత్‌లో లంకను 2-1తో ఓడించి బలంగా కనిపిస్తున్నది. సోమవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ ముందు వరకూ కూడా టీమ్ ఇండియా అన్ని అంశాల్లో ఏ లోటూ లేకుండా కనబడింది. అయితే ప్రాక్టీస్‌లో ధోనీ వెన్నుకండరాల గాయానికి గురవడం ప్రస్తుతం జట్టును ఇబ్బంది పెడుతున్న అంశం. అలా అని ఈ మ్యాచ్‌లో ధోనీ ఆడబోడన్నది ఇప్పుడే చెప్పలేంగానీ, అన్ని విధాలుగా ఆసియా కప్‌కు సమాయత్తమైన జట్టుకు ధోనీ గాయం కొద్దిగా ఇబ్బంది పెట్టే అంశమే. ఈ మ్యాచ్‌కు ధోనీ దూరమైనా యువసారథి కోహ్లీ నేతృత్వంలో జట్టు ఆత్మవిశ్వాసంతోనే బరిలోకి దిగుతుంది.
జట్లు (అంచనా)
భారత్: ధవన్, రోహిత్, కోహ్లీ, రైనా, యువరాజ్, ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్)/ పార్థివ్ పటేల్, పాండ్య, జడేజా, అశ్విన్, బుమ్రా, నెహ్రా
బంగ్లా: సౌమ్య సర్కార్, మహ్మద్ మిథున్, సబ్బీర్, మహ్మదుల్లా, ముష్ఫికర్, షకిబల్, నురుల్ హసన్ (వికెట్ కీపర్), మోర్తజా (కెప్టెన్), అరాఫత్, ముస్తఫిజుర్, అల్ అమిన్ హుస్సేన్

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా..?

  చిట్టి గౌను ధరించి చేతిలో పువ్వు పట్టుకుని కూర్చున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా?... ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి కాజల్‌. ఆమె తన చిన్ననాటి మధురానుభూతులను గుర్తు చేసుకుంటూ ఇలా ఈ ఫొటోను సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. ‘చిన్నప్పటినుంచే పోజులిచ్చేదాన్ని... నా చేతిలో ఆ పువ్వు ఎందుకు పట్టుకున్నానో తెలియట్లేదు’ అంటూ పోస్ట్‌ చేశారు. దీనికి అభిమానులు తెగ లైక్‌లు కొట్టేస్తూ... బోలెడన్ని కామెంట్స్‌ పెట్టేస్తున్నారు. చిన్నప్పటికీ ఇప్పటికీ కాజల్‌ ఏమీ మారలేదని, తన కళ్లు చాలా అందంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు కాజల్‌ చేతిలోని ఆ పువ్వు తమ కోసమేనంటూ అభిమానులు సరదాగా కామెంట్స్‌లో పేర్కొన్నారు.

Monday, February 22, 2016

సీక్రెట్ చెవిలో కాదు.. బయటికే చెప్పేస్తా!

 తమన్నాలా తెల్లగా ఉండాలంటే ఏం చేయాలి? పాలతో స్నానం చేయాలా? పన్నీటితో జలకాడాలా? అసలు ఆమె ఎలాంటి సౌందర్య సాధనాలు వాడుతుంది... అని అనుకోని వాళ్లుండరు. తెల్లగా ఉండటం ఆ దేవుడు ఇచ్చిన వరం అంటారు తమన్నా. మరి.. చర్మం తళతళలకు మీరేం చేస్తారు? అనే ప్రశ్న తమన్నా ముందుంచితే.. పెరుగు, శెనగపిండి కలిపి పేస్ట్‌లా చేసుకుని, రాసుకుంటా అంటారామె. ఇది మాత్రమే  కాదు.. మరో సీక్రెట్ కూడా ఈ మిల్క్ బ్యూటీ చెప్పారు. అదే ‘అలోవెరా’. దాని గురించి తమన్నా మాట్లాడుతూ- ‘‘రోజంతా షూటింగ్ చేసి, ఇంటికి రాగానే నా స్కిన్ చూసుకుంటే కొంచెం కంగారుగా ఉంటుంది.
         
కానీ, ఆలోవెరా ఉంది కదా అని సరిపెట్టుకుంటాను. బాగా తీరిక చిక్కినప్పుడల్లా ఆ మొక్కలోంచి వచ్చే గుజ్జుని ఒంటికి పట్టించేస్తా. మన చర్మం పసిపిల్లలాంటిది. దాన్ని ఎంత గారాబం చేస్తే అంత అందంగా ఉంటుంది. నేను అలోవెరాతో గారాబం చేస్తాను. మీరు కూడా చేసి చూడండి. అలోవెరాకి మించిన మంచి సౌందర్య సాధనం లేదు. మన ఒంటి మీదకు వయసొచ్చినా అది కనపడనివ్వకుండా చేస్తుంది ’’ అని చెప్పుకొచ్చారు.

Sunday, February 21, 2016

రూ.251 ఫోన్ పై.. రూ.31 లాభం!

 అత్యంత చౌక స్మార్ట్ ఫోన్ 'ఫ్రీడం 251' గురించి రింగింగ్‌ బెల్స్ కంపెనీ నుంచి ప్రకటన వెలువడగానే సంభ్రమాశ్చర్యంతో పాటు సందేహాలు, విమర్శలు వెల్లువెత్తాయి. సామాన్య జనం ఆశ్చర్యపోగా, మార్కెట్ వర్గాలు విమర్శలు గుప్పించాయి. ప్రభుత్వ వర్గాలు కూపీ లాగే పనిలో పడ్డాయి. ఇంత జరుగుతున్నా రూ.251 కే స్మార్ట్ ఫోన్ అందించి తీరతామని రింగింగ్‌ బెల్స్ డైరెక్టర్‌ మోహిత్ గోయల్‌ బల్లగుద్ది చెబుతున్నారు. అంతేకాదు ప్రతిఫోన్ పై తమకు రూ.31 లాభం వస్తుందని లెక్కలు వేసి మరీ చూపిస్తున్నారు. ఏప్రిల్ 15 నుంచి ఫోన్లు డెలివరీ చేస్తామని ప్రకటించారు.
ఫిబ్రవరి 18న ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన వెంటనే 7 కోట్ల రిజిస్ట్రేషన్లు వచ్చినట్టు వెల్లడించారు. మొదటి విడతగా 25 లక్షల ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు మాత్రమే ఆమోదిస్తామని తెలిపారు. మరో 25 లక్షల ఫోన్లు ఆఫ్ లైన్ డిస్ట్రిబ్యూటర్లకు జూన్ 30లోపు అందజేస్తామన్నారు. ఆన్ లైన్ కోనుగోలుదారుల నుంచి పేవ్ మెంట్ గేట్ వే ద్వారా వచ్చిన డబ్బును ప్రత్యేక ఖాతాలో ఉంచుతామని, ఫోన్లు డెలివరీ చేసిన తర్వాతే ఆ డబ్బు ముట్టుకుంటామని ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్య్యూలో గోయల్ స్పష్టం చేశారు.

తాము ఎంతో కసరత్తు చేసిన తర్వాతే  'ఫ్రీడం 251' గురించి ప్రకటించామని, మోసం చేసే ఉద్దేశం తమకు లేదని అన్నారు. 'నేను, నా కంపెనీ ఆదాయపన్ను ఎగేసినట్టు ఒక్క ఫిర్యాదు లేదు. నాపై ఎటువంటి కేసులు లేవు. ఎందుకు నన్ను మోసగాడిగా చిత్రీకరిస్తున్నారు. నైతిక విలువలతో కూడిన వ్యాపారానికి కట్టుబడ్డా' అని గోయల్ పేర్కొన్నారు.

