Monday, February 7, 2011

అన్ని ఫార్మట్‌లకు గుడ్‌బై దాదా

 క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. భారత జట్టుకు 22 సంవత్సరాలపాటు సేవలందించి, అనేక అద్భుత విజయాలకు ప్రేరణగా నిలిచిన సౌరవ్‌ గంగూలీ క్రికెట్‌లోని అన్ని రకాల ఫార్మట్‌లకు గుడ్‌బై చెపుతున్నట్లు సోమవారం నాడు ప్రకటించాడు. అన్ని రకాల ఫార్మట్‌ల నుండి వైదొలగుతున్నట్లు తెలియజేశాడు. కొల్‌కతా ప్రిన్స్‌గా, దాదాగా సుప్రసిద్ధుడైన గంగూలీ 1996లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మొదటి రెండు టెస్టుల్లో సెంచరీలు చేసి వెలుగులోకి వచ్చాడు. 38 ఏళ్ల గంగూలీ భారత్‌కు 113 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. 7,212 పరుగులు చేసాడు. 311 వన్డేల్లో 11,363 పరుగులు చేసాడు. ఇందులో 22 సెంచరీలు, 72 అర్ధసెంచరీలున్నాయి. 49 టెస్టులు, 147 వన్డేల్లో భారత జట్టుకు సారధ్యం వహించాడు. 2000 సంవత్సరంలో భారత జట్టు కెప్టెన్‌గా నియమితుడైన గంగూలీ కెరీర్‌లో 2001లో ఆసీస్‌పై సిరీస్‌ గెలుచుకోవడం ఒక అపూర్వ సంఘటనగా పేర్కొనవచ్చు. 2003-04లో ఆసీస్‌లో జరిగిన సిరీస్‌ను కూడా గంగూలీ నేతృత్వంలో డ్రా చేసుకుంది. 2003లో అతడి నాయకత్వంలో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. 2008 నవంబర్‌లో ఆసీస్‌తో జరిగిన టెస్టు గంగూలీ కెరీర్‌లో చివరి టెస్టు. ఆ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 85 పరుగులు చేసాడు. రెండో ఇన్నింగ్స్‌లో మొదటి బంతికి డకౌటయ్యాడు. ఆ సిరీస్‌ను భారత్‌ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. గంగూలీ భారత జట్టుకు 49 టెస్టుల్లో కెప్టెన్సీ వహించాడు. ఇందులో 21 టెస్టుల్లో భారత్‌ విజయం సాధించింది. ఇరానీ ట్రోఫీలో రెస్టాఫ్‌ ఇండియా జట్టులో స్థానం లభించని దరిమిలా 2008 అక్టోబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 100 టెస్టుల్లో ఆడిన భారత్‌కు చెందిన ఏడవ క్రికెటర్‌ గంగూలీ. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌ అయిన గంగూలీ 300కుపైగా వన్డే మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో పదివేల పరుగులు పూర్తిచేసిన ఏడుగురు బ్యాట్స్‌మెన్‌లో గంగూలీ ఒకడు.

No comments:

Post a Comment