Monday, October 24, 2016

అడుక్కోవలసిన ఖర్మ నాకు లేదు!

సౌతిండియాలో ఏడాదికి నాలుగైదు లేదా కనీసం రెండు సినిమాల చొప్పున రాకెట్ స్పీడుతో ఇలియానా నటించారు. ముంబై వెళ్లిన తర్వాత ఈ గోవా బ్యూటీలో అంత స్పీడు కనిపించడం లేదు. అక్కడ జోరు తగ్గడానికి కారణం... హిందీ సినిమాల్లో అవకాశాలు రాక కాదట, వచ్చిన వాటిలో మంచివి ఎంపిక చేసుకోవడమే అంటున్నారు. అంతే కాదండోయ్.. అవకాశాల కోసం ఎవ్వర్నీ అడుక్కోవలసిన ఖర్మ నాకు లేదని ఇలియానా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘‘ఇక్కడ (బాలీవుడ్‌లో) చాన్సులు, మీ సెలక్షనే కీ రోల్ పోషిస్తాయి. మీకో మంచి అవకాశం వచ్చిందనుకోండి.. నటించాలా? వద్దా? అనేది మీ చేతుల్లో ఉంటుంది.                   మీ సెలక్షన్ మంచిదయితే మీరు ఇండస్ట్రీలో ఉంటారు. చెత్తగా ఉంటే.. కెరీర్ క్లోజ్ అవుతుంది’’ అని ఇలియానా స్పష్టం చేశారు. బాలీవుడ్‌లో వచ్చిన అవకాశాలు, అందులో ఆమె సెలక్షన్ పట్ల హ్యాపీగా ఉన్నారట. ‘‘నా వరకూ నేను మంచి సినిమాలే సెలక్ట్ చేసుకున్నా. నా హార్డ్ వర్క్ వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని గర్వంగా చెప్పగలను. ఇప్పటివరకూ ఎవర్నీ ఫేవర్ చేయమని అడగలేదు. అవకాశాల కోసం ఎవర్నీ అడుక్కోను. నా డిగ్నిటీ నాకుంది’’ అన్నారామె. ప్రస్తుతం రెండు హిందీ సినిమాల్లో ఇలియానా నటిస్తున్నారు.

నాన్నకు ప్రేమతో...

మన కలలను నెరవేర్చుకోవడంలో ఆనందం ఉంటుంది. అయితే తల్లిదండ్రుల కలలను సాకారం చేయడంలో కలిగే సంతృప్తే వేరు. అందానికి ప్రతిరూపం లాంటి నటి త్రిష ఇప్పుడు రెండో రకం సంతోషాన్ని అనుభవించ డానికి దగ్గరగా ఉన్నారు. తొలి నుంచి కమర్శియల్ చిత్రాల్లో నటిస్తూ గ్లామర్‌తో నాయకిగా నెట్టుకొచ్చిన త్రిష ఇటీవల తన బాణిని మార్చారన్నది ఆమె చిత్రాల ఎంపిక చూస్తేనే అర్థం అవుతుంది. నాయకి చిత్రంతో హీరోయిన్ సెంటరిక్ పాత్రకు మారారు. ఆ చిత్రం నిరాశ పరచినా అదే బాణీలో మోహిని చిత్రంలో నటిస్తున్నారు.నాయకి చిత్రం అందించలేని ఆనందాన్ని మోహిని ఇస్తుందనే ఆశతో ఉన్నారు.
మోహిని చిత్ర ఫస్ట్‌లుక్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ధనుష్ జంటగా కొడి చిత్రంలో ప్రతినాయకి చాయలున్న పాత్ర దుమ్మురేపేలా నటించారనే టాక్ వినిపిస్తోంది. ఆ చిత్రం దీపావళి సందర్భంగా ఈ నెల 28న తెరపైకి రానుంది. ఈ చిత్ర విజయం నటి త్రిషతో పాటు, ధనుష్‌కు చాలా అవసరం. కాగా త్రిష ప్రస్తుతం మోహిని చిత్రంలో నటిస్తున్నారు. గర్జనై, చతురంగవేట్టై, సామి-2 చిత్రాల్లో నటించనున్నారు. ఇకపై వైవిధ్యభరిత కథా పాత్రల్లోనే నటించాలని ఈ బ్యూటీ నిర్ణయించుకున్నారట. కాగా ప్రముఖ హీరోయిన్లు ఇప్పుడు ఒక పక్క నటిస్తూనే మరో పక్క ఇతర వ్యాపారాల్లో ఆదాయాన్ని గడిస్తున్నారు.
  అదే విధంగా 14 ఏళ్ల సినీ వయసులోనూ నాయకిగా బిజీగా ఉన్న నటి త్రిష హోటల్ బిజినెస్‌లోకి దిగుతున్నారు. బెంగళూర్‌లో 60 గదులతో కూడిన ఆధునిక స్టార్ హోటల్‌ను నిర్మిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. త్రిష ఈ హోటల్ నిర్మించడానికి కారణం ఉందట. తన తండ్రి కృష్ణ ఒక నక్షత్ర హోటల్‌లో పని చేసేవారు. ఆయనకు తాను హోటల్ యజమానిని కావాలని కలల కనేవారట. అయితే ఆ కల నెరవేరకుండానే ఆయన తనువు చాలించారు. దీంతో తన తండ్రి కలను సాకారం చేయడానికే త్రిష స్టార్ హోటల్‌ను కట్టిస్తున్నారట.