Thursday, October 17, 2019

విడాకులు తీసుకున్న మనోజ్‌ దంపతులు

 ప్రముఖ నటుడు మంచు మోహన్‌ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్‌ తన భార్య ప్రణతీ రెడ్డితో విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. దీనిపై మనోజ్‌ ఓ లేఖను ట్విటర్లో పోస్ట్‌ చేశారు. ''నా వ్యక్తిగత జీవితం, కెరీర్‌ గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. నేను విడాకులు తీసుకున్న విషయాన్ని బాధతో మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఒక అందమైన, గొప్ప అనుబంధానికి ముగింపు పలికాం. మా ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో మానసికంగా ఎంతో ఇబ్బందిపడ్డాం. దీనిపై సుదీర్ఘమైన ఆత్మపరిశీలన చేసుకున్న తర్వాత విడివిడిగా జీవించాలని నిర్ణయించుకున్నాం. మున్ముందు కూడా మేమిద్దరం ఒకరినొకరు గౌరవించుకుంటూ సహకరించుకోవాలనుకుంటున్నాం. ఈ నిర్ణయాన్ని మీరంతా సమర్ధిస్తారని, మా ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు'' అని మనోజ్‌ భావోద్వేగంతో లేఖలో పేర్కొన్నాడు.

నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న మనోజ్‌, ప్రణతి మధ్య సరైన సంబంధాలు లేవని, ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో ఆమె తన పుట్టింటికి అమెరికా వెళ్లిపోయిందని గతేడాది వార్తలు వచ్చాయి. ఐతే అవన్నీ పుకార్లేననని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మనోజ్‌ క్లారిటీ ఇచ్చారు. తాజాగా తామిద్దరం కలిసుండటం లేదని, విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా సోషల్‌మీడియాలో వెల్లడించారు మనోజ్‌. ఫ్యామిలీ ఫ్రెండ్‌ ప్రణతిని ప్రేమించిన మనోజ్‌ పెద్దల అంగీకారంతో 2015లో వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కొన్నాళ్ల నుంచే వీళ్లిద్దరూ విడివిడిగా ఉంటున్నారని కొన్నేండ్లు ప్రచారం జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ప్రణతి చాలా రోజుల పాటు అమెరికాలోనే ఉన్నారు. వీరిద్దరి అంగీకారం, ఇరు కుటుంబాల మధ్య చర్చల అనంతరం లీగల్‌గా విడిపోయారు.

Friday, October 4, 2019

ఆర్టీసీ సమ్మె షురూ..