కనీస ధరకు కంటే తక్కువకు అమ్మితే వచ్చే నష్టాన్ని తాము స్థాపించబోయే మార్కెటింగ్ వేదిక ద్వారా కవర్ చేస్తామని, ఈ మార్కెట్‌లో కొనుగోళ్ల ద్వారా లభించే లాభాలను తమ వినియోగదారుడికి బదిలీ చేయడం ద్వారా దీనిని అధిగమిస్తానని రింగింగ్‌ బెల్స్ ప్రెసిడెంట్ అశోక్ చద్దా అంతకుముందు వివరించారు.

మిల్కీబ్యూటీ ప్రేమలో పడిందా!

 నటి తమన్నా బాలీవుడ్ దర్శకుడు షాజిత్‌ఖాన్ ప్రేమలో పడ్డారని,త్వరలోనే వీరు పెళ్లి పీటలెక్కబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. తమన్న హిందీలో షాజిత్‌ఖాన్ దర్శకత్వం వహించిన హిమ్మత్‌వాలా చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. ఆ చిత్రం షూటింగ్ సమయంలోనే వీరి మధ్య సన్నిహితం ప్రేమగా మారిందని,దీంతో తరచూ రహస్యంగా కలుసుకుంటూ ప్రేమలో మునిగితేలుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీన్ని తమన్నా ఖండించారు.

 షాజిత్‌ఖాన్ దర్శకత్వంలో తాను హిందీలో హిమ్మత్‌వాలా చిత్రంలో నటించానని, ఆ చిత్రం పరాజయం పాలైనా తదుపరి హమ్‌షకల్స్ చిత్రంలో అవకాశం కల్పించారన్న గౌరవం షాజిత్‌ఖాన్‌పై ఉందని పేర్కొన్నారు. అలా తమ మధ్య స్నేహమే తప్ప ప్రేమ లేదని స్పష్టం చేశారు. షూటింగ్‌లో తనకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారని, షాజిత్‌ఖాన్ అంటే ఆ కృతజ్ఞత కూడా ఉందని అన్నారు. ఇది తెలియని వారు తమ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారన్నారు. నా జీవితంలో బాహుబలి చిత్రాన్ని మరచిపోలేనని, ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి తనకు దేవుడిలా కనిపిస్తున్నారని పేర్కొన్నారు.

 తాను ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన నటినని, మంచి కథా పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్నానని అన్నారు. ఇందుకు అదృష్టం కూడా తోడయ్యిందని, అందుకే మంచి అవకాశాలు వస్తున్నాయని అన్నారు. అదేవిధంగా హిందీలోనూ వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటించి అక్కడ కూడా నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నానన్నారు. ఎంత కష్టపడి నటించినా మంచి కథల్లో నటించే అవకాశాల అమరాలన్నారు. కాలం కలసిరావాలని, అన్నిటికీ మించి అభిమానుల ఆదరణ చాలా అవసరం అని మిల్కీబ్యూటీ అన్నారు.

Saturday, February 20, 2016

ప్రభాస్‌ ఫియాన్సీ ఆమెనా.. కాదా?

 'బాహుబలి' ప్రభాస్ పెళ్లికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' సినిమా పూర్తవ్వగానే ఈ యంగ్ రెబల్‌ స్టార్ పెళ్లిపీటలు ఎక్కుతాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ అమ్మాయి ఫొటో ఆన్‌లైన్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ప్రభాస్‌ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈమేనంటూ ఈ ఫొటో సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో ఒక్కసారిగా ఇది వైరల్‌ గా మారిపోయింది. అయితే ఈ వార్త ఎంతవరకు నిజమన్నది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
గులాబీ రంగు చీర కట్టుకొని ఓ భారీ వస్త్రనిలయంలో ఈ అమ్మాయి ఉన్నట్టు ఫొటోలో కనిపిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఈ అమ్మాయి ప్రస్తుతం బీటెక్ చదువుతున్నదని, 2016లో ఆమె గ్రాడ్యుయేషన్‌ పూర్తవుతుందని అంటున్నారు. అయితే, ప్రభాస్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే మిత్రులు మాత్రం ఈ కథనాలను కొట్టిపారేస్తున్నారు. ప్రభాస్‌కు కాబోయే వధువు అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో నకిలీదని, ఆ వార్తలను నమ్మవద్దని చెబుతున్నారు.

Wednesday, February 17, 2016

వాళ్ల బాటలోనే... అలీ కూడా

 ఈ జనరేషన్ నటులు కేవలం నటులగానే మిగిలిపోవాలనుకోవటం లేదు. అందుకే ఇతర రంగాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. ముఖ్యం మన హీరోలు హీరోయిన్లు అప్పుడప్పుడు సింగర్ అవతారం ఎత్తుతూ గాయకులకు పోటీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే  ఈ విషయంలో కామెడీ స్టార్ లు కూడా వెనక్కి తగ్గటం లేదు. ఇటీవల 'లచ్చిందేవి ఓ లెక్కుంది' సినిమా కోసం జయప్రకాష్ రెడ్డి పాట పాడగా ఇప్పుడు ఈ లిస్ట్ లో అలీ కూడా చేరిపోయాడు.              మరో అడుగు ముందుకేసిన అలీ పాడ పాడటమే కాదు, తన పాడే పాటను తానే రాశాడు కూడా. ఎందుకంటే ఆ పాట తను మాత్రమే రాయగలడు. ఎంద చాట అంటూ విచిత్రమైన పదాలతో అలరించే అలీ అదే భాషలో పాట పాడాడు. అక్కినేని ఫిలిం స్కూల్ స్టూడెంట్ చునియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పడేసావే సినిమా కోసం అలీ పాట రాసి, పాడాడు. అనూప్ రుబెన్స్ సంగీత దర్శకత్వంలో రూపొందించిన ఈ పాటను ఇప్పటికే రికార్డ్ చేశారు.

Tuesday, February 16, 2016

నేనెవరికిస్తే మీకెందుకు..

 విరాట్‌కోహ్లి - అనుష్కశర్మ మధ్య బంధానికి తెరపడిందంటూ ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు విరాట్‌ ఎక్కడికి వెళ్లినా అతడికి అనుష్కకు సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి మంగళవారం జరిగిన ప్రైవేటు కార్యక్రమంలో.. ఓ ఖరీదైన గడియారాన్ని బాలీవుడ్‌లో ఎవరికైనా బహూకరించాల్సి వస్తే.. ఎవరికిస్తారంటూ ఓ విలేకరి కొంటెగా అడిగాడు. కోహ్లి మాత్రం కాస్త ఘాటుగానే స్పందించాడు. ‘‘బాలీవుడ్‌లో ఉన్నవాళ్లకు ఎందుకిస్తాను. ఇస్తేగిస్తే మా కుటుంబంలో ఎవరికైనా బహుమానంగా ఇస్తా. లేకుంటే జట్టు సహచరులకు ఇస్తా. అయినా ఎవరికిస్తే మీకెందుకు. ప్రస్తుత కార్యక్రమానికి సంబంధించిన ప్రశ్నలడగాలి కానీ.. విషయాన్ని మరోవైపు మళ్లించే ప్రయత్నం ఎందుకు చేస్తారు’’ అని అన్నాడు. మానవ సంబంధాల గురించి అడిగిన మరో ప్రశ్నకూ ఇలాగే స్పందించాడు కోహ్లి. ‘‘ఎవరితో సంబంధం గురించి అడుగుతున్నారు. అయినా ఇవి నన్నడగాల్సిన ప్రశ్నలు కాదు’’అని మండిపడ్డాడు.

