Friday, December 30, 2016

మూడో చిత్రం స్టైలిష్‌గా?

తెలుగు చిత్రసీమలో స్టైలిష్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకొన్నాడు సురేందర్‌రెడ్డి. ఆయన ఎవరితో సినిమా చేసినా సరే, ఆ కథానాయకుడు స్టైలిష్‌గా కనిపించబోతున్నాడని ఖచ్చితంగా ఫిక్స్‌ అయిపోతారు ప్రేక్షకులు. నిజంగానే సురేందర్‌ రెడ్డి కథానాయకుల్ని అలా ఆవిష్కరిస్తుంటారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ధృవ’ సినిమాతోనూ అదే రుజువైంది. రామ్‌చరణ్‌ ఇన్నాళ్లూ తెరపై కనిపించింది ఒకెత్తైతే, ‘ధృవ’ సినిమాలో కనిపించింది మరో ఎత్తు అన్నట్టుగా ఆ సినిమా అభిమానుల్ని అలరిస్తోంది. విజయోత్సాహంలో ఉన్న సురేందర్‌ రెడ్డి తదుపరి అఖిల్‌ అక్కినేనితో సినిమా చేయబోతున్నాడనే ప్రచారం వూపందుకొంది. అఖిల్‌ ప్రస్తుతం తన రెండో చిత్రంపై దృష్టిపెట్టారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించనున్న ఆ చిత్రం వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఆ తర్వాత సినిమా సురేందర్‌రెడ్డితోనే అని, సూరి స్టైలిష్‌ హీరోల జాబితాలో అఖిల్‌ కూడా చేరబోతున్నాడని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు గట్టిగానే చెప్పుకొంటున్నాయి. అదంతా ఒకెత్తైతే, ఆ చిత్రాన్ని రామ్‌చరణ్‌ నిర్మించబోతున్నారనే ప్రచారం మరో ఎత్తు. రామ్‌చరణ్‌, అఖిల్‌ మంచి స్నేహితులు. వాళ్లిద్దరి కలయికలో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. మరికొన్ని రోజులు తర్వాత ఆ చిత్రంపై స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశాలున్నాయి.

Thursday, December 29, 2016

ఎక్కడైనా స్టార్‌ కానీ..అక్కడ కాదు!

 ‘ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో... ఆ ఇంటికి ఈ ఇల్లూ అంతే దూరం’ అనే సామెత ఉన్న విషయం తెలిసిందే. సినిమా పరిశ్రమలో చాలామంది ఈ విధంగానే ఉంటారన్నది కొందరి ఊహ. ముఖ్యంగా పెద్దింటి కుటుంబాలకు చెందిన హీరోలు అంత ఫ్రెండ్లీగా ఉండరని ఊహించుకుంటారు. అయితే ఆ ఊహ నిజం కాదని కొన్ని సంఘటనలు చెబుతుంటాయ్‌. తాజాగా, ఓ ఫొటో ఆ విషయాన్ని మరింత బలంగా చూపించింది. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ చిరునవ్వులు చిందిస్తూ, దిగిన ఈ ఫొటో ఇక్కడిది కాదు. భార్యాపిల్లలతో కలసి కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడానికి మహేశ్‌ విదేశాలు వెళ్లారు.
ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌ నగరంలో ఉన్నారు. రామ్‌చరణ్‌ కూడా అక్కడే ఉన్నారు. ఈ ఇండియన్‌ స్టార్స్‌ అక్కడ సందడి చేశారు. ఫొటో దిగి, ‘బియాండ్‌ బౌండరీస్‌... హ్యాపీ హాలీడేస్‌’ అని మహేశ్, చరణ్‌ సోషల్‌ మీడియాలో పెట్టారు. ఎక్కడైనా స్టార్‌ కాని ఫ్రెండ్‌షిప్‌ విషయంలో స్టార్‌ కాదన్నట్లుగా మహేశ్‌ – చరణ్‌ చెబుతున్నట్లుంది కదూ. అనుకోకుండా కలిసినా స్టార్‌ స్టేటస్‌ని పక్కన పెట్టి, ఇలా కాసేపు ఫ్రెండ్లీగా హాలిడేస్‌ని ఎంజాయ్‌ చేయడం స్నేహపూరిత వాతావరణాన్ని తెలియజేస్తోంది.

మరో రెండు రోజుల్లో కోహ్లి నిశ్చితార్థం!

గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో మునిగితేలుతున్న భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి-బాలీవుడ్ నటి అనుష్క శర్మలు మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో న్యూఇయర్ వేడుకల్ని సెలబ్రెట్ చేసుకోబోతున్న ఈ జంట..  జనవరి 1వ తేదీన నిశ్చితార్థం చేసుకునే యోచనలో ఉన్నారు. 2017లో జీవితంలో స్థిరపడాలని భావిస్తున్న విరాట్-అనుష్కలు.. కొత్త ఏడాది ఆరంభపు కానుకగా నిశ్చితార్థాన్ని చేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.
 
ఇందుకు ఉత్తరాఖండ్ లోని నరేంద్ర నగర్ లోని హోటల్ ఆనందాలో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి అనుష్క శర్మ తరపున కొంతమంది స్నేహితులు, కుటుంబ సభ్యులు హాజరుకాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ ఏర్పాట్లలో ఇరు కుటుంబాల పెద్దలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై విరాట్ కోహ్లి కానీ, అనుష్క శర్మ కానీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. నూతన సంవత్సరం సందర్భంగా భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి-బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ఉత్తరాఖండ్ విహారానికి బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే.  గత కొన్నేళ్లుగా  ప్రేమించుకుంటున్న ఈ జంట... శనివారం ఉత్తరాఖండ్ ఎయిర్ పోర్ట్ ల దర్శనిమిచ్చింది.
 
ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ముగిసి విరాట్ కోహ్లికి కావాల్సిన విశ్రాంతి దొరకడంతో ప్రియురాలు అనుష్కతో కలిసి న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకోనున్నాడు. దీనిలో భాగంగానే ఈసారి ఆ జంట ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని న్యూఇయర్ వేడుకలకు ఎంచుకుంది. గతేడాది నూతన సంవత్సర వేడుకల్ని విరాట్-అనుష్కలు విదేశాల్లో జరుపుకున్నారు.

Wednesday, December 28, 2016

పండగ సందడికి సై

హరిదాసుల హడావిడి... బసవన్నల సందడి... కొత్త అల్లుళ్ల హంగామా... బావా  మరదళ్ల చిలిపి వేషాలు.. మన సంస్కృతి, కుటుంబ విలువలకు అద్దం పట్టే సంక్రాంతి పండగ అప్పుడు కనిపించే దృశ్యాలు ఇవే. మా ‘శతమానం భవతి’ కూడా ఇలాంటి దృశ్యాలతో కూడిన అందమైన కుటుంబ కథాచిత్రమే. ఈ పండక్కి థియేటర్లలో సంక్రాంతి శోభ తీసుకొస్తుందంటున్నారు నిర్మాత ‘దిల్‌’ రాజు. శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌లు నిర్మించిన సినిమా ‘శతమానం భవతి’.

తాతా మనవళ్ల అనుబంధం, కుటుంబ విలువలతో తెరకెక్కిన ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ‘‘శర్వానంద్‌కి 25వ చిత్రమిది. ఇటీవల విడుదలైన మిక్కి జె.మేయర్‌ స్వరాలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సెన్సార్‌ బోర్డు నుంచి క్లీన్‌ ‘యు’ సర్టిఫికేట్‌ లభించింది’’ అని దర్శకుడు తెలిపారు. ప్రకాశ్‌రాజ్, జయసుధ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: సమీర్‌రెడ్డి.

స్పీడు స్పీడులే... ఇది సూపర్‌ స్పీడులే!

 ‘నరసింహ’ సినిమా క్లైమాక్స్‌లో రజనీకాంత్‌ ఫైట్‌ చేస్తుంటే కారులో కూర్చున్న నటుడు అబ్బాస్‌ ‘ఆహా.. మీకింకా వయసు అవ్వలేదు’ అనే డైలాగ్‌ చెబుతాడు. ‘నరసింహ’లోని ఒక్క ఫైట్‌ మాత్రమే కాదు.. సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ రజనీ స్పీడ్‌ చూసి అభిమానులు ప్రశంసించకుండా ఉండలేరు. ఇప్పుడీ సూపర్‌స్టార్‌ స్పీడ్‌ చూసి ప్రముఖ సౌండ్‌ డిజైనర్‌ రసూల్‌ పూకుట్టి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా ‘2.0’కి ఈయనే సౌండ్‌ డిజైనర్‌గా పని చేస్తున్నారు. సోమవారం నుంచి రజనీకాంత్‌ తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించారు. ఒక్క రోజులో మూడు రీళ్లకు డబ్బింగ్‌ చెప్పేశారని రసూల్‌ పూకుట్టి ట్వీట్‌ చేశారు. ‘‘వృత్తి పట్ల తలైవా (రజనీకాంత్‌) అంకితభావం, నిబద్ధత అసమానం.
ఆయనకు ఆయనే సాటి. ఒక్క రోజులో మూడు రీళ్లకు డబ్బింగ్‌ చెప్పారు. ఆయన వర్క్‌ చూసి నేను ఆశ్చర్యపోయా’’ అని రసూల్‌ అన్నారు. రసూల్‌ మాటలు వింటుంటే, ‘బాషా’లో సూపర్‌ స్టార్‌ సై్టల్‌ను ఉద్దేశించి రాసిన ‘సై్టలు సై్టలులే.. ఇది సూపర్‌ సై్టలులే...’ పాటను ఆయన స్పీడుకి ఆపాదించి, ‘స్పీడు స్పీడులే.. ఇది సూపర్‌ స్పీడులే’ అని కూడా అనొచ్చేమో అనిపిస్తోంది. అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా, హిందీ హీరో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటిస్తున్న ఈ సిని మాకు రెహమాన్‌ సంగీత దర్శకుడు.

ఖుషీ కాంబినేషన్ లో మరో మూవీ

పెళ్లి తరువాత సినిమాకు దూరమైన జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది. ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ., ఆరేళ్ల పాటు వెండితెరకు దూరమైంది. తరువాత 2015లో 36 వయొనిథిలే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక, ఇప్పుడు మరో లేడి ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది. అయితే రీ ఎంట్రీలో గ్లామర్ రోల్స్ కు మాత్రం కాస్త దూరంగానే ఉంటోంది.

తాజాగా జ్యోతిక., ఓ స్టార్ హీరోకు జోడిగా నటించేందుకు ఓకె చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 61వ సినిమాగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీలో జ్యోతిక, విజయ్ కు జోడిగా కనిపించనుందట. సమంత, కాజల్ అగర్వాల్ లు గ్లామర్ రోల్స్ లో నటిస్తుండగా మరో కీలక పాత్రకు జ్యోతిక ఓకే చెప్పిందన్న ప్రచారం జరుగుతోంది.

దాదాపు 14 ఏళ్ల క్రితం తమిళ సినిమా ఖుషీలో విజయ్, జ్యోతికలు జంటగా నటించారు. ఇన్నేళ్ల తరువాత ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతానికి యూనిట్ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా విజయ్, జ్యోతికల కాంబినేషన్ సినిమాకు ప్లస్ అవుతుందన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది.

Tuesday, December 27, 2016

‘హుష్‌’.. అది నిజం కాదు!