దీంతో దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో విధులు నిర్వహిస్తున్న వారు శుక్రవారం మధ్యాహ్నం ఉన్న పళంగా విధుల నుంచి వైదొలిగారు. దూరప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే సర్వీసుల డ్రైవర్లు విధులు బహిష్కరించారు. దీంతో శుక్రవారమే సమ్మె మొదలైనట్లయింది. శుక్రవారం నాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కొలిక్కి రాకపోవటంతో ఈ సర్వీసులు నడిపే పరిస్థితి లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాకపోతే కొన్ని ప్రాంతాలకు ఏపీ బస్సులు రావటంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు.
బుధ, గురువారాల్లో జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనటంతో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన చర్చలపై అందరి దృష్టి నిలిచింది. ఇటు కార్మిక సంఘాలు బెట్టు వీడటమో, అధికారుల కమిటీ మెట్టు దిగటమో జరిగి సమ్మె తప్పుతుందని ప్రయాణికులు ఎదురు చూశారు. ఆదివారం సద్దుల బతుకమ్మ కావడంతో లక్షల మంది సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో జనం ఊళ్లకు వెళ్లినా, ఉద్యోగులు శనివారమే పయనమవుతున్నారు. సరిగ్గా అదే రోజు సమ్మె మొదలు కానుండటంతో శుక్రవారం టెన్షన్‌తో గడిపారు. సమ్మె లేదనే శుభవార్త కోసం ఎదురు చూశారు.  కాగా, నిర్ధారిత సమయంలో హామీలు నెరవేరుస్తామంటూ లిఖిత పూర్వకంగా స్పష్టమైన హామీ ఇస్తే సమ్మె యోచన విరమణపై ఆలోచిస్తామని కార్మిక సంఘాలు గట్టిగా డిమాండ్‌ చేశాయి. కానీ ఆర్థిక పరమైన అంశంతో ముడిపడ్డ డిమాండ్లపై ఉన్నఫళంగా లిఖిత పూర్వక హామీ సాధ్యం కాదని, దసరా తర్వాత మళ్లీ చర్చలు ప్రారంభిద్దామని, అప్పటి వరకు సమ్మెను వాయిదా వేసుకోవాలని అధికారుల కమిటీ స్పష్టం చేసింది. దీంతో కమిటీ తమ మాట వినదని, కార్మిక సంఘాల జేఏసీ చర్చలను బహిష్కరించి అక్కడి నుంచి నిష్కమించింది.
ప్రైవేటు డ్రైవర్ల చేతికి స్టీరింగ్‌ 
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు డ్రైవర్ల గుర్తింపు బాధ్యతను గురువారమే ఐఏఎస్‌ అధికారుల కమిటీ రవాణ శాఖకు అప్పగించింది. స్థానిక మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు తమ వద్ద ఉన్న డ్రైవర్ల వివరాల ఆధారంగా వారికి సమాచారం అందించి పిలిపించారు. 18 నెలలు, అంత కంటే ఎక్కువ కాలం క్రితం హెవీ మోటార్‌ వెహికిల్‌ లైసెన్సు తీసుకుని ఉన్న వారిని అర్హులుగా పేర్కొన్నారు. వారి డ్రైవింగ్‌ నైపుణ్యాన్ని పరిశీలించి, గతంలో యాక్సిడెంట్‌ కేసులు లేకుంటే వారి పేరును ఆర్టీసీ అధికారులకు సిఫారసు చేస్తున్నారు.
            అలా వచి్చన డ్రైవర్లు శనివారం ఉదయం 4 గంటల కల్లా డిపోలకు రావాల్సి ఉంది. పదో తరగతి ఉత్తీర్ణులైన వారిని కండక్టర్లుగా తీసుకుంటున్నారు. ఈ తాత్కాలిక డ్రైవర్లకు రోజుకు రూ.1,500, కండక్టర్లకు రూ.వెయ్యి చెల్లించాలని ఆర్టీసీ నిర్ణయించింది. అయితే వారి చేతికి పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ బస్సులు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. డీలక్స్‌ బస్సులపై తర్జనభర్జన పడుతున్నారు. వేగంగా వెళ్లటంతోపాటు ఖరీదు కూడా ఎక్కువ ఉండే సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్‌ బస్సులను వారి చేతికి ఇవ్వొద్దని నిర్ణయించారు.

