Wednesday, January 27, 2016

రాత్రంతా మేల్కొని...

 ‘‘నిద్రకూ నాకూ అస్సలు పడదు.. ఒక్కరోజు కూడా నేను మనస్ఫూర్తిగా పడుకోను..’’ అంటోంది శ్రుతి హాసన్‌. మరి రాత్రిళ్లు పడుకోకుండా ఏం చేస్తుంటారు? అని అడిగితే.. ‘‘పార్టీలకు వెళ్లి.. తెల్లవారుఝామువరకూ అక్కడే గడపడం నాకు ఇష్టం ఉండదు. సెట్‌ నుంచి నేరుగా ఇంటికే వెళ్లిపోతా. రేపు షూటింగ్‌ అంటే నాకు నిద్ర పట్టదు. సన్నివేశం ఏమిటి? ఆ సన్నివేశంలో ఎవరితో నటించాలి? అనే విషయాలే ఆలోచిస్తా. ఒకటికి పది సార్లు డైలాగ్‌ పేపర్‌ చదువుతూ కూర్చుంటా. షూటింగ్‌ లేకపోయినా అంతే. సంగీత సాధనలో రాత్రంతా గడిపేస్తుంటా. కొత్త కొత్త ట్యూన్లు అప్పుడే పుడతాయి. నాకే కాదు.. ఏ సంగీత దర్శకుడైనా అంతేనేమో. రాత్రిళ్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒంటరిగా పని చేసుకోవాలని అనుకొనేవాళ్లకు అదే సరైన సమయం. మూడు నాలుగు గంటలు ప్రశాంతంగా పడుకొంటా. అంతే.. మళ్లీ షూటింగ్‌కి సిద్ధమైపోతా’’ అని చెప్పుకొచ్చింది.

ఆన్‌లైన్‌లో ఘరానా మోసం!

 కొత్తకోట రూరల్: ఇటీవల ఆన్‌లైన్‌లో బుక్ చేసిన వాటర్‌ ఫిల్టర్‌కు బదులు ఓ వినియోగదారుడికి ఇటుక రాయి వచ్చింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పాలెం గ్రామానికి చెందిన బాల్‌రెడ్డి స్నాప్‌డీల్‌లో ఇటీవల రూ.8 వేలు వెచ్చించి వాటర్‌ ఫిల్టర్‌ను బుక్ చేసుకున్నాడు.
             మంగళవారం కొరియర్ బాయ్ వచ్చి కస్టమర్ బుక్ చేసుకున్న వస్తువుకు సంబంధించి ఓ బాక్స్ అందజేశాడు. దీంతో బాల్‌రెడ్డి బాక్స్‌ను తీసుకుని ఇంటివద్దకు వెళ్లి తెరిచి చూడగా వాటర్‌ఫిల్టర్‌కు బదులు ఇటుక రాయి కనిపించింది. దీంతో అతడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఈ మోసం ఆన్‌లైన్ వారి మూలంగా జరిగిందా.. లేదా కొరియర్ సంస్థ ద్వారా జరిగిందా అన్న తెలియాల్సి ఉంది.