Tuesday, June 12, 2018

‘కోహ్లి’ని అరెస్ట్‌ చేసిన పోలీసులు

 వివాదాస్పద నటుడు, బిగ్‌బాస్‌ మాజీ పోటీదారు అర్మాన్‌ కోహ్లిని ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని గర్ల్‌ ఫ్రెండ్‌, ఫ్యాషన్‌ స్టెలిస్ట్‌ నీరూ రాంధవాను దారుణంగా కొట్టి, హింసించిన కేసుల్లో ముంబైలో పోలీసులు అర్మాన్‌ కోహ్లిని అదుపులోకి తీసుకున్నారు. గత వారమే శాంతాక్రజ్‌ పోలీసు స్టేషన్‌లో ఇతనిపై కేసు నమోదైంది. 
స్టెలిస్ట్‌ నీరూ, నటుడు అర్మాన్‌ కోహ్లి మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య ఆర్థిక సంబంధమైన విషయాల్లో తరచూ గొడవ జరుగుతూ వస్తోంది. ఈ గొడవ జూన్‌ 3 మరింత తారాస్థాయికి చేరింది. గొడప పడే క్రమంలో ఉన్మాదిలా మారిన కోహ్లి.. నీరూను బలంగా నెట్టేయడంతో ఆమె మెట్లపైనుంచి దొర్లుకుంటూ కిందపడిపోయిందని రిపోర్టులు పేర్కొన్నాయి. అంతటితో ఆగకుండా ఆమె జుట్టుపట్టుకుని తలను నేలకేసి గట్టిగా బాదాడని, తీవ్రంగా గాయపడ్డ ఆమె.. తనను ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఎంత వేడుకున్నా అతను వినలేదని తెలిసింది.
కోహ్లి చేతిలో చావుదెబ్బలు తిన్న చాలా సేపటి తర్వాత అతికష్టం మీద ఆస్పత్రికి వెళ్లగలిగిన బాధితురాలు.. చివరికి పోలీసులను ఆశ్రయించింది. అప్పటికే కోహ్లి అజ్ఞాతంలోకి పారిపోయాడు. ఐపీసీ 323, 326, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం ముమ్మరంగా పోలీసులు గాలించి, ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. తనను కోహ్లి, బయట తిరగనీయకుండా చేస్తానన్నడని నీరూ తన ఫిర్యాదులో పేర్కొంది. అతను ఎలాంటి వాడో ప్రతి ఒక్కరికీ తెలుసని, ఎవరికీ తాను బయటపడనని పేర్కొంది.

Tuesday, April 10, 2018

పాన్‌ కార్డులో కొత్త ఆప్షన్‌

ఆధార్‌-పాన్‌ అనుసంధానంలో ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించింది. పాన్‌ కార్డులో థర్డ్‌జెండర్‌ ఆప్షన్‌  కల్పిస్తూ ..ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సిబిడిటి)  సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పాన్‌కార్డు దరఖాస్తులో ట్రాన్స్‌జెండర్లను ప్రత్యేక కేటగిరీగా గుర్తించిన కేంద్రం వారికోసం ఈ  ప్రత్యేక ఆప్షన్‌ను కేటాయించింది.
స్త్రీ, పురుషుల మాదిరిగా ట్రాన్స్‌జెండర్లకు ఓ ఆప్షన్‌ను కేటాయిస్తూ ఆదాయ పన్ను శాఖ నిబంధనలను ప్రభుత్వం సవరించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను సీబీడీటీ సోమవారం విడుదల చేసింది. పాన్ కోసం దరఖాస్తు చేసే ట్రాన్స్‌జెండర్ల కోసం దరఖాస్తు ఫారంలో ప్రత్యేకంగా ఓ టిక్ బాక్స్‌ను ఏర్పాటు చేశారు.
కాగా ఇన్ని రోజుల ఆధార్‌-పాన్‌ అనుసంధానంలో హిజ్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి కారణం ఆధార్‌ కార్డులో జెండర్‌ ఎంపికలో ఆడ, మగతోపాటు హిజ్రాలకు ప్రత్యేకంగా థర్డజెండర్‌ ఆప్షన్‌ ఉన్నప్పటికీ పాన్‌ కార్డు దరఖాస్తులో ఆ వెసులుబాటు లేకపోవడమే. ఆధార్‌కార్డుల్లో థర్డ్‌ జెండర్‌ అనీ, పాన్‌కార్డుల్లో మాత్రం పురుషుడు/మహిళ అని ఉండటంతో హిజ్రాలు తమ ఆధార్‌ నంబర్లను పాన్‌కు అనుసంధానించుకోలేక ఇబ్బందులకు గురయ్యారు.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో హిజ్రాలకు పాన్‌ కార్డుల ధరఖాస్తుకు, ఆధార్‌తో అనుసంధానికి సంబంధించిన సమస్యలు తొలగిపోయాయి.

