Monday, November 16, 2015

ఇరవై రోజుల గ్యాప్‌లో మరొ మూడు సినిమా ...

  ఈ 27నే... ‘సైజ్ జీరో’
ఈ మధ్యకాలంలో భారీ ఎత్తున అంచనాలు నెలకొన్న చిత్రాల్లో ‘సైజ్ జీరో’ ఒకటి. ఈ చిత్రం కోసం అనుష్క బరువు పెరగడం ప్రధాన ఆకర్షణ. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఆర్య, అనుష్క కాంబినేషన్‌లో ప్రసాద్ వి. పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. వాస్తవానికి అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు.

కానీ, అనుష్క నటించిన ‘రుద్రమదేవి’ని కూడా చిత్ర దర్శక-నిర్మాత గుణశేఖర్ అదే సమయంలో విడుదల చేయాలనుకోవడంతో ‘సైజ్ జీరో’ను వాయిదా వేశారు ప్రసాద్ వి. పొట్లూరి. ఆ వెనువెంటనే రావడానికి రామ్‌చరణ్ ‘బ్రూస్లీ’, అక్కినేని అఖిల్ పరిచయ చిత్రం ‘అఖిల్’ ఇవన్నీ ఉండడంతో ‘సైజ్ జీరో’ ఆగాల్సి వచ్చింది. దాంతో, నవంబర్ 27న విడుదల చేస్తున్నట్లు అప్పుడే పీవీపీ ప్రకటించారు. ఇప్పుడు ఆ రిలీజ్ డేటే సినిమాకు ఖాయమైంది.

డిసెంబర్ 10కి మారిన ‘బెంగాల్ టైగర్’

వాస్తవానికి ఈ నెల 26, 27తేదీల్లో ఒక రోజున ‘బెంగాల్ టైగర్’ను విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాత కేకే రాధామోహన్ అనుకున్నారు. కానీ, సరిగ్గా అప్పుడే ‘సైజ్ జీరో’ ఉంది. ‘బెంగాల్ టైగర్’ను దర్శకుడు సంపత్ నంది రవితేజ మార్క్ భారీ కమర్షి యల్ చిత్రంగా తీర్చిదిద్దారు.

ఈ రెండు చిత్రాలూ ఒకేరోజు విడుదలైతే వసూళ్లు డివైడ్ అవుతాయి. ఫలితంగా సినిమాలు పూర్తిస్థాయి బాక్సాఫీస్ సత్తా చాటుకొనే వీలుండదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉభయతారకంగా ఉండేలా, రాధామోహన్ ‘బెంగాల్ టైగర్’ను వాయిదా వేసుకున్నారు. డిసెంబర్ 10వ తేదీని రిలీజ్ డేట్‌గా ఖరారు చేశారు. మధ్యలో డిసెంబర్ 4 శుక్రవారమైనా,  ‘శంకరాభరణం’ రిలీజ్‌కు ఉండడంతో 10వ తేదీకి వస్తున్నారు.

ప్రకటించిన డిసెంబర్ 4కే... ‘శంకరాభరణం’
 నిఖిల్, నందిత జంటగా కోన వెంకట్ సమర్పణలో ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘శంకరాభరణం’. టైటిల్ ప్రకటన నుంచే ఈ చిత్రం అందరి దృష్టినీ ఆకట్టుకోగలిగింది. మంచి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటే ఈ సినిమాకు న్యాయం జరుగుతుందన్నది కోన వెంకట్ అభిప్రాయం.

‘బెంగాల్ టైగర్’, ‘శంకరాభరణం’ ఒకే రోజు రిలీజై, ఒకదానికి మరొకటి పోటీ కావడం కరెక్ట్ కాదని నిర్మాతలు ఒక అంగీకారానికి వచ్చారు. ‘సైజ్ జీర్’ డేట్‌తో క్లాష్ కాకుండా చూసుకున్న నిర్మాత రాధామోహన్ ‘శంకరాభరణం’తో కూడా డేట్స్ క్లాష్ లేకుండా సహాయపడ్డారు. ఫలితంగా, ముందుగా ప్రకటించిన డిసెంబర్ 4నే ‘శంకరాభరణం’ వస్తుంది. ఆ వెంటనే 10న ‘బెంగాల్ టైగర్’ పలకరిస్తుంది.

మొత్తం మీద ఇరవై రోజుల గ్యాప్‌లో ‘సైజ్ జీరో’, ‘బెంగాల్ టైగర్’, ‘శంకరాభరణం’ తెర మీదకొచ్చేస్తాయ్. ఒకే తేదీకి ఒకదానిపై మరొకటి పోటీ పడకుండా జాగ్రత్త పడ్డాయి.  వసూళ్ళు డివైడ్ కాకుండా, ఒక వారం పాటు ఏ సినిమాకు ఆ సినిమాకు పూర్తి ఎడ్వాంటేజ్ ఉండేలా ఈ మూడు చిత్రాల నిర్మాతలూ కలసి ఒక నిర్ణయానికి రావడం విశేషమే. సోమవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మరీ పీవీపీ, రాధామోహన్, కోన వెంకట్‌లు తమ చిత్రాల విడుదల తేదీలను ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో వర్ష బీభత్సం





బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు, చెన్నై సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తమిళనాడు ప్రభుత్వం 16 జిల్లాల్లో అన్ని విద్యాలయాలకు సెలవులు ప్రకటించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఆదివారం అర్దరాత్రి నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తిరుమలలోనూ కుండపోత వర్షంలో ప్రజలు తీవ్ర ాబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మూడు చెరువులకు గండ్లు పడ్డాయి.
                  తిరుమల, నెల్లూరులో ఆదివారం నుంచి ఎడతతెరిపిలేని వర్షం కురుస్తోంది. పలు జిల్లాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా వెంకటగిరిలో 24 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. బాలాయపల్లిలో 14, డక్కిలిలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే ప్రకాశంలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.