నయనతార ముఖ్య తారగా చక్రి తోలేటి దర్శకత్వంలో సంగీత దర్శకుడు యువన్‌శంకర్‌ రాజా నిర్మించనున్న సినిమా ‘కొలై ఉదిర్‌ కాలమ్‌’. త్వరలో చిత్రీకరణ ప్రారంభించనున్నారు. సెట్స్‌ మీదకు వెళ్లడానికి ముందే ఈ సినిమా వార్తల్లో నిలిచింది. కమల్‌హాసన్‌ ‘ఈనాడు’, అజిత్‌ ‘బిల్లా–2’ సినిమాల తర్వాత చక్రి తోలేటి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని ‘రెడ్‌ ఎపిక్‌–డబ్ల్యూ’ అడ్వాన్స్‌ టెక్నాలజీ కెమేరాతో 8కె రిజల్యూషన్‌లో షూట్‌ చేయనున్నారు. ‘‘8కె రిజల్యూషన్‌లో షూటింగ్‌ చేయనున్న తొలి భారతీయ చిత్రాల్లో మా ‘కొలై ఉదిర్‌ కాలమ్‌’ ఒకటి’’ అన్నారు దర్శకుడు చక్రి తోలేటి. ఈ సినిమా హాలీవుడ్‌ మూవీకి రీమేక్‌ అని వార్తలొచ్చాయి. వాటిపై స్పందిస్తూ.. ‘‘అమెరికన్‌ హారర్‌ థ్రిల్లర్‌ ‘హుష్‌’కు రీమేక్‌ కాదిది. అందులో ఓ పాత్ర స్ఫూర్తితో సరికొత్త కథ రాసుకున్నాం’’ అన్నారాయన

పబ్లిసిటీ కోసమే అలా చేశారు

  గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా నటించిన తొలి హాలీవుడ్‌ చిత్రం ‘బేవాచ్‌’. ఇందులో ప్రియాంక విలన్‌గా కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. దేశీగర్ల్‌ ప్రియాంక ట్రైలర్‌లో ఎలా కన్పించబోతోందోనని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు కానీ వారి ఆశ అడియాసైంది. ఎందుకంటే ట్రైలర్‌లో ప్రియాంక అర సెకనుకు మించి కన్పించలేదు. దాంతో అసలు ప్రియాంక సినిమాలో ఉందా.. లేదా.. అతిథిగా అలా వచ్చి వెళ్లిపోతుందా.. అంటూ అభిమానులు సోషల్‌మీడియాలో కామెంట్స్‌ చేశారు.
ఈ విషయమై ప్రియాంక తల్లి మధు చోప్రా స్పందిస్తూ.. ఇదంతా చిత్రబృందం పబ్లిసిటీ కోసం చేసిందేనని సినిమాలోని బెస్ట్‌ పార్ట్‌ను ముందే చూపించేస్తే అంత పబ్లిసిటీ ఉండదని వారు ఇలా చేశారని పేర్కొన్నారు. సినిమాలో ప్రియాంకదే బెస్ట్‌ పార్ట్‌ అని మధు అన్నారు. ఇంతకుముందు తన కుమార్తెపై వచ్చే నెగెటివ్‌ వార్తల గురించి ఎక్కువగా టెన్షన్‌ పడేదాన్నని, ఇప్పుడు అసలు పట్టించుకోవడంలేదని, ఎందుకంటే ప్రియాంక గురించి తల్లిగా తనకే బాగా తెలుసన్నారు. ప్రియాంకపై ఎవరైనా తప్పుగా రాసినా నమ్మనని, ఆమె చాలా నిజాయతీగా ఉంటుందని చెప్పారు. అలా అని ప్రియాంక ఏ విషయంలోనూ పొరపాటు చేయదని తాను అనడంలేదు కానీ, తప్పు మాత్రం చేయదని కుమార్తెను వెనకేసుకొచ్చారు మధు. సేథ్‌ గోర్డాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ప్రియాంక క్రిస్మస్‌ సందర్భంగా ఇండియాకి వచ్చింది. కొద్దిరోజులు కుటుంబంతో గడిపి తిరిగి అమెరికా వెళ్లిపోతుంది.

Monday, December 26, 2016

అందుకు టైం కలసి రావాలి

పెళ్లికి నేను తయారయ్యాను కానీ అంటున్నారు అందాల తార అనుష్క. ఈ తరం నటీమణుల్లో లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల నటిగా పేరు తెచ్చుకున్న మొదటి నటి అనుష్క అని పేర్కొనవచ్చు. అరుంధతి చిత్రంలో తన అట్టహాస నటన అంత సులభంగా మర్చిపోలేం. అదే విధంగా శత్రుసేనను తన ఖడ్గంతో చీల్చి చెండాడిన వీర వనిత రుద్రమదేవిగా అభినయం గుర్తుండి పోతుంది. 35 ఏళ్ల పరువాల ఈ కాంత ఇంకా జతను నిర్ణయించుకోలేదు. అయితే త్వరలో అనుష్క ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయని, కాబోయే వరుడి ఎంపిక కూడా జరిగిపోయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే విధంగా ఈ ఏడాది అనుష్క నటించిన ఒక్క చిత్రం కూడా తెరపైకి రాలేదు. ఈ విషయాల గురించి ఈ యోగా సుందరి ఎలా స్పందించారో చూద్దాం.

నా పెళ్లి ఎప్పుడని చాలా మంది చాలా సార్లు అడుగుతున్నారు. కొందరైతే పెళ్లి కొడుకు నిశ్చయం అయ్యాడు, బెంగళూర్‌కు చెందిన వ్యాపార వేత్తను అనుష్క వరించనుంది. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోనున్నాను అనే దుమారం రేపుతున్నారు. నిజానికి పెళ్లికి నేను తయరయ్యాను. అయితే అందుకు కాలం కలిసి రావాలిగా. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలున్నాయి. కథానాయకికి ప్రాముఖ్య ఉన్న కథా చిత్రాలనే ఎంపిక చేసుకుని నటిస్తున్నాను. గత ఏడాది మంచి కథా చిత్రాల్లో నటించాను. బాహుబలి చిత్రంలో నా పాత్ర ప్రశంసలు అందుకుంది. ఇడుప్పళగి చిత్రం కోసం బరువు భారీగా పెంచి నటించాను. రుద్రమదేవి చిత్రం మంచి ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇక ఈ ఏడాది నా చిత్రాలేవీ విడుదల కాలేదు. ఇది కాస్త నిరాశ పరచే అంశమే. అయితే వచ్చే ఏడాది వరసగా మూడు చిత్రాలు తెరపైకి రానున్నాయి. బాహుబలి–2, ఎస్‌–2, నమో వెంకటే«శాయ చిత్రాల్లో ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించాను. ఇది సంతోషకరమైన విషయం. బాహుబలి–2లో నేను పోషించిన దేవసేన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఓం వెంకటేశాయ భక్తిరస కథా చిత్రం.ఈ చిత్రాల్లో నన్ను వైవిధ్యభరిత పాత్రల్లో చూడవచ్చు.

అక్కడ రాత్రి.. ఇక్కడ పగలు!

 అమ్మ మధు చోప్రా, నిర్మాత వసు భగ్నాని కూతురు దీప్షికా దేశ్‌ముఖ్‌లతో కలసి ప్రియాంకా చోప్రా నిర్మించిన పంజాబీ చిత్రం ‘సర్వన్న్‌’. ఈ సినిమా షూటింగ్‌ జరిగినన్ని రోజులూ ‘క్వాంటికో’ టీవీషో, ‘బేవాచ్‌’ సినిమా కోసం ప్రియాంక విదేశాల్లోనే ఉన్నారు. అయితే.. నిర్మాణ బాధ్యతలన్నీ మిగతా ఇద్దరిపై వేయలేదట!
మనకూ, అమెరికాకీ సుమారు 11 గంటల వ్యత్యాసం ఉంది. అమెరికాలో పగలంతా షూటింగ్‌ చేసి, రాత్రి హోటల్‌ రూమ్‌కి చేరుకునేసరికి ఇండియాలో పగలు అవుతుంది. అప్పుడు ప్రియాంక ఫోనులో ‘సర్వన్న్‌’ టీమ్‌కి సలహాలిస్తూ, పనులను పర్యవేక్షించేవారట! అలా.. పగలు నటిగా.. రాత్రి నిర్మాతగా కష్టపడి పనిచేశానన్నారు.

Sunday, December 25, 2016

నేను రిటైర్‌కావట్లేదు

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి ఇప్పట్లో రిటైర్‌కానని పాకిస్థాన్‌ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది స్పష్టం చేశాడు. వీడ్కోలు మ్యాచ్‌ కావాలని తాను పీసీబీని కోరినట్లు వస్తున్న వార్తలను అతడు కొట్టిపారేశాడు. ‘‘నేను 20 ఏళ్లు పాకిస్థాన్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడా. పీసీబీ తరఫున కాదు. ఒక మ్యాచ్‌ కోసం నేనెవరిపైనా ఆధారపడిలేను. శ్రేయోభిలాషులు, అభిమానుల నుంచి పొందిన ప్రేమే నాకు పెద్ద బహుమానం’’ అని అఫ్రిది చెప్పాడు. వీడ్కోలు మ్యాచ్‌ కోసం పాకిస్థాన్‌ బోర్డును అడగబోనని అతడు అన్నాడు. ‘‘నా కెరీర్‌ ముగిసిందని అనుకోవట్లేదు. క్రికెట్లో కొనసాగుతా. ఇక పాకిస్థాన్‌ జట్టుకు ఎంపికవడం అనేది సెలక్టర్ల చేతుల్లో ఉంది’’ అని అఫ్రిది చెప్పాడు.

'అద్భుతం చూడాలంటే వెయిట్ చేయాల్సిందే'


  సూపర్ స్టార్ మహేష్ బాబు తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనా ఇంత వరకు రాలేదు. షూటింగ్ అప్ డేట్స్ లీక్ చేస్తున్నప్పటికీ.. సినిమా టైటిల్ ఏంటి.. ఫస్ట్ లుక్ ఎప్పుడు.. ఎలా ఉండబోతుంది అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు.

ఇటీవల న్యూ ఇయర్ కానుకగా మహేష్ బాబు ఫస్ట్ లుక్ వస్తుందని భారీ ప్రచారమే జరిగింది. అంతేకాదు అదే రోజు సినిమా టైటిల్ కూడా ఎనౌన్స్ చేస్తారని భావించారు. అయితే ఇప్పట్లో ఫస్ట్ లుక్ గాని, టైటిల్ గాని ఎనౌన్స్ అయ్యే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో మరోసారి సూపర్ స్టార్ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ విషయం పై సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రియదర్శి స్పందించాడు.

పెళ్లి చూపులు సినిమాతో ఆకట్టుకున్న ప్రియదర్శి.. మహేష్, మురుగదాస్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల మహేష్ అభిమానులతో తన అనుభవాలను పంచుకున్న ఈ యువనటుడు ఫస్ట్ లుక్ ఆలస్యం అవ్వటంపై స్పందించాడు. అద్భుతాన్ని చూడాలంటే కాస్త వెయిట్ చేయాలని.. సూపర్ స్టార్ అభిమానుల కోసం దర్శకుడు అద్భుతమైన విజువల్ వండర్ ను సిద్ధం చేస్తున్నాడని తెలిపాడు.

Saturday, December 24, 2016

ఫేస్‌బుక్‌లో ‘దంగల్‌’ పూర్తి సినిమా లీక్‌!

 ఆమిర్‌ ఖాన్‌ కీలక పాత్రలో నటించిన ‘దంగల్‌’ సినిమా పైరసీకి గురైంది. ఈ సినిమా పూర్తి వీడియోను ఓ వ్యక్తి తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ను బట్టి చూస్తే.. దుబాయ్‌కి చెందిన హష్మీ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ‘దంగల్‌’ పూర్తి వీడియోను పోస్ట్‌ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారి, పోస్ట్‌ చేసిన 14 గంటల్లోనే 8,33,000 మంది చూశారు. అయితే కాపీ రైట్స్‌ కారణంగా ప్రస్తుతం ఆ వీడియోను డిలీట్‌ చేశాడు.
సాక్షి తన్వర్‌, ఫాతిమా సనా షేక్‌, సన్యా మల్హోత్రా, అపర్‌శక్తి ఖురానా, వివన్‌ భటేనా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. నితీష్‌ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రీతమ్‌ చక్రవర్తి స్వరాలు సమకూర్చారు.

Friday, December 23, 2016

తొలిప్రేమ జ్ఞాపకాలు

 జీవా, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ఎంత వరకు ఈ ప్రేమ. డీకే దర్శకుడు. డీవీ సినీ క్రియేషన్స్ పతాకంపై డి. వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రమిది. తమిళంలో కావలైవేండాం పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండటం ఆనందంగా ఉంది. పెళ్లి తర్వాత ప్రేమలో పడిన ఓ జంట కథ ఇది.
అపార్థాలు, అపోహలతో విడిపోయిన వారు మళ్లీ ఏ విధంగా ఏకమయ్యారు? అనేది చక్కటి వినోదాన్ని పంచుతుంది. తొలి ప్రేమ జ్ఞాపకాలను అందంగా ఆవిష్కరించే చిత్రమిది. కాజల్ అగర్వాల్ నటన, గ్లామర్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇటీవలే విడుదలైన పాటలకు చక్కటి స్పందన లభిస్తోంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు.ఏ సర్టిఫికెట్ లభించింది. సరికొత్త ప్రేమకథగా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అని తెలిపారు. బాబీసింహా, శృతిరామకృష్ణన్, సునయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: టి.ఎస్.సురేష్.

