Sunday, May 15, 2016

అయ్యో పాపం... గాయం!

 
అదో పెద్ద కోట. ఆ కోట గోడపై పరిగెత్తడం అంటే సాహసం చేయడమే. కండల వీరుల గుండెలు దడదడలాడి పోతాయ్. ఇక, గులాబీ బాల కృతీ సనన్ వంటి భామలైతే వణికిపోతారు. ఆ వణుకుతో పరిగెత్తితే జారడం ఖాయం. అదే జరిగింది. కృతీ సనన్ ఎవరో ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు. మహేశ్‌బాబుతో ‘నేనొక్కడినే’, నాగచైతన్యతో ‘దోచెయ్’ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత హిందీ సినిమాలకు పరిమితమయ్యారు. ప్రస్తుతం దినేశ్ విజన్ దర్శకత్వం వహిస్తున్న ‘రాబ్తా’ చిత్రంలో సుషాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో జతకట్టారామె. ఈ చిత్రం షూటింగ్ హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరుగుతోంది.
ఓ కోట గోడపై కృతి పరిగెత్తే సన్నివేశం తీయడానికి ప్లాన్ చేశారు. సీన్ విన్న కృతి భయపడినా, ‘చేయను’ అంటే బాగుండదు కదా... ఒప్పేసుకున్నారు. డెరైక్టర్ షాట్ రెడీ అనగానే, మనసులో భయాన్ని బయటికి కనిపించనివ్వకుండా గోడపై పరిగెత్తసాగారామె. హఠాత్తుగా కృతి పరుగుకి బ్రేక్ పడింది. కాలు జారిందట. అయితే గోడ పైనుంచి పూర్తిగా కిందపడకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కానీ, నొప్పితో కృతి విలవిలలాడిపోయారట. పెద్ద గాయం కాకపోయినా, కాలు బెణికినందువల్ల రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారట.

పెళ్లికి రావాలని కండిషన్ పెట్టాడు!

వెండితెర తారలు కళ్ల ముందు మెదిలితే అభిమానులు ఏం చేస్తారు? పెన్నూ పేపరు చేతిలో ఉంటే ఆటోగ్రాఫ్... స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే సెల్ఫీ లేదా ఓ ఫొటో... ఆ కోరిక తీరితే ‘ఈ జన్మకి ఇది చాలు’ అని సంబరపడి పోతారు. ఇంకో రక ం ఫ్యాన్స్ ఉంటారు.. తమ ఫేవరెట్ స్టార్స్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తారు. వాళ్ల పిచ్చి పీక్స్‌లో ఉంటుంది. ఎలాగైనా అభిమాన తారను కలవాలని పట్టుదలగా ఉంటారు. వెర్రి ప్రేమతో ఏం చేస్తున్నారో తెలీని దశలో వాళ్లు ఉంటారు.  సరిగ్గా ఇలాంటి టైప్ 2 అభిమాని ఒకడు తాప్సీకి చుక్కలు చూపించి, తెగ ఇబ్బంది పెట్టేశాడట. మేటర్‌లోకి వెళితే... తాప్సీ తన సోదరితో కలసి వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్‌ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఇందుకోసమే వాళ్ల ఆఫీసుకు బోల్డెన్ని ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక ఫోన్ కాల్ వచ్చింది. కోల్‌కతాకు చెందిన తాప్సీ వీరాభిమాని తన పెళ్లికి వెడ్డింగ్ ప్లానర్ గా వ్యవహరించాలని కోరాడు. అంతవరకూ బాగానే ఉంది. కానీ, తాప్సీ కచ్చితంగా తన పెళ్లికి ముఖ్య అతిథిగా హాజరైతేనే వెడ్డింగ్ ప్లానింగ్ కాంట్రాక్ట్ ఇస్తానని షరతు పెట్టాడు. దీంతో ఈ అభిమానిని తాప్సీ టీమ్ సీరియస్‌గా తీసుకోలేదు. ఆ కాంట్రాక్ట్ గురించి కూడా పెద్దగా ఆలోచించలేదు.
అయినా ఆ అభిమాని వదల్లేదు. విచిత్రమేమింటే, అసలింకా అతని పెళ్లి ఫిక్స్ లేదు. కానీ, పెళ్లికి మాత్రం తాప్సీ తప్పనిసరిగా రావాలని కండిషన్ పెట్టాడు. ఆ విషయం తెలిసి, ‘‘అతన్ని ముందు పెళ్లి కూతుర్ని వెతుక్కోమని సలహా ఇచ్చాను. ఒకవేళ కుదిరినా పెళ్లికి రావడానికి నా డేట్స్ ఖాళీగా లేవని చెప్పా. దాంతో పెళ్లి విషయం మానేసి, తన దగ్గర సినిమా స్క్రిప్ట్ ఉందనీ, దర్శకుణ్ణి పంపుతాననీ అన్నాడు. నాకిలాంటి అనుభవం కలగడం ఇది తొలిసారి’’ అని తాప్సీ చెప్పారు.