Wednesday, October 2, 2019

‘సైరా నరసింహారెడ్డి’ మూవీ రివ్యూ

 ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ కొత్తది కాదని అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది స్వతంత్ర సమర యోధుల కథలను వెండితెరపై చూశాం. అయితే మొట్టమొదటి యోధుడు.. రేనాటి వీరుడైన నరసింహా రెడ్డి గురించి ఇంతవరకు ప్రపంచానికి అంతగా తెలీదు. ఇదే ఈ సినిమాకు కొత్త పాయింట్. ఈ పాయింటే మనల్ని సినిమా చూసేలా చేస్తుంది. 61 మంది పాలేగాళ్ల ను ఏకం చేసి బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురు వెళ్లాలని ప్రయత్నిస్తుంటాడు నరసింహా రెడ్డి. ఈ కథలో సిద్దమ్మ, లక్ష్మీ పాత్ర ఏంటి? స్వాతంత్ర్య సమరం కోసం అందరినీ నరసింహారెడ్డి ఏకతాటి పైకి ఎలా తెచ్చాడు? ఆ క్రమంలో అతనికి ఎదురైన సంఘటనలు ఏంటి? అన్నదే మిగతా కథ.
 చిరంజీవి తరువాత అంతగా పండిన పాత్ర అంటే అవుకు రాజు కిచ్చా సుదీప్‌దే. విభిన్న కోణాలను చూపిస్తూ.. అవసరమున్న చోట ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌కు గురి చేస్తారు. గురువు పాత్రలో గోసాయి వెంకన్నగా అమితాబ్‌ గౌరవ పాత్రలో నటించారు. కనిపించింది కొన్ని సీన్స్‌లోనైనా.. తెరపై అద్భుతంగా పడించారు. వీరా రెడ్డిగా జగపతి బాబు చక్కగా నటించాడు. క్లైమాక్స్‌లో జగపతి బాబు కంటతడి పెట్టిస్తాడు. విజయ్‌ సేతుపతి పాత్ర నిడివి తక్కువే అయినా రాజా పాండిగా నమ్మిన బంటు పాత్రలో ఒదిగిపోయాడు. సిద్దమ్మ పాత్రలో నయనతార.. కనిపించింది ఐదారు సీన్లే అయినా.. తన ముద్ర కనిపిస్తుంది. ఇక లక్ష్మీ పాత్రలో నటించిన తమన్నా అందర్నీ ఆకట్టుకుంటుంది. తన పాత్ర ముగింపు సినిమాను మలుపు తిప్పుతుంది. ఇక రవికిషన్‌, బ్రహ్మాజి, అనుష్క, ఇలా అందరూ తమ పరిధి మేరకు నటించారు.

విశ్లేషణ
అందరికీ తెలిసిన కథనే ప్రేక్షకలక నచ్చే, మెచ్చే విధంగా తీయడంలోనే దర్శకుడి ప్రతిభ కనబడుతుంది. అందులోనూ చరిత్ర పుటల్లో అంతగా లేని నరసింహా రెడ్డి కథను, నేటి తరానికి దగ్గరయ్యేలా తీశాడు సురేందర్‌ రెడ్డి. నరసింహా రెడ్డి గురించి చెప్పడానికి, బ్రిటీష్ వాళ్ళ ఆగడాలు, అప్పటి జనాల స్థితిగతులు చెప్పడానికే ఫస్ట్ హాఫ్‌ను ఎక్కువగా వాడుకున్నాడు దర్శకుడు. ప్రతీ షాట్‌లో క్యారెక్టర్‌ ఎలివేట్ అయ్యేలా చిత్రీకరించాడు. ప్రతీ సీన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేసాడు. ఈ కథ చెప్పడానికి దర్శకుడు ఎంచుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. మొదటి సీన్‌ నుంచి చివరి వరకు తాను రాసుకున్న కథనం ఆకట్టుకుంటుంది.
 ద్వేషం కోసం కాదు దేశం కోసం నిలబడు లాంటి ఎన్నో అద్భుతమైన, అర్థవంతమైన మాటలను సాయి మాధవ్‌ బుర్రా  రాశాడు.  సినిమాకు మరో ప్రధాన బలం సంగీతం. అమిత్‌ త్రివేది అందించిన పాటలు సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. ఉన్నవి రెండు పాటలే అయినా.. వాటిని తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకులు ముగ్దులు కావాల్సిందే. సైరా క్యారెక్టర్‌ అంతగా ఎలివేట్‌ అయిందంటే.. ప్రతీ సీన్‌తో ప్రేక్షకులు ఎమోషన్‌గా కనెక్ట్‌ అయ్యారంటే జూలియస్‌ ప్యాకియమ్‌ అందించిన నేపథ్య సంగీతమే అందుకు కారణం. రత్నవేలు పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. తన తండ్రి కోరిక నేరవేర్చేందుకు రామ్‌ చరణ్‌ పడిన కష్టం, చేసిన ఖర్చు తెరపై కనపిస్తుంది. చిరంజీవి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా చెప్పుకునే ఈ సైరాను.. విజువల్‌ వండర్‌గా తెరకెక్కించిన తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. నిర్మాణంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా ఖర్చు పెట్టాడు. దానికి తగ్గ ఫలితం వెండితెరపై కనబడుతుంది. ఎడిటింగ్‌, క్యాస్టూమ్‌, ఆర్ట్‌ ఇలా అన్ని విభాగాలు సినిమాను విజయవంతం చేయడంలో సహాయపడ్డాయి

