Friday, September 30, 2016

రివ్యూ: ఎం.ఎస్‌.ధోనీ


 ధోనీ.. ఈ పేరు వింటే క్రికెట్‌ మైదానంలో పరుగుల వరద గుర్తొస్తుంది. బ్యాట్స్‌మెన్‌గా.. వికెట్‌ కీపర్‌గా.. టీమిండియా కెప్టెన్‌గా ఆయన తిరగ రాసిన రికార్డులు కళ్లముందు కదలాడతాయి. టీమిండియా కూల్‌ కెప్టెన్‌గా ధోనీకున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి.. భారత క్రికెట్‌ గర్వించే ఆటగాడిగా ధోనీ సాధించిన ఘనత అందరికీ తెలుసు. కానీ.. ఇంత గొప్ప స్థాయికి చేరడానికి ధోనీ చేసిన ప్రయాణమెలాంటిదో.. అందులోని మలుపులేంటో అంతగా తెలియదు.
ఆ విషయాలన్నీ ‘ఎం.ఎస్‌.ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ చిత్రంలో చూడొచ్చని స్వయంగా ధోనీనే చెప్పారు. భారీ బడ్జెట్‌.. తెరపై రియల్‌ ధోనీలా హావభావాలు పండించేందుకు సుశాంత్‌సింగ్‌ చేసిన కసరత్తులు.. ప్రచార కార్యక్రమాల్లోనూ ధోనీ పాల్గొనడం ఈ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశాయి. మరి.. ఇన్ని అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథేంటి?: ధోనీ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన అందరిలాంటి పిల్లాడు. ఫుట్‌బాల్‌.. బ్యాడ్మింటన్‌.. టెన్నిస్‌ ఆటలంటే ఆసక్తి. కానీ.. అతని గురువు (రాజేశ్‌శర్మ) ధోనిలో మంచి క్రికెటర్‌ దాగి ఉన్నాడని గుర్తించి ప్రోత్సహిస్తాడు. ధోని తండ్రి(అనుపమ్‌ ఖేర్‌)కి మాత్రం కుమారుడు క్రీడల్లో కంటే బాగా చదివి ఏదైనా ఉద్యోగం చేయాలని అనుకుంటాడు. అతని తల్లి.. సోదరి(భూమికా చావ్లా).. స్నేహితులు మాత్రం ధోనీని క్రీడల వైపు ప్రోత్సహిస్తారు. అయితే అతను విఫలమవుతూ.. తిరిగి ప్రయత్నాలు మొదలెడుతూ ఉంటాడు. మరి.. భారత్‌ తరఫున ఆడాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎలాంటి అవరోధాలను అధిగమించాడు? అందుకోసం ఏం చేశాడు? రైల్వేలో ఉద్యోగం.. భారత క్రికెట్‌ టీంలో అవకాశం ఎలా వచ్చింది? ప్రేమ.. పెళ్లి వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
 ఎలా ఉందంటే?: ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన పిల్లాడు.. దేశం తరఫున క్రికెట్‌ ఆడాలనుకోవడం.. లక్ష్యాన్ని చేరుకునేందుకు పడిన కష్టాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు కాస్త తడబడినా ప్రేక్షకులను మెప్పించగలిగాడు. ప్రథమార్ధంలో ధోనీ బాల్యానికి సంబంధించిన విషయాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. స్కూలు.. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనటం.. రైల్వే ఉద్యోగంలో చేరి కొన్నాళ్లకు రాజీనామా చేయడం ఉంటుంది. ఇందులో కొత్తదనం లోపించినట్లు అనిపిస్తుంది.
ద్వితీయార్ధంలో ప్రియాంక (దిశా పటానీ)తో ప్రేమాయణం.. సాక్షితో పెళ్లి.. అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీ విజయాలు ఉంటాయి. చిత్రంలో అంతర్జాతీయ టోర్నమెంట్‌లకు సంబంధించిన ఫుటేజీలనే ఎక్కువగా చూపించారు.
చిత్రంలో ప్రధానంగా లోపించే అంశం.. కథ మొత్తం ధోనీ చుట్టూ తిప్పే ప్రయత్నంలో దర్శకుడు భారత క్రికెట్‌ దిగ్గజాలను పూర్తిగా పక్కన పెట్టేయటం పెద్ద కొరతగా చెప్పాలి. తెలియని విషయాల్ని చెబుతామని సినిమా ఉపశీర్షికలో చెప్పినా.. అలాంటివేమీ సినిమాలో కనిపించకపోవటంతో సగటు ప్రేక్షకుడు అసంతృప్తికి గురి అవుతాడు. ప్రియాంకతో ప్రేమాయణం తప్ప.. దాదాపు అందరికీ తెలిసిన ధోనీ విషయాలనే తెరపై చూపించారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ల జోలికే వెళ్లలేదు. బెట్టింగుల లాంటి వివాదాస్పద అంశాలను ఎక్కడా టచ్‌ చేయలేదు.
బయోపిక్‌ అంటే.. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటేనే ఆ చిత్రం బాగా రూపుదిద్దుకుంటుంది. కానీ.. ఇందులో అది లోపించిన వైనం ఇట్టే అర్థమవుతుంది. దర్శకుడు నీరజ్‌ పాండే పూర్తిగా ధోనీ చెప్పినట్లుగానే నడుచుకున్నట్లు చిత్రం చూస్తుంటే అర్థమవుతోంది. సినిమాటోగ్రఫీ.. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.
ఎవరెలా?: ధోని పాత్రలో సుశాంత్‌ సింగ్‌ జీవించాడు. రియల్‌ ధోనీలా హావభావాలు పలికించేందుకు అతను చేసిన కసరత్తు ఆకట్టుకోవటం ఖాయం. ధోనీ తొలి ప్రేయసి ప్రియాంక(దిశా పటానీ), రెండో ప్రేయసి.. భార్య సాక్షి(కైరా అడ్వాణీ)లను క్యూట్‌గా చూపించారు. ఇద్దరూ తమ పాత్రల్లో బాగానే మెప్పించారు. ధోనీకి తండ్రి పాత్రలో ‘అనుపమ్‌ఖేర్‌’ కనిపించరు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.
 