ప్రభాస్ కొత్త సినిమాకు ముహుర్తం కుదిరింది

 గత మూడేళ్లుగా బాహుబలి సినిమాతో కాలం గడిపేస్తున్న ప్రభాస్ ఫైనల్ గా మరో సినిమాకు ముహుర్తం సెట్ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. బాహుబలి తొలిభాగం పూర్తవ్వగానే స్టార్ట్ చేయాల్సిన సినిమాను ఎట్టకేలకు బాహుబలి 2 షూటింగ్ పూర్తయిన తరువాత మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. ఇప్పటికే పక్కా స్క్రిప్టురెడీగా ఉన్న దర్శకుడు సుజిత్, ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు.
ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ లో ఉన్న ప్రభాస్ ఈ ఏడాది అక్టోబర్ కల్లా ఆ సినిమాను పూర్తిచేయాలని భావిస్తున్నాడు. రాజమౌళి కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ కల్లా ప్రభాస్ పార్ట్ ముగించేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో నవంబర్ నుంచి తన నెక్ట్స్ సినిమాను ప్రారంభించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు బాహుబలి. రన్ రాజా రన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సుజిత్ చాలాకాలంగా ప్రభాస్ తో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నాడు. ప్రభాస్ హోం బ్యానర్ యువి క్రియేషన్స్, ప్రభాస్, సుజిత్ కాంబినేషన్ లో సినిమాను నిర్మించనుంది.

Monday, February 15, 2016

అదృష్టం బాగుండి.. బతికిపోయా: అమితాబ్

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో జరిగిన అగ్నిప్రమాదం నుంచి తాను అదృష్టం బాగుండి బతికిపోయానని.. లేకపోతే మంటల్లో చిక్కుకుని ఉండాల్సిన వాడినని బాలీవుడ్ పెద్దమనిషి అమితాబ్ బచ్చన్ చెప్పారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తాను అప్పుడే తన పెర్ఫార్మెన్స్ ముగించుకుని అక్కడి నుంచి కారులో బయల్దేరానని, కాసేపటికే అక్కడ మంటలు అంటుకున్నాయని అమితాబ్ చెప్పారు. అయితే అక్కడి వాళ్లు తనను కాసేపు అక్కడే ఉండి.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను కలిసి వెళ్లాల్సిందిగా కోరారని, కానీ పని ఉండటంతో వెళ్లిపోయానని చెప్పారు. ఒకవేళ అక్కడే ఉండి ఉంటే, తాను అగ్నిప్రమాదంలో చిక్కుకుపోయేవాడినని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దేవుడి దయ వల్ల వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారని, అలాగే ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ఎవరూ మృతి చెందకపోవడం అదృష్టమని ట్వీట్ చేశారు. అయితే ఇది మాత్రం చాలా భయానకమైన అనుభవం అన్నారు.                   ఇక బాలీవుడ్ మిస్టర్ పెర్‌ఫెక్షనిస్టు ఆమిర్ ఖాన్ కూడా ఈ ప్రమాదం గురించి తన ఫేస్‌బుక్ పేజీలో రాశాడు. చౌపట్టిలో లైవ్ షో జరుగుతున్నప్పుడు అంత పెద్ద అగ్నిప్రమాదం సంభవించడం చాలా దురదృష్టకరం గానీ, ముంబై పోలీసులు, అగ్నిమాపక శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి పరిస్థితిని చాలా చక్కగా హ్యాండిల్ చేశారని అన్నాడు. ఎవరూ కంగారు పడి తొక్కిసలాట జరగకుండా వీఐపీల నుంచి సామాన్యుల వరకు అందరినీ నిమిషాల మీద గ్రౌండునుంచి పంపారని, చిట్టచివరి వ్యక్తి అక్కడి నుంచి వెళ్లేవరకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అక్కడే ఉన్నారని చెప్పారు.

Sunday, February 14, 2016

ముద్దు రద్దును వెనక్కి తీసుకున్న నటి!

‘‘పెళ్లయ్యాక నటన పరంగా కొన్ని హద్దులు పెట్టుకుంటే బాగుంటుంది. అందుకే నేను, మా ఆయన సైఫ్ అలీఖాన్ ముద్దు సీన్స్‌లో నటించకూడదని నిర్ణయించుకున్నాం’’ అని ఓ సందర్భంలో కరీనా కపూర్ పేర్కొన్నారు. కానీ, ముద్దు రద్దు అనే మాటను వెనక్కి తీసుకుని, అర్జున్ కపూర్‌తో లిప్ లాక్ సీన్‌లో నటించారామె. ఈ ఇద్దరూ జంటగా రూపొందుతున్న చిత్రం ‘కి అండ్ క’. ఇందులో కబీర్ అనే యువకుడిగా అర్జున్ కపూర్, కియా అనే యువతిగా కరీనా నటించారు.

వీళ్ల పాత్రల పేర్లలోంచి ‘కి’, ‘క’ని తీసుకుని ‘కి అండ్ క’ అని పెట్టారు. ఆర్. బాల్కీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భార్యాభర్తల అనుబంధం చుట్టూ సాగుతుంది. కథానుసారం లిప్ లాక్ ఉంటేనే బాగుంటుందని భావించిన కరీనా నటించారు. అర్జున్, కరీనాల లిప్ లాక్ లుక్‌ను వేలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేశారు.

హీరోయిన్ ప్రణీతకు గాయాలు


హీరోయిన్ ప్రణీతకు ప్రాణాపాయం తప్పింది. రోడ్డు ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాలతో బైటపడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ఆదివారం ఖమ్మం జిల్లాలో ప్రమాదానికి గురైంది. బైక్ ను తప్పించే క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు పల్టీలు కొట్టింది. ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. స్వల్పంగా గాయపడిన ప్రణీతను మోతేలోని ఆస్పత్రికి తరలించారు.
తాను క్షేమంగానే ఉన్నానని, షాక్ నుంచి ఇంకా బయటపడలేదని ట్వీట్ చేసింది. తమ సిబ్బందికి గాయాలయ్యాయని తెలిపింది. ప్రమాదం సంభవించిన వెంటనే స్పందించి అంబులెన్స్ కు సమాచారం అందించిన వారికి ధన్యవాదాలు తెలిపింది. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు ట్విటర్ లో పోస్ట్ చేసింది.

బావ, అత్తారింటికి దారేదీ, డైనమైట్, రభస, పాండవులు పాండువులు తుమ్మెద తదితర చిత్రాల్లో ప్రణీత నటించింది. మహేశ్ బాబు 'బ్రహ్మోత్సవం'లో నటిస్తోంది. 'చుట్టాలబ్బాయి'లో ఆదితో జత కడుతోంది. తమిళ, కన్నడ సినిమాల్లోనూ ఆమె నటించింది.

Saturday, February 13, 2016

రజనీ చిత్రం కోసం 20కోట్లతో సెట్

  సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కోసం చెన్నైలోని ఓ ప్రాంతం అత్యాధునిక నగరంగా మారుతోందన్నది తాజా సమాచారం.రజనీకాంత్ ఇంతకు ముందెప్పుడూ లేనట్టుగా ఏకకాలంలో రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం పాఠకులకు తెలిసిందే. అందులో ఒకటి 2.ఓ. ఇది ఎందిరన్ చిత్రానికి సీక్వెల్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్రహ్మాండ చిత్రాల దర్శకుడు శంకర్ వెండితెరపై ఆవిష్కరిస్తున్న మరో అద్భుత సృష్టి 2ఓ చిత్రం అని చెప్పవచ్చు.ఇప్పటి వరకూ భారతీయ సినీ చరిత్రలో రూపొందనటువంటి అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నమోదు కానున్న చిత్రం ఇది.ఈ చిత్రాన్ని లైకా సంస్థ 250 కోట్ల బడ్జెట్‌లో నిర్మిస్తున్నట్లు సమాచారం. రజనీకాంత్ సరసన ఇంగ్లాండ్ బ్యూటీ ఎమీజాక్సన్ నటిస్తున్న ఈ చిత్రంతో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా మారుతున్నారు. చెన్నైలో ప్రారంభమైన 2ఓ చిత్రం షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.