Wednesday, September 25, 2019

వేణు మాధవ్‌ కన్నుమూత


టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్‌ కన్నుమూశారు. సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్రను వేసుకున్న వేణు మాధవ్‌ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నెల 7వ తేదీన ఆయనను చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు యశోదా ఆస్పత్రిలో చేర్చారు.  అయితే వేణు మాధవ్‌ చనిపోయారంటూ సోషల్‌ మీడియాలో నిన్నటి నుంచే వార్తలు హల్‌చల్‌ చేశాయి. అయితే వాటిని కుటుంబసభ్యులు ఖండించారు. ఈ నేపథ్యంలో ఇవాళ మధ‍్యాహ్నం ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు, ఆస్పత్రి వైద్యులు అధికారికంగా నిర్థారించారు. వేణు మాధవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు. కాగా కొద్ది నెలల క్రితం వేణు మాధవ్‌ సోదరుడు విక్రమ్‌ బాబు గుండెపోటుతో మృతి చెందారు.

Tuesday, September 24, 2019

హాస్య నటుడు వేణు మాధవ్‌కు తీవ్ర అనారోగ్యం

  ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్రను వేసుకున్న వేణు మాధవ్‌ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావడంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని హాస్పిటల్‌ వైద్యులు తెలిపారు.

Tuesday, September 3, 2019

టీ-20లకు మిథాలీ గుడ్ బై


 
భారత మహిళా జట్టు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ టీ-20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పింది. భారత టీ-20 జట్టుకు తొలి కెప్టెన్‌గా 2006లో బాధ్యతలు స్వీకరించిన మిథాలీ ఇప్పటివరకు 89 మ్యాచ్‌లు ఆడింది. మొత్తం 2364 పరుగులు చేసి టీ-20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రీడాకారిణిగా నిలిచింది. అలాగే 2012, 14, 16 ప్రపంచకప్‌ల్లో జట్టుకు నాయకత్వం వహించింది. `2006 నుంచి భారత్ తరఫున టీ-20లు ఆడుతున్నాను. ఇప్పుడు టీ-20లకు రిటైర్మెంట్ ప్రకటించి 2021లో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌పై దృష్టి సారించాలనుకుంటున్నాను. ఇప్పటివరకు నాకు అండగా నిలిచిన బీసీసీఐకు ధన్యవాదాలు` అని మిథాలీ పేర్కొంది.

Tuesday, January 29, 2019

టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల


 ఆస్ట్రేలియాలో 2020లో నిర్వహించే పురుషుల, మహిళల ప్రపంచ కప్‌ టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌ జట్లు ఉన్న కఠినమైన గ్రూప్‌ 2లో కోహ్లీ సేనను చేర్చారు. ఈ గ్రూప్‌లో ఆ మూడు జట్లతోపాటు మరో రెండు అర్హత సాధించే జట్లు ఉండనున్నాయి. దక్షిణాఫ్రికాతో టీమిండియా తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. మరో వైపు భారత మహిళల జట్టును గ్రూప్‌ ఏలో చేర్చారు. తొలి మ్యాచ్‌లోనే భారత్‌ కఠిన జట్టును ఎదుర్కోనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌, ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది. 


             ఆస్ట్రేలియాలో తొలిసారిగా మహిళల, పురుషుల టీ20 ప్రపంచ కప్‌లను ఒకే ఏడాది, ఒకే దేశంలో నిర్వహిస్తున్నారు. ఈ రెండు టోర్నీల ఫైనల్‌ మ్యాచ్‌లను మెల్‌బోర్న్‌ స్టేడియంలోనే నిర్వహించనుండటం విశేషం. మహిళల ప్రపంచ కప్‌లో మొత్తం పది జట్లు 23 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, భారత్‌ తలపడనున్నాయి. ఇక పురుషుల ప్రపంచకప్‌ అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు జరగనుంది.

