Thursday, November 19, 2015

లాలు తనయుడికి డిప్యూటీ సీఎం పదవి?


ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ కు బిహార్ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఆర్జేడీ శాసనసభ పక్ష నాయకుడిగా తేజస్వి యాదవ్ ను నియమించవచ్చని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం బిహార్ ముఖమంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. నితీశ్ కేబినెట్ లో లాలు కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ లకు బెర్తులు దక్కనున్నట్టు సమాచారం. లాలు చిన్న కొడుకు తేజస్వి కి డిప్యూటీ సీఎం పదవి దక్కే చాన్స్ ఉంది.


లాలు ఈ విషయంపై నితీష్ తో చర్చించినట్టు ఆర్జేడీ వర్గాలు వెల్లడించాయి. లాలు కొడుకులు తాజా ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాగా లాలు ఎన్నికల్లో పోటీ చేయలేదు. బిహార్ ఎన్నికల్లో మహాకూటమి పార్టీలు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ లు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆర్జేడీ 80, జేడీయూ 71, కాంగ్రెస్ 27 సీట్లు గెల్చుకున్నాయి.

పోస్టర్ అదిరింది...



ధనుష్‌, సమంత జంటగా నటిస్తున్న తమిళ చిత్రం 'తంగ మగన్‌' చిత్ర పోస్టర్లు గురువారం విడుదల చేశారు. ధనుష్‌ స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమీజాక్సన్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రేమ, పెళ్లి... పెళ్లి తర్వాత ప్రేమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్లు ఆసక్తిని కలిగిస్తున్నాయి. అమీ జాక్సన్ మోడ్రన్ లుక్ లో ఉండగా, సమంత కొత్తగా పెళ్లైన యువతిగా కనిపిస్తూ అభిమానులకు సినిమా మీద అంచనాలను పెంచుతున్నారు. ఈ సినిమా ఆడియోను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.