 హాలీవుడ్ స్టంట్ మాస్టర్ నేతృత్వంలో
 తాజా షెడ్యూల్ ఈ నెల 18 నుంచి చెన్నైలో ప్రారంభం కానుందన్నది సమాచారం. ఈ చిత్రం కోసం స్థానిక పూందమల్లి సమీపంలో రూ.20 కోట్ల ఖర్చుతో బ్రహ్మాండమైన సెట్‌ను వేస్తున్నారు.ఇది పలు ఏకరాల స్థలంలో ఒక ఆధునిక నగరంగా తయారవుతోందన్నది గమనార్హం.ఈ సెట్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిసింది.ఇందు కోసం హాలీవుడ్ స్టంట్ డెరైక్టర్ కెన్నీ పెట్స్ తన టీమ్‌తో చెన్నైకి చేరుకుని ఆ సెట్‌లో ఇప్పటికే ఫైట్ సీక్వెన్స్‌ను కంపోజ్ చేస్తున్నారు. ఈ స్టంట్ మాస్టర్ ది రాక్,ట్రైనింగ్ డే సీక్వెల్స్ తదితర హాలీవుడ్ చిత్రాలకు పని చేశారన్నది గమనార్హం. ఈ చిత్రంలో ఫైట్ సన్నివేశాలను చిత్రీకరించడానికి కొన్ని ఆధునిక త్రీడీ కెమెరాలను రప్పించారు.
 
 సెల్‌ఫోన్స్ నిషిద్దం

 షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా దర్శకుడు శంకర్ చిత్ర యూనిట్‌కు కొన్ని నిబంధనలను విధించారు. షూటింగ్ స్పాట్‌కు ఎవరూ సెల్‌ఫోన్లు తీసుకురాకూడదు. చిత్రానికి సంబంధించిన వారు మినహా బయటి వారెవరికి షూటింగ్ స్పాట్‌కు రావడానికి అనుమతి నిషిద్దం లాంటి నిబంధనలు విధించారట.

కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా రివ్యూ


మతిమరపు కుర్రాడు ప్రేమలో పడితే పడే పాట్లేంటో చూపించి ప్రేక్షకులని ఫ్లాట్‌ చేసేసిన నాని 'భలే భలే' బ్లాక్‌బస్టర్‌ తర్వాత ఈసారి పిరికి ప్రేమికుడి అవతారమెత్తాడు. చిన్నప్పుడే మహాలక్ష్మి ప్రేమలో పడి, పదిహేనేళ్లయినా ఆ ప్రేమ గురించి కనీసం తన స్నేహితులకి కూడా చెప్పుకోలేని కృష్ణగాడి 'వీర' ప్రేమగాథ ఇది. హీరోయిన్‌ అన్నయ్యో పెద్ద రౌడీ. ఒంటి చేత్తో ఎంత మందినైనా నరికి అవతలేసే వ్యక్తి చెల్లిని ప్రేమిస్తున్నానని పిరికి హీరో ఎలా చెప్పగలడు? అవడానికి కృష్ణగాడి ప్రేమకథే అయినా దాంట్లో 'వీరత్వం' కోణాన్ని జోడించడం కోసం దర్శకుడు హను రాఘవపూడి వేరే ఉపకథలు సిద్ధం చేసి మెయిన్‌ లైన్‌లోకి తెలివిగా కలిపాడు. 
                   రొమాంటిక్‌ సినిమాలో థ్రిల్లర్‌, కామెడీ, యాక్షన్‌ వగైరా జోనర్లన్నీ చేరి ఒక కొత్త రకమైన అనుభూతిని కలిగిస్తాయి. ఇదే కథని చాలా వైల్డ్‌గా, వయొలెంట్‌గా చెప్పవచ్చు. కానీ దర్శకుడు వినోదాన్ని నమ్ముకున్నాడు. హీరో కార్లోకి చేరి, కథ హైవే ఎక్కేసరికి ఇక ఫన్‌కి చోటు లేదనుకుంటే... అనూహ్యమైన పాత్రలతో కామెడీ సృష్టించి నవ్వులకి లోటు లేకుండా చూసుకున్నాడు. హ్యూమర్‌ పండించే విషయంలో దర్శకుడి క్రియేటివిటీ చాలా సందర్భాల్లో విశేషంగా మెప్పిస్తుంది. హీరో పిరికితనంపై బేస్‌ చేసుకుని అందించిన ఫన్‌ ఒకెత్తు అయితే, బ్రహ్మాజీ క్యారెక్టర్‌ బండారం బయటపడే సీన్‌, మురళీశర్మ-పృధ్వీ-ప్రభాస్‌ శ్రీను ట్రాక్‌, చిన్న పాప, ఆమె చేతిలోని బొమ్మ చుట్టూ అల్లుకున్న సీన్స్‌ బాగా నవ్విస్తాయి. 
నిజానికి కృష్ణగాడి ప్రేమకథ ఇంటర్వెల్‌కే కొలిక్కి వచ్చేస్తుంది. అక్కడ్నుంచీ అతని వీరగాథకి తెర లేస్తుంది. లవ్‌స్టోరీకి ఆల్‌మోస్ట్‌ శుభం కార్డు పడేసరికి 'నా జీవితంలో కష్టమైన హాఫ్‌ అయిపోయింది, ఇష్టమైన హాఫ్‌ ఇప్పుడు మొదలవుతుంది' అని ఇంటర్వెల్‌ దగ్గర కృష్ణగాడు ఆనందపడతాడు. కానీ తనకే కాదు, దర్శకుడికీ కష్టమైన హాఫ్‌ రెండోదే అవుతుంది. అంతదాకా తన ప్రేమ గురించి హీరోయిన్‌ అన్నకి తెలీకుండా తప్పించుకు తిరిగిన కృష్ణగాడు ఇప్పుడు ఎంతో మంది నుంచి వచ్చే ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ అటు తన మహాలక్ష్మిని, ఇటు ముగ్గురు పిల్లల్ని కూడా కాపాడుకోవాల్సి వస్తుంది. ఇంటర్వెల్‌ వరకు కామెడీతో కాలక్షేపం చేసిన దర్శకుడికి సెకండ్‌ హాఫ్‌లో అన్ని కథల్ని ఒక కొలిక్కి తెస్తూ, వినోదం మిస్‌ అవకుండా, అలాగే రోడ్‌ జర్నీ బోర్‌ కొట్టకుండా చూసుకోవాల్సిన పరీక్ష ఎదురవుతుంది. 
హీరో కాబట్టి కృష్ణగాడు సక్సెస్‌ అయిపోతాడనేది మనందరికీ తెలిసిందే. కానీ ఈ పరీక్షలో హను రాఘవపూడి ఎలా నెగ్గుకొస్తాడన్నదే కీలకం. చాలా సబ్‌ప్లాట్స్‌ ఉండడం, మెయిన్‌ స్టోరీలో కామెడీ తగ్గడం వల్ల వేరే ట్రాక్స్‌తో కామెడీ పండించాల్సి రావడం, ఇంటర్వెల్‌కి ముందు ఉన్నన్ని ట్విస్టులు క్లయిమాక్స్‌కి ముందు కూడా ఉండాలని ఆరాటపడడం వగైరా ఇబ్బందుల వల్ల కాసింత గందరగోళం నెలకొంటుంది. అయితే హను రాఘవపూడి చాలా వరకు తన తెలివితేటలతో మేనేజ్‌ చేసేసాడు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కోసమని సెకండ్‌ హాఫ్‌లో రెండు పాటలు ఇరికించాడు. కనీసం ఆ చివరి పాటనైనా ఎడిట్‌ చేసేసినట్టయితే బాగుండేది. హైవేలో దూసుకుపోతున్న బండిలోని పాసింజర్‌ సడన్‌గా 'లూ బ్రేక్‌'కి వెళ్లినట్టు అడ్డుపడి, 'త్వరగా కానివ్వండి' అనేలా తయారైందది. క్లయిమాక్స్‌లో పిల్లలపై పెట్టిన ఎమోషనల్‌ డ్రామా కూడా అవసరానికి మించి సాగదీసినట్టుంది. హీరోని 'బాలకృష్ణ' అభిమానిగా చూపించడం, దానికోసం కొన్ని సీన్లు జోడించడం ఏదో బాలయ్య అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నంలా ఉందే తప్ప దాని వల్ల కథకి ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదు. 
               పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం ఇంత ఈజీనా అన్నట్టుగా ప్రతి పాత్రనీ రక్తి కట్టిస్తోన్న నాని మరోసారి అద్భుతమైన అభినయంతో ఈ కథకి రథ సారథి అయ్యాడు. వంక పెట్టలేని నటనతో తెరపై కృష్ణగాడే తప్ప నానిని కనిపించకుండా చేసాడు. చివర్లో ఎమోషనల్‌గా బరస్ట్‌ అయ్యే సీన్లో నానిలోని పరిపూర్ణ నటుడు కనిపిస్తాడు. హీరోయిన్‌ పాత్రలో మెహ్రీన్‌ తేలిపోయింది. కాస్త బొద్దుగా ఉన్న ఈ అమ్మాయిని కాస్టూమ్స్‌తో కవర్‌ చేసే ప్రయత్నం జరిగింది. క్యూట్‌గా ఎట్‌ ది సేమ్‌ టైమ్‌ డామినేటింగ్‌గా కనిపించాల్సిన పాత్రకి ఆమె న్యాయం చేయలేకపోయింది. సపోర్టింగ్‌ స్టార్‌ కాస్ట్‌ అంతా కూడా అలరించారు. ముఖ్యంగా బ్రహ్మాజీ, మురళీ శర్మ, పృధ్వీ, రాజేష్‌ కామెడీకి బాగా హెల్పయ్యారు. పిల్లల్లో చిన్న పాప నైనీ అయితే ముద్దుగా ఉండడమే కాకుండా చాలా సహజంగా నటించి మార్కులు కొట్టేసింది. 
సాంకేతికంగా ఉన్నతంగా ఉన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ పెద్ద ఎస్సెట్‌ అయ్యాడు. సంగీతం కూడా రొటీన్‌గా కాకుండా ఫ్రెష్‌గా అనిపించింది. సంభాషణలు బాగున్నాయి. చిన్న సినిమా అని ఎక్కడా రాజీ పడకుండా రిచ్‌గా తెరకెక్కించడంలో ప్రొడ్యూసర్స్‌ ఎఫర్ట్స్‌ మెచ్చుకోవాలి. 'అందాల రాక్షసి' చిత్రాన్ని పొయెటిక్‌గా ప్రెజెంట్‌ చేసే ప్రయత్నంలో బోర్‌ కొట్టించిన హను రాఘవపూడి ఈసారి క్రియేటివ్‌గా కాంప్రమైజ్‌ కాకుండా ఒక మంచి ఎంటర్‌టైనర్‌ని అందించాడు. ఈ సినిమాతో అతడిని ఆడియన్స్‌ హైగా రేట్‌ చేస్తారు. తననుంచి మరిన్ని క్రియేటివ్‌ ఎంటర్‌టైనర్స్‌ని ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. 
               ట్విస్టులెక్కువయి, రన్నింగ్‌ టైమ్‌ కాసింత పెరిగి కృష్ణగాడి 'గాడీ' ఒక్కోసారి గాడి తప్పినా కానీ సరదా సందర్భాలు, థ్రిల్లింగ్‌ సన్నివేశాలు, అనూహ్యమైన మలుపులు, ఆకట్టుకునే పాత్రల సమ్మేళనంతో.. విసుగు లేని వినోదంతో అంతిమంగా వీర ప్రేమగాథ రక్తి కట్టిస్తుంది. 
బోటమ్‌ లైన్‌: వినోదభరిత ప్రేమగాథ!