చివరగా.. తెర మీదా తెలిసిన ‘ధోనీ’నే కనిపిస్తాడు. 

రివ్యూ: హైపర్‌


 కథేంటంటే?: నిజాయతీ గల ఓ ప్రభుత్వాధికారి నారాయణమూర్తి (సత్యరాజ్‌). ఆయన కొడుకే సూర్య (రామ్‌). తండ్రి అంటే సూర్యకి ప్రేమే కాదు తండ్రి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఓ బిల్డింగ్‌ నిర్మాణానికి అనుమతినిస్తూ సంతకం చేయమని మంత్రి రాజప్ప (రావు రమేష్‌) నారాయణమూర్తి దగ్గరికి ఫైల్‌ పంపుతాడు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఆ నిర్మాణాన్ని చేపడుతున్నారని.. సంతకం పెట్టనని నారాయణమూర్తి ఆ ఫైల్‌ని తిరస్కరిస్తాడు.
 దీంతో నారాయణమూర్తిపై కక్ష పెంచుకొన్న మంత్రి రాజప్ప సామదాన భేద దండోపాయాల్ని ప్రదర్శిస్తాడు. మంత్రి బెదిరింపులకు నారాయణ మూర్తి తన నిజాయతీని వదలుకున్నాడా? తన తండ్రిని మంత్రి టార్గెట్‌ చేశాడని తెలిశాక సూర్య ఏం చేశాడు? మంత్రికీ, సూర్యకీ మధ్య జరిగిన పోరాటంలో గెలుపెవరిది? సూర్యపై మనసుపడ్డ భానుమతి (రాశిఖన్నా) కథేమిటి? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.
ఎలా ఉందంటే?: తెలుగు చిత్రసీమ కొత్తదనం వైపు పరుగులు పెడుతున్న సమయమిది. ప్రేక్షకుడు చూడని ఓ కొత్త విషయాన్ని చూపించాలనే ప్రయత్నం తరచూ జరుగుతోంది. కొత్త రకమైన సినిమాలు రావటం వెనక ప్రధాన కారణం అదే. అలాగని మనకు అలవాటైన కమర్షియల్‌ ఫార్ములా కథలు ఇంకా దూరం కావడం లేదు. ఆ తరహా చిత్రాలకి బీ.. సీ కేంద్రాల నుంచి ఇప్పటికీ మంచి ఆదరణ లభిస్తుండడంతో దర్శకనిర్మాతలు ఆ కథల్ని నమ్ముతూ తెరకెక్కిస్తున్నారు.

‘హైపర్‌’ కూడా ఆ కోవకి చెందినదే. ఇందులోని కథ.. కథనం కొత్తదనం లేకున్నా కమర్షియల్‌ అంశాలకు కొరత లేకుండా చూశారు. పాటలు.. ఫైట్లు.. రొమాన్స్‌.. వాటి మధ్య ఓ రివెంజ్‌ డ్రామా.. ఇలా మాస్‌ ప్రేక్షకులకు కాలక్షేపాన్నిచ్చే అన్ని అంశాల్ని పక్కాగా ఉండేలా చూశారు. కొత్తదనం ఆశించే ప్రేక్షకుడికి కాస్త ఇబ్బందే. తొలి సగం సరదా సన్నివేశాలతో తీర్చిదిద్దారు. రామ్‌.. రాశిఖన్నాల మధ్య వినోదం- రొమాన్స్‌.. కుటుంబ నేపథ్యంతోనే సాగిపోతుంది.
 
విరామానికి ముందే ఓ మలుపు వస్తుంది. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది. అయితే ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడు వూహించినట్టే సాగుతాయి. తన తండ్రిని కాపాడినందుకు రౌడీషీటర్‌ గజ (మురళీశర్మ)తో సూర్య ఫ్రెండ్‌షిప్‌ చేయడం.. మంత్రి రాజప్ప ఫోన్లో చెప్పినట్టుగా చేస్తూ సూర్య కార్లు మారుస్తూ వెళ్లిపోయే సీన్లలో పాత వాసన కనిపిస్తుంది. రామ్‌లోని హైపర్‌ యాక్టివ్‌నెస్‌ని అభిమానులకి చూపించాలనే ప్రయత్నంగా కనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే?: చిత్రంలో రామ్‌.. రాశిఖన్నా.. రావు రమేష్‌ల పాత్రలే కీలకం. ముగ్గురూ బాగా నటించారు. ముఖ్యంగా రామ్‌ ఎప్పట్లాగే హుషారైన కుర్రాడిగా సందడి చేశాడు. డ్యాన్సులు.. ఫైట్లు చక్కటి ఈజ్‌తో చేసేశాడు. రాశిఖన్నా అందంగా కనిపించింది. రావు రమేష్‌ మంత్రి రాజప్ప పాత్రలో ఒదిగిపోయారు. సత్యరాజ్‌ పాత్రకు తగ్గట్టుగా నటించారు. ఇక మిగిలిన పాత్రల గురించి చెప్పుకొనేంత ఏమీ లేదు. సాంకేతికంగా ఈ సినిమాకి మంచి మార్కులే పడతాయి. జిబ్రాన్‌ పాటలు.. మణిశర్మ నేపథ్య సంగీతం పర్వాలేదు. అబ్బూరి రవి కలం అక్కడక్కడా మెరిసింది. రిమోట్‌తో ముడిపెడుతూ అమ్మాయిల జీవితం గురించి రాసిన మాటలు బాగున్నాయి.
 
