Friday, October 28, 2016

హిందీ-2,తెలుగు-1

హింది రెండు తెలుగు ఒకటి అంటె ఏదో అనుకున్నారు. అచర్య పోవలసిన్న అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు హింది సినిమాలు రెండు సినిమాలు రిలిజ్‌ అయ్యాయి. తెలుగులో ఇక సినిమా విడుదల అయ్యింది.

( హింది )

రివ్యూ: యే దిల్‌ హై ముష్కిల్‌

కథేంటి?: అయాన్‌(రణ్‌బీర్‌ కపూర్‌) బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన యువకుడు. సొంతంగా నిర్ణయాలు తీసుకోలేడు. ఇతరులు చెప్పినట్లుగానే ఫాలో అవుతుంటాడు. అలిజె(అనుష్క శర్మ) అతనితో స్నేహంగా ఉంటుంది. ఇద్దరూ కలిసి పిక్నిక్‌లకు, పబ్‌లకూ వెళ్తారు. ఆ సాన్నిహిత్యాన్నే ప్రేమగా ఫీలవుతాడు అయాన్‌. కానీ.. అలిజె‌ అప్పటికే మరో వ్యక్తితో లవ్‌లో ఉంటుంది. అతనే అలీ(ఫవాద్‌ ఖాన్‌). వాళ్ల ప్రేమ పెళ్లి దాకా వెళ్తుంది. దీంతో అయాన్‌ తీవ్ర వేదనకు గురవుతాడు. ఆ సమయంలోనే అందాల రాశి సబా(ఐశ్వర్య రాయ్‌)తో ఇన్నింగ్స్‌ మొదలవుతుంది. ఆ తర్వాత ఏమైంది? సబాతో అయాన్‌ పరిచయం ఎంతవరకు వెళ్లింది? అనుష్కతో స్నేహానికి పూర్తిగా కటీఫ్‌ చెప్పేశాడా? వంటి విషయాలను తెరపై చూడాల్సిందే.
 ఎలా ఉందంటే..: ప్రేమే ప్రపంచం అనుకునే అయాన్‌(రణ్‌బీర్‌ కపూర్‌).. అన్ని విషయాల్లోనూ తెలివిగా వ్యవహరించే అలిజె‌(అనుష్క) మధ్య స్నేహం అందరినీ ఆకట్టుకుంది. అతని వ్యక్తిత్వాన్ని మార్చడంలోనూ ఆమె పాత్ర ఉంటుంది. అనుష్క ప్రేమికుడు అలి(ఫవాద్‌ ఖాన్‌) అని తెలుస్తుంది. కానీ.. వారి ప్రేమ కథ గురించి మాత్రం తెరపై చూపించలేదు. ఇక ఐశ్వర్యరాయ్‌ అందాలకు కొదవలేదు. సెకండాఫ్‌ ఆరంభంలోనే హాట్‌ లుక్స్‌తో.. దొండపండు లాంటి పెదాలతో కుర్రకారు మతిపోగొట్టడం ఖాయం. ట్రైలర్లు చూసి రణ్‌బీర్‌ కపూర్‌తో ఐష్‌ హాట్‌ సన్నివేశాలు భారీగానే ఉన్నట్లు భావించారు. కానీ సెన్సార్‌ కత్తిరింపులో ఏమో.. సినిమాలో ఒకటి, రెండుకు మించి హాట్‌ సన్నివేశాలేమీ కనిపించవు. ఇది ఐష్‌ అభిమానులకు కాస్త నిరాశ కలిగించే విషయమని చెప్పాలి. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం బాగుంది. సంగీతం విషయంలోనూ మంచి మార్కులే పడతాయి.

