Monday, July 27, 2015

మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్‌ కలాం హఠాన్మరణం

             నిరుపేదగా పుట్టావు. నింగికెగరాలని కలలు కన్నావు. నిప్పులు చిమ్మే రాకెట్లను చేశావు. నిగర్విగా పెరిగావు..నిరాడంబరునిగా మసలావు. అచార్యునిగా..శాస్త్రవేత్తగా గణుతికెక్కావు. రక్షణ రంగనిపుణునిగా ఎంత ఖ్యాతి గడించావో..  రాష్ట్రపతిగా అంతే రాణించావు. .ఎంత ఎత్తుకు ఎదిగినా ఎంతో ఒదిగి ఉన్నావు.ప్రకృతిఅన్నా..పసిబాలలన్నా..విద్యార్థులన్నా. విజ్ఞానమన్నా ఎంతో ప్రేమించావు. సాంకేతికరంగాన్ని ఎంత అధ్యయనం చేశావో ..సంగీతాన్ని అంతే ఇదిగా సాధన చేశావు చివరిక్షణం దాకా పాఠాలు చెపుతూనే ఉన్నావు. మరలిరాని లోకాలకు నువ్వేగినా... కలాం నిర్మలమైన నీ నవ్వును..నీవు చూపిన బాటనూ మరిస్తే కదా ఈ దేశం...!రి
      ఎక్కడో మారుమూల ప్రాంతంలో జన్మించిన అవుల్‌ ఫకీర్‌ జైనులాబ్దీన్‌ అబ్దుల్‌ కలాం...ఓ శాస్త్రవేత్తగా ఎదిగి..రాష్ట్రపతి పదవి పొందటం వెనుక నిరంతర శ్రమ, స్వయంకృషి...అన్నింటికీ మించి మంచి మనస్సు వుంది. జీవితంలో తనకు లభించిన స్థాయిని సమాజానికి అందించాలని తపనపడ్డారు. కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడాలని దేశ యువతకు పిలుపునిచ్చారు. తన నిరాడంబరత, నిజాయితీతో అత్యున్నత పదవులకు వన్నె తెచ్చారు. నాణ్యమైన విద్య అందుబాటులోకి తేవాలన్న బలమైన ఆకాంక్షను వెలిబుచ్చుతూ...తన చివరి శ్వాసను కూడా విద్యార్థుల మధ్యే విడిచారు.  ఆయన జీవితంలోని ముఖ్య విషయాల్ని ఇక్కడ కొంత అందజేస్తున్నాం..
 
గొప్ప శాస్త్రవేత్త కలాం
                కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్‌ చేయడం ద్వారా తన వృత్తిని ప్రారంభించారు. కానీ డీఆర్డీవోలో ఉద్యోగం చేయడంతో ఆయన సంతృప్తి చెందలేదు. కలాం ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్ర వేత్త విక్రం సారాభారు కింద ఇన్‌కాస్పర్‌ కమిటీలో పని చేశారు. 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో చేరారు. ఇస్రో మొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (ఎస్‌ఎల్‌వీ-111) ప్రయోగానికి డైరెక్టర్‌గా పని చేశారు. జులై 1980లో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్యలో విజయవంతంగా చేర్చింది. ఇస్రోలో పని చేయడం తన జీవితంలో అతి పెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు. 1970లో స్థానికంగా తయారైన ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ఉపయోగించి రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో మైలురాయి.

భారత రాష్ట్రపతి పదవికి ముందు, డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ డీఆర్డీవో ఇండియన్స్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ ఇస్రోలో ఏరోస్పేస్‌ ఇంజనీర్‌గా పని చేశారు. 1998లో భారత దేశ పోఖ్రాన్‌-2 అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత సాంకేతిక రాజకీయ పాత్ర పోషించారు. 2002 అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్తిగా ప్రతిపాదించగా, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మద్దతు తెలిపింది. కలాం 'వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌' ఇండియా 2020-ఎ విజన్‌ ఫర్‌ ది న్యూ మిలినియం' మై జర్నీ అండ్‌ ఇగ్నిటెడ్‌ మైండ్స్‌, అన్‌లిషింగ్‌ ది పవర్‌ విత్‌ఇన్‌ ఇండియా' అనే పుస్తకాలను రచించారు. ఆయనకు 30 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. ఆయనను భారత అత్యున్నత పురస్కారం భారత రత్నతో సత్కరించారు.