Friday, April 6, 2018

ఐపీఎల్‌ టోర్నీ శనివారమే ప్రారంభం


అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఐపీఎల్‌ మెగా టోర్నీ ఈ శనివారమే ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు ఏర్పాట్లలో బిజీ అయ్యారు. మరోపక్క ఆటగాళ్లు సైతం వరుస ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతున్నారు.
ఈ ఏడాది ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలకు అన్ని జట్ల కెప్టెన్లు హాజరు కాని సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథులు రోహిత్‌ శర్మ, మహేంద్ర సింగ్‌ ధోనీ మినహా మిగతావారెవరూ ఆరంభ వేడుకల్లో పాల్గొనడం లేదని టోర్నీ నిర్వాహకులు తెలిపారు. ఐతే, ఈ ఏడాది ఒకే వేదికపై అన్ని జట్ల కెప్టెన్లను చూడలేకపోతున్నాం అని అభిమానులు నిరుత్సాహ పడిపోయారు. తాజాగా నిర్వాహకులు ఐపీఎల్‌ ట్రోఫీతో ఎనిమిది జట్ల సారథులతో ఫొటో షూట్‌ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఐపీఎల్‌ ట్విటర్‌ పేజీ ద్వారా పంచుకున్నారు.
ట్రోఫీతో అన్ని జట్ల కెప్టెన్లను ఒకేసారి చూడటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ‘ఈ సీజన్‌లో ఇలా అన్ని జట్ల కెప్టెన్లనూ ఒకే వేదికపై చూస్తామనుకోలేదు, చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తిరిగి ఐపీఎల్‌లో ఆడటం ఎంతో ఆనందంగా ఉంది’ అని నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.

Thursday, April 5, 2018

పొద్దున్నే ఐదున్నరకు సెహ్వాగ్‌ తలుపు కొట్టాడు

 తర్వాత పిలిచి మాట్లాడతా అన్నాను: గంగూలీ
  ‘శ్రీలంకతో ఫైనల్‌ ఓడిపోయిన మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు వీరేంద్ర సెహ్వాగ్‌ నాతో మాట్లాడేందుకు వచ్చాడు. నిద్రమత్తులో లేచి తలుపు తీశాను. ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడతాను అని చెప్పాను’ అని గంగూలీ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో సౌరభ్‌ గంగూలీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘2001లో ముక్కోణపు సిరీస్‌ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లాం. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 121 పరుగుల తేడాతో భారత్‌ ఓడిపోయింది. అనవసరపు షాట్‌కు యత్నించిన సెహ్వాగ్‌ రనౌట్‌ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాతి రోజు ఉదయం 5.30 గంటల సమయంలో నా గది తలుపు మోగింది. తిరిగి భారత్‌ వెళ్లే క్రమంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లే ముందు నన్ను కలవాలని వచ్చాడు. కానీ, నాకు ఏమో అంత పొద్దున్నే సెహ్వాగ్‌తో మాట్లాడే మూడ్‌ లేదు. దీంతో తర్వాత పిలిచి మాట్లాడతా అని చెప్పాను. ముందు రోజు ఫైనల్లో తాను ఆడిన విధానం పట్ల కెప్టెన్‌ సంతృప్తిగా లేడు.. ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని వచ్చాడు. కానీ, నేను మాట్లాడలేదు’ అని గంగూలీ అప్పటి సంగతిని గుర్తు చేసుకుని చెప్పాడు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో సెహ్వాగ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. శనివారం ఐపీఎల్‌ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. 