'వంగవీటి' మూవీ రివ్యూ

 చాలా కాలంగా తన స్థాయికి తగ్గ సినిమాలు తీయడంలో ఫెయిల్ అవుతున్న రామ్ గోపాల్ వర్మ.., ఇదే తెలుగులో నా ఆఖరి సినిమా.. ఈ సారి తప్పకుండా మెప్పిస్తానని చెప్పి మరీ తీసిన సినిమా వంగవీటి. గతంలో అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో రక్తచరిత్ర తీసిన వర్మ, పాత్రలను నిజజీవిత పేర్లతో కాకుండా ఆ భావం వచ్చేలా చూపించాడు. కానీ వంగవీటి విషయంలో మాత్రం మరో అడుగు ముందుకు వేసి.. నిజజీవితంలోని పేర్లతో యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన వంగవీటి వర్మ స్థాయిని ప్రూవ్ చేసిందా..?
కథ :
విజయవాడ రౌడీయిజం.. అందరికీ తెలిసిందే అయినా వర్మ తన మార్క్ సినిమాటిక్ టచ్ తో ఆ కథను మరింత ఎఫెక్టివ్ గా చూపించే ప్రయత్నం చేశాడు. ఎర్రపార్టీ నాయకుడు చలసాని వెంకటరత్నం విజయవాడ సిటీలో పేదలకు అండగా ఉంటూ లీడర్ గా ఎదుగుతాడు. అదే సమయంలో బస్టాండ్ లో చిన్న రౌడీగా ఉన్న వంగవీటి రాధ. వెంకటరత్నం దగ్గర పనిలో చేరి అతన్ని మించిపోయే స్థాయిలో పేరు తెచ్చుకుంటాడు. రాధ ఎదుగుదలను తట్టుకోలేని వెంకటరత్నం ఇంటికి పిలిచి రాధను అవమానిస్తాడు. తనకు జరిగిన అవమాన్ని జీర్ణించుకోలేని రాధ వెంకటరత్నాన్ని పక్కా ప్లాన్ తో దారుణంగా నరికి నరికి చంపుతాడు.

అప్పటి వరకు ఓ లీడర్ వెనుక అనుచరిడిగా ఉన్న రాధ, వెంకటరత్నం మరణంతో విజయవాడను శాసించే నాయకుడిగా మారతాడు. తనకు ఎదురొచ్చిన వారందరిని అడ్డుతప్పించుకుంటూ ఎవరూ ఎదిరించలేని స్థాయికి చేరుకుంటాడు. ఆ సమయంలో విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే దేవినేని గాంధీ, దేవినేని నెహ్రులు కాలేజీ గొడవలో పార్టీ ప్రమేయాన్ని ఆపాలంటూ రాధను కలుస్తారు. రాధ మంచితనం నచ్చి అతనితో కలిసి ఓ పార్టీని ఏర్పాటు చేసి విద్యార్థులతో కలిసి రాధకు అండగా నిలుస్తారు.
రాధ ఎదుగుదలతో విజయవాడ నగరంలో ఎర్ర పార్టీ ఆనవాళ్లు లేకుండా పోతాయన్న భయంతో ఆ పార్టీ పెద్దలు రాధ హత్యకు పథకం వేస్తారు. ఓ సెటిల్మెంట్ కోసం పిలిపించి ఒంటరిని చేసి చంపేస్తారు. అప్పటి వరకు రాజకీయం, రౌడీయిజం తెలియని రాధ తమ్ముడు రంగా., తప్పనిసరి పరిస్థితుల్లో అన్న బాటలోకి అడుగుపెడతాడు. అప్పటి వరకు అన్నకు అండగా ఉన్న దేవినేని సోదరులతో అభిప్రాయ భేదాలు రావటంతో వారు సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకుంటారు. దేవినేని సోదరుల నుంచి రంగా ప్రాణానికి ముప్పు ఉందని భావించి ఆయన అనుచరులు గాందీని చంపేస్తారు. అన్న మరణంతో దేవినేని మురళి రగలిపోతాడు. ఎలాగైన రంగా మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. (శివ టు వంగవీటి.. ఫొటోలకు ఇక్కడ క్లిక్ చేయండి)
అప్పటి వరకు రౌడీగా ఉన్న రంగా ఓ జాతీయ పార్టీ నుంచి టికెట్ పొంది ఎమ్మెల్యేగా గెలుస్తాడు. అదే సమయంలో ఆంధ్రరాష్ట్రంలో కొత్తగా వచ్చిన ఓ ప్రాంతీయ పార్టీలో చేరిన నెహ్రు కూడా ఎమ్మెల్యేగా ఎన్నికవుతాడు. నెహ్రు ఎమ్మెల్యే కావటంతో అతని తమ్ముడు మురళీకి పగ తీర్చుకునేందుకు కావాల్సిన అన్ని వనరులు అందుతాయి. దీంతో గాంధీ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఒక్కొక్కరిని వెతికి వెతికి చంపుతాడు. అంతేకాదు ఏకంగా రంగా.. ఇంటికే ఫోన్ చేసి ఆయన భార్య రత్న కుమారికి వార్నింగ్ ఇస్తాడు.మరోసారి మురళీ వల్ల రంగాకు ప్రమాదం ఉందని భావించి అతన్ని కూడా రంగా అనుచరులు చంపేస్తారు.
అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ విజయవాడలో పెరిగిపోతున్న రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని నిర్ణయించుకుంటుంది. ప్రజా సమస్యల కోసం తన ఇంటి ముందే నిరాహార దీక్ష చేస్తున్న రంగాను నల్ల బట్టల్లో వచ్చిన దుండగులు దీక్షా వేదిక మీద నరికి చంపేస్తారు. రంగ మరణంతో రగిలిపోయినా విజయవాడ కొద్ది రోజులకు సాధారణ స్థితికి చేరుకుంటుంది. అయితే రంగా మరణం వెనక ఉన్నది ఎవరు అన్నది మాత్రం వర్మ కూడా ప్రేక్షకులకు ప్రశ్నగానే వదిలేశాడు.

ప్లస్ పాయింట్స్ :
వర్మ మార్క్ టేకింగ్
సందీప్ ద్విపాత్రాభినయం
యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్ :
డైలాగ్స్
మితిమీరిన రక్తపాతం

Thursday, December 22, 2016

నన్ను దూరం పెట్టారు: హీరోయిన్‌

తనను దక్షిణాది సినీ పరిశ్రమ దూరం పెట్టిందనే ఆవేదనను నటి ఇలియానా వ్యక్తం చేశారు. ఇంతకు ముందు దక్షిణాది చిత్ర పరిశ్రమ ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఈ గోవా సుందరిని తలపై ఎక్కించుకొని మోసింది. నన్భన్‌ చిత్రంతో తమిళ సినీ ప్రేక్షకులను అలరించిన ఇలియానాకు ఆ సమయంలో పలు అవకాశాలు వచ్చాయి. అయితే అప్పుడు ఈ అమ్మడు బెట్టు చేశారు. బాలీవుడ్‌ మోజుతో దక్షిణాది చిత్రాలను తక్కువగా చూశారు. అయితే తాను ఊహించింది జరగలేదు. బాలీవుడ్‌ ఇలియానాను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మళ్లీ దక్షిణాదికే మకాం మార్చాలన్న ప్రయత్నాలు మొదలెట్టారు.
 
ఇటీవల ఈత దుస్తులతో అందాలారబోసిన ఫొటోలను ఇంటర్నెట్‌లో విడుదల చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలన్న సామెతను మరిచిన ఇలియానాకు ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమ షాక్‌ ఇచ్చింది. ఆమెను అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో దక్షిణాది సినిమా తనను పక్కన పెట్టేసిందని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఇలియానా. ప్రస్తుతం ఈ భామ ఏమంటున్నారో చూద్దాం. ప్రస్తుతం హిందీలో ఒకటి రెండు చిత్రాలే చేస్తున్నాను. దక్షిణాదిలో ఒక్క అవకాశం కూడా రావడం లేదు. కారణం ఏమిటో తెలియడం లేదు. ఈ మధ్య ఒక తెలుగు దర్శకుడు వచ్చి కథ చెప్పారు. మా చిత్రంలో మీరే కథానాయకి అని నమ్మపలికారు. అంతే మళ్లీ కంట పడలేదు. ఇప్పుడా చిత్రంలో వేరే నటి నటిస్తున్నారు. నన్నెందుకు తొలగించారని నేనా దర్శకుడిని అడగ్గా సారీ అని ఫోన్‌ పెట్టేశారు.
 
నిజం చెప్పాలంటే నేను చేసిన చిత్రాలన్నీ ఇష్టపడి చేసినవే. అర్ధాంగీకారంతో ఏ చిత్రం చేయలేదు. హిందీలో బర్ఫీ చిత్రం నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. తర్వాత అక్షయ్‌కుమార్‌కు జంటగా నటించడం మంచి అనుభవం. నేను నటించిన ప్రతి చిత్రంతో చాలా నేర్చుకున్నాను. నటించిన సన్నివేశం పూర్తి కాగానే దర్శకుడి ముఖంలోకి చూస్తాను. ఆయనలో సంతోషం కనిపిస్తే నేను సంతృప్తి పడతాను. ఇక జయాపజయాల గురించి పెద్దగా పట్టించుకోను. దక్షిణాది దర్శక నిర్మాతల నుంచి మంచి పాత్రలో నటించే అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తున్నాను అని పేర్కొన్నారు. ఇది ఇలియానా ఎదురు చూపుల వేదన.

వాళ్ల కొడుకు పేరు వాళ్లిష్టం.. మీకెందుకు?



నెటిజన్లను హెచ్చరించిన రిషికపూర్‌
బాలీవుడ్‌ జంట సైఫ్‌అలీ ఖాన్‌, కరీనా కపూర్‌లు తమ చిన్నారికి తైమూర్‌ అలీఖాన్‌ పటౌడీ అని పేరుపెట్టుకున్నారు. అయితే ఈ పేరు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కొందరు బాబుకు ఈ పేరు ఎందుకు పెట్టారో చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. దీనికి కారణం ఉంది.. తైమూర్‌ అనే పేరున్న మంగోల్‌ రాజు 14వ శతాబ్దంలో భారతదేశంపై దాడిచేశాడు. దిల్లీపై దాడి చేసి వందల మంది ప్రాణాలను బలిగొన్నాడు. ఇది పక్కనపెడితే తైమూర్‌ అంటే.. ఉక్కు మనిషి, ధీరత్వం గల రాజు అని అర్థం వస్తుంది. నెటిజన్లు చేసిన కామెంట్స్‌ చూసిన నటుడు, కరీనా కపూర్‌ బాబాయి రిషి కపూర్‌ ట్విట్టర్‌ వేదికగా వారిని హెచ్చరించారు. గతంలో దేశాన్ని ఆక్రమించిన వ్యక్తి పేరును ఇప్పుడు బాబు పేరుతో పోల్చడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘తల్లిదండ్రులు తమ కుమారుడికి పేరు పెట్టుకోవాలనుకుంటే.. జనాలు ఎందుకింత బాధపడిపోతున్నారో తెలియడం లేదు. మీ పని మీరు చూసుకోండి. పిల్లలకి ఏ పేరు పెట్టాలనేది తల్లిదండ్రుల ఇష్టం’ అని ట్వీట్‌ చేశారు.
తర్వాత ఇంకా కోపంతో ‘మీ పని మీరు చూసుకోండి. మీ పిల్లల పేర్లు మీరు పెట్టలేదా? కామెంట్‌ చేయడానికి మీరెవరు?’ అని ట్వీట్‌ చేశారు. ఇకపై ఈ విషయంపై వాదనలు చేస్తే చాలా మంది బ్లాక్‌(ట్విట్టర్‌లో) అయిపోతారని హెచ్చరించారు.

Wednesday, December 21, 2016

ఆ సినిమాకు టికెట్‌ ధరలు పెంచొద్దు..

  త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘దంగల్‌’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ‘దంగల్‌’ సినిమా టికెట్‌ ధరలను పెంచొద్దని డిస్ట్రిబ్యూటర్లను ఆమిర్‌ఖాన్‌ కోరాడు. పెద్ద సినిమాలు విడుదలైన సందర్భంగా తొలి వారంలో టికెట్‌ ధరలు పెంచడం సాధారణమే. అయితే ఇతర సినిమాల మాదిరిగా దీనికి ధరలను పెంచవద్దని కోరుతున్నాడు ఆమిర్‌.
‘అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా చేరాలి. టికెట్‌ ధరలు పెంచొద్దని థియేటర్‌ యజమానులను కోరుతున్నా. పన్ను మినహాయింపు కూడా లభిస్తే ఇంకా బాగుంటుంది. ప్రేక్షకులకు లాభం కూడా చేకూరుతుంది. పన్ను మినహాయింపు కోసం 12 రాష్ట్రాలకు దరఖాస్తు చేసుకున్నాం’ అని చెప్పాడు ఈ బాలీవుడ్‌ మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌. హరియాణా మల్లయోధుడు మహావీర్‌ ఫొగట్‌ జీవిత కథ ఆధారంగా రెజ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా డిసెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్ సినిమాలో కన్నడ స్టార్ హీరో


ప్రస్తుతం కాటమరాయుడు సినిమాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్, ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమాను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది.

