Sunday, October 16, 2016

అంతా అయిపోయాకా ఏం చేస్తాం?

 సినిమా విడుదలయ్యేంత వరకూ కష్టానికి తగిన ఫలితం వస్తుందా? హిట్‌ అవుతుందా, లేదా? అంటూ సవాలక్ష సందేహాలుంటాయి. విడుదలయ్యాక ఫలితం గురించి విశ్లేషణలూ ఉంటాయి. బాగా ఆడినా, ఆడకపోయినా కారణాలు అన్వేషించాల్సిందే. అయితే వీటి గురించి మరీ అతిగా ఆలోచించడం అనవసరం అంటోంది రాశీ ఖన్నా. ‘‘ఫలితంపై ఆరా అవసరమే. ఎందుకంటే ఎక్కడ తప్పు చేశామో ఓసారి పునః సమీక్షించుకొనే అవకాశం ఉంటుంది. అయితే మరీ వాటి గురించే ఎక్కువ ఆలోచించకూడదు. అంతా అయిపోయాక తీరిగ్గా కూర్చుని ఫలితాల్ని విశ్లేషించుకొంటూ బాధపడితే లాభం లేదు. కాలాన్ని వెనక్కి తిప్పి ఆ తప్పులు సరిదిద్దుకోలేం కూడా. అయ్యిందేదో అయిపోయింది. జరగాల్సిన విషయం ఆలోచించాలి. ఈ విషయంలో నా ఆలోచనలు అలానే ఉంటాయి. నిన్నటి గురించి, రేపటి గురించీ అతిగా ఆలోచించడం వల్ల ఒరిగేదేం ఉండదు. ప్రస్తుతం చేస్తున్న పనిపై కూడా మనసు లగ్నం చేయలేం’’ అంది రాశీ ఖన్నా.

బంగారు నాణేలు.. తవ్వుకునేందుకు జనాల పోటీ!

 నది ఒడ్డున ఉన్న ఆ ప్రాంతంలో మైనింగ్‌ జరుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ కొందరికి బంగారు నాణేలు దొరికియట. ప్రాచీనకాలంలో పాతిపెట్టిన గుప్తనిధికి సంబంధించిన ఆ బంగారు నాణెముల్లో రాజు లేదా దేవుడి ప్రతిమ, మహిళ, నెమలీ ప్రతిమలు ఉన్నాయని, అవి మాకు దొరికాయంటూ కొందరు వాట్సప్‌లో ఆ ఫొటోలు కూడా పెట్టారు. ఇంకేముంది ఆ నోటా ఈ నోటా ఈ వార్త దావాహనంలా పాకింది.
తెల్లారిలేచేసరికి స్థానిక గ్రామస్తులు అంతా ఆ నది ఒడ్డుకు వెళ్లి ఉత్త చేతులతో తవ్వడం మొదులుపెట్టారు. దీంతో ఆ నది ప్రాంతమంతా జాతరలా మారిపోయింది. ఎటుచూసినా ప్రజలు రోజుల తరబడి గుంతలు తవ్వుతూనే ఉన్నారు. బంగారు నాణెలు తమకు దొరకకపోతాయా అన్న ఆశతో గ్రామస్తులు తవ్వుతూనే ఉన్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని టాంక్‌ అనే మారుమూల గ్రామంలో జరిగింది. ఈ గ్రామ సమీపంలో ఉన్న నది ఒడ్డున బంగారు నాణేలు దొరుకుతున్నాయన్న వదంతులు వచ్చాయి. ఈ బంగారు నాణెలకు సంబంధించిన ఫొటోలు సైతం వాట్సాప్‌లో దర్శనమిచ్చాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు జరిపారు. గ్రామస్తులందరినీ వాకబు చేసినా.. ఎవరూ తమకు బంగారు నాణెం దొరికిందని చెప్పలేదు. ఎవరో దుండగులు కావాలని వదంతులు రేపినట్టు గుర్తించిన పోలీసులు.. వాట్సాప్‌లో ఫొటోలు పెట్టిన నలుగురు వ్యక్తుల్ని అరెస్టుచేశారు. అయినా.. ఆ నది ఒడ్డున గత మూడు రోజులుగా గ్రామస్తులు తవ్వడం మాత్రం ఆపలేదు.