గురువు కోసం సింగిల్ సాంగ్‌లో..


 
గురువు కోసం సింగిల్ సాంగ్‌లో దుమ్ము రేపడానికి సిద్ధమైంది ఇంగ్లిష్ బ్యూటీ. ఆ అమ్మడు ఎవరో ఇప్పటికే చాలా మందికి అర్థం అయ్యే ఉంటుంది. ఎస్.అనతికాలంలోనే సూపర్‌స్టార్‌తో రొమాన్స్ చేసే స్థాయికి ఎదిగిన ఎమీజాక్సన్‌నే ఆ బ్యూటీ. ఇక ఆమె గురువెవరన్నది అందరికీ తెలిసిందే. 16 ఏళ్ల పరువంలోనే ఈ ముద్దుగుమ్మను మదరాసుపట్టణం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి చేసి దర్శకుడు ఏఎల్.విజయ్‌ను ఎమీ తన గురువుగా భావిస్తుంది. చాలా కాలం తరువాత ఏఎల్.విజయ్ కోరిక మేరకు సింగిల్‌సాంగ్ చేయడానికి సిద్ధమైంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్న ఎమీ ఇప్పటి వరకూ సింగిల్ సాంగ్‌లో నటించలేదు. తొలిసారిగా తన గురువు కోసం తన సింగిల్‌సాంగ్‌లో తన కాలు కదపనుంది.

  సంగతేమిటంటే డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా హీరోగా నటిస్తూ సొంతంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఏఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తమన్న కథానాయికగా నటిస్తున్నారు. హారర్ ఇతివృత్తంతో కూడిన ఈ చిత్రాన్ని ప్రభుదేవా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నిర్మించడం విశేషం. ఈ చిత్రానికి అభినుత్రి అనే పేరును నిర్ణయించారు. ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాట చోటు చేసుకోవడంతో అందులో ప్రభుదేవాతో లెగ్ షేక్ చేయడానికి క్రేజీ నటి అవసరం అవడంతో దర్శకుడి మదిలో మెదిలిన తార ఎమీజాక్సన్.

 మూడు భాషల్లోనూ ఎమీకి గుర్తిం పు ఉండడంతో తనే కరెక్ట్ అని భావించిన ఏఎల్.విజయ్ వెంటనే ఎమీజాక్సన్‌కు ఫోన్ కొట్టగా గురువు కోసం వెంటనే ఓకే అనడంతో పాటు అందుకు కొన్ని డేట్స్ కేటాయించేసిందట. ప్రస్తుతం రజనీకాంత్ చిత్రం 2.ఓ చిత్రం కోసం చెన్నైలోనే మకాం పెట్టిన ఎమీ త్వరలోనే అభినేత్రి చిత్రం కోసం ప్రభుదేవాతో డాన్స్ చేయనుందని సమాచారం.ఈ చిత్రానికి ఎస్.తమన్, జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించడం మరో విశేషం.

రహస్యంగా పెళ్లి చేసుకుంటున్న మరో నటి

 ఇటీవల కొందరు బాలీవుడ్‌ నటులు ఎవరికీ తెలీకుండా రహస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో మరో బాలీవుడ్‌ నటి అమృతా రావ్‌(అతిథి ఫేం) చేరింది. అమృత ముంబయికి చెందిన రేడియో జాకీ అన్మోల్‌తో ఈరోజు వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. ఆన్మోల్‌, అమృతలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈరోజు అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటి కానున్నట్లు తెలుస్తోంది.
అయితే అమృతా, అన్మోల్‌ల వివాహం కొన్ని నెలల క్రితమే అయిపోయిందని పెళ్లయ్యాక ఇద్దరూ విడిగా ఉంటున్నారని ఇంతకుముందువార్తలు వెలువడ్డాయి. ఇటీవల అమృత హాజరైన ఓ కార్యక్రమంలో చేతికిఉంగరం ఉండడం చూసి అమృత పెళ్లి విషయం కాస్తా బాలీవుడ్‌లో చక్కర్లు కొట్టింది. ఇది ఎంత వరకు నిజమో తెలీదు కానీ ఈరోజు వివాహమయ్యాక కొద్దిరోజుల తర్వాత అందరికీ గ్రాండ్‌గా రిసెప్సన్‌ ఇవ్వనున్నట్లు సన్నిహితులు తెలిపారు.
హిందీలో మై హూ నా, వివాహ్‌, ఇష్క్‌ విష్క్‌ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది అమృత. ఆ తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో తన సోదరి ప్రీతికా రావ్‌లాగే టీవీ సీరియళ్లలో నటిస్తోంది.