పవన్ సరసన కీర్తీ సురేష్, అను ఇమ్మాన్యూల్ లను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో మరో కీలక పాత్రకు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించనున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించిన ఉపేంద్ర మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

Tuesday, December 20, 2016

కరీనా ఇంట బుల్లి నవాబు


బాలీవుడ్‌ జంట కరీనా కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌ ఇంట ఆనందం వెల్లివెరిసింది. కరీనా ఓ బుల్లి నవాబుకు జన్మనిచ్చి తల్లిగా మారింది. మంగళవారం ఉదయం ముంబయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరీనాకు మగబిడ్డ పుట్టాడు. కరీనా దంపతులు తమ బిడ్డకు తైమూర్‌ అలీఖాన్‌ పటౌడీ అని పేరుపెట్టారు. కుమారుడు పుట్టిన వెంటనే అతని పేరు మీద ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ప్రారంభించి అందులో తమ ఆనందం పంచుకున్నారు. ‘‘మాకు కుమారుడు పుట్టాడన్న శుభవార్తను అందరితో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. మాపై ఎంతో ప్రేమ చూపిస్తున్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతల’’ని కరీనా దంపతులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ శుభసందర్భంలో కరీనా సోదరి కరిష్మా కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌ సోదరి సోహా అలీఖాన్‌తో పాటు కరణ్‌ జోహార్‌, సోనమ్‌ కపూర్‌, కాజల్‌ అగర్వాల్‌, అమృతా అరోరా తదితర బాలీవుడ్‌ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరోయిన్..?

 ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారు కూడా సక్సెస్ లు లేక అవకాశాల కోసం ఎదురుచూస్తుంటే.. ఓ యంగ్ హీరోయిన్ మాత్రం కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుందట. ఇటీవల ఎక్కడికీ పోతావు చిన్నవాడా సినిమాతో మరో హిట్ అందుకున్న ఈ భామ తరువాత ఒక్క తెలుగు సినిమా కూడా అంగీకరించలేదు.
అయితే ఈ ముద్దుగుమ్మ త్వరలోనే నటనకు గుడ్ బై చెప్పనుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇటీవల ఓ యంగ్ హీరోతో వివాదంతో అవికా పేరు వార్తల్లో ప్రముఖంగా వినిపించింది. దీంతో ఈ అమ్మడు టాలీవుడ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. అయితే కేవలం తెలుగు సినిమాలకు గుడ్ బై చెపుతుందా..? లేక నటనకే గుడ్ బై చెపుతుందా..? అన్న విషయంపై మాత్రం తెలియరాలేదు.

Monday, December 19, 2016

ఐటం సాంగ్‌ అంటే తెలియదు

 సినిమాల్లో ఐటమ్‌ సాంగ్‌ ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐటమ్‌ సాంగ్‌ లేకుండా ఇప్పుడు సినిమాలే ఉండట్లేదు. ఇది ఇప్పటి సంప్రదాయం కాదు.. సినిమా తొలినాళ్ల నుంచి ఇలాంటి ఐటమ్‌ సాంగ్స్‌ ఉన్నాయి. మాస్‌ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకునే అంశాల్లో ఐటమ్‌ సాంగ్‌ ఒకటి. అందుకే సినిమా సినిమాకి ఇలాంటివి మరింత ఆకర్షణీయంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే.. బాలీవుడ్‌ భామ సన్నీ లియోనీ మాత్రం తనకు ఐటమ్‌ సాంగ్‌ అంటే ఏంటో తెలియదంటోంది.
శృంగార తార సన్నీ లియోనీ 2012లో ‘జిస్మ్‌-2’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టి బీటౌన్‌ జనాల్ని తనవైపునకు తిప్పుకుంది. ఎంతలా అంటే కేవలం సన్నీలియోనీ ప్రధాన పాత్రలోనే వరసపెట్టి సినిమాలు వస్తున్నాయి. ఆమె నృత్యం కోసం సినిమాలు చూసే అభిమానులున్నారు. అందుకే బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌ నటిస్తున్న ‘రయీస్‌’ మరింత ఆకర్షణీయంగా ఉండాలని సన్నీతో ‘లైలా మే లైలా’ అనే పాటతో ఐటమ్‌సాంగ్‌ను చిత్రీకరించారు. దీని గురించి మాట్లాడుతూ.. ‘ఈ పాట చిత్రంలో చాలా ముఖ్యమైనది. ఆ పాటే కథను ముందుకు తీసుకెళ్తుంది. కానీ.. దాన్ని చాలా మంది ఐటమ్‌ సాంగ్‌ అంటున్నారు. అసలు ఐటమ్‌ సాంగ్‌ అంటే ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. చిన్నప్పట్నుంచి నేను పాటలు వింటున్నాను. కానీ ఐటమ్‌ సాంగ్‌ అంటే ఎంటో తెలియదు. ఇలాంటి పాటలు బాలీవుడ్‌ తొలినాళ్ల నుంచి ఉన్నాయి. ప్రేక్షకులు వాటిని చూసేందుకు ఇష్టపడతారు. నా దృష్టిలో ఐటమ్‌సాంగ్స్‌ చేయడంలో ఎలాంటి తప్పు లేదు’ అని చెప్పుకొచ్చింది.

Sunday, December 18, 2016

రాజమౌళి మహాభారతం తీస్తే నేను శ్రీకృష్ణుణ్ని

ఆమీర్‌ఖాన్‌... బాక్సాఫీసు సంచలనం. ఆయన ఎంచుకొన్న ప్రతి పాత్ర, ప్రతి కథా.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. ప్రయోగాత్మక చిత్రాలతోనూ వసూళ్ల వర్షం కురిపించొచ్చని నిరూపించిన కథానాయకుడాయన. ‘తారే జమీన్‌ పర్‌’, ‘త్రీ ఇడియట్స్‌’, ‘పీకే’... ఇలా ఒకదాన్ని మించి మరో మైలురాయిని సృష్టించుకొంటూ వెళ్తున్నాడు. ఆమీర్‌ నటించిన ‘దంగల్‌’ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం తెలుగులోనూ అనువాదమైంది. ‘దంగల్‌’ ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌ వచ్చాడు ఆమీర్‌ ఖాన్‌. ఈ సందర్భంగా పాత్రికేయులతో ముచ్చటించాడు.
‘దంగల్‌’ తెలుగు వెర్షన్‌ చూశారా? మీ పాత్ర తెలుగులో డైలాగులు చెబుతుంటే ఎలా అనిపిస్తోంది? 
‘దంగల్‌’ నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల తెలుగు వెర్షన్‌ని పూర్తిగా చూడలేకపోయా. కానీ తెలుగు ట్రైలర్‌ చూశా. నా పాత్ర తెలుగులో మాట్లాడుతుంటే.. కొత్తగా అనిపించింది.
ఓ తెలుగు కథ మీకెవరైనా వినిపిస్తే చేయడానికి, ఈ భాష నేర్చుకోవడానికి సిద్ధమేనా?
కొత్త భాషలు నేర్చుకోవడం నాకు చాలా ఇష్టం. ‘పీకే’ కోసం భోజ్‌పురి నేర్చుకొన్నా. ‘దంగల్‌’ కోసం హర్యాణీ భాషపై పట్టుసాధించా. ఒకవేళ తెలుగు సినిమాలో నటించాల్సివస్తే తప్పకుండా తెలుగు నేర్చుకొంటా. పూర్తిగా కాకపోయినా నా సంభాషణల వరకూ తెలుసుకొనే ప్రయత్నం చేస్తా.
తెలుగులో నటించాల్సివస్తే మీ సహనటులుగా ఎవరిని ఎంపిక చేసుకొంటారు?
సహ నటుల్ని ఎంపిక చేసే బాధ్యత పూర్తిగా దర్శకుడిదే. నిజంగానే నాకు ఛాయిస్‌ ఉంటే చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ను ఎంచుకొంటా. తమిళంలో రజనీకాంత్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన అభిమానిని నేను. వీళ్లందరితో పనిచేయాలని ఉంది.
ప్రతిసారి కొత్త కథల్ని ఎంచుకొంటూ ప్రయాణం సాగిస్తున్నారు. ఇది మీకెలా సాధ్యమవుతోంది?
నేను రచయితని కాదు. నా కోసం రచయితలు, దర్శకులు మంచి పాత్రలు రాస్తున్నారు. ఈ విషయంలో వాళ్లకు రుణపడి ఉన్నా. నా వరకూ ఓ కథని సామాన్య ప్రేక్షకుడిలానే వింటా. నాలోని సగటు ప్రేక్షకుణ్ని ఆ కథ సంతృప్తిపరిస్తే చాలు. వెంటనే ఒప్పుకొంటా.
‘దంగల్‌’ కోసం బరువు పెరిగారు.. మళ్లీ తగ్గారు. దాని కోసం మీరు చేసిన కసరత్తులు ఎలాంటివి?
బరువు పెరగడానికి పెద్దగా కష్టపడలేదు. నాలుగైదు నెలల్లో 27 కిలోలు పెరిగా. మళ్లీ తగ్గడానికీ అంతే సమయం పట్టింది. వారానికి ఒక పౌండ్‌ చొప్పున తగ్గితే మంచిది. కానీ నేను మాత్రం వారానికి నాలుగు పౌండ్లు తగ్గేవాణ్ని. అలా మూడు వారాలు చేశా. నిజానికి అలా ఉన్నఫళంగా తగ్గడం అంత శ్రేయస్కరం కాదు. అందుకే ఆ తర్వాత వేగం తగ్గించాను. లావుగా ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం కష్టమయ్యేది. కనీసం వంగి షూ లేస్‌ని కూడా కట్టుకోలేకపోయేవాణ్ని.
పాత్ర కోసం ఇంత సాహసం చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్లు కంగారుపడలేదా?
మా అమ్మ, నా భార్య గట్టి వార్నింగ్‌ ఇచ్చారు (నవ్వుతూ). మరోసారి ఇంత రిస్క్‌ చేయొద్దన్నారు. నా భార్య అయితే ‘ప్రతి సినిమాకీ గెటప్‌ మార్చేస్తున్నారు. మీ నిజమైన ఆకారం మర్చిపోతున్నా’ అంటుంటుంది. నిజమే.. తనని తొలిసారి ‘దిల్‌ చాహతాహై’ గెటప్‌లో కలిశా. అప్పటి నుంచీ.. ప్రతి సినిమాకీ గెటప్‌ మార్చుకొంటూ వెళ్తున్నా.
మీ సినిమా అంటే రికార్డుల గురించి మాట్లాడుకోవాల్సిందే. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ స్థాయి వసూళ్లు సాధ్యమేనా?
నేనెప్పుడూ రికార్డుల గురించో.. వసూళ్ల కోసమో సినిమా తీయను. ప్రేక్షకుల హృదయాన్ని తాకితే చాలనుకొంటా.
రాజమౌళితో మీరో సినిమా చేస్తారని ప్రచారం సాగుతోంది. అదెప్పుడు?
రాజమౌళి గొప్ప దర్శకుడు. ఆయనతో పనిచేయాలని నాకూ ఆశగా ఉంది.
రాజమౌళి మహాభారతం తీస్తానని చెబుతుంటారు. మహాభారతం తీస్తే మీరు ఏ పాత్రని ఎంచుకొంటారు?
‘మహాభారత్‌’ అంటే నాకు చాలా ఇష్టం. అందులోని ప్రతి పాత్రా ఇష్టమే. ముఖ్యంగా కర్ణుడు, శ్రీకృష్ణుడు పాత్రలు నన్ను ఆకర్షిస్తాయి. కర్ణుడు కవచకుండలాలతో పుట్టాడు. ఓ యుద్ధ వీరుడు. అలాంటి పాత్రలో నన్ను నేను వూహించుకోవడం కష్టం. కాబట్టి శ్రీకృష్ణుడి పాత్రైతే బాగుంటుంది. ఆ పాత్రకు నేను నప్పుతానా లేదా అనేది రాజమౌళి ఆలోచించుకోవాలి.
పెద్ద నోట్ల రద్దుని స్వాగతిస్తున్నారా?
మంచి ప్రయత్నమే. దీర్ఘకాలిక ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకోవాలి. చిన్న చిన్న సమస్యలున్నాయి. ప్రభుత్వం వీలైనంత త్వరగా చక్కదిద్దుతుందనుకొంటున్నా.

