Sunday, June 29, 2014

బోనమెత్తి.. పరవశించి

శివసత్తులు ఊగంగా.. పోతరాజులు ఆడంగా.. తెలంగాణ ఆడపడుచులు బోనమెత్తి పరవశించిపోయారు. స్వరాష్ట్రంలో సగర్వంగా బోనమెత్తిన నగరం పులకించిపోయింది. గోల్కొండ కోట భక్తి పారవశ్యంతో నిండిపోయింది. అమ్మవారి నామస్మరణతో మార్మోగింది. ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బోనాల పండుగ అట్టహాసంగా ప్రారంభమైంది. చారిత్రాత్మక గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక ఆలయంలో అమ్మవారికి తొలి బోనం సమర్పించి పూజలు ప్రారంభించారు. గోల్కొండలో మతాలకు అతీతంగా ముస్లింలు బోనాల ఊరేగింపునకు ఆత్మీయ స్వాగతం పలికారు. 


ఆలస్యంగా ప్రారంభం

బోనాల పండుగ మొదటి పూజ ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా మధ్యాహ్నం1.30కు ప్రారంభమైంది. దేవాదాయ శాఖ తరఫున డిప్యూటీ కమిషనర్ రామకష్ణారావు పట్టువస్ర్తాలను తీసుకొని లంగర్‌హౌస్ చౌరస్తా సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వచ్చారు. వేదికపై ఉన్న హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వస్ర్తాలను తీసుకెళ్లి ఆలయ కమిటీ చైర్మన్ తీగుల్ల విజయ్‌కుమార్‌కు అందజేశారు. నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి పూజా సామాగ్రిని అందజేశారు. అనంతరం నాయిని నర్సింహారెడ్డి తొట్టెలకు పూజలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి టి.జీవన్‌సింగ్, నాయకులు కావూరి వెంకటేష్, తూముకుంట అరుణ్‌కుమార్, కోడూరి శ్రీధర్‌సాగర్ తదితరులు నత్యం చేశారు.

విగ్రహాలకు ఘనంగా పూజలు
గోల్కొండ జగదాంబిక ఆలయంలో బోనాల పండుగ కోసం ఊరేగించే ఉత్సవ విగ్రహాలకు ఆలయ కమిటీ సభ్యుడు, ప్రధాన అర్చకుడు అనంత చారి ఇంట్లో ఘనంగా పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి విగ్రహాలను దిగంబర్ పంతులు ఇంటికి తీసుకొని వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, బోనాల ఉత్సవ కమిటీ అధ్యక్షులు గడ్డి చంద్రశేఖర్, సభ్యులు రాజ్ మల్లేష్‌యాదవ్, మాజీ చైర్మన్లు, సంఘసేవకులు రాజువస్తాద్ పూజల్లో పాల్గొన్నారు. 



కోట వద్ద పోతరాజుల విన్యాసాలు

గోల్కొండ కోట ప్రవేశ ద్వారం చౌరస్తా వద్దకు ఊరేగింపు చేరుకోగానే పోతరాజుల బందం చేసిన హడావుడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చుట్టుపక్కల పోతరాజులు కలియతిరుగుతూ గోల్కొండ ఆలయం వైపు తిరిగి సాష్టాంగ నమస్కారం చేసి తమ భక్తిని చాటుకున్నారు. చివరగా కోటలోకి తొట్టెల, పూజారి కుటుంబ సభ్యులు తెచ్చిన బోనాలతో అమ్మవారి రథం ప్రవేశించింది. అక్కడి నుంచి వేగంగా కోటపై ఉన్న ఎల్లమ్మ దేవాలయం వద్ద బోనాలు సమర్పించారు. దీంతో తొలి రోజు బోనాల ఉత్సవం ముగిసింది. 


ఊపిరిపీల్చుకున్న పోలీసులు

రంజాన్, బోనాల పండుగ తొలిపూజ ఆదివారమే కావడంతో నగర పోలీసుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఆసిఫ్‌నగర్ పోలీస్ డివిజన్ ఉన్నతాధికారులు పలుమార్లు పీస్‌మైత్రి కమిటీ సమావేశాలను నిర్వహించారు. అంతేకాకుండా ఆదివారం భారీగా పోలీసులను మోహరించారు. బోనాల మొదటి పూజ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి సూచనలతో వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ, టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీలు లింబారెడ్డి, , గోషామహల్, ఆసిఫ్‌నగర్, ఏసీపీలు డి. శ్రీనివాస్, రాంభూపాల్‌రావు, బందోబస్తులో పాల్గొన్నారు. 

సందర్శకుల తాకిడి

బోనాల పండుగను పురస్కరించుకుని గోల్కొండ కోటలోని ఉచిత ప్రవేశం ఉండటంతో ఆదివారం రికార్డు స్థాయిలో గోల్కొండను సందర్శకులు సందర్శించారు. తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు, పర్యాటకులు తరలివచ్చారు. సుమారు లక్షకుపైగా భక్తులు ఆదివారం ఒక్కరోజే గోల్కొండను సందర్శించడం విశేషం.