Friday, January 25, 2019

గోవా బీచుల్లో మద్యపాన నిషేధం



 ఇకపై గోవా బీచుల్లో బహిరంగంగా మద్యం సేవించినా, వంటలు వండినా రూ.2000ల జరిమానా విధించనున్నారు. ఇందుకోసం అక్కడి రాష్ట్రప్రభుత్వం పర్యాటక చట్టాల్లో చేసిన మార్పులకు కేబినెట్‌ గురువారం ఆమోదముద్ర వేసింది. దీనిపై గోవా పర్యటకశాఖ మంత్రి మనోహర్‌ అజ్గోంకర్‌ మాట్లాడుతూ.. ఈ బిల్లును జనవరి 29 నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదిస్తామని పేర్కొన్నారు. గోవాకు వచ్చే పర్యాటకుల్లో కొద్దిమంది పగిలిన మద్యం సీసాల్ని బీచ్‌లో విసురుతున్నారని, అక్కడే వంటలు కూడా వండుతున్నారని చెప్పారు. దీనిని నిషేధించే ఉద్దేశంతోనే ప్రస్తుతం ఈ బిల్లును తీసుకొచ్చామని చెప్పారు. ఇకపై బీచుల్లో బహిరంగంగా మద్యం సేవించడం నిషేధిస్తామని, అక్కడికి మద్యం సీసాలు తీసుకెళ్లేందుకు కూడా అనుమతించమని చెప్పారు. బహిరంగంగా వంటలు వండటాన్ని కూడా నిషేధిస్తున్నామని, ఒక వేళ ఎవరైనా అతిక్రమణలకు పాల్పడితే రూ.2000 జరిమానా విధిస్తామన్నారు. జరిమానా చెల్లించని పక్షంలో వారిని అదుపులోకి తీసుకొని మూడు నెలల జైలు శిక్ష విధిస్తామని చెప్పారు. బృందాలుగా ఈ నిబంధనలను అతిక్రమించే వారికి రూ.10వేల వరకూ జరిమానా ఉంటుందని చెప్పారు. ఇటీవలి కాలంలో గోవాలో బీచ్‌ల నిర్వహణ సరిగాలేదని పర్యటక ప్రతినిధులు కొందరు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నూతన చట్టం అమల్లోకి వచ్చాక ప్రత్యేకంగా ఓ వాట్సప్‌ నెంబరు ద్వారా అతిక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించి, 12 గంటల్లోగా వారిపై చర్యలు తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి అజ్గోంకర్‌ తెలిపారు.

Thursday, January 24, 2019

మరో కట్టప్ప!

  ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రంలో కీలక పాత్ర చేస్తావా? అని దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి అడగ్గానే వెంటనే ఒప్పుకొన్నానని అంటున్నారు ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రెండో భారీ షెడ్యూల్‌ ఇటీవల ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లోనే సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారట. ఈ విషయాన్ని ఆయన ఓ తమిళ మ్యాగజైన్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘నేను దర్శకత్వం వహించిన ‘నాడోడిగల్‌’ సినిమా చూసి రాజమౌళి సర్‌ నాకు ఓ పెద్ద మెసేజ్‌ పెట్టారు. అప్పటినుంచి నేను రాజమౌళి సర్‌తో టచ్‌లో ఉన్నాను. ఇటీవల ఆయన నన్ను తన ఇంటికి ఆహ్వానించారు. తన కుటుంబీకుల్ని పరిచయం చేశారు. అప్పుడే నాకు ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమా గురించి తెలిసింది. ఇందులో ఓ కీలక పాత్ర ఉంది చేస్తావా? అని అడిగారు. నేను క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఒప్పేసుకున్నాను. అయితే ముందు ఆయన స్క్రిప్ట్‌ చదవాలని చెప్పారు. సరేనన్నాను’ అని వెల్లడించారు.
             ప్రస్తుతం చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో ముగ్గురు కథానాయికలకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. సమంత, కీర్తి సురేశ్, ప్రియమణి, అదితిరావు హైదరి పేర్లు వినపడుతున్నాయి. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్‌ హక్కులు రికార్డు స్థాయిలో రూ.132 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.