Thursday, February 11, 2016

‘బాహుబలి’ ఈ యేడాదే?!

 ‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన అద్భుతం ఇంకా కళ్లముందు కదులుతూనే ఉంది. ఇప్పుడు అందరి దృష్టీ ‘బాహుబలి 2’పైనే. ‘బాహుబలి - ది కన్‌క్లూజన్‌’ ఎప్పుడొస్తుందో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై రాజమౌళి కూడా ఓ క్లారిటీ ఇచ్చేశారు. ‘‘అనుకొన్నది అనుకొన్నట్టు జరిగితే ఈ యేడాది చివర్లో బాహుబలి 2ని విడుదల చేసేస్తాం..’’ అంటూ ఓ శుభవార్త చెవిన వేశారు. ‘‘ప్రస్తుతం 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ యేడాదే విడుదల చేయాలనుకొంటున్నాం. అంతగా కుదరకపోతే... వచ్చే యేడాది ప్రధమార్థంలో తీసుకొస్తాం’’ అంటున్నారు జక్కన్న. ‘బాహుబలి’ ప్రభంజనాన్ని ఇంకా కొనసాగించాలన్నది రాజమౌళి ఆలోచన. అంటే... బాహుబలి 2నే కాదు, 3,4లను కూడా చూడొచ్చు.

Tuesday, February 9, 2016

కిడ్నీ వ్యాధిగ్రస్తుడి కోసం ఆటో నడిపిన అఖిల్

 కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఏడేళ్ల చిన్నారి అశ్విత్‌రెడ్డిని సినీ హీరో అక్కినేని అఖిల్ పరామర్శించారు. మంచు లక్ష్మి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ ప్రైవేట్ టీవీ చానల్ ద్వారా అశ్విత్‌రెడ్డి దుస్థితిని తెలుసుకున్న అఖిల్ మంగళవారం ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా అశ్విత్‌రెడ్డి వైద్యానికి అవసరమయ్యే డబ్బు కోసం ఆటో నడిపి కొంత మొత్తం సేకరించారు. నగరంలోని నర్సింహస్వామి దేవాలయం రోడ్డులో ఉంటున్న కట్టూరి కృష్ణారెడ్డి, కవితలకు కుమారుడు అశ్విత్‌రెడ్డి, కుమార్తె అనుషిత ఉన్నారు.     రెండు నెలల క్రితం అశ్విత్ డెంగీ జ్వరం బారినపడటంతో వైద్య పరీక్షలు చేయించారు. ఆ సమయంలో అతనికి రెండు మూత్రపిండాలు పాడైనట్లు వైద్యులు తెలిపారు. వైద్యం కోసం ఆస్తి, బంగారం అమ్మి రూ.6 లక్షల వరకు ఖర్చు చేశారు. కిడ్నీ మార్పిడికి రూ.10 లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పారు.  అంతమొత్తం వెచ్చించే స్థోమత అశ్విత్‌రెడ్డి తల్లిదండ్రులకు లేదు. ఈ నేపథ్యంలో టీవీ చానల్ ద్వారా విషయాన్ని తెలుసుకున్న అఖిల్ ఖమ్మం వచ్చి ఆటో నడిపి డబ్బులు సేకరించి ఇచ్చాడు.