చివరగా.. ఇది తెలిసిన ‘హైపర్‌’ 

Thursday, September 29, 2016

ఏడేళ్ల ప్రేమకు బ్రేకప్?

 అటు తమిళంలో, ఇటు తెలుగులో (డబ్బింగ్) వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న కథానాయకుడు విశాల్. నటుడు శరత్‌కుమార్ కుమార్తెగానే కాకుండా హీరోయిన్‌గానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వరలక్ష్మి. విశాల్, వరలక్ష్మి ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నారని గుసగుసలు వినిపించాయి. ‘‘తమిళ నడిగర్ సంఘం ఆధ్వర్యంలో కల్యాణ మండపం కడుతున్నాం. అది పూర్తి కాగానే అందులో జరిగే మొదటి పెళ్లి నాదే’ అని విశాల్ చెబుతూ వచ్చారు.

ఆయన పెళ్లాడనున్నది వరలక్ష్మీనే అని చాలామంది ఫిక్సయ్యారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో వరలక్ష్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమతో పాటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. ‘‘ప్రేమ ఇటీవల పరిహాసంగా మారుతోంది. ఓ వ్యక్తి ఏడేళ్ల బంధాన్ని తేలిగ్గా వద్దనుకున్నాడు. అది కూడా తన మేనేజర్ ద్వారా ఆ అమ్మాయికి ఆ విషయం తెలియజేశాడు. ప్రపంచంలో ప్రేమ ఏమైపోతోందో? ఎక్కడుందో?’’ అంటూ ఆమె ఆవేదనగా ట్వీట్ చేశారు.

విశాల్‌ని ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. విశాల్‌ను వరలక్ష్మి ప్రేమించడం ఆమె తండ్రి శరత్‌కుమార్‌కి నచ్చలేదని, పెళ్లికి ఆయన సమ్మతం వ్యక్తం చేయలేదని ఓ టాక్ ఉంది. దానికి తోడు నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్, శరత్‌కుమార్ మధ్య మనస్పర్థలు వచ్చాయి కూడా. ఒకవేళ విశాల్-వరలక్ష్మి బ్రేకప్ వెనక శరత్‌కుమార్ హస్తం ఉండి ఉంటుందేమోనన్నది కొందరి ఊహ. ఇంతకీ వరలక్ష్మి ట్వీట్ వెనక ఆంతర్యం ఏంటో ఆ పెరుమాళ్లకే ఎరుక.

రాజకీయాల్లోకి మహేష్‌బాబు?

 సినిమాలు - రాజకీయాల మధ్య అవినాభావ సంబంధం ఉంది. సినిమాల్లో స్టార్‌ డమ్‌ అనుభవించి రాజకీయాల్లో ఓ మెరుపులా వచ్చిన తారలు ఎంతోమంది. ఆ లిస్టులో మహేష్‌బాబు చేరుతున్నాడా.. అని డౌటు పడొద్దు. ఇది వేరే మేటర్‌. మహేష్‌ బాబు - కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కబోతోందన్న సంగతి తెలిసిందే. మురుగదాస్‌ సినిమా పూర్తయ్యాక ‘శ్రీమంతుడు’ కాంబోలో సినిమా మొదలవుతుంది. ఈ కథా నేపథ్యం రాజకీయాల చుట్టూ తిరగబోతోందని టాక్‌. మహేష్‌ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తాడని చెప్పుకొంటున్నారు. ‘దూకుడు’లో మహేష్‌ ఎమ్‌.ఎల్‌.ఏ పాత్రలో కనిపించాడు కదా? ఇప్పుడు సీఎమ్‌గా ప్రమోషన్‌ వచ్చిందన్నమాట. 2017 జనవరిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ స్క్రిప్టుని తీర్చిదిద్దే పనిలో ఉన్నారని టాక్‌.

Wednesday, September 28, 2016

రాడనుకున్నారు.. రాలేడనుకున్నారు..!


