Monday, December 5, 2016

తలైవీ.. సెలవ్

దేశ రాజకీయాల్లో ఓ శకం ముగిసింది.. అలుపెరుగక పోరాడిన ‘విప్లవ నాయకి’ విశ్రమించింది...అభిమానుల ‘అమ్మ’ అస్తమించింది.. తమిళనాట ఓ ధ్రువతార నేలరాలింది.. ముఖ్యమంత్రి జయలలిత రెండునెలలకుపైగా మృత్యువుతో జరిపిన పోరాటంలో అలిసిపోయారు. ఆమె అభిమానులు చేసిన పూజలు.. దేశవిదేశాలకు చెందిన అత్యంత నిపుణులైన వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు..
75 రోజులుగా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన జయలలిత సోమవారం రాత్రి 11.30కు మృతి చెందినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. ‘అమ్మ’ మృతితో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం వారం రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. మెరీనా బీచ్‌లోని ఎంజీఆర్‌ సమాధి వద్ద నేటి సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తారు. జయ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖులంతా సంతాపం తెలిపారు.
 చెన్నై: తమిళనాడు శోకసంద్రమైంది.. రాష్ట్రమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.. ముఖ్యమంత్రి జయలలిత (68) సోమవారం రాత్రి కన్నుమూశారు. రాత్రి 11.30 గంటలకు కన్నుమూసినట్లు చెన్నై అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఆసుపత్రి నుంచి పార్థివదేహాన్ని అర్ధరాత్రి పోయెస్‌ గార్డెన్‌లోని ఆమె స్వగృహానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం అక్కడినుంచి మంగళవారం ఉదయం మౌంట్‌రోడ్‌లోని రాజాజీ హాల్‌కు తరలిస్తారు. అత్యవసరంగా సమావేశమైన పార్టీ శాసనసభాపక్షం తదుపరి ముఖ్యమంత్రిగా పన్నీర్‌సెల్వంను ఎన్నుకుంది. ఆ వెంటనే ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి అర్ధరాత్రి 1.20 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రంలో వారంరోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు. మూడురోజుల పాటు రాష్ట్రంలోని విద్యాసంస్థలు, పాఠశాలలను మూసివేస్తారు. ఆమె అంత్యక్రియలను మెరీనా బీచ్‌లోని ఎంజీఆర్‌ సమాధి వద్ద మంగళవారం సాయంత్రం నిర్వహించనున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా జయ సన్నిహితురాలైన శశికళను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ప్రణబúముఖర్జీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తదితర ప్రముఖులంతా జయ మృతికి తీవ్ర సంతాపం ప్రకటించారు.
ఆదివారం సాయంత్రం తీవ్రమైన గుండెపోటు రావడంతో జయలలిత పరిస్థితి విషమించింది. అపోలో ఆసుపత్రిలోనే సాధారణ ప్రత్యేక గదిలో ఉంటున్న ఆమెను వెంటనే క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌కు తరలించారు. ఆమె ప్రాణాలు కాపాడటానికి వైద్యులు రేయింబవళ్లు శ్రమించారు. ‘ఎక్మో’ యంత్రం ద్వారా కృత్రిమ శ్వాస, రక్త ప్రసరణ జరిగేలా చూశారు. దిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) వైద్య బృందం కూడా ప్రత్యేక విమానంలో చెన్నైకి వచ్చింది. లండన్‌ నుంచి డాక్టర్‌ రిచర్డ్‌ బాలే వైద్యసేవలపై సలహాలు ఇస్తూ సమీక్షించారు. వైద్యుల ప్రయత్నాలు విఫలమవడంతో ఆమె సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె ఆరోగ్యం మళ్లీ విషమించినట్లు తెలియగానే అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. రెండురోజుల నుంచి అక్కడ తీవ్ర ఉద్వేగపూరితమైన వాతావరణం కొనసాగింది. సోమవారం రాత్రి జయ మృతిచెందినట్లు తెలియగానే అభిమానులంతా కన్నీరుమున్నీరయ్యారు. తమిళనాడు మొత్తం విషాదంలో మునిగిపోయింది. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాపాడలేకపోయాం..
రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు
అపోలో ఆసుపత్రుల అధికారిక ప్రకటన
ఈనాడు, చెన్నై: ‘ఇది వ్యక్తం చేయలేని దుఃఖం (ఇన్‌డిస్‌క్రైబబుల్‌ గ్రీఫ్‌), మన ప్రియతమ నేత, తమిళనాడు ముఖ్యమంత్రి, విప్లవనాయకి అమ్మ(జయలలిత) ఈ రోజు రాత్రి (సోమవారం) 11.30 గంటలకు కన్నుమూశారు. సెప్టెంబర్‌ 22న తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌ సమస్యలతో గౌరవ ముఖ్యమంత్రి ఆసుపత్రిలో చేరారు. ఆమెకు క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో వివిధ విభాగాల నిపుణులతో చికిత్స అందించాం. వాటికి ఆమె బాగా స్పందించారు. క్రమంగా కోలుకున్నారు, ఆహారమూ తీసుకునేవారు. వీటన్నిటి ఆధారంగా ఆమెను క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ నుంచీ హై డిపెండెన్సీ యూనిట్‌కు తరలించాం. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఆమె పరిస్థితి మెరుగయ్యే సూచనలు కనిపించాయి. దురదృష్టవశాత్తు 4వ తేదీ(ఆదివారం) సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రికి తీవ్రమైన గుండెపోటు(మాసివ్‌ కార్డియాక్‌ అరెస్ట్‌) వచ్చింది. వెంటనే వైద్య నిపుణులు ఆమెను క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌కు తరలించారు. వెనువెంటనే ఎక్మో సహాయం అందించి పరిస్థితిని పర్యవేక్షించాం. ఎక్మో అనే చికిత్స ప్రక్రియ అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న అత్యంత అధునాతన చికిత్స ప్రక్రియ. ఆమెకు అవసరమైన ప్రతి చిన్న చికిత్సను కూడా అందించి కాపాడటానికి విశ్వ ప్రయత్నాలు చేశాం. అయినా.. అప్పటికే విషమించిన ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి ఆమెను కోలుకోలేకుండా చేశాయి. చివరకు ఆమె సోమవారం రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు. అపోలో ఆసుపత్రిలోని సిబ్బంది గౌరవ ముఖ్యమంత్రికి అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన అవిశ్రాంత వైద్య సపర్యలు అందించారు. ఆమె మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆమెను పోగొట్టుకుని విచారంలో మునిగిపోయిన తమిళనాడు ప్రజలు, జాతి దుఃఖంలో మేము సైతం పాలు పంచుకుంటున్నాం’
- అపోలో ఆసుపత్రుల యాజమాన్యం

మహేష్‌ సినిమాకు పేరు ఖాయం!

 సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, కొరటాల శివ కాంబినేషన్లో సినిమా అనే ప్రకటన వెలువడినప్పటి నుంచీ టైటిల్‌పై పుకార్లు వస్తున్నాయి. మహేష్‌ ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తున్నారని, ‘భరత్‌ అను నేను’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్‌ వచ్చింది. అయితే దీనికి సంబంధించి తాజాగా చిత్ర బృందం నుంచి దాదాపు స్పష్టత వచ్చింది. ఈ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య సోమవారం ‘భరత్‌ అను నేను’ అనే పేరును రిజిస్టర్‌ చేయించారు. మరి టైటిల్‌పై దాదాపు స్పష్టత వచ్చినా, మహేష్‌ ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తున్నారా? అన్న ప్రశ్నకు సమాధానం కోసం వేచి చూడాలి. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి నుంచి జరగనున్నట్లు తెలుస్తోంది.
మహేష్‌ కథానాయకుడిగా ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం అహ్మదాబాద్‌లో జరుగుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదు.