Thursday, June 22, 2017

ఆయనతో ఇప్పటికీ ప్రేమలో ఉన్నా: శ్రీదేవి

 దక్షిణ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలిగిన అతిలోక సుందరి శ్రీదేవి. ఆమె నటించిన తాజా చిత్రం ‘మామ్‌’. థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ నిర్మించారు. జులై 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో శ్రీదేవి మీడియాతో ముచ్చటించారు. తన భర్త, కుమార్తెల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
‘బోనీ కపూర్‌లాంటి నిర్మాతను ఇంతవరకు నేను చూడలేదు. ఆయన లేకుండా ‘మామ్‌’ సాధ్యమయ్యేది కాదు. ఈ సినిమా క్రెడిట్‌ మొత్తం ఆయనకే దక్కుతుంది. ‘మామ్‌’ సినిమా చక్కగా రావాలని నటీనటుల ఎంపిక, వారిని సెట్‌లో చైతన్యపరచడం వంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు’ అని శ్రీదేవి అన్నారు.
అనంతరం బోనీతో తన ప్రేమబంధం గురించి మాట్లాడుతూ.. ‘నేను బోనీతో చాలా నిజాయతీగా ఉంటాను. ఏ విషయాన్నీ దాచిపెట్టను. ఇది పెద్ద విషయమేమీ కాదు. ఆ మాత్రం కుటుంబం కోసం నేను చేయకపోతే, ఇంకెవరు చేస్తారు. ఇప్పటికీ ఆయన నన్ను గాఢంగా ప్రేమించడం.. నాకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుంటుంది. నేను ఆయనను ఎంతగానో ప్రేమిస్తున్నా. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయనపై నా ప్రేమ మరింతగా పెరుగుతోంది. దానికి ప్రేమ అనే పేరు సరిపోదు. ఇన్నేళ్లు అయినా ఏమీ మారలేదని ఆయన ప్రేమ నాకు గుర్తు చేస్తుంటుంది. బోనీ భావోద్వేగాలు కలిగిన వ్యక్తి. నన్ను ఎప్పుడూ నవ్విస్తుంటారు. మేం ఒకరికొకరం అండగా నిలుస్తుంటాం’ అని చెప్పారు.
శ్రీదేవి కుమార్తె జాహ్నవి సినీ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కుమార్తెకు ఏం సందేశం ఇస్తారని ప్రశ్నించగా.. ‘కష్టపడి పని చేయి, ఉత్తమ ప్రతిభ కనబరుచు. ఎటువంటి కష్టం లేకుండా ఫలితం లభించదు. హృదయంతో నటించాలి తప్ప మొదడుతో కాదని తనకు ఎప్పుడూ చెబుతుంటా. ఈ ప్రవర్తన నటి, నటుడికి చాలా ముఖ్యం. అదేవిధంగా జీవితంలో వినయం, కృతజ్ఞతాభావం చూపించడం ఏ వ్యక్తికైనా చాలా అవసరం’ అని శ్రీదేవి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 

Saturday, June 17, 2017

ఆ తప్పు ఇక్కడ చేయను!

 అక్కడ చేసిన తప్పు ఇక్కడ చేయనంటోంది బాలీవుడ్‌ బ్యూటీ సాయేషా సైగల్‌. లెజెండ్రీ నటుడు దిలీప్‌కుమార్‌ కుటుంబం నుంచి వచ్చిన ఈ తరం నటి సాయేషా. నటిగా తన రంగప్రవేశానికి ఏరి కోరి టాలీవుడ్‌ను ఎంచుకుని అఖిల్‌ చిత్రంతో తెరంగేట్రం చేసింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో సాయేషా ప్రతిభ వెలుగులోకి రాలేదు. ఆ తరువాత మాతృభాషలో అజయ్‌దేవ్‌గన్‌కు జంటగా శివాయ్‌ చిత్రంలో నటించింది.

ఆ చిత్రం ఓకే అనిపించుకుంది. అయినా సాయేషాకు ఈ రెండు భాషల్లోనూ అవకాశాలు తలుపు తట్టాయట. ఈ రెండు భాషా చిత్రాల అనుభవాన్ని చవి చూసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా కోలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఇక్కడ జయంరవికి జంటగా వనయుద్ధం చిత్రంలో నటించింది. విజయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 23న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అయితే ఇందులో హీరో జయంరవికి చాలా తక్కువ మాటలు, సాయేషాకు చాలా ఎక్కువ మాటలు ఉంటాయట. అంతేకాదు, ఇందులో పాటల సన్నివేశాల్లో డాన్స్‌లో సాయేషా కుమ్మేసిందట.

ఆ పాట కొరియోగ్రాఫర్‌ డాన్సింగ్‌ కింగ్‌ ప్రభుదేవానే అబ్బురపడేలా నటించిందట. ఈ టాక్‌ కోలీవుడ్‌లో వైరల్‌ అవడంతో అమ్మడికి అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇప్పటికే విశాల్, కార్తీ కలిసి నటిస్తున్న మల్టీస్టార్‌ చిత్రం కరుప్పురాజా వెళ్‌లైరాజా చిత్రంలో నటించడానికి ఎంపికైంది.మరో మూడు చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయట.

ఇలా కోలీవుడ్‌లో అనూహ్యంగా అవకాశాలు తలుపు తడుతుండడంతో అక్కడ చేసిన తప్పు ఇక్కడ చేయను అంటోంది నటి సాయేషా. ఇంతకీ ఆ తప్పేంటంటే టాలీవుడ్, బాలీవుడ్‌ల్లో అవకాశాలు వచ్చినా అంగీకరించలేదట. ఇప్పుడు కోలీవుడ్‌లో వస్తున్న అవకాశాలను వదులుకునేది లేదని ఈ జాణ అంటోంది. మొత్తం మీద మూడు చిత్రాలకే చాలా ఆరితేరిపోయింది కదూ.