మ్యాచ్‌ ఎలాంటి స్థితిలో ఉన్నా.. ఒత్తిడి అతని దరి చేరదు. సెహ్వాగ్‌ లాంటి భీకర ఓపెనర్‌ విఫలమైన చోట కూడా అతను అవలీలగా భారీ స్కోర్లు చేయగలడు. స్వలాభం కోసం శతకాలు బాదాలని అతను ఎప్పుడూ కోరుకోలేదు. జట్టు కోసం అవసరమైతే సమిధలా మారి 90ల్లో ఔటైన సందర్భాలు కోకొల్లలు. అందుకేనేమో భారత్‌ చరిత్రాత్మక విజయాలు కొన్ని అతని భీకర పోరాటంతోనే సాధ్యమైనా.. సరైన గుర్తింపులేక అవి తెరవెనుకే కనుమరుగైపోయాయి. కానీ అతను పోరాటం ఆపలేదు.. ఎందుకంటే మైదానంలో పట్టుదలకు, బ్యాటింగ్‌లో తెగువకు అతను నిలువుటద్దం. ‘చివరి అవకాశం ఇవ్వండి సగర్వంగా క్రికెట్‌ను నుంచి తప్పుకొంటాం’ అంటూ జట్టులో స్థానం కోల్పోయి సీనియర్‌ క్రికెటర్లు అభ్యర్థిస్తున్న వేళ.. జట్టులో స్థానం కోసం బ్యాట్‌తోనే పోరాడతాను అంటూ ధైర్యంగా ప్రకటించి మళ్లీ టెస్టు జట్టులో తాజాగా స్థానం పొందిన ఆ క్రికెటరే గౌతమ్‌ గంభీర్‌.
2007లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి ప్రపంచకప్‌ ఫైనల్లో గంభీర్‌ 75 పరుగులు చేయడంతోనే భారత్‌ భారీ స్కోరు చేయగలిగింది.. తొలి టీ20ప్రపంచకప్‌ విజేతగా అవతరించింది. 2011లో భారత్‌ 28 ఏళ్ల తర్వాత గెలిచిన వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో కూడా గంభీర్‌ భీకరంగా పోరాడి 97 పరుగులతో టీమిండియా విజయానికి బాటలు వేశాడు. ఓపెనర్‌గా వచ్చిన అతను 41.2 ఓవర్‌ వరకూ క్రీజులో నిలిచి భారత్‌ విజయం దాదాపు ఖరారైన దశలో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతను శతకం చేసినట్లయితే చరిత్రలో నిలిచిపోయేవాడే కానీ.. అప్పుడు జట్టు అవసరాల మేరకు 90లో కూడా హిట్టింగ్‌ చేయడానికి మొగ్గుచూపాడు. అయితే అందరూ చివర్లో సిక్స్‌ బాదిన ధోనీ(91 నాటౌట్‌)నే ఆకాశానికి ఎత్తేశారు. దీంతో గంభీర్‌ పోరాటం కనుమరుగైపోయింది. ఇక్కడ ధోనీ పోరాటాన్ని తక్కువ చేయడం కాదు గానీ.. 275 పరుగుల లక్ష్య ఛేదనలో 31 పరుగులకే సీనియర్లు సెహ్వాగ్‌, సచిన్‌ పెవిలియన్‌ చేరిన దశలో గంభీర్‌ అసాధారణ పోరాటానికి సరైన గుర్తింపు దక్కలేదనేది గత కొంతకాలంగా అతను జట్టుకు దూరమైన తీరే చెప్తోంది..!
కెరీర్‌ సాగిందిలా..!
2003లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన గంభీర్‌ అతి తక్కువ కాలంలో నమ్మదగిన బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందాడు. కెరీర్‌లో 56 టెస్టులాడి అందులో ఒక ద్విశతకం, 9 శతకాలు, 21 అర్ధశతకాలు సాధించాడు. 147 వన్డేల్లో 11 శతకాలు, 31 అర్ధశతకాలు.. టీ20 కెరీర్‌లో 37 మ్యాచ్‌లాడి 7 అర్ధశతకాలు చేశాడు. అయితే 2014లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన గంభీర్‌ ఐపీఎల్‌లో మాత్రం తన బ్యాటింగ్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ముందుండి నడిపిస్తూ విజయవంతమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.


సహచరులైనా తగ్గేది లేదు..!
ఆటలో దూకుడుగా ఉండే గంభీర్‌ ప్రత్యర్థి క్రికెటర్లతోనే కాదు.. సహచర క్రికెటర్లపైనా తరచూ గొడవకు దిగడం అతని కెరీర్‌ను కొంత మసకబార్చింది. భారత టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో 2013లో జరిగిన ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌లో ప్రత్యక్షంగా గొడవకు దిగి అప్పట్లో సంచలనానికి తెరలేపగా.. వన్డే, టీ20 కెప్టెన్‌ ధోనితో గత కొంతకాలంగా ప్రచ్ఛన్న యుద్ధాన్నే నడిపిస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో ధోని బ్యాటింగ్‌ చేస్తుండగా టెస్టు తరహాలో ‘అటాకింగ్‌ ఫీల్డింగ్‌’ ఈ వాదనకు మరింత బలం చేకూర్చాడు గంభీర్‌. కెప్టెన్లతో ఈ స్థాయిలో విభేదాలు ఉన్న అతను ఇక భారత్‌ జట్టులోకి రావడం దాదాపు అసాధ్యంగానే క్రికెట్‌ పండితులు తేల్చేశారు. కానీ నిలకడైన అతని ఆటతీరు, భారత్‌ కోచ్‌ కుంబ్లే, సెలెక్టర్ల చొరవతో మళ్లీ అతను టీమిండియాలోకి పడిలేచిన కెరటంలా అడుగుపెట్టాడు. ‘సమర యోధుడు భగత్‌సింగ్‌ నాకు ఆదర్శం. ఆయన స్ఫూర్తితోనే చివరివరకూ పోరాడుతాను’ అంటూ జట్టులోకి ఎంపికైన అనంతరం గంభీర్‌ ప్రకటించాడు. స్వదేశంలో భారత్‌ ఇంకా 12 టెస్టులు ఆడనున్న నేపథ్యంలో వివాదాల జోలికి వెళ్లకుండా గంభీర్‌ ఆటతో అందర్నీ మెప్పిస్తాడా లేదా మళ్లీ పాత గొడవలకు ఆజ్యం పోసి కెరీర్‌ను ముగిస్తాడో మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.
 
 

Tuesday, September 27, 2016

జోడీ కుదిరిందా?

‘నేను శైలజ’ చిత్రంతో ఆకట్టుకొంది కీర్తి సురేష్‌. ప్రస్తుతం నాని ‘నేను లోకల్‌’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈలోగా మరో మంచి అవకాశం అందుకొన్నట్టు ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం ఇటీవలే లాంఛనంగా మొదలైంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కథానాయికగా కీర్తి సురేష్‌ని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ‘దువ్వాడ జగన్నాథమ్‌’గా రెడీ అవుతున్నాడు బన్నీ. ఈ సినిమా పూర్తయ్యాకే లింగుస్వామి ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈలోగా నటీనటుల్ని, మిగిలిన సాంకేతిక నిపుణుల్ని ఎంచుకొనే పనిలో పడింది చిత్రబృందం. అధికారిక వివరాలు త్వరలో తెలుస్తాయి.

