Saturday, November 28, 2015

పిలవని పేరంటానికి వెళ్తే...కొట్టి చంపారు ..!

పెండ్లి జరిగితే బంధువులే కాదు...ఆకలి బాధలో ఉన్నవారు కూడా ఆ సందడిలో హాజరవుతారు. ఓ వేళ అలా వచ్చిన వారిని బయటకు పంపటమో..లేకపోతే పోనీలే అని ఊరుకుంటాము. అది మానవత్వం..కానీ పంజాబ్‌లో ఓ దళితుడు పిలవని పెండ్లికి హాజరయ్యాడు. అతన్ని గుర్తించి తీవ్రంగా కొట్టి చంపేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పంజాబ్‌లోని సంగ్రూర్‌ జిల్లా గాగా గ్రామంలో భారీఏర్పాట్లతో పెండ్లి వైభవంగా జరుగుతున్నది. అది చూసి ముచ్చటపడ్డ జర్నేల్‌సింగ్‌ లోనికి వెళ్లాడు. తమ బంధువుల్లోని వ్యక్తి కాదని పెండ్లివారు గుర్తించారు. అతన్ని బయటకు పంపకుండా తీవ్రంగా కొట్టారు. పిడిగుద్దులు కురిపించారు. ఈ దారుణం జరుగుతున్నప్పుడు స్కూలు నుంచి తిరిగి వస్తున్న జర్నేల్‌ సింగ్‌ తనయుడు గురుదీప్‌ సింగ్‌ చూశాడు. తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తండ్రిని చూసి కన్నీరుమున్నీరైన కొడుకు సమీపంలో ఉన్న బంధువులను పిలిచి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. కానీ, మార్గమధ్యంలోనే జర్నేల్‌ సింగ్‌ మృతిచెందాడు. ఈ ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పనున్న హ్యాఫీడేస్‌ హీరో ...


 శేఖర్‌కమ్ములా దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ మూవీతో ఒక్కసారిగా స్టార్‌డమ్ పేరు తెచ్చుకున్న హీరో వరుణ్ సందేశ్. త్వరలోనే తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడు. ఓ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న వరుణ్ సందేశ్ చర్చలో భాగంగా మాట్లాడుతూ తన సోదరి వివాహం గురించి వెల్లడించారు. ఈ క్రమంలో తన సినీ జీవితం, వివాహంపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అస్పష్టంగా ఇచ్చాడు. పెళ్లికి సంబంధించిన విషయాలను చెబుతూ డిసెంబర్ 7న తన నిశ్చితార్థం అని పేర్కొన్నాడు. కాగా జీవిత భాగస్వామి ఎవరో మాత్రం వెల్లడించలేదు.
           కానీ ఈ యువ హీరో చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకోనున్నట్లు గతంలోనే వెల్లడించిన విషయం తెలిసిందే. పడ్డానండి ప్రేమలో, ఝామ్మంది నాథం, ప్రేమ్ ఇష్క్ కాదల్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ వితికా శేరుగా ఊహాగానాలు. పడ్డానండి ప్రేమలో చిత్రం నుంచి వీరిరువురి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లిపీటల దాకా చేరినట్లు సమాచారం.