Friday, November 11, 2016

పాత నోట్లతో చెల్లింపులకు గడువు పెంపు



పాత నోట్లతో ప్రజా వినియోగ సేవల బిల్లుల చెల్లింపునకు గడువు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 14వ తేదీ అర్థరాత్రి వరకు పాత రూ.500, 1000 నోట్లతో విద్యుత్‌, నీటి బిల్లులు, ఆస్తిపన్ను, తదితర ప్రజా వినియోగ పన్నులు చెల్లించ వచ్చు. తొలుత 11వ తేదీ అర్థరాత్రి వరకే అవకాశం ఇచ్చినప్పటికీ ప్రజల నుంచి అనూహ్య స్పందన రావటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ రాత్రి 7గంటల వరకు దాదాపు రూ.40కోట్ల పన్నులు వసూలయ్యాయని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. మరో 72గంటల పాటు గడువు పొడిగించినందున నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రివ్యూ: సాహసం శ్వాసగా సాగిపో

 కథేంటంటే?: లీలా (మంజిమ మోహన్‌)కి సినిమాలంటే ఇష్టం. వైజాగ్‌కి చెందిన తన స్నేహితురాలు మైత్రేయితో కలిసి స్క్రిప్ట్‌ రైటర్‌గా చిత్ర పరిశ్రమలో స్థిరపడాలని ప్లాన్‌ చేస్తుంది. కొన్ని రోజులు గడిపేందుకు మైత్రేయి ఇంటికి వస్తుంది. అక్కడే మైత్రేయి సోదరుడైన రజనీకాంత్‌(నాగచైతన్య)కి దగ్గరవుతుంది. రజనీకాంత్‌కు బైక్‌పై ప్రయాణమంటే చాలా ఇష్టం. కన్యాకుమారికి బైక్‌పై వెళ్లాలనుకొంటాడు. అది తెలిసి లీలా కూడా ప్రయాణమవుతుంది. ఇద్దరూ కన్యాకుమారి వెళ్లి తిరిగొచ్చే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురవుతారు. ఆస్పత్రిలో రజనీకాంత్‌ని చేర్పించిన లీలా.. మహారాష్ట్రలో ఉన్న తన అమ్మానాన్నలపై జరిగిన హత్యాయత్నం గురించి తెలుసుకొని అక్కడికి వెళ్లిపోతుంది. అయితే రజనీ, లీలా కన్యాకుమారి నుంచి తిరిగి వస్తుండగా జరిగింది ప్రమాదం కాదని, లీలాని అంతం చేయాలనే పథకం అని ఆ తర్వాత తెలుస్తుంది. మరి రజనీకాంత్‌ అప్పుడెలా స్పందించాడు? ఇంతకీ లీలాని చంపాలనుకొన్నది ఎవరు? రజనీకాంత్‌.. మహేష్‌గా ఎలా మారాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 ఎలా ఉందంటే?: గౌతమ్‌మేనన్‌ మార్క్‌ సినిమా ఇది. తొలి సగభాగం ‘ఏమాయ చేసావె’ తరహాలోనే ఓ పక్కింటి కుర్రాడి ప్రేమకథని చూపించారు. కానీ ఇక్కడ ఆ ప్రేమకథని ఓ రోడ్‌ట్రిప్‌ నేపథ్యంలో చూపించడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. రోడ్డుపై ప్రమాదం జరగడం, అది కూడా ఓ పథకం ప్రకారమే అన్న విషయం తెలియడంతోనే అసలు కథ మొదలవుతుంది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ తిరిగిన ఓ కుర్రాడికి అనుకోని కష్టం ఎదురైనప్పుడు ఎలా స్పందించాడు? ఎలా ధైర్యం కూడగట్టుకొన్నాడు? అనే విషయాల్ని సహజంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మలి సగభాగమంతా శత్రువుల నుంచి లీలా అమ్మానాన్నల్ని కాపాడటం నేపథ్యంలోనే సాగుతుంది. ఆ భాగమంతా కూడా యాక్షన్‌, ఛేజింగ్‌ సన్నివేశాలే ఎక్కువగా ఉండటంతో పాటల్ని కూడా పక్కనపెట్టారు. చివరి పదిహేను నిమిషాలు కథ మరింత ఆసక్తికరంగా సాగుతుంది. కథానాయకుడు కేసులోని చిక్కు ముడులను విప్పేది అప్పుడే. అయితే అంతకుముందు సుదీర్ఘంగా సాగిన యాక్షన్‌ ఘట్టాలే ప్రేక్షకులకు బోర్‌ కొట్టినట్టు అనిపిస్తాయి. లీలాని ఎందుకు చంపాలనుకొంటున్నారనే విషయాన్ని చివరి వరకు కూడా బయటపెట్టక పోవడంతో ప్రేక్షకులు అసహనానికి గురవుతారు. కానీ చివరి పది నిమిషాల్లోనే ఆ చిక్కుముడినంతా మాటలతోనే చెప్పిస్తారు. థ్రిల్లింగ్‌తో కూడిన ఈ కథకి విలనిజం ప్రధానం. కానీ అది కూడా బలంగా ఏమీ పండలేదు. బాబా సెహగల్‌ బాగానే నటించాడు కానీ... ఆ పాత్రలో విలనిజం మాత్రం పండలేదు. తాను... నేను, చకోరి... పాటలు బాగున్నాయి. వెళ్లిపోమాకే పాట బాగున్నప్పటికీ అది ప్లేస్‌మెంట్‌ సరిగ్గా కుదర్లేదనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే?: నాగచైతన్య తన పాత్రలో ఒదిగిపోయాడు. ప్రేమ సన్నివేశాలతో పాటు, యాక్షన్‌ ఘట్టాల్లో కూడా చక్కటి భావోద్వేగాలు పండించాడు. మంజిమ మోహన్‌ తొలి సగభాగంలో అందంగా కనిపించింది. ముఖ కవళికల్లో సమంతని అనుసరించినట్టు అనిపిస్తుంది. ఆమె సంభాషణలు చెప్పేటప్పుడు సమంతే గుర్తుకొస్తుంది. కామత్‌ అనే పోలీసు పాత్రలో బాబా సెహగల్‌ ఒదిగిపోయాడు. రాకేందుమౌళి ప్రాధాన్యమున్న స్నేహితుడి పాత్ర చేశాడు. ఇక మిగిలిన పాత్రల గురించి చెప్పుకోదగినంత ఏమీ లేదు. సాంకేతికంగా ఈ సినిమాకి మంచి మార్కులే పడతాయి. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం బాగుంది. ఛాయాగ్రహణం కూడా సహజంగా ఉంది. ‘ద గాడ్‌ఫాదర్‌’ స్ఫూర్తితో కథ రాసుకొన్నట్టు టైటిల్‌ కార్డ్స్‌లో వేశారు గౌతమ్‌మేనన్‌. కథానాయకుడి పాత్ర అందుకు స్ఫూర్తి ఇచ్చుండొచ్చేమో కానీ... ఈ తరహా కథలు తెలుగుకి కొత్తేమీ కాదు.
చివరిగా: కాసేపు కాలక్షేపమే ఆశించి సాగిపో..