బాహుబలిని చంపినప్పుడు నేనక్కడ లేను

 మూడు భాషల్లో తెరకెక్కించే చిత్రాల్లో ఇకపై నటించనని మిల్కీబ్యూటీ తమన్నా అన్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తమన్నా ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. ‘అభినేత్రి పూర్తిగా హారర్‌ సినిమా కాదు, అది వినోదం కోసమే. ఈ సినిమాలో దయ్యం ఉంటుంది, కానీ అది ఎవర్నీ భయపెట్టదు. మూడుభాషల్లో చిత్రాన్ని తెరకెక్కించడం సులభమైన పని కాదు, అది చాలా కష్టం. దీన్ని తమిళం, హిందీ భాషల్లో మాత్రమే తెరకెక్కించాలని అనుకున్నారు. తెలుగులో నాకు మంచి మార్కెట్‌ ఉందని నేను సలహా ఇవ్వడంతో ఈ భాషలోనూ తీశారు. మూడు సినిమాల్లో నటించినట్లు అనిపించింది, సినిమాని ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేశాం. ఈ మూడు భాషలు ఒకదానికొకటి చాలా విభిన్నంగా ఉంటాయి కాబట్టి డైలాగ్‌ పలికే విధానం కూడా తేడాగా ఉంటుంది. తెలుగు సన్నివేశం పూర్తి చేసిన తర్వాత తమిళ్‌, హిందీ చేసేదాన్ని. ఒకే సన్నివేశాన్ని మూడుసార్లు మూడు భాషల్లో చేయడంతో చాలా అలసిపోయేదాన్ని’ అని చెప్పారు.
అనంతరం ‘జాగ్వార్‌’ చిత్రంలోని ప్రత్యేక గీతం గురించి ప్రశ్నించగా.. ‘ఇప్పటికే ఆ పాట షూటింగ్‌ పూర్తి చేశాం. ప్రేక్షకులు నా ప్రత్యేక గీతాల్ని ఇష్టపడతారనుకుంటున్నా. దక్షిణ చిత్ర పరిశ్రమలో ప్రజలు స్టార్‌ హీరోయిన్లు ప్రత్యేక గీతం చేస్తే ఎందుకు అసహనంగా భావిస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇలాంటి ఇబ్బంది హిందీ చిత్ర పరిశ్రమలో ఉండదు. దీపికా, కత్రినా, కరీనా ప్రత్యేక గీతాల్లో నటించారు. దక్షిణ చిత్ర పరిశ్రమలో ఉన్న ఈ సమస్యను బ్రేక్‌ చేయాలి అనుకున్నా. పాటను హుందాగా కొరియోగ్రఫీ చేసినప్పుడు ఎందుకు నటించకూడదు?’ అని ప్రశ్నించారు తమన్నా. ‘జాగ్వార్‌’ పాటకు ఎక్కువ పారితోషికం తీసుకున్నారా? అని అడిగితే వెంటనే.. ‘నేను ఎప్పుడూ ఎక్కువ పారితోషికమే తీసుకుంటా’ అని చెప్పారు.
చేయబోతున్న సినిమాల గురించి మాట్లాడుతూ తమన్నా బాహుబలి క్లైమాక్స్‌ సన్నివేశం చేయాల్సి ఉందన్నారు. దాంతో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని ప్రశ్నించగా తమన్నా ఇలా సమాధానం ఇచ్చారు. ‘బాహుబలిని కట్టప్ప చంపినప్పుడు నేనక్కడ లేను, ఇంకెవరైనా ఉండి ఉంటారని అనుకోను. నాకు తెలిసి రాజమౌళి ఈ సన్నివేశం చిత్రీకరణను తొలి విభాగంలోనే పూర్తి చేసుంటారు. ఎవరికీ ‘బాహుబలి’ కథ తెలియదు’ అని చెప్పారు.

Monday, September 26, 2016

‘బాహుబలి 2’ ట్రైలర్‌ ఎప్పుడంటే?

 ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి 2’ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం పతాక సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ చిత్రం విడుదల కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే నవంబరులో చిత్రం షూటింగ్‌ పూర్తి కానుందని సమాచారం. హీరో ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా అక్టోబరు 23న చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లను రాబట్టడంతో దానికి కొనసాగింపుగా తీస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బాహుబలి’ ట్రైలర్‌ యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లోనే దాదాపు 40 లక్షల మంది వీక్షించడం గమనార్హం.
ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. కీరవాణి చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న ‘బాహుబలి 2’ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

సమంత చేసిన పూజ ఏంటి?

‘వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాం’ అని ఇటీవల విడివిడి ఇంటర్య్వూల్లో అక్కినేని నాగచైతన్య.. సమంతలు చెప్పేయటం తెలిసిందే. దీంతో వీరి వ్యవహారంపై ఇప్పుడు అందరికి స్పష్టత వచ్చేసింది. ఇదిలా ఉంటే.. వీరిద్దరూ పక్కపక్కనే కూర్చొని పూజ చేసిన ఫోటోలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

పక్కపక్కనే కూర్చున్న చైతూ.. సమంతలు కుంకుమ బొట్లు పెట్టుకుని కనిపించారు. వీరికి చుట్టూ వేదపండితులు నిల్చుని ఉన్నారు. పెళ్లికి ముందుగా జరిపే పూజలో భాగంగా సమంత ఈ కార్యక్రమంలో చైతుతో కలిసి పాల్గొందని ఫిల్మ్‌ వర్గాల టాక్‌. మరి కొందరేమో.. దోష నివారణ నిమిత్తం ఈ పూజలు చేసినట్లు చెబుతున్నారు.
అయితే ఈ విషయం గురించి సమంత, నాగచైతన్య సోషల్‌మీడియా ద్వారా ఏమీ మాట్లాడలేదు. సమంత, నాగచైతన్య హిందు, క్రిస్టియన్‌ సంప్రదాయాల ప్రకారం రెండుసార్లు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

Sunday, September 25, 2016

‘నగరం’ ఫస్ట్‌లుక్‌ విడుదల

 సందీప్‌కిషన్‌, రెజీనా జంటగా లోకేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నగరం’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్రకథానాయిక రెజీనా ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. జావేద్‌రియాజ్‌ ఈ సినిమాకి స్వరాలు సమకూర్చారు. త్వరలోనే ఆడియో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