కర్నూలు వెళ్లబోయి కరీంనగర్‌ వెళ్లిన ‘జబర్‌దస్త్‌’ నటి

 నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రం గుర్తుందా? అందులో హీరోయిన్‌ కుటుంబాన్ని శ్రీశైలం తీసుకెళ్లమంటే మర్చిపోయి ఎక్కడికో తీసుకెళ్తాడు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది నటి, వ్యాఖ్యాత రష్మి గౌతమ్‌కు. ‘జబర్‌దస్త్‌’ కార్యక్రమంతో అందరికీ సుపరితురాలైన రష్మి ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలు జిల్లా నంద్యాల వెళ్లాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమానికి ఆలస్యం రావడంతో అక్కడి ప్రేక్షకులకు ఆమె క్షమాపణలు చెప్పారు. కారు డ్రైవర్‌ను కర్నూలు తీసుకెళ్లమంటే కరీంనగర్‌ తీసుకెళ్లాడని దీంతో కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చానని ప్రేక్షకులకు సారీ చెప్పింది రష్మి. అనంతరం అక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో పలు పాటలకు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా రష్మిని చూసేందుకు అభిమానులు పోటెత్తడంతో వారిని నియంత్రించడానికి పోలీసులు కష్టాలు పడాల్సి వచ్చింది.

Saturday, December 17, 2016

బన్నీనే నంబర్ వన్

 వరుసగా 50 కోట్ల సినిమాలతో సత్తా చాటుతున్న యంగ్ హీరో అల్లు అర్జున్. ఆన్ లైన్ లోనూ రికార్డ్ లు సృష్టిస్తున్నాడు. 2016లో ఆన్ లైన్ లో అతి ఎక్కువ మంది సెర్చ్ చేసిన తెలుగు హీరోగా రికార్డ్ సృష్టించాడు బన్నీ. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ లో నిలిచాడు బన్నీ. ఆ తరువాత స్ధానాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, బాహుబలి ప్రభాస్ లు నిలవగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఇటీవల సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ తరువాత కాస్త గ్యాప్ తీసుకొని డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాను ప్రారంభించాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు బన్నీ. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను 2017 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Friday, December 16, 2016

నేను చాలా మారిపోయా!

కొత్త ఏడాది వచ్చేస్తోంది. కొత్త నిర్ణయాలు తీసుకునేవాళ్లు తీసుకుంటున్నారు. 2016 ఎలా గడిచింది అని విశ్లేషించుకునే పని మీద కొంతమంది ఉన్నారు. శ్రుతీహాసన్‌ కూడా ఈ ఏడాది తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి ఓసారి ఆలోచించుకున్నారు. ఆ మార్పుల గురించి శ్రుతి చెబుతూ – ‘‘వ్యక్తిగా నేను చాలా మారాను. స్వీయ అవగాహన చేసుకోవడానికి ఈ ఏడాది ఎక్కువ టైమ్‌ కేటాయించాను. ఇంతకుముందు కొన్ని చేయడానికి సంశయించేదాన్ని.
అది మంచిదైనా ఎందుకో వెనకడుగు వేసేదాన్ని. కానీ, ఇకనుంచి ముందడుగు వేస్తాను. నా ఇష్టాయిష్టాల పరంగా కూడా నేనో నిర్ధిష్టమైన అభిప్రాయానికి వచ్చేశా. ‘ఇది మనకు నచ్చదు’ అని ఓ విషయం గురించి అనుకుంటే ఇక ఎప్పటికీ నచ్చదు. నచ్చినది ఎప్పటికీ నచ్చుతుంది. అంత బలమైన అభిప్రా యాలను కలగజేసిన సంవత్సరం ఇది. వయసు, అనుభవం వ్యక్తుల్లో పరిణతి తెస్తాయంటారు. 30 ఏళ్లొచ్చేశాయ్‌ కదా.. నాలోనూ పరిణతి వచ్చింది’’ అన్నారు.

కొంచెం టర్నింగ్‌ ఇచ్చుకో రఘువరా!

 సీనియర్‌ హీరోల్లో మామ రజనీకాంత్‌ సూపర్‌ స్టార్‌... యంగ్‌ హీరోల్లో అల్లుడు ధనుష్‌ తిరుగు లేని మాస్‌ హీరో. అల్లుడు సినిమాకి ఇప్పటివరకూ రజనీ క్లాప్‌ కొట్టలేదు. ఫస్ట్‌ టైమ్‌ అది జరిగింది. మామ ఎంతో ఆత్మీయంగా క్లాప్‌ ఇస్తుంటే.. అల్లుడు అలా వెనక్కి తిరిగాడేంటి? మరి అదే వెరైటీ. ‘మా సినిమా కొత్తగా ఉంటుంది’ అని ముహూర్తపు దృశ్యం నుంచే చూపించాలనుకుని ఉంటారు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి రజనీ రెండో కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. రజనీతో ఇటీవల ‘కబాలి’ చిత్రాన్ని నిర్మించిన కలైపులి ఎస్‌. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ధనుష్, అమలాపాల్‌ నటించిన ‘విఐపీ’ (వేలై ఇల్లా పట్టదారి)కి ఇది సీక్వెల్‌. ‘వైలై ఇల్లా పట్టదారి 2’గా తమిళంలో, ‘వీఐపీ 2’గా తెలుగులో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదటి భాగం తెలుగులో ‘రఘువరన్‌ బీటెక్‌’గా రిలీజై, ఇక్కడ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ‘వీఐపీ’లో ధనుష్‌ సరసన కథానాయికగా నటించిన అమలాపాల్‌ సీక్వెల్‌లోనూ నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ–మాటలు: ధనుష్, స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: సౌందర్యా రజనీకాంత్‌.

Thursday, December 15, 2016

బన్నీ ఫస్ట్‌.. మహేశ్‌ సెకండ్‌.. ప్రభాస్‌..

 ఏమిటీ లెక్క అని కంగారు పడుతున్నారా? 2016 అయిపోవచ్చింది కదా.. ఈ ఏడాది అభిమానులు తమ ప్రియమైన నటుల్లో ఎవరికోసం గూగుల్‌లో ఎక్కువగా వెదికారో.. ఆ లెక్క అన్నమాట ఇది. స్టైలిష్‌ స్టార్‌ అనిపించుకున్న టాలీవుడ్‌ కథానాయకుడు అల్లు అర్జున్‌ ఫేస్‌బుక్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న దక్షిణాది చిత్ర పరిశ్రమ నటుడిగా, ట్విట్టర్‌లో అతి తక్కువ సమయంలో వన్‌ మిలియన్‌ ఫాలోవర్స్‌ను చేరుకున్న నటుడిగా ఘనత సాధించిన సంగతి తెలిసిందే. ఆయనే ఇప్పుడు మరో క్రెడిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. 2016 గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన తెలుగు నటుల జాబితాలో అల్లు అర్జున్‌ ప్రథమ స్థానంలో ఉన్నారు.
 సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు రెండో స్థానం, రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ మూడో స్థానం, యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ నాల్గో స్థానం, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఐదో స్థానంలో ఉన్నారు. తమ అభిమాన హీరోలు ఇలా గూగుల్‌ ట్రెండింగ్‌లో ఉండటంతో ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Wednesday, December 14, 2016

విలన్‌గా...మరో హీరో

  మహేశ్‌బాబు హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో దర్శకుడు కమ్‌ హీరో అయిన ఎస్‌.జె. సూర్య విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాలో విలన్‌గా నటిస్తున్నట్లు మరో హీరో కూడా ప్రకటించారు. అతను ఎవరో కాదు... ‘ప్రేమిస్తే’ చిత్ర ఫేమ్‌ భరత్‌. ఇప్పటివరకూ భరత్‌ నెగిటివ్‌ రోల్‌ చేయలేదు. మహేశ్‌ సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. అహ్మదాబాద్‌లో జరుగుతోన్న సినిమా షూటింగ్‌లో భరత్‌ కొన్ని రోజులు పాల్గొన్నారు.
ఈ షెడ్యూల్‌ తర్వాత బ్యాంకాక్, హైదరాబాద్, పుణేలలో జరగబోయే షెడ్యూల్స్‌లోనూ పాల్గొననున్నారు. ‘‘మహేశ్‌ ఫ్రెండ్లీ కో–స్టార్‌. ఈ సినిమాలో ఛాన్స్‌ రావడం సంతోషంగా ఉంది. దర్శకుడు నా పాత్రను ఆసక్తికరంగా రాశారు’’ అని భరత్‌ తెలిపారు. ‘ఠాగూర్‌’ మధు, ఎన్వీ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సంభవామి’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్టు సమాచారం.

Tuesday, December 13, 2016

విడాకుల దిశగా సిని నటి

 నటి మీరా జాస్మిన్‌ భర్త అనిల్‌ జాన్‌ టిటుస్‌ నుంచి విడాకులు కోరుతూ నోటీసులు పంపినట్లు సమాచారం. ఇకపై భారత్‌లోనే ఉండి సినీ కెరీర్‌పై దృష్టిపెట్టాలని మీరా అనుకుంటున్నారట. 2014లో దుబాయ్‌కి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరైన అనిల్‌తో మీరా పెళ్లి జరిగింది. వివాహానంతరం మీరా నటనకు స్వస్తి పలికి భర్తతో కలిసి దుబాయ్‌కి వెళ్లిపోయారు. అయితే ఆమె తిరిగి భారత్‌కు వచ్చి త్వరలో విడుదల కాబోతోన్న ‘10 కల్పనకల్‌’ అనే మలయాళ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో ఆమె పోలీసు అధికారిణి పాత్ర పోషించారు. అంతేకాదు ‘పూమరం’ అనే మరో చిత్రంలోనూ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మీరా మళ్లీ సినిమాల్లో నటించడం అనిల్‌కి ఇష్టం లేదట. కానీ ఆమె మాత్రం భారత్‌లోనే ఉండి నట జీవితాన్ని కొనసాగించాలని భావిస్తున్నారట. ఈ కారణంగా ఇద్దరి మధ్య మనస్ఫర్థలు ఏర్పడినట్లు తెలుస్తోంది. విడాకులకు కారణంపై మాత్రం ఇద్దరూ నోరు విప్పడం లేదు.
అనిల్‌కి మీరాతో జరిగింది రెండో వివాహం. మొదటి వివాహంలో విడాకులు తీసుకోనందున మీరాతో పెళ్లి సమయంలో గొడవలు జరుగుతాయేమోనని అనిల్‌ పోలీసు సహాయం తీసుకున్నారు. అనంతరం తొలి వివాహం తాలూకు విడాకుల కాగితాలు చూపించనందువల్ల అనిల్‌-మీరాల వివాహం రిజిస్టర్‌ చేయడానికి అధికారులు అంగీకరించలేదు. ఈ విషయాలన్నీ కూడా అప్పుడు వార్తల్లో వచ్చాయి.

Monday, December 12, 2016

ఏ హీరోతో అంత సరదాగా లేను: కాజల్

 మెగాస్టార్ చిరంజీవి అందం నాలుగురెట్లు పెరిగిందంటోంది అందాలభామ కాజల్ అగర్వాల్. ఖైదీ నంబర్ 150 చిత్రంలో చిరంజీవితో జతకట్టిన అమ్మడు మెగా స్టార్ పై పొగడ్తల వర్షం కురిపించింది. 'మెగా ఇమేజ్ ను కూడా పక్కన పెట్టి సెట్లో అందరితో సరదాగా ఉండే వారు.నేను సెట్ లో కంఫర్టబుల్ గా మూవ్ అయ్యేలా అవకాశం ఇచ్చారు. నేను నటించిన చిత్రాల్లోని ఏ ఇతర హీరోతో కూడా అంత సరదాగా గడపలేదు. సెట్లో ఉన్న వారందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. షూటింగ్ సమయంలో ఆయనతో సరదాగా జోకులు కూడా వేశాను. తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి నిజంగా ఓ గొప్ప డ్యాన్సర్' అంటూ  కాజల్ తెగ సంబరపడుతోంది.

'డ్యాన్స్ చేసే సమయంలో కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. వాటి ద్వారా నా డ్యాన్స్ లో మార్పు కూడా వచ్చింది. ఆ మార్పును సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరే చూడొచ్చు. ఇంత కాలం చిరు సినిమా కోసం ఎదురు చూసిన అభిమానులను ఈ చిత్రం తప్పకుండా అలరిస్తుంది. మెగాస్టార్ తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నా.  అయనతో కలిసి పని చేయడం నాకు ఎంతో ప్రత్యేకం' అంటూ  కాజల్ మురిసిపోయింది.

సురేఖ సమర్పణలో వీవీ వినాయక్ దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.తమిళంలో ఘన విజయం సాధించిన కత్తి చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం 2017 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

మహేష్ సినిమాలో గోల్డెన్ చాన్స్


మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం వచ్చిందంటే ఎగిరి గంతేస్తాం. అలాంటిది తెలుగులోను, తమిళంలోను ఒకేసారి తీస్తున్న సినిమాలో అవకాశం వస్తే.. మరింత అద్భుతంగా ఉంటుంది కదూ. సరిగ్గా అలాంటి అవకాశమే భరత్‌కు వచ్చింది. సినిమాలో ఒక కీలక పాత్రకు భరత్‌ను తీసుకున్నామని, అతడి పాత్ర ఏంటన్నది సినిమా విడుదలయ్యే వరకు బయటకు రానివ్వబోమని సినిమా వర్గాలు తెలిపాయి. సినిమా కథ దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైనది కావడం వల్లే ఇలా చేస్తున్నామన్నారు. 
 