Monday, April 2, 2018

సినిమాలు లేకపోయినా... ఆమె హవా తగ్గలేదు!

 లోకనాయకుడు, నటుడు కమల్‌ హాసన్‌ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది నటి శ్రుతీహాసన్. అయితే కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటోంది ఈ భామ. తన బాయ్‌ఫ్రెండ్ మైఖేల్‌ కోర్స్‌లేతో షికార్లు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని వదంతులు ప్రచారంలో ఉన్నాయి.
ఏడాది నుంచి శ్రుతి ఏ సినిమా చేయకపోయినా... తెరపై అభిమానులకు కనిపించకపోయినా. ట్వీటర్‌లో మాత్రం ఆమె హవా కొనసాగిస్తోంది. భారీ సంఖ్యలో అభిమానులు ఆమెను ఫాలో అవుతున్నారు. రజనీకాంత్, కమల్‌ హాసన్, మోహన్‌లాల్‌ వంటి స్టార్లను వెనక్కి నెట్టి ముందు వరుసలో నిలిచింది శ్రుతి. ఏడు మిలియన్ల మంది అభిమానులు ట్వీటర్‌లో ఈ నటిని ఫాలో అవుతున్నారు. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా.. ఆమె హవా మాత్రం తగ్గలేదంటున్నారు నెటిజన్లు. నటి సమంత, శ్రుతికి కాస్త దగ్గర్లో ఉంది. సమంతను ట్వీటర్‌లో 6.53 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

Friday, March 23, 2018

ఒక్క సినిమా చేస్తే చాలనుకున్నా!


‘ఎం.ఎల్‌.ఎ’ అంటే మంచి లక్షణాలున్న అబ్బాయి మాత్రమే కాదు. మంచి లక్షణాలున్న ‘అమ్మాయి’ కూడా. కాజల్‌ అలాంటి కథానాయికే. అందం, అభినయాల కలబోత కాజల్‌. ‘లక్ష్మీ కల్యాణం’ నుంచి మొన్నొచ్చిన ‘అ..!’ వరకూ తన దగ్గరకు వచ్చిన ప్రతి పాత్రకూ న్యాయం చేసింది. అందాల ప్రదర్శన హద్దుల్లోనే ఉంచుతూ ఊరించింది. కమర్షియల్‌ కథానాయికగా గుర్తింపు పొందింది. అగ్ర కథానాయకులందరితోనూ జోడీ కట్టింది. ఈ ప్రయాణంలో యాభై చిత్రాల్ని పూర్తి చేసింది. తన తొలి కథానాయకుడు కల్యాణ్‌ రామ్‌తో మరోసారి నటించిన చిత్రం ‘ఎం.ఎల్‌.ఎ’ . ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా కాజల్‌తో బాతాఖానీ!


యాభై చిత్రాల మైలు రాయిని దాటేశారు... సెంచరీ కొట్టే ఆలోచనలు ఉన్నాయా?
(నవ్వుతూ) అసలు ఇన్ని సినిమాలు చేస్తానని అస్సలు అనుకోలేదు. ‘లక్ష్మీ కల్యాణం’ రోజులు నాకింకా గుర్తు. ‘ఈ ఒక్క సినిమా చేస్తే చాలు భగవంతుడా’ అనుకున్నా. ఆ సినిమా వీలైనంత త్వరగా పూర్తి చేసి, మళ్లీ నా చదువులు నేను చదువుకుందామనుకున్నా. కానీ.. అక్కడి నుంచి వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇదిగో.. వెనక్కి తిరిగి చూసుకుంటే యాభై సినిమాలు పూర్తయ్యాయి.