ఎవరెలా..?: సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా రణ్‌బీర్‌ కపూర్‌ నటన అద్భుతంగా ఉంది. ఈ సినిమాలోని నటీనటుల్లో ఎక్కువ మార్కులు రణ్‌బీర్‌కే పడతాయి. అందాల రాశి ఐశ్వర్యరాయ్‌లో గ్లామర్‌ డోస్‌ ఏమాత్రం తగ్గలేదు. కొన్ని సన్నివేశాల్లో అనుష్క శర్మలో గ్లామర్‌ మిస్సయినట్లు అనిపిస్తుంది. ఐశ్వర్య కంటే అనుష్కనే తెరపై ఎక్కువసేపు కనిపిస్తుంది. ఫవాద్‌ఖాన్‌ తన పరిధి మేరకు నటించాడు. షారుక్‌ఖాన్‌.. ఆలియా భట్‌లు గెస్ట్‌ రోల్‌లో అలా వచ్చి ఇలా వెళ్లిపోతారు. కొన్ని సన్నివేశాలను సాగదీసినట్లు అనిపిస్తుంది. 

చివరిగా.. విడుదలకు ముందు ‘ముష్కిల్‌ హై’..  తెర‌పై ప్రేమికులకు ‘దిల్‌ కుష్‌ హై’
రివ్యూ: శివాయ్‌
కథేంటి?: శివాయ్‌(అజయ్‌ దేవగణ్‌) భోళా మనిషి. ఎంత శక్తివంతుడైనా ఎవ్వరి జోలికి వెళ్లేరకం కాదు. సాహసాలతోనే తన సావాసం. పర్వాతారోహణను ఇష్టపడే శివాయ్‌ హిమాలయ పర్వతాలను అధిరోహించే పనిలో ఉంటాడు. ఓసారి బల్గేరియా నుంచి వచ్చిన యువతి ఓల్గా(ఎరికా కార్‌) పర్వతారోహణ సమయంలో ప్రమాదంలో పడితే రక్షిస్తాడు. ఈ క్రమంలో ఒకరినొకరు ఇష్టపడతారు. శారీరకంగానూ దగ్గరవుతారు. దీంతో ఓల్గా గర్భం దాల్చుతుంది. కానీ ఇదంతా ఇష్టం లేని ఓల్గా ఓ పాపకు జన్మనిచ్చి బల్గేరియా వెళ్లిపోతుంది. అప్పట్నుంచి కూతురే ప్రాణంగా జీవిస్తుంటాడు శివాయ్‌.

