Monday, November 21, 2016

గుడ్‌ న్యూస్‌; విత్‌ డ్రా పరిమితి పెంపు

  నోట్ల కష్టాలు తొలగించేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) మరిన్ని ఉపశమన చర్యలు ప్రకటించింది. కరెంట్‌, ఓవర్‌ డ్రాఫ్ట్‌, క్యాష్‌ క్రెడిట్‌ ఖాతాలు కలిగిన వారికి నగదు విత్‌ డ్రా పరిమితిని వారంలో రూ. 50 వేలకు పెంచింది. వీరికి రూ. 2 వేల నోట్లు ఇస్తారు. కనీసం మూడు నెలల నుంచి ఈ ఖాతాలు నిర్వహిస్తున్న వారికే వారంలో రూ. 50 వేలు తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది. వ్యక్తిగత ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఖాతాలు కలిగిన వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది.
రైతులకు కూడా ఊరట కల్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దుకాణాల్లో రద్దు చేసిన పాత 500 నోట్లతో రైతులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ధ్రువీకృత గుర్తింపు కార్డు చూపించి అన్నదాతలు విత్తనాలు కొనుగోలు చేయొచ్చు. కేంద్ర, రాష్ట్ర విత్తన సంస్థలు, వ్యవసాయ యూనివర్సిటీలు, ఐసీఏఆర్‌ సంస్థల నుంచి విత్తనాలు కొనుక్కోవచ్చు. వివాహాలకు రేపటి నుంచి రూ. 2.5 లక్షల విత్‌ డ్రా సదుపాయం కల్పించనున్నట్టు ఆర్బీఐ తెలిపింది. ఇంతకుముందే ఈ ప్రకటన చేసినప్పటికీ నగదు లేకపోవడంతో ఇప్పటివరకు ఇది అమలు కాలేదు. కాగా, నవంబర్‌ 10 నుంచి 18 వరకు బ్యాంకు ఖాతాల నుంచి ప్రజలు 1.03 లక్షల కోట్లు విత్‌ డ్రా చేశారని ఆర్బీఐ వెల్లడించింది.