Tuesday, September 27, 2016

బాహుబలిని చంపినప్పుడు నేనక్కడ లేను

 మూడు భాషల్లో తెరకెక్కించే చిత్రాల్లో ఇకపై నటించనని మిల్కీబ్యూటీ తమన్నా అన్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తమన్నా ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. ‘అభినేత్రి పూర్తిగా హారర్‌ సినిమా కాదు, అది వినోదం కోసమే. ఈ సినిమాలో దయ్యం ఉంటుంది, కానీ అది ఎవర్నీ భయపెట్టదు. మూడుభాషల్లో చిత్రాన్ని తెరకెక్కించడం సులభమైన పని కాదు, అది చాలా కష్టం. దీన్ని తమిళం, హిందీ భాషల్లో మాత్రమే తెరకెక్కించాలని అనుకున్నారు. తెలుగులో నాకు మంచి మార్కెట్‌ ఉందని నేను సలహా ఇవ్వడంతో ఈ భాషలోనూ తీశారు. మూడు సినిమాల్లో నటించినట్లు అనిపించింది, సినిమాని ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేశాం. ఈ మూడు భాషలు ఒకదానికొకటి చాలా విభిన్నంగా ఉంటాయి కాబట్టి డైలాగ్‌ పలికే విధానం కూడా తేడాగా ఉంటుంది. తెలుగు సన్నివేశం పూర్తి చేసిన తర్వాత తమిళ్‌, హిందీ చేసేదాన్ని. ఒకే సన్నివేశాన్ని మూడుసార్లు మూడు భాషల్లో చేయడంతో చాలా అలసిపోయేదాన్ని’ అని చెప్పారు.
అనంతరం ‘జాగ్వార్‌’ చిత్రంలోని ప్రత్యేక గీతం గురించి ప్రశ్నించగా.. ‘ఇప్పటికే ఆ పాట షూటింగ్‌ పూర్తి చేశాం. ప్రేక్షకులు నా ప్రత్యేక గీతాల్ని ఇష్టపడతారనుకుంటున్నా. దక్షిణ చిత్ర పరిశ్రమలో ప్రజలు స్టార్‌ హీరోయిన్లు ప్రత్యేక గీతం చేస్తే ఎందుకు అసహనంగా భావిస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇలాంటి ఇబ్బంది హిందీ చిత్ర పరిశ్రమలో ఉండదు. దీపికా, కత్రినా, కరీనా ప్రత్యేక గీతాల్లో నటించారు. దక్షిణ చిత్ర పరిశ్రమలో ఉన్న ఈ సమస్యను బ్రేక్‌ చేయాలి అనుకున్నా. పాటను హుందాగా కొరియోగ్రఫీ చేసినప్పుడు ఎందుకు నటించకూడదు?’ అని ప్రశ్నించారు తమన్నా. ‘జాగ్వార్‌’ పాటకు ఎక్కువ పారితోషికం తీసుకున్నారా? అని అడిగితే వెంటనే.. ‘నేను ఎప్పుడూ ఎక్కువ పారితోషికమే తీసుకుంటా’ అని చెప్పారు.
చేయబోతున్న సినిమాల గురించి మాట్లాడుతూ తమన్నా బాహుబలి క్లైమాక్స్‌ సన్నివేశం చేయాల్సి ఉందన్నారు. దాంతో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని ప్రశ్నించగా తమన్నా ఇలా సమాధానం ఇచ్చారు. ‘బాహుబలిని కట్టప్ప చంపినప్పుడు నేనక్కడ లేను, ఇంకెవరైనా ఉండి ఉంటారని అనుకోను. నాకు తెలిసి రాజమౌళి ఈ సన్నివేశం చిత్రీకరణను తొలి విభాగంలోనే పూర్తి చేసుంటారు. ఎవరికీ ‘బాహుబలి’ కథ తెలియదు’ అని చెప్పారు.

No comments:

Post a Comment