అలా తొమ్మిదేళ్లు గడిచిపోతాయి. ఓ రోజు కూతురు(అబిగేల్‌ ఏమ్స్‌) కోరిక మీద ఓల్గాను వెతికేందుకు ఇద్దరు కలిసి బల్గేరియా వెళ్తారు. అక్కడ కొంతమంది ఆ పాపను కిడ్నాప్‌ చేస్తారు. ఇంతకీ పాపను కిడ్నాప్‌ చేసింది ఎవరు? ఆ దుర్మార్గుల నుంచి శివాయ్‌ కూతుర్ని ఎలా కాపాడుకున్నాడు? ఈ తండ్రీకూతుళ్లు ఓల్గాను కలిశారా? ఇంతకీ శివాయ్‌కి.. సాయేషా సైగల్‌కి ఉన్న సంబంధమేంటి? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
ఎలా ఉందంటే..: కథపై నమ్మకంతో అజయ్‌ దేవగణ్‌ ఈ చిత్రానికి నిర్మాతగానూ మారారు. అందుకే సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. సినిమా నిడివి ఎక్కువైనప్పటికీ ఎక్కడా బోర్‌ కొట్టకుండా స్క్రీన్‌ప్లేతో కట్టిపడేశారు. కాకపోతే స్క్రిప్టుకి ఇంకాస్త పదును పెట్టాల్సింది. ఛాయాగ్రహణం సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది. మంచు పర్వతాల నేపథ్యంలో జరిగే పోరాట ఘట్టాలు.. బల్గేరియా.. పోలాండ్‌.. ఉత్తరాఖండ్‌ల్లోని ప్రకృతి అందాలను అద్భుతంగా చూపించారు. గ్రాఫిక్స్‌ కూడా బాగున్నాయి. యాక్షన్‌ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. మోతాదు కొంచెం ఎక్కువైంది.
కథపరంగా సినిమా మొత్తం అజయ్‌ దేవగణ్‌ చుట్టూనే తిరుగుతుంది. ఇందులో అజయ్‌ సరికొత్త లుక్‌లో ఆకట్టుకున్నారు. యాక్షన్‌ సన్నివేశాల్లో తనదైన శైలిలో అలరించారు. పోలాండ్‌కి చెందిన నటి ఎరికా కార్‌ కూడా పర్లేదు గానీ.. ఆమె సంభాషణలు చెప్పే విధానం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. సాయేషా సైగల్‌ పాత్ర చాలా చిన్నది. అయినప్పటికీ పరిధి మేరకు ఆకట్టుకుంది. అజయ్‌దేవగణ్‌ కూతురుగా నటించిన అబిగేల్‌ ఏమ్స్‌ తన పాత్రకు న్యాయం చేసింది. గిరీష్‌ కర్నాద్‌.. వీర్‌ దాస్‌ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యమేమీ లేదు.
చివరగా.. యాక్షన్‌ అభిమానులకు నచ్చే ‘శివాయ్‌’.
తెలుగు
రివ్యూ: కాష్మోరా!   
 కథేంటంటే?: ప్రేతాత్మల నుంచి విముక్తి కల్పిస్తానంటూ మేజిక్కులు చేస్తూ బతికేస్తుంటాడు క్యాష్‌ అలియాస్‌ కాష్మోరా(కార్తీ). తనకి శక్తులేవీ లేకపోయినా ఉన్నట్టు అందరినీ నమ్మిస్తుంటాడు. అతడికి సొంత కుటుంబం కూడా తోడుంటుంది. ఆత్మల పేరుతో చేతివాటం ప్రదర్శించే కాష్మోరా ఒకసారి టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ తమ కుటుంబ సభ్యులంతా రోహిణి నక్షత్రంలో పుట్టామని, అందుకే తమకి ఈ శక్తులు అబ్బాయని చెబుతాడు. అదే విషయాన్ని పత్రికల్లోనూ ప్రకటనలు ఇస్తూ ప్రచారం చేసుకొంటుంటాడు. నిజంగానే ప్రేతాత్మ అయిన రాజ్‌నాయక్‌ (కార్తీ)కి ఆ ప్రకటన గురించి ఎలా తెలుస్తుంది? రాజ్‌నాయక్‌ ప్రేతాత్మలా మారిపోవడానికి కారణమేమిటి? 700 యేళ్ల క్రితంనాటి అతని చరిత్ర ఎలాంటిది? రోహిణి నక్షత్రంలో పుట్టిన కాష్మోరా కుటుంబాన్ని రాజ్‌నాయక్‌ ఆత్మ తన దగ్గరికి రప్పించుకొని ఏం చేసింది? ఈ కథతో యామిని (శ్రీదివ్య) అనే పరిశోధక విద్యార్థినికీ, రత్నమహాదేవి (నయనతార)కీ మధ్య సంబంధమేమిటి? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే?: ఇదొక ఫాంటసీ కథ. 700 ఏళ్ల క్రితం నాటి కథకీ, అప్పటి ఓ శాపానికీ, ప్రస్తుతం భూత వైద్యుడిగా చెప్పుకొంటూ కాలం వెళ్లదీసే ఓ కుటుంబానికీ మధ్య ముడిపెట్టి కథని అల్లారు. తొలి సగభాగం కథంతా ఆత్మల్ని పైకి పంపిస్తానంటూ కాష్మోరా పాత్రలో కార్తీ, ఆయన తండ్రి పాత్రలో వివేక్‌ చేసే మేజిక్కులతోనే సాగిపోతుంది. ఆ సన్నివేశాలన్నీ కడుపుబ్బా నవ్వించేలా తీర్చిదిద్దారు. భూతం ఉందంటూ నమ్మించేందుకు రిమోట్‌ కంట్రోల్‌తో కూడిన పరికరాలతో కాష్మోరా కుటుంబమంతా చేసే విన్యాసాలు కూడా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతాయి. కాష్మోరా కుటుంబమంతా రాజ్‌నాయక్‌ బంగ్లాకి వెళ్లాకే అసలు కథ మొదలవుతుంది. రాజ్‌నాయక్‌ ఎందుకు ప్రేతాత్మగా మారాడో, అతనికి పునరుజ్జీవం రావడానికి తమ కుటుంబం ఎలా కీలకమో కాష్మోరాకి తెలిసే క్రమం ఆసక్తిని రేకెత్తిస్తుంది. 700 ఏళ్ల క్రితం నాటి రాజ్యాన్ని, అప్పటి యుద్ధాన్ని, రాజ్‌నాయక్‌ పరాక్రమాన్ని చాలా బాగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా అప్పటి రాజ్యాన్ని విజువల్‌ ఎఫెక్ట్స్‌తో కళ్లకు కట్టిన తీరు చాలా బాగుంది. ‘బాహుబలి’ స్థాయి ఎఫెక్ట్స్‌ ఆ సన్నివేశాల్లో కనిపిస్తాయి. ఒక ఆత్మ కథని... ఫాంటసీతో ముడిపెట్టి తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. దర్శకుడు కథని అల్లుకొన్నవిధానం, దాన్ని తెరపైకి తీసుకొచ్చిన విధానం కూడా మెచ్చుకోదగ్గ స్థాయిలో ఉంది. అయితే తొలి సగభాగంలోని కామెడీలో కొంచెం కూడా మలి సగభాగంలో లేకపోవడమే ప్రేక్షకులకి కాస్త లోటు అనిపిస్తుంది. కథంతా కూడా మలి సగభాగంలో చెప్పాల్సి రావడమే అందుకు కారణం. అక్కడక్కడా సన్నివేశాల్లో స్పష్టత లోపించినట్టు అనిపించినా ఆసక్తి మాత్రం చివరి వరకు కొనసాగుతుంది.
ఎవరెలా చేశారంటే?: కార్తీ నటనే సినిమాకి ప్రధాన బలం. ఆయన మూడు కోణాల్లో కనిపిస్తూ ప్రతీ సన్నివేశంలోనూ సందడి చేస్తుంటారు. కానీ కథానాయికలకి అసలేమాత్రం ప్రాధాన్యం లేదు. రెండో సగభాగంలోనే నయనతార తెరపైకొచ్చినా ఉన్నంతలో ఆమే ఎక్కువసేపు కనిపిస్తుంది. శ్రీదివ్యకి చెప్పుకోదగ్గ ప్రాధాన్యం లేదు. కార్తీ తండ్రిగా కనిపిస్తూ వివేక్‌ చాలా సన్నివేశాల్లో నవ్వించారు. ఇక మిగిలిన పాత్రల గురించి చెప్పుకోవాల్సినంత ఏమీ లేదు. రాజ్‌నాయక్‌ పాత్రలో కార్తీ చేసే సందడి చాలా బాగుంది. కాష్మోరా పాత్రలో మంచి టైమింగ్‌ని ప్రదర్శించి నవ్వించారు. సాంకేతికంగా సినిమాకి మంచి మార్కులే పడతాయి. ఓం ప్రకాష్‌ ఛాయాగ్రహణం, సంతోష్‌ నారాయణ్‌ సంగీతం, విజువల్‌ ఎఫెక్ట్స్‌ చాలా బాగా కుదిరాయి. దర్శకుడు గోకుల్‌కి ఇది మూడో సినిమానే అయినా ఎంతో పరిణతిని కనబరుస్తూ తెరకెక్కించారు. నిర్మాణ విలువలు అడుగడుగునా కనిపిస్తాయి.