‘కథానాయికగా నేను స్థిరపడినట్టే’ అని ఎప్పుడు అనిపించింది..?
‘మగధీర’తో ఆ నమ్మకం వచ్చింది. అంతకు ముందు కూడా కొన్ని సినిమాలు చేసినా ఎక్కడో చిన్న బెరుకు ఉండేది. ‘నాకూ సినిమాకూ సెట్‌ అవ్వదేమో’ అనిపించేది. కానీ ‘మగధీర’ విజయం నాపై నాకు నమ్మకాన్ని కలిగించింది.

ఈ ప్రయాణంలో కథానాయకుల ఆధిపత్య ధోరణి ఎప్పుడూ ఎదురవ్వలేదా?
లేదు. నన్ను చాలా బాగా చూసుకున్నారు. ‘సినిమా అంటే నా ఒక్కడి వల్ల కాదు.. అది సమష్టి బాధ్యత’ అనే విషయం నేను పనిచేసిన కథానాయకులందరికీ తెలుసు. కాబట్టి నాకు గౌరవం ఇచ్చారు. మంచి పాత్రలు దక్కాయి. కొన్నిసార్లు వాళ్లతో సమానమైన పాత్రలు లభించాయి.

కథానాయకులందరితోనూ నటించారు... ‘ఫలానా వాళ్లతో నటించాలి’ అనే కోరికలు మిగిలిపోయాయా?
నటించిన వాళ్లందరితోనూ మరోసారి నటించాలని వుంది. ఇప్పుడు కల్యాణ్‌రామ్‌తో చేసినట్టు..

మీ తొలి కథానాయకుడు కల్యాణ్‌రామ్‌. ‘లక్ష్మీ కల్యాణం’ నుంచి ‘ఎం.ఎల్‌.ఎ’ వరకూ ఆయనలో ఏమైనా మార్పులు కనిపించాయా?
‘లక్ష్మీ కల్యాణం’ సమయంలో నాకు సినిమా గురించి ఎలాంటి అవగాహన లేదు. సెట్లో ఎలా ఉండాలో, కెమెరా ముందు ఎలా నిలబడాలో కూడా అర్థమయ్యేది కాదు. ఆ సమయంలో కల్యాణ్‌ రామ్‌ సలహాలు ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం ఇద్దరం చర్చించుకుని మరీ సన్నివేశంలో నటించాం. ఇప్పటికీ ఆయన నాకు విలువైన సలహాలు ఇస్తున్నారు. ఈ ప్రయాణంలో ఇద్దరం మారాం. ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. నా తొలి కథానాయకుడిగా కల్యాణ్‌రామ్‌కి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఇస్తాను. ‘ఎం.ఎల్‌.ఎ’ సెట్లో తొలిరోజు ఆయన్ని చూసినప్పుడు పాత స్నేహితుడ్ని కలుసుకున్న అనుభూతి కలిగింది.

‘ఎం.ఎల్‌.ఎ’లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
కథానాయిక పాత్రలకు ప్రాధాన్యం ఉన్న కథలు చాలా తక్కువ వస్తున్నాయి. అలాంటి కథల్లో ‘ఎం.ఎల్‌.ఎ’ కూడా ఉంటుంది. కథలో కీలకమైన పాత్ర నాది. ఓ మంచి సందేశం కథలో మిళితమై సాగుతుంది. సందేశం అంటే... బలవంతంగా ఏదో రుద్దుతున్నట్టు ఉండదు. దాన్నీ వినోద భరితంగా చెప్పే ప్రయత్నం చేశారు.

కథానాయికగా ఇంత అనుభవం వచ్చింది కదా, ఇక ముందు కథల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు?
కథల విషయంలో ముందు నుంచీ నేను జాగ్రత్తగానే ఉంటున్నాను. అయితే ఇక మీదట మరింత ఆచి తూచి అడుగులేయాలి. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను. అన్ని సినిమాలూ కథలు నచ్చే ఒప్పుకోం. కొన్ని కొన్ని ప్రత్యేక కారణాలుంటాయి. ప్రతీసారీ మంచి కథలు, మంచి పాత్రలూ రావు. డబ్బుల కోసం కూడా కొన్ని సినిమాలు చేయాలి.

