Thursday, March 17, 2016

బుర్రిపాలెంలో నమ్రత

ప్రభుత్వ పథకాల వల్లె వేయడంతో గ్రామస్తుల నిరాశ
రెండునెలల్లో మహేష్‌ వచ్చి ప్రణాళికను వెల్లడిస్తాడని ప్రకటన



బ్రహ్మరథం పట్టిన బుర్రిపాలెం గ్రామస్తుల కోలాహాలం మధ్య సినీ నటుడు మహేష్‌ భార్య నమ్రత శిరోద్కర్‌ గ్రామంలో గురువారం పర్యటించారు. తెనాలి మండలం బుర్రిపాలేన్ని మహేష్‌బాబు ఆన్‌లైన్‌ ద్వారా దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామ స్థితిగతులు తెలుసుకునేందుకు మహేష్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌, అతని సోదరి, ఎంపి గల్లా జయదేవ్‌ భార్య పద్మావతి బుర్రిపాలెంలో పర్యటించారు. పలు ప్రార్థనా మందిరాలను సందర్శించినానంతరం సూపర్‌స్టార్‌ కృష్ణ తల్లి నాగరత్నమ్మ నిర్మించిన జడ్‌పి పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభకు ఎంపిడిఒ బి.శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. నమ్రతా మాట్లాడుతూ గ్రామీణుల్లో చైతన్యం తెచ్చి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచ్చేందుకు సిఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. సిఎం స్ఫూర్తితో స్మార్ట్‌ గ్రామాలకు తామూ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పలు ప్రభుత్వ పథకాలను ఆమె ఇక్కడే ఉదహరించారు. సిఎం, పిఎం పాలనపై ప్రశంసలు కురిపించిన ఆమె ప్రతిఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకుంటే ప్రభుత్వాలే ప్రత్యేక గ్రాంటులు విడుదల చేస్తాయని చెప్పారు. మహేష్‌బాబు సోదరి, ఎంపి గల్లా జయదేవ్‌ భార్య పద్మావతి మాట్లాడుతూ తన తండ్రి సొంతూరు బుర్రిపాలెం, అమ్ముమ సొంతూరు కంచర్లపాలెం అంటే తనకు అమితమైన మక్కువన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తకు మాత్రమే మాట్లాడే అవకాశం కల్పించారు. తమ గ్రామంలోని మూడు అంగన్వాడీ కేంద్రాలూ పాఠశాలల్లోనే కొనసాగుతున్నాయని, ప్రత్యేక భవనాలు నిర్మించాలని కార్యకర్త కోరారు. అయితే వారి నుండి మాత్రం సరైన స్పందన వ్యక్తమవ్వలేదు. ఈ సందర్భంగా జడ్‌పి పాఠశాల నేతృత్వంలో రూపొందించిన కృష్ణ, మహేష్‌బాబు కుటుంబ సభ్యుల డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అనంతరం కృష్ణ నివాసంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలోనూ పై అంశాలనే ప్రస్తావించారు. ఎంపి గల్లా జయదేవ్‌ నిధుల నుండి రూ.27లక్షలతో సిసి రోడ్లు నిర్మిస్తారని రెండురోజుల కిందటి నాటి అంశాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎంపిపి ఎస్‌.వెంకట్రావు, జడ్‌పిటిసి ఎ.జయలక్ష్మి, సర్పంచ్‌ కె.సామ్రాజ్యం, ఎంపిటిసి ఎస్‌.రామ్మోహనరావు, హెచ్‌ఎం లలితప్రసాద్‌, గ్రామ కార్యదర్శి కిషోర్‌ పాల్గొన్నారు.
కంచెర్లపాలెంలో పద్మావతి..
అనంతరం ఎంపి గల్లా జయదేవ్‌ భార్య పద్మావతి తాను దత్తత తీసుకున్న కంచర్లపాలెంలో పర్యటించారు. అభివృద్ధి పనులపై అధికారుల నుండి వివరాలు సేకరించారు. స్థానిక ప్రజలతో సమావేశం కాగా సిసి రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం, శ్మశాన వాటికల అభివృద్ధి, కమ్యూనిటీ హాలు, బస్సు ఏర్పాటు అంశాలను గ్రామస్తులు ఆమె దృష్టికి తెచ్చారు. పరిశ్రమను ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు కలుగుతాయని కోరారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ గ్రామాభివృద్దికి రూ.27లక్షలతో డ్రెయిన్‌ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఉపాధి హామీ, రూ.60 లక్షల ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కె.నిర్మలాకుమారి, తహశీల్దార్‌ జివి సుబ్బారెడ్డి, ఎంపిపి, జడ్‌పిటిసి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

'బాహుబలి 2లో నటించడం లేదు'


 తాను 'బాహుబలి 2' సినిమాలో నటించడం లేదని హీరోయిన్ శ్రియ తెలిపింది. ఈ చిత్రంలో భల్లాలదేవుడిగా నటించిన దగ్గుబాటి రానాకు జోడీగా శ్రియ నటించనుందని అంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను శ్రియ తోసిపుచ్చింది. 'బాహుబలి 2'లో తాను లేనని వెల్లడించింది. ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన అమెజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో ఆమె పాల్గొంది. డిజైనర్ కనిజ సలూజ డిజైన్ చేసిన దుస్తులు ధరించి ర్యాంప్ పై మెరిసిపోయింది.
         ఈ సందర్భంగా విలేకరులు 'బాహుబలి 2' గురించి అడగ్గా... ఈ సినిమాలో నటించమని తనను ఎవరూ సంప్రదించలేదని తెలిపింది. ఈ చిత్రం నటించాలని ఉన్నా తనకు అవకాశం రాలేదని వెల్లడించింది.
            'బాహుబలి' తొలి భాగంలో రానా కొడుకు పాత్రను మాత్రమే చూపించిన దర్శకుడు రాజమౌళి.. రెండో భాగంలో భల్లాలదేవుడి భార్యను కూడా చూపించనున్నాడు. ఈ పాత్ర ఎవరికి దక్కుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్, రానా లీడ్ రోల్స్‌ లో నటించిన 'బాహుబలి 2' వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.