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో షూటింగ్ జరుపుకొంటోంది. సినిమా టైటిల్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదని, 'సంభవామి' అనే టైటిల్ ఒకటి పరిశీలనలో ఉందని సినిమా వర్గాలు చెప్పాయి. వచ్చే సంవత్సరం జనవరిలో టైటిల్‌ ఏంటన్నది ఫిక్స్ చేస్తామన్నారు. ఇప్పటికి తమ చేతిలో నాలుగు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయన్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమాలో ఇంకా ఎస్‌జే సూర్య, ఆర్‌జే బాలాజీ, ప్రియదర్శి పులికొండ ఉన్నారు. హ్యారిస్ జజరాజ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Sunday, December 11, 2016

నటిగానే గుర్తుండిపోవాలి

 బాలీవుడ్‌తో పాటు తెలుగు.. కన్నడ భాషల్లోనూ నటించింది శిల్పాశెట్టి. 2007లో వచ్చిన ‘అప్నే’ చిత్రం తర్వాత సినిమాలకు దూరమైన శిల్పా.. ఆ తర్వాత ఒకటి.. రెండు సినిమాల్లో అతిథి పాత్రలకే పరిమితమైంది. ప్రస్తుతం యోగా నిపుణురాలిగా రాణిస్తున్న ఈ భామ ‘బిజినెస్‌ టైకూన్‌’ అని పిలిపించుకోవడం కంటే.. అభిమానుల హృదయాల్లో నటిగా గుర్తుండిపోవాలని కోరుకుంటోందట.
‘‘ నాకు నచ్చినవి చేస్తున్నా. కొన్ని సక్సెస్‌ అవుతున్నాయి. ఇంకొన్ని ఫెయిలవుతున్నాయి. అంతేతప్ప బిజినెస్‌వుమెన్‌ అవ్వాలని అనుకోవడం లేదు. అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ నటిగానే గుర్తుండిపోవాలని అనుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చింది శిల్పాశెట్టి. మరి సినిమాల్లోకి రీఎంట్రీ ఎప్పుడిస్తారని అడిగితే.. దాని గురించి ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పింది.
 
ప్రస్తుతం ఓ టీవీ ఛానెల్‌లో ప్రసారమవుతున్న ‘సూపర్‌ డ్యాన్సర్‌’కి న్యాయనిర్ణేతగా చేస్తోంది శిల్ప. జడ్జిగా వ్యవహరించడంపై తన అనుభవాన్ని చెబుతూ.. ‘‘మనం చేస్తున్న పనిలో విజయం సాధించినపుడు సంతోషంగా ఉంటుంది. ప్రస్తుతం నేనూ అలాంటి ఆనందాన్నే పొందుతున్నా. ఈ షోలో నేను కేవలం మధ్యవర్తి లాంటిదాన్నే. ఇందులో డ్యాన్సర్లే నిజమైన స్టార్‌లు. వాళ్లలో అద్భుతమైన టాలెంట్‌ ఉంది’’ అని చెప్పింది.

Saturday, December 10, 2016

చిరు స్టెప్పులు అదుర్స్‌.. స్పాట్‌ వీడియో లీక్‌!

 ఇన్నాళ్లు రాజకీయాలతో బిజీగా ఉన్న మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పుడు మళ్లీ వెండితెరపై తళుక్కుమనబోతున్నారు. 'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌' అంటూ 150 చిత్రంతో మరోసారి తన అభిమానుల్ని అలరించబోతున్నారు. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 150వ సినిమా 'ఖైదీ నంబర్‌ 150'. ఇటీవల రిలీజ్‌ అయిన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తున్నది.
మరోసారి మెగాస్టార్‌ తనదైన స్టైల్‌తో, స్టామినాతో దూసుకుపోనున్నాడని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన లీకైన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. 'ఖైదీ నంబర్‌ 150' సినిమాలోని ఓ పాటకు చిరంజీవి, కాజల్‌ స్టెప్పులు వేస్తుండగా.. షూటింగ్‌ స్పాట్‌లో ఉన్న ఓ వ్యక్తి దానిని రహస్యంగా చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో లీక్‌ కావడంతో ఇది బాగా హల్‌చల్‌ చేస్తోంది.

http://www.sakshi.com/news/movies/chiru-movie-shooting-video-leak-430812?pfrom=home-top-story

క్షమాపణ కోరిన మంచు లక్ష్మీ

 సినీరంగంలో జరిగే పరిణామాలతో పాటు సామాజిక అంశాలపై కూడా ఈ మంచువారమ్మాయి లక్ష్మీ ప్రసన్న  స్పందిస్తుంటుంది. త్వరలో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో మంచు లక్ష్మీ చేసిన ఓ ట్వీట్ ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటోంది. ' గత నెల ఇదే రోజు.. కాస్ట్రో జీవించి ఉన్నాడు. అమ్మ ఆరోగ్యం మెరుగుపడుతోంది. అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకొనేందుకు సిద్ధమవుతోంది. మీ అందరి దగ్గర డబ్బుంది' అంటూ ట్వీట్ చేసింది.
అయితే ఈ ట్వీట్ తాను ముందుగానే చేశానని అదే ట్వీట్ ను మంచు లక్ష్మీ కాపీ చేసిందంటూ సదరు వ్యక్తి లక్ష్మీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయటంతో ఆమె క్షమాపణ చెప్పింది. తనకు ఫ్రెండ్ ద్వారా వచ్చిన ఆ మెసేజ్ లో పేరు లేకపోవటంతో క్రెడిట్ ఇవ్వకుండానే తాను ట్వీట్ చేశానని అందుకు తనను క్షమించాలని కోరింది. అంతేకాదు ఆసక్తికరమైన ట్వీట్ చేసిన ఆ వ్యక్తిని అభినందించింది.

సినీ రంగంలో వారసురాళ్లుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వారు చాలా తక్కువ. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో వారసురాళ్లు తెర మీదకు రావడమే చాలా అరుదు. కానీ మోహన్ బాబు వారసురాలు మంచు లక్ష్మీ మాత్రం ఈ సాంప్రదాయాలకు మినహాయింపు. కలెక్షన్ కింగ్ వారసురాలిగా వెండితెర అరంగేట్రం చేసిన లక్ష్మీ  నటిగానే కాక నిర్మాతగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినీ రంగంతో పాటు ఇతర వ్యాపార రంగాల్లోనూ దూసుకుపోతోంది.

Friday, December 9, 2016

వైభవంగా అఖిల్‌ నిశ్చితార్థం


ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున, అమల కుమారుడు అఖిల్‌ నిశ్చితార్థం శ్రీయా భూపాల్‌తో హైదరాబాద్‌లో శుక్రవారం వైభవంగా జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే మనవరాలైన శ్రీయా భూపాల్‌, అఖిల్‌లు గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి ప్రేమను అంగీకరించిన ఇరు కుటుంబాలు వారికి వివాహం చేయాలని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో వీరిద్దరి నిశ్చితార్థ వేడుక అతికొద్దిమంది సన్నిహితుల మధ్య ఓ ప్రైవేటు అతిథిగృహంలో వైభవంగా నిర్వహించినట్టు సమాచారం. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శ్రీయా భూపాల్‌ వృత్తిరీత్యా ఫ్యాషన్‌ డిజైనర్‌.

 

'ధృవ' మూవీ రివ్యూ



కథ :
ధృవ(రామ్ చరణ్)..  దేశంలో జరిగే అన్యాయాలను అంతం చేయాలన్న ఆశయంతో ఐపీఎస్‌ లో జాయిన్ అయిన కుర్రాడు. నీ శత్రువు గురించి తెలిస్తే నీ స్టామినా ఏంటో తెలుస్తుంది అనే మనస్థత్వం కలిగిన కుర్రాడు. అదే బ్యాచ్ లో తనలాంటి భావాలున్న వ్యక్తులతో కలిసి రాత్రుళ్లు కొన్ని కేసులకు సంబంధించిన నేరస్తులను పోలీసులకు పట్టిస్తుంటాడు. అంతేకాదు తాను చూసిన ప్రతీ కేసు వెనుక ఉన్న నిజానిజాలను ఎంక్వైరీ చేసి ఆ నేరాల వెనుక ఉన్న అసలు నేరస్తులను పట్టుకోవాలని భావిస్తాడు. ధీరజ్ చంద్ర, జయంత్ సూరి, ఇర్ఫాన్ అలీ అనే వ్యక్తులు హైదరాబాద్ లో జరిగే నేరాలకు ముఖ్య కారకులని తెలుసుకున్న ధృవ, వీళ్లలో అందరికంటే బలమైన నేరస్తుడ్ని తన టార్గెట్ గా ఫిక్స్ చేసుకోవాలనుకుంటాడు.

అప్పుడే ఈ ముగ్గురు వెనకాల ఉన్నది ఒకే వ్యక్తి అన్న నిజం తెలుస్తుంది. ప్రఖ్యాత సైంటిస్ట్ గా, సమాజంలో పెద్ద మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న సిద్దార్థ్ అభిమన్యు (అరవింద్ స్వామి) ఈ ముగ్గురినీ బినామీలుగా పెట్టుకొని నేరాలు చేస్తున్నాడని తెలుసుకుంటాడు. పేదవారి ప్రాణాలను కాపాడటం కోసం అతి తక్కువ రేటుకే మందులను అందించే అగ్రిమెంట్ ను అడ్డుకొని దేశం మొత్తం తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలనుకుంటాడు సిద్దార్థ్. ఈ విషయం తెలుసుకున్న ధృవ... సిద్దార్ధ్ ను ఎలా అడ్డుకున్నాడు..? ఎంతో తెలివిగా నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న సిద్దార్ధ్ అంత ఈజీగా పట్టుబడ్డాడా..? చివరకు ధృవ అనుకున్నది సాధించాడా..? సిద్దార్ధ్ అభిమన్యు ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
ఈ సినిమా కోసం తన లుక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న రామ్ చరణ్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు. సిక్స్ ప్యాక్ బాడీతో, సరికొత్త బాడీలాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు. తన గత సినిమాలతో పోలీస్తే నటుడిగాను ఈ సినిమాతో తన స్థాయిని ప్రూవ్ చేసుకున్నాడు. తెలివైన శత్రువుతో పోరాడే సమయంలో ఎదురయ్యే మానసిక సంఘర్షణను అద్భుతంగా చూపించాడు. విలన్ గా అరవింద్ స్వామి సూపర్బ్. ఎక్కడ అతి లేకుండా సెటిల్డ్ పర్ఫామెన్స్ తో సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచాడు. హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రాతకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా.. ఉన్నంతలో మంచి నటన కనబరించింది. ముఖ్యంగా రకుల్ గ్లామర్ షో సినిమాకు మరో ఎసెట్. ఇతర పాత్రల్లో నవదీప్, పోసాని కృష్ణమురళీ, విద్యుల్లేక లు ఆకట్టుకున్నారు.
ప్లస్ పాయింట్స్ :
రామ్ చరణ్, అరవింద్ స్వామి
స్క్రీన్ ప్లే
నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :
పాటలు
సినిమా లెంగ్త్

ఓవరాల్ గా ధృవ.. రామ్ చరణ్ స్థాయిని పెంచే చేసే స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్
 

Thursday, December 8, 2016

సంతకం పెట్టిందోచ్!

