Monday, April 20, 2015

పవన్‌ కల్యాణ్‌ను కలిసిన శ్రీజ కుటుంబం

                 తీవ్ర అనారోగ్యం నుంచి బయటపడిన చిన్నారి శ్రీజ తన అభిమాన నటుడు పవన్‌కల్యాణ్‌ కలుసుకుంది. సోమవారం జూబ్లీహిల్స్‌లోని జనసేనపార్టీ కార్యాలయంలో పవన్‌ను చిన్నారి శ్రీజ, ఆమె కుటుంబసభ్యులు కలుసుకున్నారు. మూడు నెలల క్రితం ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన శ్రీజ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఒకానొక దశలో శ్రీజ బతకడం కష్టమని వైద్యులు తేల్చేశారు.
            ఈ క్రమంలో అభిమాన నటుడు పవన్‌ను కలవడం శ్రీజ చివరి కోరిక అని తెలుసుకున్న ‘‘మేక్‌ ఎ విష్‌’’ ఫౌండేషన్‌ కార్యకర్తలు ఆ విషయాన్ని పవన్‌కు తెలిపారు. దీనిపై స్పందించిన పవన్‌ ఖమ్మం వెళ్లి ఆస్పత్రిలో చావుబతుకుల్లో ఉన్న శ్రీజను పరామర్శించారు. తన అభిమాన నటుడు పవన్‌కల్యాణ్‌ వచ్చి పలకరించడంతో శ్రీజ ఆరోగ్యం మెరుగుపడింది. దాదాపు నెలన్నర చికిత్స తర్వాత పూర్తిగా కోలుకుంది.
                         ఆరోగ్యం కుదుట పడిన తర్వాత హైదరాబాద్‌ తీసుకురావాలని ఆనాడే శ్రీజ తల్లిదండ్రులకు పవన్‌ చెప్పారు. ఈ క్రమంలో పూర్తిగా కోలుకున్న శ్రీజను తీసుకుని ఆమె తల్లిదండ్రులు ఈరోజు పవన్‌ను కలిశారు. దాదాపు రెండు గంటల పాటు పవన్‌తో శ్రీజ భేటీ అయ్యారు. అభిమాన నటుడితో మాట్లాడిన తర్వాత శ్రీజ ఎంతో ఉత్సాహంగా కనిపించింది.