Monday, February 8, 2016

కథ కుదిరింది


‘నేను.. శైలజ’ అంటూ ఓ ప్రేమకథ వినిపించి తొలి అడుగులోనే ఆకట్టుకొన్న దర్శకుడు కిషోర్‌ తిరుమల ఇప్పుడాయనకు వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. నితిన్‌తో ఓ సినిమా ఓకే చేసుకొన్న కిషోర్‌..ఇప్పుడు వెంకటేష్‌కీ కథ వినిపించేశారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు వెంకటేష్‌. ఆ తరవాత కిషోర్‌ సినిమా పట్టాలెక్కుతుంది. మల్టీ డైమెన్షన్‌ రామ్‌మోహన్‌ నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇటీవలే వెంకటేష్‌గారికి కథ వినిపించా. ఆయనకు బాగా నచ్చింది. ఆయన సినిమాలంటే వినోదంతో పాటు కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అంశాలూ ఉండాలనుకొంటారు. అలాంటి కథే ఇది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తామ’’న్నారు.

Sunday, February 7, 2016

నో డౌట్.. వాళ్లు విడిపోయారు!

 చూడబోతే 2016 'బ్రేక్ అప్ ఇయర్'గా రికార్డులకెక్కేలా ఉంది. ఈ ఏడాది ఆరంభం నుంచి బాలీవుడ్ ప్రముఖ జంటలంతా 'బ్రేక్ అప్' బాట పట్టారు. తాజాగా క్రేజీ జంట విరాట్ కోహ్లి-అనుష్క శర్మలు కూడా అదే దారిలో నడిచినట్లు రుజువులతో సహా నిరూపిస్తున్నారు సినీ డిటెక్టివ్ లు. ఎప్పుడూ తమ విహారయాత్రలతో వార్తల్లో నిలిచే ఈ ప్రేమ పక్షులు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. నెలరోజుల క్రితమే వీరు విడిపోయారని చెప్పడానికి పలు అంశాలు కూడా అనుకూలిస్తున్నాయి.
ఇన్ స్టాగ్రామ్ లో 'హార్ట్ బ్రేక్'..
కొన్ని రోజుల క్రితం విరాట్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ పేజీలో సెల్ఫీ పోస్ట్ చేసి 'హార్ట్ బ్రేక్' అంటూ దానికో క్యాప్షన్ జోడించాడు. ఆ 'హార్ట్ బ్రేక్' క్యాప్షన్ బ్రేకింగ్ న్యూస్ అవుతుందని భావించాడో ఏమో వెంటనే దాన్ని తొలగించాడు.  కానీ ఆ కాస్త వ్యవధిలోనే ఫ్యాన్స్ అసలు విషయాన్ని పసిగట్టేశారు. విరాట్ అంతటితో ఊరుకున్నాడా.. 'హార్ట్ బ్రేక్' క్యాప్షన్ తొలగించిన వెంటనే అనుష్కను 'అన్ ఫాలో' చేసేశాడు. దాంతో అభిమానులు ఓ నిర్ధారణకు వచ్చేశారు.

గడ్డం కూడా తీసేశాడు..
సాధారణంగా పంజాబీల వివాహ సమయంలో జరిగే కొన్ని వేడుకల్లో వరుడు గడ్డంతో ఉండటం వారి సంప్రదాయం. వివాహం కోసమే విరాట్ గడ్డం పెంచుతున్నాడని ఓ భారీ రూమర్. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ విరాట్ గడ్డం తీసేసి కనబడుతున్నాడు. అనుష్క పెళ్లికి  నిరాకరించడంతోనే  విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నాడట.

ఇక వారి సన్నిహితుల కథనం ప్రకారం.. విరాట్-అనుష్కలు నెల క్రితం విడిపోయిన మాట నిజమేనని, అయితే వారిద్దరూ ఇష్టపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.  ప్రస్తుతం వారిద్దరూ కెరీర్ మీద సీరియస్ గా దృష్టి పెట్టాలనుకుంటున్నారని, అయినా ఆ నిర్ణయం విరాట్ ది కాదని చెబుతున్నారు. కాగా విరాట్ టీ ట్వంటీ ప్రిపరేషన్ లో బిజీగా ఉండగా.. అనుష్క సుల్తాన్ షూటింగ్ లో బిజీ.  మొత్తానికి గడసరి క్రికెటర్, సొగసరి హీరోయిన్ల ప్రేమకథ ఇలా ఊహించని మలుపు తిరిగింది.

Saturday, February 6, 2016

యువీకి షాక్‌.. వాట్సన్‌కి లక్‌

  ఐపీఎల్‌ గత రెండు సీజన్లలో అత్యధిక ధరకు అమ్ముడుపోయి వేలంలో రారాజుగా వెలుగొందిన భారత్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌ సింగ్‌కు తాజాగా ఐపీఎల్‌-9 సీజన్‌ వేలంలో దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీ 2014 సీజన్‌లో యువరాజ్‌ని రూ.14 కోట్లకు కొనుగోలు చేయగా.. తర్వాత ఏడాది దిల్లీ డేర్‌డెవిల్స్‌ ఏకంగా రూ.16 కోట్లు వెచ్చించి మరీ దక్కించుకుంది. అయితే ఈ రెండు సీజన్లలో యువరాజ్‌ సింగ్‌ పేలవ ఆటతీరుతో ఫ్రాంచైజీలను తీవ్రంగా నిరాశపరిచాడు. శనివారం బెంగళూరులో జరిగిన వేలంలో రూ.2కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన యువరాజ్‌ను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. అయితే రూ.7కోట్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దక్కించుకుని అందర్నీ ఆశ్చర్య పరిచింది. అంటే గత రెండేళ్లతో పోలిస్తే యువరాజ్‌ ధర దాదాపు సగానికి సగం పడిపోయిందన్నమాట. దాదాపు 351 మంది క్రికెటర్లు శనివారం వేలంలో నిలిచారు.

Wednesday, February 3, 2016

చిరంజీవికి నేడు ఆపరేషన్

 మెగాస్టార్ చిరంజీవి గురువారం ఆపరేషన్ చేయించుకోనున్నారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో భుజానికి ఆయన శస్త్రచికిత్స చేయించుకోనున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. చాలా కాలంగా ఆయన భుజం నొప్పితో బాధ పడుతున్నారని, కత్తి సినిమా షూటింగ్ కు ముందే ఆపరేషన్ చేయించుకోవాలని భావించి ముంబై ఆస్పత్రిలో చేరారని తెలిపాయి. చాలా రోజుల క్రితమే ఆపరేషన్ చేయించుకోవాలని అనుకున్నా కుదరలేదని వెల్లడించాయి.
చిరంజీవి సతీమణి సురేఖ ఆయన వెంట ఉన్నారు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆయన దాదాపు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఆయనను ఎప్పుడు డిశ్చార్జి చేస్తారనేది వెల్లడి కాలేదు. పూర్తిగా కోలుకున్నాకే ఆయన హైదరాబాద్ కు తిరిగొచ్చే  అవకాశముందని సమాచారం. కత్తి సినిమా రీమేక్ నటించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభంకానుంది. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తారు.

ఓ మిస్డ్‌కాల్.. ప్రేమ..పెళ్లి.. విషాదం!