  సమంత అంటే ఇష్టపడే తెలుగు సినిమా అభిమానులకు ఇది శుభవార్తే. అక్కినేని నాగచైతన్య (చైతూ)తో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చెన్నై బ్యూటీ నటన, సినిమాలకు స్వస్తి పలుకుతారనే పుకార్లు షికారు చేశాయి. పెళ్లి తర్వాత కూడా సమంత నటిస్తుందని చైతూ స్వయంగా చెప్పినా... ఈ పుకార్లకు అడ్డుకట్ట పడలేదు. దీనికి తోడు ‘జనతా గ్యారేజ్’ తర్వాత తెలుగులో మరో చిత్రానికి సమంత సంతకం చేయకపోవడంతో ప్రచారంలో ఉన్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ పుకార్లకు చెక్ పెడుతూ... తెలుగులో కొత్త చిత్రాలకు సమంత సంతకం చేశారు. ఆ మాట ఎవరో కాదు... సాక్షాత్తూ సమంతే చెప్పారు. కానీ, ఆ కొత్త తెలుగు చిత్రాల ఏమిటన్నది మాత్రం చెప్పలేదు.
‘‘కొత్త చిత్రాల్లో ఎవరికి జోడీగా నటిస్తున్నాను, ఆ సినిమాలు ఏంటి, కాంబినేషన్ ఏమిటన్నది ప్రకటించడానికి నేనింక ఎదురు చూడలేను’’ అని సమంత ట్వీట్ చేశారు. ఫిల్మ్‌నగర్‌లో మాత్రం చిన్న ఎన్టీఆర్- దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ) సినిమా, రామ్‌చరణ్- దర్శకుడు సుకుమార్‌ల సినిమాల్లో హీరోయిన్‌గా సమంత పేరు వినిపిస్తోంది. అయితే, అధికారికంగా ఏదీ కన్ఫర్మ్ కాలేదు. అలాగే, చైతూతోనూ త్వరలోనే సమంత కలసి నటిస్తారనే వార్తలు వినపడుతున్నాయి. మరి, సమంత తెలుగులో అంగీకరించిన కొత్త సినిమాలు ఏమిటో? అబ్బ... సమంత మళ్ళీ ట్వీట్ చేసేదాకా జనం ఎదురుచూడలేరు బాబూ!

Wednesday, December 7, 2016

పూరి 'మూడు కోతులు.. ఒక మేక'

 పూరి జగన్నాథ్... టాలీవుడ్ సినిమా మేకింగ్ కు స్పీడు నేర్పిన దర్శకుడు. కొత్త హీరోతో సినిమా అయినా.. స్టార్ హీరోతో సినిమా అయినా.. పూరి స్పీడు మాత్రం తగ్గదు. మూడు నెలల్లోనే సినిమాను పూర్తి చేయడం పూరి స్టైల్. సినిమా మేకింగ్ లోనే కాదు, సినిమా టైటిల్ ఎంపికలో కూడా పూర్తి కొత్తదనం చూపిస్తుంటాడు. స్టార్ హీరోల సినిమాలకు పోకిరి, దేశముదురు లాంటి టైటిల్స్ పెట్టాలన్న, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం లాంటి పొయటిక్ టైటిల్స్ తో ఆకట్టుకోవాలన్నా పూరికే చెల్లింది.
ఇటీవల తన స్థాయికి తగ్గ హిట్స్ అందించటంలో విఫలమవుతున్న పూరి జగన్నాథ్, ఓ బిగ్ హిట్ తో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. అందుకే యంగ్ హీరోలతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కించిన రోగ్ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న పూరి, ఆ తరువాత చేయబోయే సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాడు. అంతేకాదు ఈ సినిమాకు మరోసారి తన మార్క్ కనిపించేలా డిఫరెంట్ టైటిల్ ను పిక్స్ చేశాడు. ముగ్గురు హీరోలతో రూపొందించనున్న ఈ సినిమా కోసం మూడు కోతులు ఒక మేక అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించనున్నారు.

Tuesday, December 6, 2016

రాజీపడే ప్రసక్తే లేదు!

ష్టించి పని చేయడంలో అనుష్క ముందు వరసలో ఉంటుంది. ఆమె గురించి పరిశ్రమలో ఎవర్ని అడిగినా సరే... హార్డ్‌వర్కర్‌ అనే మాటతోనే మొదలుపెడతారు. ఇటీవలి కాలంలో ఆమె చేస్తున్న పాత్రల్ని గమనించినా అనుష్క ఎంతగా చెమటోడుస్తుందో ఇట్టే అర్థమవుతుంది. ప్రతి సినిమాకీ అలా శక్తికి మించి కష్టపడటం ఎలా సాధ్యమవుతుందని అడిగితే అనుష్క ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. ‘‘వ్యక్తిగతంగా నాకు తెలిసిన వాళ్లను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. కానీ నన్ను అభిమానించే వాళ్లు మాత్రం కోకొల్లలు. వాళ్లందరికీ నేనొక నటిని మాత్రమే. నాలోని నటిని చూసే వాళ్లంతా అభిమానించడం మొదలు పెట్టారు. నా పనితీరే నాపైన అభిమానానికి కారణమైనప్పుడు ఆ విషయంలో రాజీపడాలా? ఛాన్సే లేదు. అందుకే నా పాత్ర కోసం ఏం కావాలన్నా చేయాలనుంటుంది. మనసులో ఆ భావన ఉండటంతోసెట్‌లోకి వెళ్లేసరికి పాత్రలో లీనమైపోతుంటా. ఇక ఆ తర్వాత నేనెంత కష్టపడుతున్నానన్నది నాకే గుర్తుండదు’’ అని చెప్పుకొచ్చింది అనుష్క.

లక్షాధికారులు!

  రామ్‌చరణ్ లక్షాధికారి అయ్యాడండీ. ఈ హీరోగారు 40 లక్షలకు అధిపతి. హన్సిక ఏకంగా 60 లక్షలకు అధిపతి అయ్యారు. త్రిష 30, ఇలియానా 40 లక్షలు... ఇలా లక్షాధికారులు అయినందుకు వీళ్లంతా చాలా హ్యాపీగా ఉన్నారు. కోట్లు కోట్లు పారితోషికం తీసుకునే వీళ్లు లక్షాధికారులైనందుకు ఆనందపడటమేంటి? అనేగా మీ డౌట్! అయితే అసలు విషయంలోకి వెళదాం...
 
 కరెన్సీ కష్టాల కారణంగా ఎవరెవరు తమ బ్యాంక్ ఖాతాల్లో ఎంతుందో చూసుకుని హ్యాపీగా ఫీలవుతున్నారు అనుకుంటున్నారా? కాదండి! ఈ లెక్క సోషల్ మీడియాల్లోని తమ ఖాతాల్లో అభిమానుల సంఖ్య. ఈ లెక్క ఆల్ ఇండియాకి సంబంధించినది కాదు.. హోల్ వరల్డ్‌ది అన్న మాట. సెలబ్రిటీలంతా అభిమానులతో నేరుగా తమ విశేషాలు పంచుకోవడానికి సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటున్న విషయం తెలిసిందే. అభిమాన నటీనటులతో నేరుగా మాట్లాడకపోయినా.. ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా అభిప్రాయాలు పంచుకోవచ్చు కాబట్టి, వీళ్ల ఎకౌంట్స్‌ని ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు. ఒక్కో సెలబ్రిటీ ఎకౌంట్‌లో లక్షల్లో ఫాలోయర్స్ ఉంటారు. గడచిన పది రోజుల్లో... 40, 60, 30 లక్షలకు చేరుకున్న సెలబ్రిటీల ఖాతాల వివరాల్లోకి వెళితే...
 
 మీకోసం ఎంత కష్టపడుతున్నానో
 రామ్‌చరణ్‌కి ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ఖాతాలున్నాయి. ఫేస్‌బుక్ ఖాతాను ఇప్పుడు ‘40 లక్షల’ మంది అనుసరిస్తున్నారు. ‘‘మన ఫ్యామిలీ మొత్తం నాలుగు మిలియన్లు (40 లక్షలు). చాలా ఆనందంగా ఉంది. చూడండి.. ఫేస్‌బుక్‌లో మీకు అప్‌డేట్స్ ఇవ్వడానికి ఎంత కష్టపడుతున్నానో’’ అంటూ షూటింగ్ సమయాల్లో ఫోన్ ద్వారా ఫేస్‌బుక్‌లో తాను అప్‌డేట్ చేస్తున్న ఫొటోను రామ్‌చరణ్ పోస్ట్ చేశారు. తాను చేస్తున్న సినిమాల విశేషాలతో పాటు అడపా దడపా ఫేస్‌బుక్ ద్వారా ఫ్యాన్స్‌తో ప్రత్యేకంగా ‘చాట్’ చేస్తుంటారు రామ్‌చరణ్. అభిమానులు అడిగిన ప్రశ్నలకు లైవ్‌లో ఓపికగా సమాధానాలిస్తుంటారు.
 
 మీ ప్రేమకో మంచి ఉదాహరణ
 బబ్లీ బ్యూటీ హన్సిక తమిళంలో కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టాక అభిమానుల సంఖ్య బాగా పెరిగిపోయింది. పైగా తమిళనాడులో ‘చిన్న ఖుష్బూ’ అనిపించుకున్నారు కాబట్టి, అభిమానుల సంఖ్య సినిమా సినిమాకీ పెరుగుతోంది. ఫలితంగా ఈ బ్యూటీ ఫేస్‌బుక్ ఖాతాలో 60 లక్షలు ఫాలోయర్స్ చేరారు. ఫేస్‌బుక్‌లో ఎప్పట్నుంచో ఆమెకు ఎకౌంట్ ఉంది. ‘‘అభిమానులు నన్నెంతగా ప్రేమిస్తున్నారో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం’’ అని హన్సిక పేర్కొన్నారు.
 
 ఆ ఫొటోలకు బోల్డంత క్రేజ్
 గోవా బ్యూటీ ఇలియానా హిందీ సినిమాలు చేయడం మొదలుపెట్టాక సౌత్‌కి దూరమయ్యారు. కానీ, అభిమానులకు మాత్రం దూరం కాలేదు. ముఖ్యంగా ఈవిడగారి ‘ఇన్‌స్టాగ్రామ్’కి ఫాలోయర్ల సంఖ్య ఎక్కువ. ఎందుకంటే.. ఎప్పటిప్పుడు తన పర్సనల్ ఫొటోలను అందులో పొందుపరుస్తుంటారు. ‘వామ్మో.. చాలా హాట్ గురూ’ అనే స్థాయిలో ఆ ఫొటోలు ఉంటాయి. బికినీలో ఉన్న ఫొటోలను, వీడియోలను సైతం ఆమె పెడుతుంటారు. ఆ ఫొటోలకున్న క్రేజ్ ఎలాంటిదింటే ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌ని 40 లక్షల మంది ఫాలో అవుతున్నారు. 
 
 థర్టీ ప్లస్.. థర్టీ లాక్స్!
 త్రిష వయసు 30. నటిగా ఆమె కెరీర్ వయసు దాదాపు 15. ఇన్నేళ్లుగా కథానాయికగా రాణించడం అంటే చిన్న విషయం కాదు. పైగా చేతిలో రెండు మూడు సినిమాలతో బిజీగా ఉండటం అంటే మాటలు కాదు.  ఈ చెన్నై చందమామ చాలా ఆనందంలో ఉన్నారు. ఎందుకంటే ఈవిడగారి ట్విట్టర్ ఎకౌంట్‌ను 30 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ‘‘థ్యాంక్యూ.. నా మనసులో మీకు (ఫ్యాన్స్) ప్రత్యేకమైన స్థానం ఉంది’’ అని ఆనందం వ్యక్తం చేశారామె.
 
 కోట్లు తీసుకునే తారలకు వందల్లో ఫ్యాన్స్ ఉంటే లాభం లేదు. లక్షల్లో ఉండాలి. అప్పుడే లైమ్‌లైట్‌లో ఉన్నట్లు లెక్క. కెరీర్ మంచి ఊపు మీద ఉంటుంది. అందుకే ఈ కోటీశ్వరులందరూ తమను ఫాలో అవుతున్న లక్షలాది అభిమానులకు ‘బిగ్ థ్యాంక్స్’ అంటున్నారు.

