Saturday, December 9, 2017

విరాట్‌ పెళ్లికి వెళ్లేది వాళ్లిద్దరేనా?

 భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ స్టార్‌ అనుష్క శర్మల వివాహ సందడి ప్రారంభమైనట్లే కనబడుతోంది. అధికారికంగా వీరి పెళ్లిపై ఇరు వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేకపోయినా జరుగుతున్న పరిణామాలు చూస్తే వీరి వివాహం ఖాయంగా కనిపిస్తున్నది.  కాగా శుక్రవారం కుటుంబంతో సహా అనుష్క ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమివ్వడంతో  ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అదే సమయంలో కొన్నాళ్ల క్రితం డెహ్రాడూన్‌లో వీళ్లిద్దరిని ఆశీర్వదించిన పురోహితుడు కూడా విమానం ఎక్కేందుకు రావడంతో పెళ్లి వార్త నిజం కావొచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే ఈ వివాహానికి సంబంధించి మరో వార్త ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. విరాట్ తన వివాహానికి కేవలం ఇద్దరు క్రికెటర్లను మాత్రమే ఆహ్వానించాడట. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో పాటు యువరాజ్ సింగ్‌లకు విరాట్ వివాహ ఆహ్వానం అందినట్లు సమాచారం. భారత జట్టు శ్రీలంకతో జరిగే వన్డే, టీ-20 సిరీస్‌తో బిజీగా ఉండటంతో విరాట్ సచిన్, యువీలతో పాటు తన బాల్య మిత్రులు కొందరిని వివాహానికి ఆహ్వానించాడట. మూడు నెలల క్రితమే ప్లాన్ చేశారని, విరాట్, అనుష్కల కుటుంబాలు కావాలనే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని విరాట్ సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నెల 12న ఇటలీలోని మిలాన్‌లో కోహ్లి, అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారని కొంతమంది చెబుతుండగా, 15వ తేదీన వీరి వివాహం జరుగనున్నట్లు మరికొంతమంది చెబుతున్నారు.