Friday, November 18, 2016

ప్రేమలో విఫలమైతే విహారయాత్రలకు వెళ్తా

 ఆలియా భట్‌.. చిన్న వయసులోనే బాలీవుడ్‌లో అడుగుపెట్టి అనతికాలంలోనే అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే.. తోటి నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు బీటౌన్‌లో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా తన టీనేజీ లవ్‌ బ్రేకప్‌ గురించి.. ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది.
‘‘నేను పదహారేళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రేమలో విఫలమయ్యా. ఆ బ్రేకప్‌ బాధలోంచి తేరుకోవడానికి స్నేహితులతో ఎక్కువగా గడిపేదాన్ని. కానీ ఇప్పుడు అలాంటిది జరిగితే విహార యాత్రలకు వెళ్తా లేదా నా పనిపై ఇంకాస్త ఎక్కువ దృష్టిపెడతా. ఓ వ్యక్తి నాకోసమే ఎక్కడైనా ఉంటే.. ఎప్పటికైనా తిరిగొస్తాడని నమ్ముతా. నా దృష్టిలో ప్రేమ అనే భావన రోజూ మారుతుంటుంది. ప్రేమ అనేది ఇద్దరు ప్రేమికుల మధ్యలో ఉన్నదే కాదు. స్నేహితుల మధ్య ఉండొచ్చు. నాకు నా పెంపుడు పిల్లిపై.. కాఫీపై కూడా ప్రేమ ఉంది’’ అంటూ తనదైన ప్రేమపాఠాలు చెప్పుకొచ్చింది ఆలియా.

దేవుడే మళ్లీ ఆహ్వానించాడు!

 ‘‘బైబిల్ కథాంశంతో తెరకెక్కనున్న చిత్రమిది. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే చిత్రం అవుతుందనుకుంటున్నా. ‘కరుణామయుడు’ రేంజ్‌లో ఈ చిత్రం ఆడాలి’’ అని నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. సీనియర్ నటి దివ్యవాణి ప్రధానపాత్రలో ‘తొలి కిరణం’ జాన్‌బాబు దర్శకత్వంలో డి.శ్రీధర్‌రెడ్డి నిర్మిస్తున్న ‘నీ దేవుడే నా దేవుడు’ చిత్రం ఇటీవల ప్రారంభమైంది.
‘‘చారిత్రక చిత్రమిది. క్రీస్తు పూర్వం ఇజ్రాయిల్ దేశంలో జరిగిన అత్తాకోడళ్ల కథ’’ అని దర్శకుడు అన్నారు. ‘‘పదిహేనేళ్ల వయసు నుంచి సినిమాల్లో నటిస్తున్న నేను పెళ్లయ్యాక ఏడేళ్లు గ్యాప్ తీసుకున్నా. నాకిష్టమైన ఈ రంగానికి దేవుడు నన్ను మళ్లీ ఆహ్వానించాడు. నయోని అనే పాత్రలో కనిపిస్తా’’ అని దివ్యవాణి  చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: స్రవంతి.