Monday, December 5, 2016

తలైవీ.. సెలవ్

దేశ రాజకీయాల్లో ఓ శకం ముగిసింది.. అలుపెరుగక పోరాడిన ‘విప్లవ నాయకి’ విశ్రమించింది...అభిమానుల ‘అమ్మ’ అస్తమించింది.. తమిళనాట ఓ ధ్రువతార నేలరాలింది.. ముఖ్యమంత్రి జయలలిత రెండునెలలకుపైగా మృత్యువుతో జరిపిన పోరాటంలో అలిసిపోయారు. ఆమె అభిమానులు చేసిన పూజలు.. దేశవిదేశాలకు చెందిన అత్యంత నిపుణులైన వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు..
75 రోజులుగా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన జయలలిత సోమవారం రాత్రి 11.30కు మృతి చెందినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. ‘అమ్మ’ మృతితో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం వారం రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. మెరీనా బీచ్‌లోని ఎంజీఆర్‌ సమాధి వద్ద నేటి సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తారు. జయ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖులంతా సంతాపం తెలిపారు.
 చెన్నై: తమిళనాడు శోకసంద్రమైంది.. రాష్ట్రమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.. ముఖ్యమంత్రి జయలలిత (68) సోమవారం రాత్రి కన్నుమూశారు. రాత్రి 11.30 గంటలకు కన్నుమూసినట్లు చెన్నై అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఆసుపత్రి నుంచి పార్థివదేహాన్ని అర్ధరాత్రి పోయెస్‌ గార్డెన్‌లోని ఆమె స్వగృహానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం అక్కడినుంచి మంగళవారం ఉదయం మౌంట్‌రోడ్‌లోని రాజాజీ హాల్‌కు తరలిస్తారు. అత్యవసరంగా సమావేశమైన పార్టీ శాసనసభాపక్షం తదుపరి ముఖ్యమంత్రిగా పన్నీర్‌సెల్వంను ఎన్నుకుంది. ఆ వెంటనే ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి అర్ధరాత్రి 1.20 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రంలో వారంరోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు. మూడురోజుల పాటు రాష్ట్రంలోని విద్యాసంస్థలు, పాఠశాలలను మూసివేస్తారు. ఆమె అంత్యక్రియలను మెరీనా బీచ్‌లోని ఎంజీఆర్‌ సమాధి వద్ద మంగళవారం సాయంత్రం నిర్వహించనున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా జయ సన్నిహితురాలైన శశికళను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ప్రణబúముఖర్జీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తదితర ప్రముఖులంతా జయ మృతికి తీవ్ర సంతాపం ప్రకటించారు.
ఆదివారం సాయంత్రం తీవ్రమైన గుండెపోటు రావడంతో జయలలిత పరిస్థితి విషమించింది. అపోలో ఆసుపత్రిలోనే సాధారణ ప్రత్యేక గదిలో ఉంటున్న ఆమెను వెంటనే క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌కు తరలించారు. ఆమె ప్రాణాలు కాపాడటానికి వైద్యులు రేయింబవళ్లు శ్రమించారు. ‘ఎక్మో’ యంత్రం ద్వారా కృత్రిమ శ్వాస, రక్త ప్రసరణ జరిగేలా చూశారు. దిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) వైద్య బృందం కూడా ప్రత్యేక విమానంలో చెన్నైకి వచ్చింది. లండన్‌ నుంచి డాక్టర్‌ రిచర్డ్‌ బాలే వైద్యసేవలపై సలహాలు ఇస్తూ సమీక్షించారు. వైద్యుల ప్రయత్నాలు విఫలమవడంతో ఆమె సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె ఆరోగ్యం మళ్లీ విషమించినట్లు తెలియగానే అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. రెండురోజుల నుంచి అక్కడ తీవ్ర ఉద్వేగపూరితమైన వాతావరణం కొనసాగింది. సోమవారం రాత్రి జయ మృతిచెందినట్లు తెలియగానే అభిమానులంతా కన్నీరుమున్నీరయ్యారు. తమిళనాడు మొత్తం విషాదంలో మునిగిపోయింది. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాపాడలేకపోయాం..
రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు
అపోలో ఆసుపత్రుల అధికారిక ప్రకటన
ఈనాడు, చెన్నై: ‘ఇది వ్యక్తం చేయలేని దుఃఖం (ఇన్‌డిస్‌క్రైబబుల్‌ గ్రీఫ్‌), మన ప్రియతమ నేత, తమిళనాడు ముఖ్యమంత్రి, విప్లవనాయకి అమ్మ(జయలలిత) ఈ రోజు రాత్రి (సోమవారం) 11.30 గంటలకు కన్నుమూశారు. సెప్టెంబర్‌ 22న తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌ సమస్యలతో గౌరవ ముఖ్యమంత్రి ఆసుపత్రిలో చేరారు. ఆమెకు క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో వివిధ విభాగాల నిపుణులతో చికిత్స అందించాం. వాటికి ఆమె బాగా స్పందించారు. క్రమంగా కోలుకున్నారు, ఆహారమూ తీసుకునేవారు. వీటన్నిటి ఆధారంగా ఆమెను క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ నుంచీ హై డిపెండెన్సీ యూనిట్‌కు తరలించాం. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఆమె పరిస్థితి మెరుగయ్యే సూచనలు కనిపించాయి. దురదృష్టవశాత్తు 4వ తేదీ(ఆదివారం) సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రికి తీవ్రమైన గుండెపోటు(మాసివ్‌ కార్డియాక్‌ అరెస్ట్‌) వచ్చింది. వెంటనే వైద్య నిపుణులు ఆమెను క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌కు తరలించారు. వెనువెంటనే ఎక్మో సహాయం అందించి పరిస్థితిని పర్యవేక్షించాం. ఎక్మో అనే చికిత్స ప్రక్రియ అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న అత్యంత అధునాతన చికిత్స ప్రక్రియ. ఆమెకు అవసరమైన ప్రతి చిన్న చికిత్సను కూడా అందించి కాపాడటానికి విశ్వ ప్రయత్నాలు చేశాం. అయినా.. అప్పటికే విషమించిన ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి ఆమెను కోలుకోలేకుండా చేశాయి. చివరకు ఆమె సోమవారం రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు. అపోలో ఆసుపత్రిలోని సిబ్బంది గౌరవ ముఖ్యమంత్రికి అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన అవిశ్రాంత వైద్య సపర్యలు అందించారు. ఆమె మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆమెను పోగొట్టుకుని విచారంలో మునిగిపోయిన తమిళనాడు ప్రజలు, జాతి దుఃఖంలో మేము సైతం పాలు పంచుకుంటున్నాం’
- అపోలో ఆసుపత్రుల యాజమాన్యం

మహేష్‌ సినిమాకు పేరు ఖాయం!

 సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, కొరటాల శివ కాంబినేషన్లో సినిమా అనే ప్రకటన వెలువడినప్పటి నుంచీ టైటిల్‌పై పుకార్లు వస్తున్నాయి. మహేష్‌ ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తున్నారని, ‘భరత్‌ అను నేను’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్‌ వచ్చింది. అయితే దీనికి సంబంధించి తాజాగా చిత్ర బృందం నుంచి దాదాపు స్పష్టత వచ్చింది. ఈ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య సోమవారం ‘భరత్‌ అను నేను’ అనే పేరును రిజిస్టర్‌ చేయించారు. మరి టైటిల్‌పై దాదాపు స్పష్టత వచ్చినా, మహేష్‌ ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తున్నారా? అన్న ప్రశ్నకు సమాధానం కోసం వేచి చూడాలి. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి నుంచి జరగనున్నట్లు తెలుస్తోంది.
మహేష్‌ కథానాయకుడిగా ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం అహ్మదాబాద్‌లో జరుగుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదు.

Sunday, December 4, 2016

ఆయన చిన్న కమలహాసన్!

  నటుడు జయంరవిని చిన్న కమలహాసన్‌గా ప్రభుదేవా అభివర్ణించారు. ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు  ప్రభుదేవా ఇటీవల దేవి చిత్రంలో నిర్మాతలా కూడా అవతారమెత్తిన విషయం తెలిసిందే. ఆయన తన ప్రభుదేవా స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం బోగన్. జయంరవి, హన్సిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇంతకు ముందు ఇదే జంటతో రోమిమో జూలియట్ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన లక్ష్మణ్ దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు అరవిందస్వామి ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అం దిస్తున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం చెన్నై శివారు ప్రాంతం ఇంజిమ్‌బాక్కమ్‌లో గల వేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలోని ఐసరి వేలన్ ఆవరణలో జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర కథానాయకుడు జయంరవి మా ట్లాడుతూ బోగన్ పక్కా కమర్షియ ల్ ఫార్ములాలో తెరకెక్కిన మాస్ రొమాంటిక్ ఎంటర్‌టెయినర్ అని తెలిపారు.
ఇందులో అరవిందస్వామితో మరోసారి కలిసి నటించడం ఆనందంగా ఉందన్నారు. ఇక ఈ చిత్రంలో యువ సంగీత దర్శకుడు అనిరుద్ పాడిన పాటకు తాను చిందేయడం మంచి అనుభూతి అని పేర్కొన్నారు. తనిఒరవన్ చిత్రం తరువాత అంత మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. చిత్ర నిర్మాత ప్రభుదేవా మాట్లాడుతూ సినిమాకు చెందిన చాలా విషయాలు ఆయనకు తెలుసని, అందుకే తాను జయంరవిని కుట్టి(చిన్న) కమలహాసన్ అని పిలుస్తానని అన్నారు. ఇక నటి హన్సిక నటన బోగన్ చిత్రంలో తనను చాలా ఇంప్రెస్ చేసిందన్నారు. ఎంగేయుమ్ కాదల్ చిత్రం నాటి నుంచి ఇప్పటి వరకూ ఆమె ఎదుగుదలను తాను చూస్తున్నానని తెలిపారు. ఈ బోగన్ చిత్రం అని వరా్గాలను అలరించే మంచి కమర్షియల్ ఎంటర్‌టెరుునర్‌గా ఉంటుందని ప్రభుదేవా ఆశాభావం వ్యక్తం చేశారు.

Friday, December 2, 2016

బెంగళూర్ వ్యాపారవేత్తతో బొమ్మాళి పెళ్లి?

 యోగా టీచర్ అనుష్కకు వరుడు దొరికాడా..? ఈ ప్రశ్నకు అవుననే అంటున్నారుు సినీ వర్గాలు. తమిళ, తెలుగు భాషల్లో అగ్ర నాయకిగా రాణిస్తున్న నటి అనుష్క. 2005లో నటిగా రంగప్రవేశం చేసిన ఈ భామ ప్రముఖ కథానాయకులందరితోనూ నటించారు. ప్రస్తుతం 35వ ఏట అడుగుపెట్టారు. దీంతో అనుష్క పెళ్లి గురించి చాలా రోజులుగా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆంధ్రాకు చెందిన ఒక వ్యాపారవేత్తను అనుష్క పెళ్లాడబోతున్నారనే ప్రచారం ఆ మధ్య హల్‌చల్ చేసింది. అయితే నిజంగానే అనుష్క పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో బెంగళూర్‌కు చెందిన వ్యాపారవేత్తతో బొమ్మాళి పెళ్లి నిశ్చయం అయింయందని తాజా సమాచారం. ఆయనకు బెంగళూర్, ఆంధ్రాలో భారీగా ఆస్తులున్నట్లు టాక్. వీరి పెళ్లి వచ్చే ఏడాది జరగనుందని సినీ వర్గాల సమాచారం. అనుష్క సూర్యకు జంటగా నటించిన ఎస్-3 చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 16న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం బాహుబలి-2, భాగమతి చిత్రాలతో పాటు నాగార్జున సరసన నమో వెంకటేశాయ అనే భక్తిరస కథా చిత్రంలో నటిస్తున్నారు. వీటిని పూర్తి చేసిన తరువాత పెళ్లి పీటలెక్కనున్నారని, ఆ తరువాత నటనకు స్వస్తి చెప్పే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Thursday, December 1, 2016

దేని దారి దానిదే!

మాంచి ఘుమఘుమలాడే భోజనం ముందుంటే... లొట్టలేసుకుంటూ తినేస్తారు తప్ప ఎవరూ చూస్తూ కూర్చోరు కదా! కానీ, హీరోయిన్ల పరిస్థితి ఇందుకు భిన్నమనే చెప్పాలి. ముందున్న ప్లేటులో ఫుడ్ నోరూరిస్తున్నా.. ఇది తింటే కొవ్వు పెరుగుతుందేమో? ఇందులో కేలరీలు ఎన్నున్నాయో? రేపు జిమ్‌లో ఎంతసేపు ఎక్స్ట్రా వర్కౌట్స్ చేయాలో? అని సవాలక్ష ప్రశ్నలతో తినడానికి భయపడతారు. కానీ, రకుల్‌ప్రీత్ సింగ్  అలాంటి భయాలేవీ పెట్టుకోకుండా గుజరాతీ ఫుడ్‌ను ఫుల్లుగా లాగించేశారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబుకు జోడీగా నటిస్తున్న సినిమా షూటింగ్ కోసం రకుల్ అహ్మదాబాద్ వెళ్లారు.
 
  షూటింగ్‌కి ప్యాకప్ చెప్పేసిన వెంటనే... వ్యక్తిగత సహాయక బృందంతో కలసి దగ్గరలోని ఓ రెస్టారెంట్‌కి వెళ్లారు. సంప్రదాయ గుజరాతీ వంటకాలు బాగున్నాయని ఫుల్‌గా తినేశారు. మరి, వర్కౌట్స్ సంగతేంటి? ఆల్రెడీ జిమ్‌లో ఉన్నారా! ఏంటి? అనడిగితే... రకుల్ గట్టిగా నవ్వేశారు. ‘‘ఓ పక్క ఫుడ్ దారి ఫుడ్‌ది. మరోపక్క వర్కౌట్స్ దారి వర్కౌట్స్‌ది’’ అన్నారు. ఏం తిన్నా, ఎంత తిన్నా వెయిట్ పెరగని రకుల్ స్లిమ్ బ్యూటీ వెనుక సీక్రెట్ ఇదన్నమాట!