Wednesday, January 23, 2019

చక్కర్లు కొట్టిన కోహ్లి, ధోని

Virat Kohli And MS Dhoni Enjoyed Riding A Segway - Sakshi

 న్యూజిలాండ్‌ గడ్డపై శుభారంభం చేసిన టీమిండియా మంచి ఊపుమీద ఉంది. బుధవారం జరిగిన మొదటి వన్డేలో కివీస్‌ను చిత్తుగా ఓడించి కోహ్లి సేన భారీ విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత మెక్‌లీన్‌ మైదానంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోని కాసేపు సందడి చేశారు. సెల్ఫ్‌ బ్యాలెన్సింగ్‌ టూవీలర్‌ ‘సెగ్‌వే’పై చక్కర్లు కొట్టారు. (కివీస్‌ గడ్డపై తొలి వన్డే మనదే!)

ముందుగా కోహ్లి దీనిపై హుషారుగా ప్రయాణించాడు. రకరకాల విన్యాసాలు చేస్తూ అక్కడున్నవారిని అలరించాడు. తర్వాత ధోని కూడా తనదైన శైలిలో కూల్‌గా చక్కర్లు కొట్టాడు. బీసీసీఐ ట్వీట్‌ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా మైదానం సిబ్బంది సులువుగా ప్రయాణించేందుకు ‘సెగ్‌వే’ను వినియోగిస్తారు. కాగా, భారత్‌-న్యూజిలాండ్‌ రెండో వన్డే ఈనెల 26న జరగనుంది.

Tuesday, January 22, 2019

‘మా ఇద్దరినీ అంతం చేయాలని చూస్తున్నారు’

 గ్లామరస్‌ మాఫియా కారణంగానే తమ సినిమాకు థియేటర్లు దొరకలేదని, అందుకే పరాజయం చవిచూడాల్సి వచ్చిందని బాలీవుడ్‌ మూవీ ‘రంగీలా రాజా’ నిర్మాత, సెంట్రల్‌ బోర్డు ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌(సీబీఎఫ్‌సీ) మాజీ చైర్మన్‌ పహ్లజ్‌ నిహలానీ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘ సెన్సార్‌ బోర్డు చైర్మన్‌గా ఉన్న సమయంలో కఠినంగా వ్యవహరించినందు వల్లే కొంతమంది నన్ను టార్గెట్‌ చేశారు. నా కారణంగా హీరో గోవిందాను ఇబ్బంది పెడుతున్నారు. నన్ను, గోవిందాను అంతం చేయాలని చూస్తున్న ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలుసు. ఇండస్ట్రీ మొత్తం కొంతమంది చేతుల్లో చిక్కుకుపోయింది. కార్పోరైటేజషన్‌ పేరుతో నా వంటి నిర్మాతలను అణగదొక్కాలని చూస్తున్నారు. అయినా భయపడేది లేదు. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధిస్తా’ అని వ్యాఖ్యానించారు.
ఇక ఈ విషయం గురించి మాట్లాడిన గోవిందా.. ‘ గత తొమ్మిదేళ్లుగా పరిస్థితి ఇలాగే ఉంది. నా సినిమాలకు థియేటర్లు దొరకకుండా కొంతమంది అడ్డుతగులుతున్నారు. నేనేమీ రాజకీయాల్లో లేనుకదా. దయచేసి నా పనిని సక్రమంగా చేసుకోనివ్వండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా గోవిందా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రంగీలా రాజా’ సినిమా శుక్రవారం విడుదలైంది.