ఆదిలాబాద్
                   ఓ మిస్డ్‌ కాల్.. వారి మధ్య పరిచయూనికి దారితీసింది. అది ప్రేమగా మారి పెళ్లి దాకా చేరింది. చివరికి ఆ యువతి ప్రాణాన్నే బలితీసుకుంది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని కొత్త కాలనీకి చెందిన గుమ్ముల స్వరూప (22) బీడీ కార్మికురాలు. గుమ్ముల లక్ష్మి, రాములు మూడో సంతానమైన ఆమె పెద్దగా చదువుకోలేదు. మూడేళ్ల క్రితం ఆమె ఫోన్‌కు ఒక మిస్డ్ కాల్ వచ్చింది. ఎవరు కాల్ చేశారో తెలియక ఆమె తిరిగి కాల్‌ చేసింది. అవతలి వ్యక్తి తన పేరు అశోక్ అని, తాను ఆదిలాబాద్‌కు చెందిన వ్యక్తినని పరిచయం చేసుకున్నాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్ని రోజులపాటు ప్రేమలో గడిపారు. అనంతరం అశోక్ పెళ్లికి నిరాకరించడంతో స్వరూప పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.           పోలీసులు, పెద్ద మనుషుల ద్వారా రాజీ కుదుర్చుకుని పెళ్లి చేసుకున్న వారికి 20 రోజుల క్రితమే కూతురు పుట్టింది. ఏమైందో ఏమో తెలియదు కానీ మంగళవారం సాయంత్రం స్వరూప ఆత్మహత్య చేసుకుందని కాలనీవాసులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. అయితే.. స్వరూప ఆత్మహత్య చేసుకోలేదని, భర్తే చితకబాది బలవంతంగా పురుగుల మందు తాగించాడని ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. అతను హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేస్తున్నాడని అంటున్నారు. ఆదిలాబాద్‌లోని రూరల్ పోలీసులు స్వరూప భర్త అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tuesday, February 2, 2016

స్త్రీలే ఎక్కువ కాలం జీవిస్తారా?

పురుషుల కన్నా స్త్రీల ఆయు: ప్రమాణం ఎక్కువని చాలా పరిశోధనల్లో తేలింది. పురుషులతో పోలిస్తే గుండె జబ్బులు, పక్షవాతం..లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా స్త్రీలలో తక్కువగా రావడాన్ని గమనించారు. రోగనిరోధకశక్తితో పాటు జీవనపరిమితి కూడా స్త్రీలలో ఎక్కువగా ఉండడానికి కారణమేమిటి? అనే విషయంపై జీవశాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఈ విషయం అంతుచిక్కని రహస్యంగానే ఉంది. కానీ స్కాండినేషియన్‌ శాస్త్రవేత్తలు మాత్రం తమ పరిశోధనల్లో ఒక కొత్త విషయాన్ని చెప్పారు. స్త్రీ శరీర కణాల్లో వైవిధ్యభరితమైన రెండు ఎక్స్‌ క్రోమోజోములు ఉండడమే ఇందుకు కారణమని ఆ నిపుణుల బృందం పేర్కొంది.
                     ఆ రెండే కీలకం : మనిషి శరీరం సూక్ష్మమైన కణాలతో నిర్మితమైందన్న సంగతి తెలిసిందే. ప్రతి కణంలోనూ 22 జతల నిర్మాణాత్మక క్రోమోజోములు, ఒక జత లైంగిక క్రోమోజోములు ఉంటాయి. వీటిలో సగం తల్లి, సగం తండ్రి నుంచి సంక్రమిస్తాయి. అయితే వీటిలో శరీర నిర్మాణానికి దోహదపడే 22 జతల క్రోమోజోముల సంగతలా ఉంచితే, తల్లిదండ్రులిద్దరి నుంచి ఆనువంశికంగా వచ్చే లైంగిక క్రోమోజోములే జీవి లింగభేదాన్ని నిర్దేశిస్తాయి. కీలకమైన ఆ క్రోమోజోముల్నే ఎక్స్‌, వై గా పిలుస్తారు. ఇవి స్త్రీలలో ఎక్స్‌, ఎక్స్‌ సంయోగంగా, పురుషుల్లో ఎక్స్‌, వై సంయోగంగా ఉంటాయి. ఫలదీకరణ సమయంలో ఈ క్రోమోజోముల్లో జరిగే కణవిభజన, పుట్టేబిడ్డ ఆడా, మగా అనే విషయాన్ని నిర్దేశిస్తుంది. ఆయా క్రోమోజోముల మీద ఉన్న జన్యువులే కణవిభజనను ప్రభావితం చేస్తాయి. అయితే తల్లి, తండ్రి నుంచి వచ్చే వైవిధ్యభరితమైన ఆ రెండు ఎక్స్‌ క్రోమోజోములే స్త్రీలలో ఆయు:ప్రమాణం ఎక్కువగా ఉండడానికి కారణమని స్కాండినేషియన్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రెండు ఎక్స్‌ క్రోమోజోముల కారణంగా ప్రతి స్త్రీ శరీరంలోనూ స్వల్ప వైవిధ్యం ఉన్న రెండు కణరేఖలు ఏర్పడతాయి. ఈ కణరేఖలే జీవి ఆయు:ప్రమాణాన్ని పెంచడానికీ, తగ్గించడానికీ దోహదపడతాయని వారు వివరించారు. స్త్రీలలో రెండు రకాల కణరేఖలు ఏర్పడడం వల్ల జీవనాన్ని ప్రభావితం చేయగల రేఖను ఎంపిక చేసుకునే అవకాశం వాళ్ల శరీరానికి ఉంది. అలాంటి అవకాశం పురుషులకు లేదు. అందుకే పురుషులలో కన్నా స్త్రీలలో ఆయు:ప్రమాణం ఎక్కువ అని తమ ప్రయోగాల ద్వారా వారు పేర్కొన్నారు.
                     స్త్రీలలో ఉండే ఈ రెండు కణరేఖల్లో ఎదో ఒకటి మాత్రమే పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుందని డెన్మార్క్‌లోని ఓడెన్స్‌ యూనివర్సిటీకి చెందిన కారీ క్రిస్టెన్‌సెన్‌, ఓస్లోలోని ఉలెవల్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌కు చెందిన కరెన్‌ హెలెన్‌ ఆర్‌స్టావిక్‌ అధ్యక్షతన పరిశోధనలు చేసిన బృందం పేర్కొంది. ఎక్స్‌ క్రోమోజోమ్‌ మీదున్న ఆండ్రోజన్‌ జన్యుకారకం ఆధారంగా ఆ రెండూ ఒకదానిలో ఒకటి కలియకుండా విడవిడిగా ఏర్పడినవేనని తేలింది.
                     ఈ పరిశోధనల కోసం వయస్సు తక్కువగా ఉన్న మహిళల కణాలను పరిశీలించారు. అందులో ఆ రెండు రేఖలు సుమారుగా 50:50 నిష్పత్తిలో విభజన చెంది ఉన్నాయని గుర్తించారు. ఆ తర్వాత వృద్ధుల శరీరంలోని కణరేఖల్ని పరిశీలించారు. వారందరిలో కూడా ఒకే కణరేఖకే ప్రాముఖ్యం ఇచ్చినట్లు కనుగొన్నారు. ఆ తర్వాత నడివయస్సు ఉన్న మహిళలో పరిశోధనలు చేశారు. మొత్తం అందరిలోనూ రెండు కణరేఖల్లో ఒకటి పూర్తిగా చర్యాగుణాన్ని అంటే డామినేట్‌ చేస్తూ కనిపించింది. అదే పురుషుల్లో అయితే ఒకే ఒక కణరేఖ ఉంటుంది. కాబట్టి వారికి ఒకే అవకాశం ఉంటుందని క్రిస్టెన్‌సెన్‌ పేర్కొన్నారు. అంతేకాదు, స్త్రీలలో రెండు కణరేఖలు ఉండడం వల్ల ఒకటి కాకపోతే రెండోది ప్రభావశీలంగా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల వాళ్ల జీవన పరిమితి పురుషుల్లో కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు.
                  ఈ బృందం జంతువులపై చేసిన ప్రయోగాలు కూడా ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. ఉదాహరణకు క్షీరదాలను తీసుకుంటే వాటిలో కూడా మగ జంతువుల్లో ఎక్స్‌, వై అనే లైంగిక క్రోమోజోములే ఉంటాయి. అందువల్ల వాటి ఆయు:ప్రమాణం కూడా తక్కువే. అదే పక్షుల్లో ఆడవాటిలో జెడ్‌, డబ్ల్యూ అనే రెండు వైవిధ్యభరితమైన లైంగిక క్రోమోజోములుం టాయి. మగపక్షుల్లో రెండూ జెడ్‌ క్రోమోజోములే ఉంటాయి. ఫలితంగా పక్షుల విషయంలో మగ పక్షులే ఎక్కువ జీవనపరిమితిని కలిగి ఉంటాయి. దీన్ని బట్టి ఈ లైంగిక క్రోమోజుములే జీవుల ఆయు:ప్రమాణాన్ని ప్రభావితం చేస్తున్నాయని పరిశోధకలు నిర్ధారించారు.
                      అయితే ఈ అభిప్రాయాలతో అందరూ ఏకీభవించడం లేదు. 'జీవన పరిమితి ఎంత కాలముంటుందనేది మనం లెక్కించలేం కాబట్టి ఈ విషయంతో ఏకీభవించలేం' అని జాన్‌సన్‌ పేర్కొంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ ఇడహౌకు చెందిన స్టీవెన్‌ ఆస్టడ్‌ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. అదీగాక మార్స్యుపియల్స్‌లో(పిల్లల్ని సంరక్షించుకు నేందుకు పొట్ట కింద భాగంలో సంచీలాంటి నిర్మాణాన్ని కలిగి ఉండే క్షీరదజాతి) అంటే కంగారూ లాంటి జంతువుల్లో తండ్రి నుంచి సంక్రమించే ఎక్స్‌ క్రోమోజోమ్‌.. ఆడజంతువుల్లో ఎప్పుడూ క్రియాశీలంగా ఉండదు. అంటే వాటిలో ఏ ఎక్స్‌ క్రోమోజోమ్‌ మంచిది అని తేల్చడానికి అవకాశమే లేదని ఆయన పేర్కొన్నారు. కాబట్టి ఆడామగా కంగారూల్లో ఏవి ఎక్కువ కాలం జీవిస్తాయనేది తేల్చిచెప్పలేం. ఆడామగా జీవుల్లో ఆయు:ప్రమా ణాలు వివిధ జాతుల్లో వివిధ రకాలుగా ఉన్నాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయని, వాటిపై వివాదాలు లేకపోలేదని మరికొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఆసీస్‌తో తొలివన్డేలో భారత మహిళా జట్టు ఓటమి