Wednesday, September 21, 2016

సల్మాన్‌ నాతో నటించడానికి ఒప్పుకోలేదు

 సెలబ్రిటీ వారసులుగా సినీ పరిశ్రమలో అడుగుపెడితే వారికి ప్రత్యేకమైన గౌరవం దక్కుతుంది. అవకాశాలు.. పాపులారిటీ సులభంగా వస్తాయి. అయితే దాన్ని నిలుపుకోవడం మాత్రం వారి ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వస్తే చాలా ఉపయోగాలు.. వెసులుబాటులుంటాయి. కానీ.. సోనమ్‌ కపూర్‌ మాత్రం అదే ఇబ్బందులను తెచ్చిపెడుతోందని తెగ బాధపడిపోతోంది.
‘‘నా తండ్రి వల్ల నేను చాలా సినిమాల్లో నటించే అవకాశం కోల్పోయాను. ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో’ సినిమాని తీసుకోండి. మొదట ఈ చిత్రంలో సల్మాన్‌ నాతో నటించడానికి ఒప్పుకోలేదు. ‘అనిల్‌ కపూర్‌ నా సన్నిహిత స్నేహితుడు. అలాంటిది అతని కుమార్తెతో నేను ఎలా రొమాన్స్‌ చేయగలను?’ అని సల్మాన్‌ అన్నాడు. అతికష్టం మీద నటించేందుకు ఒప్పుకున్నాడు. అలాగే ‘దర్శకురాలు ఫరాఖాన్‌ మా అమ్మకు స్నేహితురాలు. కానీ ఫరాఖాన్‌ చిత్రాల్లో ఒక్క దాంట్లో కూడా నేను నటించలేదు. చిన్నప్పట్నుంచి తెలిసిన అమ్మాయిని కాబట్టి తనకు నేను నటిగా కనిపించకపోవచ్చు’ అని ఆవేదన వ్యక్తం చేస్తోంది సోనమ్‌.

Tuesday, September 20, 2016

సల్మాన్‌ని వెంటాడుతున్న వ్యాధి

 ‘దబాంగ్‌’ ఖాన్‌ సల్మాన్‌ 50 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్‌ని కాపాడుకోవడానికి ఎన్నో కసరత్తులు చేస్తుంటాడు. భాయ్‌ ఎంత బిజీగా ఉన్నా తన డైట్‌ని చక్కగా అనుసరిస్తాడు. అలాంటి సల్లూభాయ్‌ కొన్ని సంవత్సరాలుగా ఓ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాడట.
సల్మాన్‌ 2007లో పార్ట్‌నర్‌ సినిమాలో నటిస్తున్నప్పుడు దవడ భాగంలో తీవ్ర నొప్పి వచ్చిందట. దాంతో భాయ్‌ వైద్యులను సంప్రదిస్తే ట్రైజెమినల్‌ న్యూరల్జియా వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ వ్యాధి వచ్చినప్పుడు ముందు దవడ భాగంలో తీవ్ర నొప్పి ఉంటుంది. తర్వాత అది నిదానంగా మెదడుపై ప్రభావం చూపుతుంది.
ఈ విషయం తెలిసి సల్మాన్‌ వెంటనే కొన్నాళ్ల పాటు షూటింగ్‌ వదిలేసి సీక్రెట్‌గా తన సోదరులతో కలిసి అమెరికా వెళ్లి చికిత్స చేయించుకుని వచ్చినట్లు సమాచారం. అప్పటికి కనీసం ఇంట్లో వారికి కూడా ఈ విషయం తెలీదట. ట్రీట్‌మెంట్‌ పూర్తికాగానే సరిగ్గా విశ్రాంతి తీసుకోకుండా వెంటనే భారత్‌ వచ్చి షూటింగ్‌లో పాల్గొన్నాడట. ఈ వ్యాధి కారణంగా భాయ్‌ క్రమం తప్పకుండా చెకప్‌లు చేయించుకుంటున్నాడు. తనకు ఇలాంటి సమస్య ఉన్నా భాయ్‌ ధైర్యంగా, ‘సుల్తాన్‌’లా దర్జాగా లైఫ్‌ని ఎంజాయ్‌ చేయగలగడం విశేషం.

Friday, September 9, 2016

ఇటు 33..అటు 61!

 ఇప్పుడు అమలా పాల్ వయసు 24 ఏళ్లు మాత్రమే. మరి, ఇటు 33... అటు 61 ఏంటనుకుంటున్నారా? హీరోల వయసండీ. సిల్వర్ స్క్రీన్‌పై ఓ పక్క యంగ్ హీరోలతో రొమాన్స్ చేస్తున్న ఈ మలయాళీ బ్యూటీ, మరో పక్క సీనియర్ హీరోల సరసన కూడా సై అంటున్నారు. ఇప్పుడీ బ్యూటీ నటిస్తున్న తమిళ సినిమా ‘వడ చెన్నై’ హీరో ధనుష్ వయసు 33 ఏళ్లు. యంగ్ హీరోల సినిమాల్లో మంచి చాన్సులు వస్తున్నప్పుడు సీనియర్ హీరోల పక్కన నటించడానికి అమలా పాల్ వయసున్న హీరోయిన్లు ఆలోచిస్తారు. ఎందుకంటే.. సీనియర్ హీరోయిన్ కింద ట్రీట్ చేసి, యంగ్ హీరోలు చాన్సులు ఇవ్వరేమోననే భయం.