యాభై చిత్రాల్లో కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా ఒక్కటీ కనిపించలేదు. అనుష్క, నయనతారలా లేడీ సూపర్‌స్టార్‌ ఇమేజ్‌ కోరుకోవడం లేదా?
ఎవరినో చూసి, నేనూ అలానే ఉండాలి అనుకోవడం నాకు ఇష్టం ఉండదు. నా ప్రయాణం నాది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు నాకూ వచ్చాయి. అప్పట్లో కాల్షీట్లు సర్దుబాటు చేయడం కుదరక కొన్ని వదులుకున్నా. అయితే కథానాయిక ప్రాధాన్యం ఉన్న కథలంటే.. హారర్‌, థ్రిల్లర్‌ లేదంటే ఓ సమస్య కోసం పోరాటం చేసే స్త్రీ పాత్రలే అనుకోవడం తప్పు. మంచి ప్రేమకథలూ చేయొచ్చు. వ్యాపార విలువలు ఉన్న సినిమాలూ చేయొచ్చు. అలాంటి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తా.

మీరు నటించిన సినిమాలు చూస్తే మీకేమనిపిస్తుంది? ‘ఇంకొంచెం బాగా నటిస్తే బాగుణ్ను’ అనుకుంటారా?
నాకే కాదు.. నటీనటులు ఎవరికైనా అలానే అనిపిస్తుంది. నాకైతే ఇంకొంచెం ఎక్కువ అనిపిస్తుంది. నా కుటుంబంలో సినీ పరిశ్రమకు చెందిన వాళ్లెవరూ లేరు. నాకు దగ్గరుండి నేర్పించే గురువులూ లేరు. నాకు నేనే నేర్చుకుంటూ వెళ్లాలి. అందుకే కెరీర్‌ ఆరంభంలో కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. కొన్ని సినిమాలు చూస్తుంటే.. ‘అలా ఎందుకు నిలబడ్డాను? డైలాగ్‌ ఇలానే ఎందుకు చెప్పాను?’ అనిపిస్తుంటుంది. మరో పదేళ్ల తరవాత ఇప్పటి సినిమాలు చూస్తే.. అలాంటి భావనే కలుగుతుందేమో?

 

Tuesday, February 27, 2018

‘శ్రీదేవి ఇద్దరి కుమార్తెల గురించే నా దిగులు’

 శ్రీదేవి మృతితో ఆమె ఇద్దరు కుమార్తెలు జాన్వి, ఖుషి గురించి దిగులు పడుతున్నానని నటి షాలినీ కపూర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జాన్వి కథానాయికగా నటిస్తున్న తొలి సినిమా ‘దఢక్‌’. ఇందులో షాలినీ కపూర్‌ ఆమె తల్లి పాత్ర పోషిస్తున్నారు. శ్రీదేవి మరణవార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని ఆమె చెప్పారు.

‘అద్భుతమైన నటి శ్రీదేవి మృతి నన్ను చాలా బాధించింది. ఆమె చక్కటి నటన, విభిన్నమైన పాత్రలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుంటాయి. నా ఆలోచనలన్నీ ఆమె కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల చుట్టూ తిరుగుతున్నాయి. నేను అన్నింటి కంటే ఎక్కువగా ఆమె ఇద్దరు కుమార్తెల గురించి బాగా దిగులుపడుతున్నా’.
‘‘దఢక్‌’లో జాన్వి తల్లి పాత్రలో నటిస్తున్నారు. ఆమెకి, శ్రీదేవికి మధ్య ఉన్న ప్రేమ గురించి నాకు బాగా తెలుసు. ఆ అనుబంధాన్ని మాటల్లో వివరించలేం. ఆమె గురించి తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది. శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని ఆమె పేర్కొన్నారు.