Saturday, November 5, 2016

రానే వచ్చింది ఆ రోజు

 అల్లు అర్జున్‌ రంగంలోకి దిగాడు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘డీజే... దువ్వాడ జగన్నాథమ్‌’ కోసం శుక్రవారమే సెట్లోకి అడుగుపెట్టాడు. ఈ రోజు కోసం ఎదురు చూశానని... సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సెట్లోకి అడుగుపెట్టడం బాగుందని అల్లు అర్జున్‌ ట్విట్టర్‌లో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘సరైనోడు’ తర్వాత బన్నీ కెమెరా ముందుకు రాలేదు. కుటుంబంతో గడుపుతూ, కొత్త కథల్ని వింటూ గడిపారు. కొంత కాలం కిందటే ‘డీజే’కి పచ్చజెండా వూపారు. అల్లు అర్జున్‌, పూజ హెగ్డే జంటగా దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. అయితే అల్లు అర్జున్‌పై శుక్రవారం నుంచి చిత్రీకరణ మొదలుపెట్టారు. ఈ సినిమాలోని పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా సన్నద్ధమైనట్టు తెలిసింది. రెండు కోణాల్లో సాగే ఆ పాత్ర కోసం శారీరకంగా కసరత్తులు చేయడంతోపాటు, హావభావాల విషయంలోనూ ప్రత్యేకంగా శిక్షణ తీసుకొన్నట్టు తెలిసింది. ‘‘ఆర్య’ చూసినప్పట్నుంచి అల్లు అర్జున్‌తో సినిమా చేయాలనేది నా కల. ఆ రోజు వచ్చింది’’ అని హరీష్‌ శంకర్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.