Friday, January 27, 2017

'టాప్' లేపిన డేవిడ్ వార్నర్!

 కెరీర్‌లో ఉన్నత దశలో ఉన్న ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటాడు. ఇటీవల సొంతగడ్డపై పాకిస్తాన్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో శతకాల మోత మోగించిన వార్నర్‌ 367 పరుగులతో రాణించి, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కెరీర్‌లో తొలిసారిగా ఆసీస్ ప్లేయర్ ఫస్ట్ ర్యాంకును సాధించాడు. మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక ర్యాంకు దిగజారి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. టాప్ ర్యాంక్‌లో ఉన్న దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి మారాడు.
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఒక స్థానం మెరుగు పరుచుకుని 13వ ర్యాంకు సాధించగా, గాయాలతో సతమతమవుతున్న రోహిత్ శర్మ మూడు స్థానాలు దిగజారి 12వ స్థానానికి పరిమితం అయ్యాడు. ఇంగ్లండ్ ప్లేయర్ జాస్ బట్లర్‌తో సంయుక్తంగా శిఖర్ ధావన్ 14వ ర్యాంకులో నిలిచాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన కేదార్ జాదవ్ 57 స్థానాలు మెరుగు పరుచుకుని 47వ ర్యాంకు దక్కించుకున్నాడు.

బౌలింగ్ ర్యాంకింగ్స్: టాప్ టెన్‌లో నో ప్లేస్
 ఏ భారత బౌలర్ కూడా వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ టెన్‌లో చోటు దక్కించుకోలేదు. మూడు స్థానాలు దిగజారిన అక్షర్ పటేల్ 12వ స్థానంలో, లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా 14వ ర్యాంకులో నిలిచాడు. టీమిండియా బౌలింగ్‌ కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఓవరాల్‌గా టీమిండియా వన్డేల్లో మూడో స్థానాన్ని అలాగే కొనసాగించింది.