 కానీ, అమలా పాల్‌కి అటువంటి భయాలు ఉన్నట్లు కనిపించడం లేదు. 33 ఏళ్ల ధనుష్ సరసన నటిస్తూనే, 61 ఏళ్ల సత్యరాజ్ పక్కన నటించడానికి సంతకం చేసేశారు. మోహన్‌లాల్, అమలా పాల్ జంటగా నటించిన మలయాళ సినిమా ‘లైలా ఓ లైలా’ను సత్యరాజ్ హీరోగా తమిళంలో ‘మురుగవేల్’గా రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్‌లో పోషించిన పాత్రనే మళ్లీ తమిళంలో చేస్తున్నారు అమలా పాల్. 61 ఏళ్ల సత్యరాజ్ పక్కనే కాదు.. మరో నాలుగేళ్లు పెద్దైన రజనీకాంత్ సరసన కూడా ఆమె నటించనున్నారట.

ఆ కారులో షికారు బేజారు!

                        సినిమాలో లీడ్ రోల్ చేసే ఆర్టిస్ట్ లుక్ ఎలా ఉంటుందో విడుదలకు ముందు చూపించడానికి ఫస్ట్ లుక్ విడుదల చేస్తుంటారు. ఫేవరెట్ స్టార్ లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తారు. నయనతార అభిమానులు ఆమె టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘డోర’ ఫస్ట్ లుక్ కోసం అలానే ఎదురు చూశారు. లుక్ బయటికొచ్చింది. నయనతార వెనక్కి తిరిగి ఉన్న ఈ లుక్‌ని చూసి, ‘మేడమ్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకుంటే బాగుండేది’ అని ఫ్యాన్స్ అనుకోవడం సహజం. కానీ, ఈ పోస్టర్‌లో నయనతార ముందు కారు, పైన మేఘాల్లో కనిపిస్తున్న ఫేసు చూసి, సమ్‌థింగ్ డిఫరెంట్ మూవీ చేస్తోందని ఆనందపడుతున్నారు.

 దాసు రామస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ హార్రర్ మూవీ రూపొందుతోంది. తెలుగులో మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఇప్పటివరకూ వచ్చిన హార్రర్ చిత్రాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. ఊహించని మలుపులతో ఆసక్తికరంగా సాగుతుంది. నయనతార పాత్ర చాలా బాగుంటుంది’’ అన్నారు. ఈ చిత్రంలో ఓ కారు పాత్ర కీలకంగా ఉంటుంది. ఆ కారులో షికారు చేసేవాళ్లు బేజారైపోతారట. దానికీ, డోరాకీ లింకేంటి? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

ఆమిర్‌ కొత్త లుక్‌ అదుర్స్‌

 ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకునే ఆమిర్‌ ఖాన్‌ విభిన్న రకాల పాత్రలతో అలరిస్తుంటాడు. అందుకే ఆయన్నిఅభిమానులు మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అని పిలుస్తుంటారు. పీకేలో మానవ రూపంలో ఉన్న గ్రహాంతరవాసిగా కొత్తలుక్‌లో కనిపించి అందరినీ మెస్మరైజ్‌ చేసిన ఆమిర్‌ ఇప్పుడు ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ అనే చిత్రంలో అతిథి పాత్రలో నటిస్తున్నారు. దానికి సంబంధించిన ఆమిర్‌ లుక్‌ ఒకటి బయటికి వచ్చింది. అందులో ఆమిర్‌ పెద్ద మీసాలు, తలకు హెడ్‌గేర్లు తగిలించుకుని విభిన్న అవతారంలో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆమిర్‌ది మ్యూజిక్‌ డైరెక్టర్‌ పాత్ర. ఓ బాలికకి మ్యూజిక్‌ నేర్పిస్తూ ఆమెని సెలబ్రిటీని చేయాలని పరితపిస్తుంటాడు. సినిమాలో ఆమిర్‌ది మ్యూజిక్‌ డైరెక్టర్‌ పాత్ర అయినప్పుడు ఇలాంటి విచిత్ర లుక్‌లో ఆమిర్‌ ఎందుకు ఉన్నాడన్న విషయం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Thursday, September 8, 2016

ఇంకొక్కడు :రివ్యూ

            విక్రమ్‌ సినిమాలెప్పుడూ కొత్తగా ఉంటాయి. జయాపజయాల్ని పక్కన పెడితే... ఏదో ఓ కోణంలో కొత్తదనం చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు. నటుడిగా తనలోని భిన్నకోణాన్ని ఎప్పటికప్పుడు ఆవిష్కరిస్తూనే ఉంటాడు. అందుకే ‘అపరిచితుడు’ తర్వాత విక్రమ్‌కి సరైన విజ‌యాల్లేక‌పోయినా.. అతని సినిమా అంటే ప్రత్యేక ఆసక్తి చూపిస్తుంటారు. ఈసారీ ‘ఇంకొక్కడు’పై అలాంటి ఆశ‌లూ, అంచనాలూ కలిగాయి. మరి.. విక్రమ్‌ ఈసారైనా తన స్థాయికి తగిన సినిమా చేశాడా? ఇంతకీ ఈ ‘ఇంకొక్కడు’ ఎవరు?
కథేంటంటే..:మలేసియాలో భారత దౌత్య కార్యాలయంపై దాడి జరుగుతుంది. ఎనభై ఏళ్ల ముసలాడు అక్కడివాళ్లందరినీ చితగ్గొట్టి కొంతమందిని చంపేస్తాడు. సీసీ కెమెరాల్లో చూస్తే ఆ వృద్ధుడు ఓ ఉత్ప్రేరకం ప్రభావంతో అంత శక్తివంతుడయ్యాడన్న విషయం అర్థమవుతుంది. ఆ మందు పేరు.. ‘స్పీడ్‌’. ఇన్‌హేల‌ర్‌‌ రూపంలో ఉండే ఆ మందు పీలిస్తే... క్షణాల్లో ఓ వ్యక్తి పది రెట్ల బలవంతుడవుతాడు. అయితే ఆ ప్రభావం 5 నిమిషాలే ఉంటుంది. ఈ స్పీడ్‌ అరాచక శక్తుల చేతుల్లోకెళితే చాలా ప్రమాదం. అందుకే ఈ కేసుని ఛేదించడానికి ఇండియా నుంచి అఖిల్‌ (విక్రమ్‌) వెళ్తాడు. తనో రా ఏజెంట్‌. నాలుగేళ్ల క్రితం మలేసియాలోనే తన భార్య (నయనతార)ని కోల్పోతాడు. దానికీ, ఇప్పుడు స్పీడ్‌ ఉపద్రవానికీ కారణం.. ఒక్కడే. తనే లవ్‌ (విక్రమ్‌). అఖిల్‌ భార్య ఎందుకు చనిపోయింది? మలేసియా వెళ్లిన అఖిల్‌ ఏం చేశాడు? అనేదే.. ‘ఇంకొక్కడు’ కథ.
ఎలా ఉందంటే..: ఇదో సైంటిఫిక్‌ థ్రిల్లర్‌. ప్రారంభ సన్నివేశాలు ఆసక్తిగానే సాగుతాయి. అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ కోసం అఖిల్‌ మలేసియా వెళ్లడం.. అక్కడ ఒక్కొక్క ఆధారం సంపాదించడం అంతా బాగుంది. లవ్‌ పాత్ర రాక.. ఈ కథకు కీలకమైన మలుపు. అక్కడి నుంచి అఖిల్‌ - లవ్‌ల మధ్య పోరాటం కూడా కీలకమే. అయితే ఈ కీలకమైన భాగాన్ని దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ సరిగ్గా డీల్‌ చేయలేదేమో అనిపిస్తుంది. ఈ సినిమా అంతా.. ‘స్పీడ్‌’ మందు చుట్టూనే తిరుగుతుంది. దాని వల్ల కలిగే నష్టాలేంటి? అనే విషయాన్ని తెరపై సరిగ్గా చూపించలేదు. దాంతో.. తెరపై హీరో చేసే విన్యాసాలకు ప్రేక్షకుడు సరిగ్గా కనెక్ట్‌ అవ్వడు. సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లే కూడా గ్రిప్పింగ్‌గా లేదు. ఐదు నిమిషాలకు ఓసారి ఎవరో ఒకరు స్పీడ్‌ మందు తీసుకోవడం, దాని చుట్టూ సన్నివేశాల్ని అల్లడం.. దీనికే సరిపోయిందంతా. నిత్యమేనన్‌ పాత్రని సరిగ్గా వాడుకోలేదు. నయనతార చుట్టూ అల్లిన కథ కూడా క‌న్విన్సింగ్‌గా లేదు. వినోదం లేకపోవడం ఈ సినిమా ప్రధాన లోపం. పాటలు  బోర్‌ కొట్టిస్తాయి. పతాక సన్నివేశాలు కాస్త ఉపశమనం కలిగిస్తాయంతే. 
ఎవరెలా చేశారంటే..: విక్రమ్‌ తన శక్తివంచన లేకుండా సినిమాని కాపాడే ప్రయత్నం చేశాడు. అఖిల్‌, లవ్‌ రెండు పాత్రల్లోనూ వైవిధ్యం చూపించాడు. అయితే లవ్‌ పాత్రకే ఎక్కువ మార్కులు పడతాయి. లవ్‌ పాత్రలో విక్రమ్‌ గెటప్‌, బాడీ లాంగ్వేజ్‌ బాగున్నాయి. నయనది కూడా సీరియస్‌గా కనిపించే పాత్రే. నాజర్‌ కాసేపే కనిపిస్తాడు. మిగిలినవాళ్లవన్నీ మనకు తెలియని మొహాలే. సాంకేతికంగా కెమెరా పనితనం బాగుంది. మలేసియా అందాల్ని బాగా చూపించారు. హారీశ్‌ పాటల్లో కొత్తదనం లేదు. పాటలు ఈ సినిమాకి అడ్డు తగిలాయి.
చివరిగా: ఇంకొక్కడు ‘స్పీడ్‌’ తగ్గింది

Monday, September 5, 2016

ఇంకా సిగ్గు పోలేదు


నేను తీసుకునే నిర్ణయాలు సరైనవని నేనెప్పుడూ అనుకోనంటోంది రాశీ ఖన్నా. నాలో నేను చూడని నటిని నా దర్శకులు చూస్తారు, అందుకే దర్శకుల నమ్మకాన్ని బట్టి కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకుంటానని చెబుతోంది. తెలుగు చిత్రసీమలో జోరు మీదున్న కథానాయికల్లో రాశి ఒకరు. ప్రస్తుతం రామ్‌తో ‘హైపర్‌’, గోపీచంద్‌తో ‘ఆక్సిజన్‌’లో నటిస్తోంది. కెరీర్‌ పరంగా మీ ప్రణాళికలు ఎలా ఉంటాయని అడిగితే ‘‘చిత్రసీమలో మనం అనుకున్నట్లు ఏదీ జరగదు. పరిస్థితుల్ని బట్టి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే నేనెప్పుడూ ప్రణాళికలు వేసుకోను. నేను సినిమా రంగానికొచ్చి ఏళ్లు గడుస్తున్నా నాలో సిగ్గు మాత్రం పోలేదు. తెరపై కొన్ని పాత్రలు చూస్తున్నప్పుడు ఇలాంటిది నేను చేయగలనా? అనుకుంటుంటా. దర్శకులు నా పాత్ర గురించి చెబుతున్నప్పుడూ అలాగే అనిపిస్తుంది. వాళ్లు నన్ను దృష్టిలో పెట్టుకొని ఆ పాత్రని సృష్టించారంటే నేను చేయగలననేగా అర్థం. అందుకే నాలో ఓ పాత్రపై సందేహాలున్నప్పటికీ దర్శకులిచ్చే ధైర్యంతో పచ్చ జెండా వూపేస్తుంటా. అలా చేసిన ప్రతిసారి నాకు మంచి ఫలితాలే లభిస్తుంటాయ’’ని చెప్పింది రాశీ ఖన్నా.