Thursday, July 7, 2016

అందరికీ ఓకె చెప్పేస్తున్నాడు

బ్రహ్మోత్సవం సినిమాతో నిరాశపరిచిన మహేష్ బాబు తన నెక్ట్స్ సినిమాతో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ మధ్య ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాల మీద దృష్టి పెట్టిన సూపర్ స్టార్, ఇప్పుడు రూట్ మార్చి ఓ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేస్తున్నాడు. తమిళ దర్శకుడు మురుగదాస్ డైరెక్షన్ లో మెసేజ్ ఓరియంటెండ్ కమర్షియల్ యాక్షన్ డ్రామాను రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెలాఖరున సెట్స్ మీదకు వెళ్లనుంది.

మురుగదాస్ సినిమా ఇంకా మొదలు కాకముందే ఇతర దర్శకులకు కూడా కమిట్మెంట్స్ ఇచ్చేస్తున్నాడు. ఇప్పటికే బ్రహ్మోత్సవం నిర్మాతలైన పీవీపీ సంస్థ కోసం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. తనకు పోకిరి బిజినెస్ మేన్ లాంటి సూపర్ హిట్స్ అందించిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన సినిమా చేయనున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇక దర్శకధీరుడు రాజమౌళికి కూడా చాలా రోజుల క్రితమే సినిమా చేస్తానని మాట ఇచ్చాడు రాజకుమారుడు. మరి ఇన్ని సినిమాలు లైన్లో పెట్టిన మహేష్ బాబు, ఇవన్నీ ఎప్పటికీ పూర్తి చేస్తాడో.7