 ఆస్ట్రేలియా- భారత మహిళా క్రికెటజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కాన్‌బెర్రా వేదికగా జరిగిన తొలిమ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. దీంతో ఆసీస్‌ 1-0తో సిరీస్‌లో పైచేయి సాధించింది. అంతకు ముందు నిర్వహించిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 2-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేసింది. అలెక్స్‌ బ్లాక్‌వెల్‌ 114, ఎల్ల్సీ పెర్రీ 90 పరుగులతో భారీ స్కోరుకు బాటలు వేశారు. భారత బౌలర్లలో శిఖాపాండే మూడు వికెట్లు సాధించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళలు 46.5 ఓవర్లలో 175 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. హర్మన్‌ప్రీత్‌(46), జూలన్‌ గోస్వామి(25) మాత్రమే రెండండెల స్కోర్‌ చేశారు.

Monday, February 1, 2016

మా మధ్య ఉన్నది అది కాదు

సిద్ధార్థ్‌ మల్హోత్రా, ఆలియా భట్‌ల మధ్య బంధం గురించి కొంత కాలంగా బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’తో అరంగేట్రం చేసిన వీరిద్దరూ అప్పటి నుంÍే మంచి స్నేహితులుగా మారిపోయారు. పార్టీలకు, ప్రివ్యూ షోలకు జంటగా హాజరై మీడియా దృష్టిని ఆకర్షించారు. దీంతో వీరి మధ్య స్నేహానికి మించిన బంధమేదో ఉందన్న వార్తలు బలంగా వినపడుతున్నాయి. దీని గురించి సిద్ధార్థ్‌ స్పందించాడు. ‘‘నాకు, ఆలియాకు సినిమాల్లోకి రాకముందు నుంచే పరిచయముంది. ఒకే చిత్రంతో వెండితెరకు పరిచయం కావడం వల్ల స్నేహితులుగా మారిపోయాం. అవసరమైనప్పుడు ఒకరి సినిమాలకు మరొకరం మద్దతుగా నిలుస్తుంటాం. అంతమాత్రాన మా స్నేహాన్ని వేరే ఉద్దేశంతో చూడకూడదు. అలాంటి వార్తలు నా కుటుంబాన్ని బాధించాయ’’ని చెప్పాడు సిద్ధార్థ్‌. ప్రస్తుతం వీరిద్దరూ ‘కపూర్‌ అండ్‌ సన్స్‌’లో నటిస్తున్నారు. ఆలియా అద్భుతమైన నటి అని, ‘హైవే’ చూస్తే ఆమె సత్తా అర్థమవుతుందని ప్రశంసించాడు సిద్ధార్థ్‌.

రజనీతో కలిసి చేయడం అద్భుతం!

 దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి రోబో సినిమా సీక్వెల్‌లో కలిసి నటించడం అద్భుతంగా అనిపిస్తోందని బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ అంటున్నాడు. సీక్వెల్‌లో కూడా రజనీకాంత్ సైంటిస్టుగాను, ఆయన తయారుచేసే రోబో 'చిట్టి'గాను నటిస్తుండగా, విలన్ పాత్రను అక్షయ్ కుమార్ పోషిస్తున్నారు. ఇప్పటికే తన సినీజీవితంలో అనేక ఫైట్లు చేశానని, ఇప్పుడు రజనీకాంత్ లాంటి సూపర్ హీరోతో పంచ్‌లు తినడం చాలా గొప్పగా అనిపిస్తోందని అక్షయ్ చెప్పాడు. నెగెటివ్ పాత్ర పోషించాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానన్నాడు. అయితే ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ఏమీ సిద్ధం కావడం లేదు. దానికి ఎలాంటి ట్రైనింగు తీసుకోవట్లేదని అక్షయ్ చెప్పాడు. నన్నెవరూ చూడలేదు
తాను ఇంతకుముందు రజనీకాంత్‌ను కలిసిన సందర్భాన్ని అక్షయ్ గుర్తుచేసుకున్నాడు. తాను ఆయన వద్దకు వెళ్లేసరికి 15 మంది ఆయన కోసం వేచి చూస్తున్నారని, అందరూ ఆయనవైపే చూస్తున్నారని అన్నాడు. ఆయన టీ తాగుతూ.. ప్యాంటుమీద దుమ్ము ఉంటే దులుపుకొన్నారని, అందరూ ఒక్కసారిగా ఊపిరి భారంగా పీల్చుకున్నారని చెప్పాడు. తాను కూడా తన ప్యాంటు మీద దుమ్ము ఉంటే దులుపుకొన్నానని, కానీ అయితే అక్కడ ఎవరూ తనవైపు చూడలేదని తెలిపాడు. రోబో మొదటి భాగంలో ఐశ్వర్యారాయ్ నటించగా.. సీక్వెల్‌లో మాత్రం అమీ జాక్సన్ నటిస్తోంది. అలాగే డేనీ స్థానంలో అక్షయ్ వస్తున్నాడు.