Thursday, March 24, 2016

రనౌట్ కు ముందు ధోని ఏం చేశాడంటే...

టీ20 ప్రపంచకప్ లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ లో చివరికి రనౌట్ తో టీమిండియా విజయం సాధించింది. రనౌట్ చేయాలని 'మిస్టర్ కూల్' మహేంద్ర సింగ్ ధోని ముందుగానే సిద్ధమైనట్టు కనబడుతోంది. హార్ధిక్ పాండ్యా చివరి బంతిని వేసే ముందు ధోనిని నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
బంతి వేయడానికే ముందే ధోని తన కుడిచేతి గ్లౌజ్ తీసేశాడు. సాధారణంగా వికెట్ కీపర్లు చేతులకు రెండేసి గ్లౌజులు వేసుకుంటారు. చేతికి అంటిపెట్టుకుని గ్లౌజులతో పాటు వదులుగా ఉండే గ్లౌజులు ధరిస్తారు. బంతిని ఒడిసిపట్టిన తర్వాత దాన్ని విసిరే క్రమంలో చేతికున్న పెద్ద గ్లౌజును తీసేస్తుంటారు. వదులుగా ఉండే పెద్ద గ్లౌజులు ధరించి వికెట్లను కొట్టడం కష్టం. కాబట్టి ధోని ముందుగానే రనౌట్ కు ప్లాన్ చేసుకున్నట్టు కనబడుతోంది.
ఇక రెండో ఎండ్ లో ఉన్న బ్యాట్స్ మన్ వచ్చేలోపే 15 గజాల దూరం పరుగెత్తి ధోని రనౌట్  చేయడం విశేషం. దూరం నుంచి బంతి విసిరితే అది వికెట్లకు తగలకపోతే మ్యాచ్ చేజారిపోయే ప్రమాదముందని గ్రహించిన టీమిండియా కెప్టెన్ సమయస్ఫూర్తితో వ్యవహరించి జట్టుకు అనూహ్య విజయాన్ని అందించాడు. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తి పరుగులు తీయడంలో ధోని ఎక్స్ పర్ట్  అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ విశ్వాసంతోనే ధోని వికెట్ల దగ్గరకు పరుగెత్తికొచ్చి రనౌట్ చేయగలిగాడని కామెంటేటర్లు వ్యాఖ్యానించారు.